.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    ఒకనాటి ఉదయం తమ్ముళ్ళతో కలిసి గనివద్దకు వెళుతోంటే కీచుమంటూ వాళ్ళపక్కగా వచ్చి ఆగింది ఓ జీపు.
 ఉలికిపాటునించి తేరుకోబోయేలోపలే జీపులోంచి మనిషి శరీరం ఒకటి వుండలా రోడ్డుమీద దొర్లింది.
అది బతికిందో, ప్రాణం పోయిందో గమనించే లోపలే జీపు స్పీడందుకొంది.  బాలుడు దాన్ని అందుకోవాలని ప్రయత్నించాడు గాని సాధ్యం కాలేదు.
 జీపు నెంబర్ గుర్తుపెట్టుకొని పెన్నుతో అరచేతి మీద రాసుకొన్నాడు రమణారెడ్డి
 నేలమీదున్న శరీరాన్ని పరిశీలించి చూశారు.
  ఊపిరాడుతూ వుంది.
  రేగిన వెంట్రుకలు, పెరిగిన గడ్డం, మాసిన బట్టలతో ఎవరో పాతికేళ్ళ యువకుడు, అతని వొళ్ళంతా కుడుములు కుడుములుగా వాచివుంది. వీపంతా ఎర్రగా వాతలు తేలివున్నాయి. స్పృహ తప్పి పడిపోయేంతగా కొట్టి పడేసి పోయారు.
 అటుగా వెల్తోన్న ఆటోను ఆపి పోరుమామిళ్ళకు తీసుకెళ్ళి హాస్పెటల్‌లో జాయిన్ చేశారు.
 గంటకల్లా స్పృహలోకొచ్చాడు ఆ యువకుడు.
 లేచికూచోని వాళ్ళకేసి ఆశ్చర్యంగా చూశాడు.
 "  ఎట్లా వుంది ఒంట్లో ?  బావుందా ? "  రమణారెడ్డి అడిగాడు.
 సమాధానమివ్వకుండా అతను బెడ్ మీంచి దిగబోతుండగా  " వొద్దొద్దు కూచో "  చేయిపట్టుకొని ఆపబోతే అతను నవ్వాడు.  " నాకేం కాదులే అన్నా ! ఏమయితాదేం యీ దెబ్బల్తో........?  నాకిది మామూలేలే "  అంటూ మంచం దిగాడు.
 " తినడానికేమన్నా వుందేన్నా ? "   అడిగాడు.   " ఆనాకొడుకులు నిన్నట్నుంచి వొల్లంతా దెబ్బల్దినిపిస్తా వుండారేగాని కడుపుకింత తిండి తినిపిస్తామని అనుకోరే..!  "
 ఒక్క నిమిషంలో బైటకు పరుగెత్తాడు జయసింహ.
 ఆపిల్ పళ్ళతో తిరిగొచ్చాడు.
 వాటిని కోయబోతుంటే చొరవగా లాక్కొని నోట కొరికి తినసాగాడు.
 అంతలో డాక్టర్ వచ్చాడు.
  బెడ్ మీద పేషంట్ లేకపోయేసరికి ఉలికిపాటుగా చూశాడు.
 అతని ఆదుర్దా గమనించి వేలెత్తి చూపాడు బాలుడు.
 పేషెంట్ కేసి ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్.
 " ఏంటిది ? ఏంటి... ఏమయ్యా ! పేషంట్ కంటే బుద్ది లేదు. మీకేమయ్య ? ఏ కండీషన్లో అతన్నిక్కడకు తెచ్చారో గర్తు లేదా..?  పడుకోబెట్టండి.... రెండ్రోజుల పాటు బెడ్‌రెస్ట్ ఇస్తేగాని కోలుకోలేడు... ఇప్పుడు అర్జంటుగా సెలైన్ ఎక్కించాలి... "  మొహం చిట్లించి చూస్తూ అన్నాడు.
 డాక్టర్ కేసి అదోలా చూశాడు ఆ యువకుడు  " సార్ ! ఒక్కమాట..."  అన్నాడు. డాక్టర్ అతనికేసి చూడగానే  " వీల్లెవురో నాకు తెల్దు సార్ ! నేనెవురో వాల్లకూ తెల్దు. దెబ్బలుతిని పడుంటే ఎత్తకొచ్చినారు. సెలైన్‌లు ఎక్కిస్తూ రెండ్రోజులు బెడ్ రెస్ట్ యిచ్చినావంటే  నీఫీజ్ ఎట్లా రాబట్టుకొంటావో ఆలోచించుకో. ముందుగా - ఇప్పటికైనా ఫీజు సంగతి చూసుకో "  అన్నాడు.
 మరేమి మాట్లాడలేదు డాక్టర్.
ఐదు నిమిషాల్లో బిల్‌తో సహా వచ్చింది నర్స్.
 "  నాకాడ అర్థరూపాయి కూడా లేదన్నా !  ఆ నాకొడుకులు జోబుల్లో ఏమి లేకుండా సేసినారు "  చెప్పాడు.
రమణారెడ్డి బిల్ చెల్లించాడు.
 హాస్పెటల్ నుండి బయటపడ్డారు అందరూ.
 "  నొప్పులు లేవా ? "  బాలుడు అడిగాడు.
 " నేనేం  దేవున్నా బ్రదరూ.. నొప్పుల్లేకుండేందుకు ? "  నవ్వాడు.
" ఇంతకు నువ్వెవరు తమ్ముడూ ..? "  అడిగాడు రమణారెడ్డి.
 చిన్నాగా నవ్వాడు ఆ యువకుడు.
 "  నాపేరు గోపాల్‌రెడ్డి, ఇంటి పేరు మజ్జిగ.  మాపూర్వీకులెవరికో దండిగా పాడివున్నెట్లుంది. బానలు బానలు ( పెద్ద పెద్ద కడవలు) మజ్జిగ చిలికి పోసే వాళ్ళేమో ! ఇంటి పేరు అదే ఖాయమైంది. "
 అన్ని దెబ్బలు తినికూడా నవ్వగలుగుతున్నందుకు అతనికేసి మెచ్చుకోలుగా చూశాడు రమణారెడ్డి.
 "  నేనీ కథ చెబితే కొందరు వొప్పుకోరు బ్రదరూ !  మాకే మజ్జిగ లేక సెరవ ( పెద్ద సిల్వర్ గిన్నె)  తీసుకొని ఇండ్లిండ్లా అడుక్కొనేదాన్నే మాకీ పేరొచ్చిందంటారు...  ఏమైతేనేం... కమ్మని పేరుగదా !  "
 అతని మాటతీరుకు నవ్వొచ్చింది వాళ్ళకు.
 తనది బద్వేలు మండలమట. వూరిపేరు కూడా చెప్పాడు
 " మీదేవూరో తెలుసుకోవచ్చునా అన్నలూ ? "  అడిగాడు.
 వాళ్ళ చిరునామా తెలీగానే అతని కళ్ళ నిండా ఆశ్చర్యం తొణకిసలాడింది.
 " కాఫీ తాగాలన్నా ! పెదాలు పీకుతండాయి "  చెప్పాడు.
 దగ్గర్లోని హోటల్‌కు వెళ్ళారు అందరూ. ఓ మూలగా వున్న టేబుల్‌ను ఆక్రమించి కాఫీ ఆర్డరిచ్చారు.
 "  మీనాయన గురించే విన్నేనన్నా ! పాలెగాడన్నా  ఆయప్ప....!  మీలాంటివాల్ల కోసమే నేను తిరుగుతాండ ....  తంతే అప్పచ్చుల గంపలో పన్నెట్టు మీకాడనే వొచ్చి పడినా..., మీనాయనట్లా మా నాయనా పాలెగాడు కాదుగాని.. జాతీయపార్టీ అభిమాని.  చెన్నారెడ్డికి ఆపోజిట్‌గా పట్టుదలగా ఎలక్షన్ జరిపించినందుకు మామీద కసిబట్టి మామీద దాడి జేసినాడు, కడాకు ( చివరికి) మా నాయన్ను నట్ట నడిరోడ్డు మీద పడేసి నరికినారన్నా ! "  అతని గొంతు పూడుకుపోయింది.
 "  అప్పట్నించి చెన్నారెడ్డిని సంపాలని తిరుగుతా వుండా.. నాకాడ పౌర్సముంది (పౌరుషము) గాని ఏ బలమూ లేదు. దొరికిన కాడంతా యిదో యిట్లా వొల్లు వాయిగొట్టించుకొంటావుండా... "
  తన అవస్థలన్నీ చెప్పుకు పోతూనే వున్నాడతను
 తను రెండు సార్లు దాడి చేసేసరికి జాగ్రత్త పడ్డాడట చెన్నారెడ్డి.  ప్రైవేటు మనుషుల్ని ఎక్కువ సంఖ్యలో తన చుట్టూ కాపలా పెట్టుకొన్నాడట. అతని రక్షణ వలయాన్ని ఛేదించుకొని పోవటం మాట దేవుడెరుగు - తనుకనిపిస్తే  చాలు వెంటపడి పట్టుకొని చితకబాది విసరేసి పోతున్నారట.
 తనలాగ తండ్రుల్ని, అన్నలను, ఆత్మీయుల్ని, బంధువుల్ని, భర్తల్ని, కొడుకుల్ని పోగొట్టుకొన్న ఎందరో ఎదురు చూస్తున్నారట కసిదీర్చుకొనే అవకాశం కోసం.
 మజ్జిగ గోపాల్‌రెడ్డిని నేరుగా శివపురికి తీసుకెళ్ళారు.
 వారం రోజుల విశ్రాంతి తర్వాత బాగా కోలుకొన్నాడు అతను. ఈలోపు రమణారెడ్డి తలలో ఓ వ్యూహం రూపు దిద్దికోసాగింది.
 మళ్ళీరోజే ఓ జీపును బాడుగకు మాట్లాడుకొన్నారు.
 మజ్జిగ గోపాల్‌ను వెంటేసుకొని ఏడుమంది అన్నదమ్ములు తాలుకా నలుమూలలా తిరిగారు.
 చెన్నారెడ్డి వల్ల పూడ్చుకోలేని గాయాల పాలైన కుటుంబాల్ని కలిశారు. తమను పరిచయం చేసుకొన్నారు.
  అందరి గాయమూ ఒకటే..
  అందరి బాధా ఒకటే...
  అందరి శత్రువు ఒకడే..
 తమ ప్రాణం పోయినా సరే శత్రువును చంపాలనే అంకిత భావం కలిగిన యువకుల్ని గుర్తించారు.
 మజ్జిగ గోపాల్ వాళ్ళ వెంటే శివపురికి వచ్చాడు.
 మానవ శక్తి దండిగా వుంది.
 ఇక ఆర్థిక శక్తి కావాలి.
 బంధువులందర్నీ మరోసారి కలిసారు.
 తాము ఎమ్మెల్లే చెన్నారెడ్డితో  ’పార్టి ’ చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. తమ ధ్యేయాన్ని, దాన్ని సాధించాలనే అంకిత భావాన్నీ, చెన్నారెడ్డి చావే జీవితాశయంగా పెట్టుకొని తాలుకా అంతటా తిరిగి సేకరించిన యువశక్తినీ వివరించేసరికి వాళ్ళమీద బంధువుల్లో కొంత నమ్మకం కలిగింది.
 అప్పటిదాకా పార్టీ చేయొద్దనీ, పార్టీలకు దూరంగా వుండమని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు పార్టీ చెయ్యమని ప్రోత్సహించారు. యువకుల హుషారు చూసి మితవాదులనుకొన్న వాళ్ళు కూడా ఎగదోశారు.
   తాము ఏడుమందిమి పోయినా పర్లేదు - చెన్నారెడ్డిని చంపి తీరాలనే కమిట్‌మెంట్‌కు వచ్చారు శివపురి సోదరులు.
 చెన్నారెడ్డితో  పార్టీ జేయాలంటే కేవలం గుండెబలం మాత్రమే సరిపోదు, ఆయుధాలు కావాలీ, వాహనాలు కావాలి. అడుగడునా డబ్బే ప్రధానంగా వుండాలి.
  తమకు గుండెలయితే వున్నాయి డబ్బు ఎక్కణ్నించి తేగలరు..?
 బంధువుల వద్ద తమ ప్రధాన సమస్య గురించి చెప్పారు.
 వాళ్ళంతా సానుకూలంగా స్పందించారు.
  ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భారీగానే చందాలిచ్చారు.
  దాదాపు పండ్రెండు లక్షల దాక జమకూడింది డబ్బు.
 వెంటనే రెండు జీపుల్ని కొన్నారు.
 విషయమంతా జాతీయపార్టి అధిస్టానానికి తెలిసింది.
 తమ ఆశీసుల్ని ’ బలంగా ’ అందజేశారు.
 తర్వాతి కార్యక్రమం తుపాకి లైసెన్స్‌లకు అప్లై చేయటం
 ఏడుమంది అన్నదమ్ములు ధరఖాస్తు చేసుకొన్నారు.
  వాళ్ళ నాన్నగారు ఇద్దరూ మర్డర్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు కూడ హాని వుంటుందనే కారణంగా జిల్లా నాయుకులు ఎస్పీకి చెప్పి మనిషికి రెండింటి వంతున ఏడుమందికి పదునాలుగు తుపాకులు మంజూరు చేయించారు. జిల్లా వ్యక్తి హోంమంత్రిగా వుండటం వలన వాళ్ళకాపని సులభమైంది.
 చెన్నారెడ్డి వల్ల జీవితాలు నాశనమైన వాళ్ళు, అతన్ని చంపాలనే పట్టుదల వున్నవాళ్ళను పిలిపించుకొన్నాడు రమణారెడ్డి.
 శివపురి సోదరులు ఏడుమంది తమతో మరో ముప్పైమంది యువకుల్ని వెంటేసుకొని రెండు జీపుల్నిండా వేలాడుతూ ప్రతిరోజూ బద్వేలు, పోరుమామిళ్ళకు తిరగటం మొదలు పెట్టారు.
  తుపాకులు బైటకు కన్పించేలా పట్టుకొని రెండుజీపులూ వేగంగా వెళ్ళి సెంటర్లో ఆగితే జనమంతా బెదిరిపోయి వాళ్ళకేసి చూడవలసిన పరిస్థితి వస్తోంది.
 తామెవరో అందరికీ అర్థమైన తర్వాత చెన్నారెడ్డి ఆధిపత్యాన్ని సవాల్ చేయటం ప్రారంభించారు.
  వాళ్ళందరీ ధ్యేయం ఒక్కటే - చెన్నారెడ్డిని చంపటం.
 ముందుగా అతన్ని మానసికంగా దెబ్బతీయాలి.
 అతనికి భయం పుట్టించాలి.
  వాళ్ళకు మరో పనిలేదు - చావంటే భయం లేదు.
మొదట చెన్నారెడ్డి మనుషులు తిరిగే సెంటర్లమీద దృష్టి కేంద్రీకరించారు. అకస్మాత్‌గా రెండు జీపులూ ఆ సెంటర్లకు పోవటం, కన్పించిన చెన్నారెడ్డి మనుషుల్ని చితకబాదటం, వచ్చినంత వేగంగానే జీపులెక్కి వుడాయించటం.
  ఆఫీసుల మీద కూడా దాడి జేస్తున్నారు.
  తమవాళ్ళకు  పనుల్జేయని ఆఫీసర్లకు వార్నింగ్‌లిస్తున్నారు.
 తమవర్గం వాల్లను ఇబ్బంది పెడుతోన్న పల్లె నాయుకుల్ని టౌన్‌లో దొరకపుచ్చుకొని బెదిరిస్తున్నారు.
 టౌన్‌లోనే నివాసముంటోన్న మాజీ ఎమ్మెల్లే సోమనాధరెడ్డి, పారిశ్రామికవేత్త రామసుబ్బారెడ్డి, సూపర్‌క్లాస్ కాంట్రాక్టర్ జి.పి.ఆర్ వర్గాల ఇళ్ళకు తరుచు వెళ్ళి ధైర్యాన్ని కలిగిస్తున్నారు. చెన్నారెడ్డి దెబ్బకు బెదిరి చాలా యేళ్ళుగా ఇంటికే పరిమితమిన ఆ ప్రముఖులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించారు.
  తమకు చెన్నారెడ్డిని ఎదుర్కొనే దమ్ములున్నాయని వాళ్ళకు నమ్మకం కలిగించారు.
  శివపురి సోదరుల చర్యలన్నింటినీ ఒక కంట గమనిస్తూనే వున్నాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
 చాచి కొడితే గిరగిరా తిరిగి పడిపోయేలా లేదు వ్యవహారం.. ఎదురు తిరిగేట్టున్నారు.
 తనవాళ్ళమీద దాడి చేయటం కాదు - వీలైతే తనమీదనే దాడి చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కూడా రహస్య సమాచారం.
  చాలా దూకుడుగా వ్యహరిస్తున్నారు శివపురివాళ్ళు.
 తమ వ్యతిరేకులంతా వాళ్ళ వెనక గట్టిగా నిలబడినట్లుంది, వాళ్ళ దూకుడుకు మొదట్లోనే అడ్డుకట్ట వేయకుంటే పరిస్థితి చేయదాటి పోవచ్చు.
  పోలీసుల్ని సంప్రదించాడు.
 డిస్పీ స్థాయి అధికారులతో చర్చించాడు.
  పిల్లనాయాల్లకు తుపాకులిచ్చి అందర్నీ భయప్రాంతుల్ని చేయటం మంచిది కాదనీ, ముందా గన్స్ లైసెన్స్ వెనక్కి లాక్కొమని వొత్తిడి చేసాడు.
 పోలీసులు తమ ఆశక్తతను వ్యక్తపరిచారు.
 తమ తండ్రుల్ని ప్రత్యుర్థులు ధారుణంగా చంపారనీ, తమకు కూడా వాళ్ళచేతిలో ప్రాణహాని  ప్రమాదం వుంది కాబట్టి ఆత్మరక్షణార్థం తుపాకుల లైసెన్స్‌లకు ధరఖాస్తు చేసుకొన్నారట. అట్లాంటి పరిస్థితుల్లో తుపాకులు లైసెన్స్ మంజూరు  చేయటం ప్రభుత్వ పాలసీ కాబట్టి తమ చేతిలో ఏమిలేదని పోలీసులు చెప్పారు.
 శివపురివాళ్ళకు హోంమినిస్టర్ వద్ద ప్రత్యేకమైన గుర్తింపు వుంది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా తామేమీ చేయలేమనీ, అలాగే స్థానిక ఎమ్మెల్లేగా చెన్నారెడ్డికి కూడా నష్టం కలిగించబోమనీ హామీ యిచ్చారు.
 పోలీసుకులు కూడా తనకు ముఖం చాటేస్తోన్న విషయం చెన్నారెడ్డికి అర్థమవుతోంది. వాళ్ళను తను ఎంతగా డబ్బుతో కొన్నా తనకు హానీ చెయ్యకపోవచ్చుగానీ మేలు మాత్రం చేయరు. తమ పక్క తాలుకా ఎమ్మెల్లే హోంమంత్రిగా వున్నందువల్ల పోలీసులు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు.
 తను ఏదొకటి చేయాలి
 తన చేయి వంగిపోకుండా చూసుకోవాలి.
 అవసరమైతే మరిన్ని ప్రాణాలు తీసయినా టెర్రర్ సృష్టించాలి.
 వాళ్ళు ప్రాణాలకు తెగించినట్టుంది.
 తనమీద కసిదీర్చుకోవటానికే ప్రయత్నిస్తున్నారు. సందేహంలేదు. తలకు తల అన్నరీతిలో ఆలోచిస్తున్నారు.
 తమ ప్రాణాలకు భయపడుతూ పార్టీ జేసేవాళ్ళు కొన్ని పరిమితులకు లోబడి వుంటారు. అవతల వాళ్ళను చంపాలి తప్ప తాము పొరబాటున కూడా చావకూడదనుకొంటారు. కనీసం గాయపడటం కూడా జరగొద్దని భావిస్తారు. అలాంటి వాళ్ళతో పార్టీ ( ఫ్యాక్షన్) జేయటం నడపటం సులభం.
 తాము చచ్చినా పర్లేదు. అవతలి వాళ్ళను చంపాలనే ధ్యేయంతో పన్జేస్తే... వాళ్ళతో పార్టీజేయటం కష్ట సాధ్యమైన విషయం.
 ముందుగా శివపురి పిల్లకాయలను భయపెట్టాలి.
 వాళ్ళు చేసేది కుప్పిగంతులేనని వాళ్ళకే తెలిసేట్లు చేయాలి.
 వెంటనే ఎనిమిది కమాండర్ జీపులు కొన్నాడు - చెన్నారెడ్డి. వాటినిండా వందమందికి పైగా జనాన్నేసుకొని తిరగటం ప్రారంభించాడు.
 తను గట్టిగా కన్ను దెరిస్తే అవతలి వాళ్ళు మాడిమసై పోరా..! అనే ధీమా వుంది చెన్నారెడ్డికి.
 జనాలకు కూడా అతనిమీద ఆ నమ్మకం వుంది.
 ఎప్పుడేం జరుగుతుందోనని ఉత్కంఠంగా చూస్తున్నారు. శివపురి పిల్లనాయాల్లకు మూడిందనే అనుకొంటున్నారు.
 తమ హంగామాకే అవతలి వాళ్ళు జడిసిపోతారనే భావనలో వున్నాడు చెన్నారెడ్డి. ఇప్పుడు కాకున్నా ఇంకొద్ది రోజులకైనా వాళ్ళు తోక ముడవక తప్పదు. పైసా ఆదాయం లేకుండా అంతమంది జనాల్ని మేపుకొంటూ ఎంతో కాలం తిరగటం సాధ్యమయ్యే విషయం కాదు. తనకు తెలిసి పెద్దగా ఆదాయమొచ్చే వనరులు కూడా వాళ్ళకు లేవు. ముగ్గుపిండి గనితో ప్రస్తుతం పార్టీలు నడిపేంత పరిస్థితి లేదు.
  మారెట్లా రెండు జీపుల్ని పద్నాలుగు తుపాకుల్ని కొని యుద్దానికి సన్నద్దమయ్యారు...?
 బహుశా తన ప్రత్యుర్థులు చందాలిచ్చి వుండొచ్చు...!
  ముఖ్యంగా  జీ.పియ్యార్, సోమనాధరెడ్డి, రామసుబ్బారెడ్డిలాంటి వాళ్ళే సహాయం చేసి వుండొచ్చు.
 ’ అబ్బిళ్ళు కొరుకుతూ మెల్లిగా తలపంకించాడు చెన్నారెడ్డి ’
 శివపురి వాళ్ళను బెదరగొట్టాలి.
 వాళ్ళకు వత్తాసిచ్చే మనుషులకు వాళ్ళెట్లా రక్షణ కల్పించగలరో పరీక్షించాలి. చెన్నారెడ్డితో పెట్టుకొంటే కాపాడేవాడు ఎవడూ లేడనే విషయం మరోసారి జనాలకు తెలిసిరావాలి.
 ఆ దిశగా పావుల్ని కదపటానికి సిద్దమయ్యాడు చెన్నారెడ్డి.
  పార్టీల స్వరూప స్వభావాల్ని పూర్తిగా తెలిసికోకుండానే అందులోకి అడుగుబెట్టిన శివపురి కుంకలు తగిన మూల్యం చెల్లించుకొనేలా చేయాలి.
 తన ముఖ్య అనుచరుల్ని పిల్చి వాళ్ళతో మాట్లాడాడు......

                                                                                    ......................  సశేషం

                                                                                                       .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

 మండల ఎలక్షన్లు దగ్గరపడ్డాయి.
  అక్కడక్కడా అడదడపా కొట్లాటలు జరుగుతున్నాయి.
  పోలీసు కేసులవుతున్నాయి.
  రిపోర్టులకు ప్రతిరిపోర్టులు, కేసులకు ప్రతికేసులు.
   ఓబుళరేడ్డికి మినిస్టరు అండ దండిగా వుండటం వలన పోలీసుస్టేషన్‌లో ఎమ్మెల్లేతోటి సమాన గౌరవం లభిస్తోంది.
  మండల ఎలక్షన్లలో చెన్నారెడ్డి భార్యమీద టేకూరి గుర్విరెడ్డి భార్యను పోటీకి నిలిపారు.
  తనకు ఎదురు చెప్పేవాడెవడనే అహంకారంతో చెన్నారెడ్డి ప్రవర్తిస్తోంటే, యీ ఎన్నికలు తమకు జీవన్మరణ సమస్యలాగ ఎక్కడలేని పట్టుదలతో కృషి చేస్తున్నారు ఓబుళరెడ్డి ప్రభృతులు.
  తన స్వంతమండలం కాకుండా పోరుమామిళ్ళ మండలానికి తన భార్యను పోటీగా నిలపటం కొంత పొరబాటేమోననిపించింది చెన్నారెడ్డికి, అక్కడ సరైన వ్యక్తి లేకపోవటం, తనకు అడ్డులేదనే గర్వం అతన్ని అలా పురికొల్పింది.
  జాతీయపార్టివాళ్ళు మొండిపట్టుదలతో ఎన్నికల్లో పన్జేయటం - పలితాలు కూడా బాగా తారుమారయ్యాయి.
  చెన్నారెడ్డి నిశ్చేష్టుడయిపోయేంత పరిస్థితి వచ్చింది.
  ఒక్క తన బద్వేలు మండలం తప్ప మిగిలిన ఐదుమండలాల్లో తను ఓడిపోయాడు.
  టేకూరు గుర్విరెడ్డి భార్య చేతిలో తన భార్య ఓడిపోయింది.
  ఆ షాక్‌ను భరించలేకపోయాడు అతను.
  తమ ఓటిమిని సమీక్షించుకొంటే - దీనికంతటికీ కారణం శివపురి ఓబుళరెడ్డిగా తేలింది.
  మండలాల వారీగా వచ్చిన ఓట్లన్నీ లెక్కేసుకొంటే - అతనికి వాలేమిటొ వారి సత్తా ఏమిటో అర్థమయ్యాయి.
  పల్లె పల్లెలుగా నాయకులు నాయకులుగా విడదీసి లెక్కలు మొదలు పెట్టాడు.
  ఒక్క తన మండలంలోనే తనకు భారీ మెజార్టీ వచ్చింది. మిగతా అన్ని మండలాల్లో తను వెనకబడి వున్నాడు.
  తాలుకా మొత్తం కలుపుకొంటే తనమండలంలో వచ్చిన ఓట్లు అంతా కరిగిపోయి రెండువేల ఓట్ల కంటే ఎక్కువ మిగల్లేదు.
  అంటే ... రేపు ఎవడైనా బలమైనా వ్యక్తి తనమీద పోటిజేస్తే ఓటమి ఖాయం.
  దిగ్భ్రాంతుడయ్యాడు చెన్నారెడ్డి.
  దీనికంతటికీ కారణం శివపురి ఓబుళరెడ్డి.
  అతనివల్ల తన  రాజకీయ పతనం ఖాయమయ్యే స్థితికి వచ్చింది.
  రాత్రి తన కుటుంబ సభ్యులతో యీ విషయం మీదనే రహస్యంగా మంతనాలు చేశాడు.
  ఓబుళరెడ్డిని లేపేద్దామన్నాడు చిన్నకొడుకు.
  అంతరంగికులు కూడా ఎగదోశారు.
  భార్య రమాదేవి మాత్రం చూస్తూ వూరుకుంది.
  ఓబుళరెడ్డిని చంపటం అనివార్యమని తేలిపోయింది.
  ఆ రాత్రి నుంచే వ్యూహాలు వూపిరిపోసుకోసాగాయి.
 మండల ఎలక్షన్ల తర్వాత తాలుకా రాజకీయాల్లో ఓబుళరెడ్డి పాత్ర విసృతమైంది. పార్టీ అధిస్టానం వద్ద అతనికో ప్రత్యేకగుర్తింపు వచ్చింది. సివిల్ కాంట్రాక్టు వర్కుల కోసం హైదరాబాద్, కర్నూల్, బెంగళూర్ ప్రాంతాలకు తిరుగుతున్నాడు. సరైనా రక్షణ చర్యలు కూడ చేసుకొనటం లేదు. తనమీద దాడులు జరుగుతాయేమోనని అనుమానం వున్నా, చంపేంత పనికి పూనుకొంటారని అతను భావించటం లేదు.
  ఓబుళరెడ్డిని చంపటమే ధ్యేయంగా కొంతమందిని వినియోగించాడు చెన్నారెడ్డి.
  సమయం కలిసి రాలేదు.
  పని తొందరగా జరగలేదు.
  చెన్నారెడ్డి కొంత అసహన పడుతున్నాడు..
  ఒకనాటి రాత్రి రెండు జీపుల్లో హైదరాబాద్‌నించి వస్తున్నాడు చెన్నారెడ్డి.  తన అన్నకొడుకు, కొందరు ఫాలోయిర్స్..ఇంకా తన మెరికల్లాంటి మనుషులతో నిండివున్నాయి జీపులు.
 హైవే మీద జీపుల వేగం బాగా పెరిగింది.
  లారీల్ని, బస్సుల్ని దాటుకొని వెళ్తున్నాయి.
  ఓ లగ్జరీ బస్సును ఓవర్‌టేక్ చేసింతర్వాత ఉన్నట్టుండి వెనుక సీటులోంచి  " అయ్యా ! అయ్యా !  ఆ బస్సులో వాల్లుండారయ్యా ! "  అన్నాడు తన మనిషి.
  "  ఎవర్రా  ?  "
  " వాల్లేయ్యా !  శివపురి ఓబుళరెడ్డి వాల్లు .."
  ఉలిక్కిపడ్డాడు చెన్నారెడ్డి.
  డ్రైవర్‌కు  సైగ చేశాడు.
 జీవు స్లో అయ్యింది.
  బస్సు తన వేగంతో తాను ముందుకు పోతోంది.
  రెండూ పక్క పక్కగా వెల్తూ వుండగా స్పష్టంగా కన్పించారు వాళ్ళు.  హైదరాబాదు బద్వేలు లగ్జరీ బస్సులో కిటికీ వారనే (పక్కనే) కూచుని శివపురీ ఓబుళరెడ్డి అతని పక్కన్నే టేకూరి గుర్విరెడ్డి.
  షాద్ నగర్ దగ్గరవటం వలన లైట్లు వేసి ప్రయాణీకుల్ని ఏదో అడుగుతున్నాడు కండక్టర్.
  "  మనకాడా ఏమేముండాయి ? "   వెనక్కి ప్రశ్నించాడు చెన్నారెడ్డి.
  చెప్పాడు అతను.
   " షాద్ నగర్ బస్టాండులో బస్సాగుతాది.. తెలుసుగదా !.. జీపులు బస్టాండు గేటుకు రవ్వంత ముందుంటాయి.. పనియిపించుకొని రాండి.. "  చెప్పాడు.
   బస్సు షాద్‌నగర్ బస్టాండులోపలికి వెళ్ళింది.
  చెన్నారెడ్డి జీపులు బస్టాండుదాటి కొంత ముందుకెళ్ళి ఆగాయి.
  రెండు జీపుల్లోంచి ఆరుమంది మనుషులు దిగారు.
  నలుగురి చేతుల్లో వేటకొడవళ్ళు వున్నాయి.
  ఇద్దరి చేతల్లో బాంబులున్నాయి.
   బాంబులు పట్టుకొన్న ఇద్దరు, వేటకొడవళ్ళు పట్టుకొన్న మరో ఇద్దరు ఎంట్రెన్స్‌కు అటుఇటూ తచ్చాడుతోంటే మిగిలిన ఇద్దరు నేరుగా బస్సు వద్దకు నడిచారు.
   బస్సులోంచి ప్రయాణికులు ఒక్కోక్కరే దిగుతున్నారు.
  భోజనాలు చేయదల్చుకొన్నవాళ్ళు హోటల్‌కు వెళ్ళుతున్నారు.
  ఓబుళరెడ్డి, గురివిరెడ్డిలు కూడా బస్సు దిగారు.
  జేబులో చేయిదూర్చి తడువుకొంటూ అటు ఇటు చూస్తోన్నంతలోనే శివపురి ఓబుళరెడ్డ్ మీద దాడి జరిగింది.
  వేటకొడవలి మొదటి దెబ్బ ఖచ్చితంగా మెడమీదనే పడింది.
  చావుకేక వేస్తూ రెండు చేతులు అడ్డుపెట్టాడు అతను.
 మరో దెబ్బ చంకల కింద పడింది.
  అకస్మాత్తుగా జరిగిన ఆ సంఘటన అక్కడి ప్రయణికుల్ని భయప్రాంతుల్ని చేసింది.
  గావుకేకలు వేసికొంటూ చెల్లాచెదరయ్యారు.
  మరో రెండు దెబ్బలకే ఓబుళరెడ్డి కుప్పకూలిపోయాడు.
  దిగ్భ్రాంతి నుంచి తేరుకొన్న గురివిరెడ్డి చావుకేకలేసుకొంటూ గేటుకేసి పరుగెత్తాడు.
  అతన్ని వెంబడించారు ఇద్దరు.
  " వొద్దు...నన్ను సంపొద్దు..మీకు దండం బెడ్తా !.. నన్ను సంపొద్దు.. అంటూ  పరుగెడ్తోన్న గురివిరెడ్డికి ఎదురుగా మరో రెండు వేటకొడవళ్ళు అడ్డుగా నిలబడ్డాయి.
  వెనకనించి వచ్చిన వేటకొడవళ్ళు అతన్ని సమీపించాయి.
  తన్ను చంపొద్దని దీనంగా వేడుకోంటోన్న టేకూరు గురివిరెడ్డి మీద వాలాయి ఓబుళరెడ్డిని నరికిన వేటకొడవళ్ళే.
  జనం కూడుకోబోతోంటే  రెండు నాటుబాంబులు కూడా పగిలాయి.
  ఇద్దర్నీ చంపిన తర్వాత వచ్చినంత వేగంగానే వెళ్ళి జీపుల్లో దూరారు ఆరుమంది మాసులు.
  బైటి జనాలకు అక్కడేం జరుగుతుందో తెలిసేలోపలే జీపులు ఆ ప్రాంతాల నించి వేగంగా వెళ్ళిపోయాయి.
  శివపురి ఓబుళరెడ్డి, టేకూరు గురివిరెడ్డిల  ’శవాలు ’ బస్టాండు లోపల ఒకటి, గేటు వద్ద ఒకటి భీభత్సంగా పడివున్నాయి.
  శవాల చుట్టూ క్రమంగా రక్తం మడుగు కడుతూ వుంది.
  చుట్టూ జనాలు మూగుతున్నారు.

           *******

 షాద్‌నగర్ వద్ద జరిగిన జంటహత్యలు తాలుకాను అతలాకుతలం చేశాయి.  జిల్లాను దిగ్భ్రాంతికి గురి చేశాయి.
 చెన్నారెడ్డి మీదా, అతని అన్నకొడుకూ మరికొందరి మీద కేసు రిజిస్టరయ్యింది.
  ఇంజనీరింగ్ ముగించుకొని ఏవో అవకాశాలకోసం చూసుకుంటూ తాలుకా నెత్తుటి రాజకీయాల్ని తలకెక్కించుకోకుండా వున్న చెన్నారెడ్డి అన్నకొడుకు నాగసుబ్బారెడ్డి ఆరోజు చిన్నాయన వెంబడి రావటం వలన కేసులో రెండవ ముద్దాయి  అయ్యాడు.
  అతను ముద్దాయి కాదని జనాల సానుభూతి.
 అతన్ని కేసులో ఇరికించటం జాతీయపార్టి వాళ్ళకు కూడ అంతగా ఇష్టం లేదు, అయినా తప్పని పరిస్థితి. ఎండు కర్రతోటి పచ్చకర్ర కూడా కాలవలసిందే గదా !
  జంటహత్యలతో చెన్నారెడ్డి మరోసారి టెర్రర్ సష్టించాడు. అతని వ్యతిరేకుల్లో గుబులు పుట్టించాడు.
 అతన్ని ఎదిరించి బతకటం కష్టమనిపించింది తాలుకాలోని జాతీయపార్టి నాయుకలందరికీ.
 గుండె ధైర్యమున్న ఓబుళరెడ్డిని నరికాడు.
మంచితనమున్న గురివిరెడ్డిని చంపాడు.
  చెన్నారెడ్డి దృష్టిలో ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే ! తనమార్గానికి అడ్డొచ్చింది కంపచెట్టయినా, పూలమొక్కయినా తొలగించబడవలిసిందే.
 తాలుకా పరిస్థితి మీద జాతీయపార్టి వాళ్ళంతా కలిసి చర్చించుకొనేందుక్కూడ భయపడుతున్నారు.
మండల ఎలక్షన్లలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు బద్వేలు టౌనుకు వెళ్ళటం చాలించారు.
  శివపురి ఇంకా దుఃఖం నించి కోలుకోలేదు.
 ఇద్దరు తమ్ముళ్ళను కిరాతకంగా పోగొట్టుకొన్న పెద్దిరెడ్డికి ఇప్పుడు వేదాంత ధోరణి అలవడింది.
 బంధువులొస్తున్నారు.. పరామర్శించిపోతున్నారు. జరిగినదంతా ఖర్మగా, విధివ్రాతగా చిత్రీకరించి సానుభూతి పలుకుతున్నారు.
 బాలుడు జైలునించి విడుదల అవటంతో ఏడుమంది అన్నదమ్ములు ఇంటి పట్టున్నే వుండిపోయారు.
 పరామర్శించడానికి వచ్చిన వాళ్ళంతా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నారు, పెద్దిరెడ్డి వేదాంతధోరణి, ఏడుమంది అన్నదమ్ముల గమ్యం తెలీని స్థితిని అర్థం చేసుకొన్నారు.  తాలుకా రాజకీయాల్ని దిశా నిర్దేశాలు చేసే పనిలో ఇకపై శివపురికి ఎలాంటి స్థానమూ లేదని వూహిస్తున్నారు.
  "  మేం ముందే చెప్పినాం, చెన్నారెడ్డితో పార్టి జెయ్యడం మంచిది గాదని పార్టీ పెట్టుకున్నెప్పుడే జెప్పినాం, మామాట విన్పించుకోకపోయినారు "  అన్నారు కొందరు.
 నారమ్మ కూడ వచ్చింది శివపురికి.
 పెద్దిరెడ్డి ఇంటివద్దకెళ్ళి నాలుగువైపుల ఎగాదిగా చూసింది.
ఆమె ఎందుకొచ్చిందో అర్థం కాలేదు అక్కడున్నవాళ్ళకు.
 పరామర్శించడానికొచ్చిందో..?
  తన పగవాడి పతనాన్ని కళ్ళారా చూడ్డానికొచ్చిందో..?
 ఎవ్వరితోనూ మాట్లాడలేదు ఆమె.
 నేరుగా రమణారెడ్డి సోదరుల వద్దకెళ్ళింది.
  " ఏమబ్బీ !  నాయన పోయినాడని దిగులు బడ్తాండారా ఏంది ? మొగపిల్లలకు ఏడుపూ, దిగులూ రాగూడదబ్బీ ! మీనాయనొక్కడే ఆ రాకాసోనితో తగూలాడిండే ! ఇంతమంది వుండీ బయపడ్తే ఎట్లా ?  మీ గుంపులో వొకరు పోయి మీ నాయనే వున్నేడనుకో.. ఇట్లా దిగులు మొగాలేసుకొని కూకుండేవాడా ? ... ఏడుమంది ఎద్దులాల వుండారు  ఎద్దులాల... "  అంటూ వెనుదిరిగి రెండడుగులు వేసి ఏదోగుర్తొచ్చిన దానిలా  " నామీదికైతే రాండి...ఆడదాన్ని, ముండమోపిని...  ! "  కసిగా అంటూ ఇక అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయింది.
  ఆమె ఏం మాట్లాడింది చుట్టుపట్ల వాళ్ళకు అర్థం కాలేదు.
 రమణారెడ్డి సోదరుల్ని అడిగితే పెదవి విప్పలేదు.
  ఆమె ఎందుకొచ్చిందీ, ఎందుకట్లా తమను రెచ్చగొట్టిందీ అర్థం చేసుకోలేనంత అమాయుకుడేం కాదు రమణారెడ్డి.
  తాము చేతగాని వాళ్ళలా పడున్నామనీ, ప్రతీకారం తీర్చుకొనే ఆలోచనల్లో లేమనీ తెలిసి ఆరాటపడుతూ వచ్చింది.
 ఆమె ఆరాటం - తామేదో సాధించాలని కాదు...!
  ఆవేశంతో చెన్నారెడ్డిని ఎదుర్కొని మాడి మసైపోవాలని.
 పినతండ్రి చనిపోయినప్పటినుండి తనను అలాంటి అనుమానమే  పట్టి కాల్చుకు తింటోంది.
 తన తమ్ముళ్ళు తొందరపడి ఎక్కడ దెబ్బతింటారోనను భయంగా వుంది. బాలుడు పెట్రేగి పోతున్నాడు.
 జయసింహ చావో రేవో తేల్చుకొందామంటున్నాడు.
 తమ్ముళ్ళంతా అదే కోవలో వున్నారు.
  రెండ్రోజుల క్రితమే తమ్ముళ్ళందర్నీ తండ్రి సమాధి వద్దకు తీసుకెళ్ళి కూచోబెట్టి పరిస్థితుల్ని వివరించాడు.
 తమ తండ్రిని చంపిన వాళ్ళమీద పగతీర్చుకోవటమనేది అనివార్యమైన చర్య. అందులో రాజీపడే అవకాశమే లేదు.
  తమ విరోధి అందరిలాంటివాడు కాదుకాబట్టి ఎంత సమయమైనా తీసుకొని పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. ఇది కేవలం ఆవేశంతో చేసే పని కాదు, ఆలోచన వుండాలి. ఒక రోజు..రెండ్రోజుల్లో పూర్తియేపనికాదు, ఒక్కోసారి జీవితకాలం పట్టొచ్చు.. ఎన్ని రోజులైనా పట్టనీ, ఎన్ని ఏళ్ళయినా పట్టనీ చెన్నారెడ్డి మాత్రం సహజమరణం పొందటానికి వీల్లేదు. పోరాటంలో తామందరూ పోయినా సరే మిగిలిన వాళ్ళే ఆ పని నేరవేర్చాల అవసాన దశలో మంచంమీదున్నపుడయినా సరే గొంతుకోసి చంపాలి తప్ప సహజంగా చచ్చేందుకు అవకాశం ఇవ్వకూడదు.
  పకడ్భందీ ప్రణాళిక ఏర్పాటు చేసుకొంటే తమ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చు.
  వ్యూహాన్ని నిర్మించుకొనేంత దాకా తమ్ముళ్ళను తొందర పడవద్దనె చెప్పాడు రమణారెడ్డి.
  ఈ క్రమంలోనే తమ యింటికి వచ్చిన వాళ్ళందర్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు,  వాళ్ళ మాటల్ని అధ్యయనం చేస్తున్నాడు.
  బంధువులెవ్వరూ తమను గొడవలకు పురమాయించటం లేదు.
  పైపెచ్చు భయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
   తమ నిర్ణయం బైటపడితే వాళ్ళగుండా నైతిక మద్దదు లభిస్తుందేమోగాని తమ కసిలో పాలు పంచుకొనే వాళ్ళెవరూ దొరక్కపోవచ్చు.  తాము మాత్రమే ఒంటరి పోరాటం చేయక తప్పేట్టు లేదు. తుపాకులు, బాంబులు, జీపులూ, మెరికల్లాంటి మనుషులు వగైరాలతో పరిపుష్టంగా వున్న చెన్నారెడ్డిని ఏ ఆయుధాలూ లేకుండా వుత్త చేతుల్తో,... ఏ వాహనమూ  లేకుండా ఉత్త కాళ్ళతో... ఏ బలగమూ లేకుండా కేవలం గుండే బలంతో..ఎదుర్కోవటం సాధ్యమా..?
   వాస్తవాల్ని కూడా బేరీజు వేసుకోవాలిగదా !
  ఆలోచిస్తూ వున్నాడు రమణారెడ్డి.
 నిద్రహారాలు మాని ఒకటే ఆలోచనలు..
  తమ్ముళ్ళు తొందరపాటు మాత్రం పట్టరాకుండా వుంది.
  జొరబడి నరికి వద్దామంటున్నారు. ’తాము ఏడుమందిమి చచ్చేలోపల వాన్ని నరకలేమా ? ’ అంటున్నారు.
 వాళ్ళ ఆవేశం అట్లా వుంది.
  పూర్వంలా ఎదురెదురు కత్తియుద్దం చేయటం కాదు ఇప్పుడు పార్టీలు ( ఈ " పార్టీ " పదానికే ఫ్యాక్షన్ అని ముద్దు పేరు పెట్టింది మన మీడియా) నడపటమంటే. చాటుమాటుగా ఎదుటి మనిషిని దెబ్బతీయాలి, విజయం సాధించాలి. తమవైపు ప్రాణ నష్టం జరక్కుండా పార్టీలు నడిపినవాడే గొప్పవాడు.  తాము నష్టపోకుండా ఎదుటి వాళ్ళను నష్టపరచాలి. అదే పార్టీ మూలసూత్రం.
  చెన్నారెడ్డి వ్యూహమంతా పై నిబంధనల ప్రకారమే వుంటుంది. ఎదుటివాడు సన్నద్దమయ్యేలోపలే దెబ్బతీస్తాడు.
  అన్ని విషయాలు తమ్ముళ్ళతో చర్చిస్తున్నాడు రమణారెడ్డి. ప్రతిరోజు ముగ్గుపిండి గనులవద్దకెళ్తున్నారు, భవిష్యత్తు కార్యచరణకు వ్యూహాలు పన్నటంలో తలమునకలవుతున్నారు.

                                                                                                     ............ సశేషం.

                                                                                                    .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

       ’లా ’ పూర్తిచేసి అప్పటికే ఇంటికి వచ్చివున్నాడు రమణారెడ్డి.
   జయసింహారెడ్డి ఎమ్మెస్సీ పూర్తిజేశాడు
  రామసుబ్బారెడ్డి, నర్శిరెడ్డిలు డిగ్రీలతోనే సరిపెట్టుకొన్నారు.
  చెన్నకేశవరెడ్డి, చంద్రశేఖర్‌లు డిగ్రీ చివరి అంకంలో వున్నారు.
  బాలుడు జైల్లో వున్నాడు.
 తాలుకాలో జాతీయపార్టీని బతికించేందుకు నడుం బిగించిన పెద్దలకు శివపురి వాళ్ళ సంతానం మీద కన్నుబడింది.
  ప్రముఖ జాతీయపార్టి నాయకుడు మున్నెల్లి సిద్దారెడ్డి తరుపున శివపురికి పెళ్ళిపెత్తనం వెళ్ళారు. పెద్దిరెడ్డిని, ఓబుళరెడ్డిని కలిశారు. రమణారెడ్డికి పిల్లనిచ్చి సంబంధం కలుపుకోదలంచినట్లు చెప్పారు.
  తమ్ముని కొడుకును పక్కకు పిల్చాడు పెద్దిరెడ్డి
   " పిల్లను సూడాల్సిన పన్లేదు వొప్పుకొందాం "  చెప్పాడు.  " తొట్టతొలూత(మొట్ట మొదటిసారిగా) యింటిని ఎదుక్కొంటూ వొచ్చిన సంబందాన్ని వొదులుకోగూడదురా ! "  హితువు  చెప్పాడు.
  " సరే సరేలే. మనం కాదంటావుడామా యేంది ? " ఓబుళరెడ్డి చెప్పాడు. ’ తాము కూడ వచ్చి అమ్మాయిని చూసింతర్వాత నిర్ణయం తీసుకొంటామని చెప్పాడు వచ్చిన వాళ్ళకు.
  రాత్రి రమణారెడ్డిని దగ్గరకు పిల్చుకొన్నాడు పెద్దిరెడ్డి. " అబ్బీ ! పెద్దోడా !  కాల్లకాడికొచ్చిన సంబందాన్ని కాలదన్నగాకు నాయనా ! పిల్చి పిల్లనిస్తామంటున్నారు.  గురి యించుమించు సర్దుకుపో. రంభను తెచ్చుకొని దాన్ని అంటిపెట్టుకొని వుండేకన్నా బుద్దిమంతురాల్ని తెచ్చుకుంటే  బాగుబడ్దాది నాయనా ! "  అంటూ హితబోధ చేశాడు.
  పెళ్ళి సంగతులు ఎత్తుకొంటే  తన బ్రహ్మచారి తనం గుర్తుకొస్తాంది ఆయనకు.
  తను వయసులో ఉన్నప్పుడు అందరిలాగే పెళ్ళి చూపులకు వెళ్ళాడు. మొదటిచూపులోనే అమ్మాయి రూపం అతని గుండెల్లో స్థిరపడిపోయింది.  ఆమె మీద అంతులేని వలపు పెంచుకొన్నాడు. పెళ్ళి ఖాయమవుతుందనే ( కుదురుతుంది) భావించారు అందరూ.
  అంతలో ’ నీకు పిల్లనిచ్చేది లేదంటూ అమ్మాయి తండ్రి వద్దనుంచి కబురొచ్చింది. ఆమె మేనమామ అడ్డుపడ్డాడట. అతనితోనే పెళ్ళి చేశారట.
  మనస్సు విరిగిపోయింది పెద్దిరెడ్డికి.
  " చ...నాకు పెళ్ళే వొద్దు.. " అనుకొన్నాడు.
  బ్రహ్మచారిగా వుండిపోయాడు.
  తనలాగా రమణారెడ్డి స్పరద్రూపి కాదు. నల్లగా పొట్టిగా వుంటాడు.  ఆ విషయమే పెద్దిరెడ్డికి కొంత భయాన్ని కలిగిస్తూ వుంది.
  అయితే ఇక్కడ ఆయన భయానికి అర్థం లేదు..ఎందుకంటే అవి రాజకీయపు పెళ్ళి చూపులు కాబట్టి.
  రాజకీయంగా రెండు వర్గాలు ఏకం కావటానికి  నిర్వహించే పెళ్ళితతంగంలో అందానికి, ఐశ్వర్యానికి తావులేదు.  చాలినంత బలగముంటే చాలు చెరోవైపు ఆడపిల్ల, మగపిల్లాడు వుంటే చాలు.
  రమణారెడ్డి పెళ్ళి  ఖాయమైంది.
  అంతలో కలసపాడు నించి మరో జాతీయపార్టి నాయకుని సంబంధం వొకటి నర్శిరెడ్డిని వెదుక్కొంటూ వచ్చింది.
  ఇద్దరి పెళ్ళెళ్ళూ ఆడంబరంగా జరిగాయి.
  అన్ని గమనిస్తూనే వున్నాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  ఓబుళరెడ్డి  ప్రయాణం ఎటువైపు సాగుతుందో పసిగట్టాడు
  ఆపేందుకు తనచేతిలో ఏమిలేదు - చూస్తూ వుండటం మినహా.
  అతను చూస్తోండగానే జయసింహారెడ్డికి, చెన్నకేశవరెడ్డికి కూడా పెళ్ళిళ్ళయ్యాయి. అందరికీ జాతీయ పార్టీ కుటుంబాల్నించే అమ్మాయిల్ని యిచ్చి..పని చక్కబెట్టారు.
  శివపురి వర్గం దాదాపు కాంగ్రెస్స్ పార్టీలో చేరినట్లేనని అందరి భావం
  వాళ్ల అనుమానాల్ని నిజం చేస్తూ ఓ సుభముహూర్తాన పులివెందుల జాతీయపార్టి రాష్ట్ర నాయుకుడు దేవుడు సమక్షంలో శివపురి వర్గం జాతీయ పార్టీ తీర్థం పుచ్చుకొంది.
  అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వెలుబడింది.
  ఓబుళరెడ్డి  చేరికతో జాతీయపార్టి బలోపేతమైందని భావించారు టేకూరి గురివిరెడ్డి.  శివపురి ఓబుళరెడ్డి, బద్వేలు జి.పి.ఆర్, అట్లూరి సోమనాథరెడ్డి, బి.కోడూరు రామసుబ్బారెడ్డిల వర్గాలతో కూడుకొన్న జాతీయపార్టి యీ దఫా చెన్నారెడ్డిని వెనక్కి నెట్టుతుందని అనుకొన్నారు.
  అయితే  చెన్నారెడ్డిని ఎదుర్కొని నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
  రాష్ట్రంలో ప్రాంతీయపార్టి నాయుకుని ప్రభంజనం బలంగా వుంది.
  అయన్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పగ్గాలు చేతికి తీసుకొన్న నాదేండ్ల భాస్కర్‌రావు ప్రభుత్వం నెలరోజులకే కుప్పకూలి పోయాక తిరిగి విశ్వనీయతకోసం వచ్చిన మధ్యంతర ఎన్నికలు ఇవి.
   జాతీయపార్టి నాయకురాలు టెర్రరిస్టుల చేతిలో మరణించి దేశమంతటా జాతీయపార్టికి సానుభూతిపవనాలు వీస్తున్నా రాష్ట్రంలో మాత్రం ఎన్టీఆర్ మీద సానుభూతి పవనాలు వీస్తున్నాయి.
  తాలుకాలో కూడా రెండు మండలాల్లో చెన్నారెడ్డికి అడ్డులేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో జాతీయపార్టి పక్షాన నామినేషన్ వేసేందుకు మనిషే దొరకలేదు.
  గత్యంతరం లేని పరిస్థితిల్లో తనకు సన్నిహితుడైన వై.వి.రావు చేత దేవుడు నామినేషన్ వేయించాడు.
  ఎన్టీఆర్ ప్రభంజనం ముందు మహామహులే మట్టిగొట్టుకుపోయారు, ఆయనకు జరిగిన అన్యాయానికి ప్రజలు తీవ్రంగా స్పందించి ప్రాంతీయపార్టీకి బ్రహ్మరథం పట్టారు.  దేశమంతా జాతీయపార్టి విజయఢంకా మోగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మట్టికరిచింది.
  తాలుకాలో కూడా శివపురి ఏరియా తప్ప మిగిలిన మండలాలన్నీ దాదాపు ఏకపక్షమయ్యాయి.
   చెన్నారెడ్డి అత్యధిక మెజారిటీతో గెల్చాడు.
  అతని మెజార్టీ చూసి ప్రాంతీయపార్టి అధ్యక్షుడు స్వయంగా అభినందించాడు. దాంతో అతనికి గర్వం పెరిగింది.
  బద్వేలు హెడ్ క్వార్టర్‌లో కూచుని అతను చేసే వికటాట్ట హాసాలు తాలుకాలోని అన్ని ప్రాంతాల జాతీయపార్టి వారి గుండెల్లో మార్మోగసాగాయి.
   " ఓబుళరెడ్డి  పోతే నా యింటిక పోయిందా ? జి.పి.ఆర్ పోతే నా ఎంటిక రాలిందా ? టేకూరు గురివిరెడ్డి పోతేనేం ? అట్లూరి సోమనాధ్‌రెడ్డి పోతేనేం.. వీల్లంతా కలిసి నా ఎంటికేమన్న పీక్కున్నెరా ? "  అంటూ ప్రగల్భాలు పలకసాగాడు.
  అతని మాటలు చెవుల బడుతున్నాయి అందరికీ.
  కానీ - ఏమి చేయలేని పరిస్థితి.
  రావుకు తాము సక్రమంగా ఓటు  జరపలేక పోయామేమోనను అనుమానం.  తమ వరకు గట్టిగనే పోరాడారు. అతని అసమర్థతను  తాము సవరించలేము గదా !  చెన్నారెడ్డి ఎదురుగా వస్తున్నాడంటే ఆ దారిన రావటం కూడా చాలించుకుంటాడు అతను.  తన ఏరియాలోనే వూళ్ళకు వూళ్ళు ఆక్రమించుకొని రిగ్గింగ్ చేసికోంటుంటే ఆ ప్రాంతానికేసి తొంగి  కూడా చూడలేదు రావు.
  చెన్నారెడ్డి విర్రవీగాడు.
  ఎలక్షన్లలో తనకు వ్యతిరేకంగా పన్జేసిన వాళ్ళ మీద కక్షగట్టి టౌన కేంద్రంగా పల్లెజనాల మీద తన పంజా గురిపెట్టాడు.
  పెద్ద మనుషుల్ని, మర్యాదస్తుల్ని సైతం తనకు వ్యతిరేకంగా పనిచేశారనే కారణంగా టౌనుకొచ్చినపుడు పట్టి బంధించి, కొట్టి దారుణంగా అవమానించాడు. చెన్నారెడ్డి పేరు బెట్టి అతని మనుషులు కూడా అరాచకాలకు దిగారు.
  ఈ నేపధ్యంలో చెన్నారెడ్డి చిన్నకొడుకు హర్షవర్ధన్ ప్రముఖపాత్ర పోషించసాగాడు.
బాంబుల ప్రయోగాన్ని విసృతపరిచాడు చెన్నారెడ్డి.
 ఊరూరా బాంబుల్ని పుష్కలంగా నిలవుంచాడు.
  దిబ్బల్లో బాంబులే.. వాముల కింద బాంబూలే.. పాడుబావుల్లో బాంబులే.. ఎక్కడ వంగితే అక్కడ బాంబు దొరికేంత అవకాశం కల్పించాడు.
  వంతుల బావికింద నీళ్ళ తకరారు వస్తుందేమో ! -  బావి గుంతపక్కనే కంపపొదల్లో బాంబులుండాలి.
  గెట్ల తకరారు రావొచ్చేమో !  గెనిమల వద్దనే గుర్తుగా బాంబులు పూడ్చి పెట్టి వుండాలి.
  ఇళ్ళవద్ద గోడ తకరారు వస్తుందేమో !
 ఎద్దుల గాడి తకరారు ఎదురవుతుందేమో !
  ఏ వైపునించి ఏ ఆపద మూడుతుందో ? తన వాళ్ళందరికీ అన్ని తావుల్లో చేతికందేలా బాంబులు నిల్వలుంచాలి.
  ఎమ్మెల్లే ఆశీర్వాదంతో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి బాంబులు వేసి వస్తున్నారు అతని అనుయాయులు.
  రాష్ట్రంలో ఆయన పేరు బాంబులకు పర్యాయపదమైంది.  చింతకుంట చెన్నారెడ్డి అనేకన్న బాంబుల చెన్నారెడ్డి అంటేనే ఆయన అందరికీ గుర్తింపుకొస్తున్నాడు.
  ఇన్ని గొడవలు చేస్తున్నప్పటికీ అతను టేకూరు గుర్విరెడ్డి జోలికి గాని, శివపురి వర్గం జోలికి గాని వెళ్ళటం లేదు. వాళ్ళు కూడా అతన్ని సవాల్ చేయటం లేదు.
  అలాగని వాళ్ళను వదిలేశాడని కాదు.
  అన్ని వైపుల్నించి నరుక్కొంటూ వాళ్ళకేసి వస్తున్నాడు.
  ఆ విషయం వాళ్ళక్కూడా అర్థమైంది.
  టేకూరు గురివిరెడ్డి మాత్రం ఓబుళరెడ్డిలాగ తెంపుమనిషి కాదు ( తెంపు = తెగింపు ) గాని అందర్నీ ఆకట్టుకొనే మంచిమనిషి. విస్తృతమైన బంధుబలం వున్న వ్యక్తి. అతనికి దెబ్బతగిలితే ఒక మండలమంతా బాధపడేంత గొప్ప మనిషి.
  బద్వేలు టౌన్లో సంసారముంటోన్న పాత నాయకులందర్నీ సవాల్ చేశాడు చెన్నారెడ్డి.  సోమనాథ్‌రెడ్డిని లెఖ్కలేకుండా తిట్టి చిటికలు వేసి పిలుస్తూ మరీ సవాలు  విసిరాడు. భూస్వాములు, ఫ్యాక్టరీ యజమానులు, కోటీశ్వరులుగా పిలవబడుతోన్న వాళ్లంతా చెన్నారెడ్డికేసి కన్నెత్తి చూడాలన్న వణికి పోయే పరిస్థితి వచ్చింది.
  పోలీసులంతా అతని గులాములయ్యారు. అతనికి వ్యతిరేకంగా కేసులు పెట్టినా రిజిస్టర్ చేసే పరిస్థితిలో లేరు.
  మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి బద్వేలు, అట్లూరు, గోపవరం మండలాలు మూడూ అతని చేతికిందికి వచ్చాయి. ఆ మండలంలో జాతీయపార్టికి ఏజంట్లు కూడా కరవయ్యే పరిస్థితి వచ్చింది.
  టేకూరు వాళ్ళు, శివపురి వాళ్ళు మాత్రం తమ ఉనికి చాటుకొంటున్నారు. ఆరెండు మండలాల్లో చెన్నారెడ్డి దౌర్జన్యం యధేచ్చగా సాగటం లేదు.
   పదొమ్మిది వందలఎనబై తొమ్మిదిలో తిరిగి ఎలక్షన్లు వచ్చాయి.
  చెన్నారెడ్డి భారీ మెజారిటీతో తిరిగి గెల్చాడుగాని, రాష్ట్రమంతటా జాతీయపార్టి గాలి వీచటంతో ప్రాంతీయపార్టి మట్టి కొట్టుకపోయింది. రెండు చోట్ల పోటి చేసిన ఆ పార్టి అధ్యక్షుడే   ఒక స్థానంలో ఓడిపోయాడు.
  రాష్ట్రంలో జాతీయపార్టి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో  చెన్నారెడ్డి ప్రత్యుర్థులకు కొంత వూరట కలిగింది. తను ఎమ్మెల్లే అయితే కావొచ్చు తమకు జిల్లా జాతీయపార్టి నాయుకులు వత్తాసు పలుకుతారు గదా! అందులోనూ యీ దఫా జిల్లా మనిషికే హోంమంత్రి పదవి దక్కింది. అతని అండదండలు తమకు దండిగా వుంటాయి. అప్పుడు తమపట్ల పోలీసుల ప్రవర్తన కూడా మారుతుంది కదా !
  వాళ్ళు వూహించినట్లే పోలీసుల్లో కొంత మార్పు వచ్చింది. చెన్నారెడ్డికి యిచ్చిన విలువ జాతీయపార్టి నాయకులకు కూడా యిస్తున్నారు. శివపురి ఓబుళరెడ్డిని సాదరంగా ఆహ్వానించి కుర్చీలు వేసి కూర్చబెడుతున్నారు.
  చెన్నారెడ్డి టెర్రర్ ఇంకా అణగ లేదు.
  ఓ కేసుకు సంబంధించి పోలీసులు తన వాళ్ళను అరెస్ట్ చేస్తే..పోలీసు్స్టేషన్ ముందరే పెద్ద గందరగోళం లేవదీసి, పోలీసుల్ని బెదిరించి మరీ విడిపించుకు పోయాడు. పోలీసుల్లో అతని మీద అంతర్లీనంగా అసమ్మతి వుంది.
  ఈ నేపథ్యంలో చింతకుంట చెన్నారెడ్డి వ్యతిరేకులంతా ఒక చోట సమావేశమయ్యారు. కాంగ్రెస్స్ గవర్నమెంటు హవా నడుస్తున్నా యీ ఐదేళ్ళలో అతని దుడుకుతనాన్ని అణచివేయాలని నడుంబిగించారు. వెంటనే పల్లె పల్లెకు వెళ్ళి తమ కార్యకర్తలని కలిశారు.
  పంచాయితీల వారిగా వాళ్లను కూడేశారు.
  ధైర్యం నూరిపోశారు.
  ఎమ్మెల్లే కూడా అప్పటిలా దుడుకుగా వ్యవహరించటంలేదు. ఏ మాత్రం తేడావస్తే పోలీసుల చేతుల్లో ఇరుక్కోంటామేమోనని అతనికి అనుమానంగా వుంది.
  జాతీయపార్టి కార్యకర్తల్లో మళ్ళీ జవసత్వాలు కూడుకొంటున్నాయి.
  చెన్నారెడ్డి మనుషుల గొడవలు పోలీసు స్టేషన్ వరకైనా తీసుకపోగలుగుతున్నారు.
  ఓబుళరెడ్డి ఇప్పుడు పూర్తిగా కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసే పనిలో వున్నాడు. ఎక్కడ గొడవలు జరిగినా తన జనంతో సహా అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు.
  అతని చర్యలు చెన్నారెడ్డికి కంటగింపుగా మారాయి.
  ఇలానే వదిలేస్తే తన వాళ్ళను బెదిరించే స్థాయికి కూడా రాగలడేమో..!
  పోరుమామిల్లలో ఓ పెళ్ళికి హాజరైన ఓబుళరెడ్డి వద్దకు దురుసుగా దూసుకెళ్ళాడు చెన్నారెడ్డి.
  " ఏం వోయ్ ?  మావాల్ల మీంద నీ బెదిరింపులు జాస్తెయినాయంట..?(ఎక్కువైనాయట ) దేనికోయి ఈ రాజకీయమంతా నీకు ?  ఎమ్మెల్లేకు పోటి జేస్తావా యేంది ! "  అన్నాడు తీక్షణంగా చూస్తూ వ్యంగాన్ని మిళితం చేసి.
   " మేం  ఎవార్నీ బెదిరించేవాల్లం గాదు. అనవసరంగా ఎవరిజోలికి పోము. మాజోలికి వస్తే వొప్పుకోం. దౌర్జన్యాలు సెయ్యడం, బెదిరించడం నీ లక్షణం. మాకవి చేతగాదు  "  అంతకంటే తీక్షణంగా చూస్తూ చెప్పాడు ఓబుళరెడ్డి.
   " సరే..సరే.. నేను తప్పుడు నాకొడుకునే... ఎమ్మెల్లే పదవి నిలబెట్టుకోవాలగాబట్టి నేను దౌర్జన్యాలు జేస్తాండ. నువ్వెందుకోయి మందను ఎంటేసుకొని వూర్లమీద తిరుగుతండావు ? నువ్వేమైనా ఎమ్మెల్లేకు పోటి జేసేదుందా ? "
   " ఎందుకు జేయనూ ? నీకు దొరికినట్టు మా యట్లాంటి ఖర్మనాకొడుకు  మాకు దొరికితే ఎమ్మెల్లేకు పోటిజేయనల్లా వుందా ? "  అన్నాడు ఓబుళరెడ్డి.
  గతుక్కుమన్నాడు చెన్నారెడ్డి... అంతలోనే తేరుకొని  " సరే .. సరే.. రేపు ఎలక్షన్లలో అట్లనే పోటీజేద్దువుగాని..  నావాల్ల జోలికి మాత్రం రావొద్దు.  పాతసావాసంగాబట్టి  నోటితో చెబుతావుండా ! " అన్నాడు తీక్షణంగా చూస్తూ.
  " లేకుంటే ఏం జేస్తావోయ్ ? "  గట్టిగా అరిచాడు ఓబుళరెడ్డి.
 పెళ్ళి జనమంతా అటుకేసి చూపుల్ని తిప్పి దిగ్ర్భాంతికి గురవుతున్నారు.
 ఓబుళరెడ్డి కేసి పైకి కిందకు ఓ సారి ఎగాదిగా చూశాడు చెన్నారెడ్డి. " ఏం జేస్తానా ? " అంటూ పళ్ళు కొరికి  " నేను ఎమ్మెల్లేనయి బజారు మనుసుల్లా మీదబడలేకుండా. మీయట్లా వుత్తమాసినయ్యుంటేనా... మిమ్మల్ని గాదు - మీ వూరిని కూడా ఎత్తక పోయిండేవాన్ని "  అన్నాడు.
  "  పో..  పోవోయ్ ! "  అదే శైలితో ప్రతిస్పందించాడు ఓబుళరెడ్డి.  " ఎమ్మేల్లేవు కాబట్టే మేమూ నీజోలికి రాలేకుండాము. రిజైన్ చేసి ఒక్కసారి తగిలి సూడు - మా సంగతేందో నీకూ తెలుస్తది..."  అంటూ ప్రతి సవాల్ విసిరాడు.
 చుట్టూ వున్న వాళ్ళందరికీ అక్కడేదో అరాచకం జరగబోతోన్న విషయం స్పరించసాగింది.
  ఓబుళరెడ్డి కేసి తదేకంగా కొంతసేపు చూశాడు చెన్నారెడ్డి. అతనికేసి పళ్ళు కొరుకుతూ వెనుదిరిగాడు.
  అక్కడ జరిగిన సంఘటన తాలుకా అంతటా చర్చనీయాంశమైంది.
  జాతీయపార్టీ కార్యకర్తలకు కొంత మనోధైర్యం సమకూరింది.

                                                                                                             ..........సశేషం.

     ఎప్పటినుండో నా బ్లాగ్‌లో రాయాలనుకుంటున్న కొన్ని విషయాలను బద్దకంతో వాయదావేస్తూవస్తున్న నాకు నవతరంగంలో " మహిళాదర్శకులు అయితే మాత్రం..? " వ్యాసంలోని కొన్ని వ్యాక్యానాలు  నేను అనుకున్న విషయానికి కాస్త మోక్షం ఇచ్చినట్లు అయ్యింది. ఆడ, మగ జెండర్ మద్యన దృక్కోణాలు వేరు వేరుగా ఉంటాయన్న అక్కడి వ్యాసానికి చాలా మంది తమ వ్యాక్యానాల ద్వార విబేదించారు...చాలా వరకు జనరల్‌గా ఆడైనా మగైనా తాము తీసే సినిమా జనరంజకంగా తీస్తే బావుంటుందనో..!! లేక వాళ్ళు తీసే సినిమాలలో ఆడవారు తీసారా..? లేక మగవారు తీసారా అన్న విభజనరేఖ చేయడమేంటి..? అన్న ప్రశ్నలు కూడ సందించారు..! మరి కొందరు..ఇంకాస్త ముందుకెళ్ళి కొందరివ్యక్తులమీద ఉన్న ఒక ఫిక్సడ్ అభిప్రాయం వలన వ్యాసంలోని విషయాన్ని లోతుగా చూడలేకపోయారనిపించింది. ఈనా నామాటల్లొ కాన్‌ఫ్లిక్ట్ ఉందనుకోండి. నేను చెప్పిందే వాస్తవం అవాలని రూల్ లేదుకదా..? కాకపోతే విషయాన్ని విషయంగానే చర్చిస్తే కాస్తైనా " సత్యం " చూడవచ్చుననే అనుకుంటున్నా.
       అక్కడ చాలా మంది వ్యక్తపరిచిన అభిప్రాయంలో జనరలజైషన్ ఉన్నది..! జనరల్‌గా నాతో సహా ఎవరికైనా, లేక చాలా వరకు... ఆడ, మగ మద్యన తారతమ్యాలేంటి..! హెచ్చుతగ్గులేంటి..! ఇద్దరు సమానమే అన్న విషయంలో వేరే అభిప్రాయం వుండదనే అనుకుంటున్నా..! జనరల్‌గా ఇలాంటి మాటలు చెప్పుకోడానికి కూడ బానే ఉంటాయి.. కాని ఇక్కడ రెండు విషయాలున్నాయి, అలా ఉండాలి..ఇలా వుండాలి..ఆలా ఉంటేనే సమాజం ముందుకు సాగుతుంది అని చెప్పుకునే మాటలు. అలానే వుండాలి అని అనుకోవడం వేరు..! ఇక రెండవది వాస్తవంగా ఆచరణలో ఆడ, మగ ఈ ఇద్దరూ బయటి ప్రపంచాన్నితమ తమ దృక్కోణంలోనుండి చూస్తున్నది ఏమిటి..? జరుగుతున్నది ఏమిటి ..? అన్నది తరచి చూడాలి ..ఇదివేరు ..! ఈ రెండిటిని కలిపి ఒకే విదానంలో చూస్తున్నారనిపిస్తుంది.  ప్రస్తుతం రెండవ విషయాన్నే నవతరంగంలో ప్రస్తావించారనుకుంటా..??  స్త్రీ తన దృక్పదం నుండి బయటి ప్రపంచాన్ని..చుట్టూ జరుగుతున్న సంఘటనల్ని ఎలా చూస్తన్నది..? ఏమి అనుకుంటున్నది...?? ఇలాంటి విషయాలు స్త్రీ  తను తీసే సినిమాలలో ప్రతిబింబిస్తే అది బయటిప్రపంచానికి మరో విభిన్నత స్పష్టపర్చినట్లవుతుంది..! ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే ఇద్దరి మగవాళ్ల మద్యన ఆలోచనావిధానలలోను..అభిప్రాయలలోనూ బేదాలు వుంటాయి..అలాగే ఇద్దరి స్త్రీల ఆలోచనల మద్యన కూడ తేడాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు స్త్రీ, పురుషుల ఆలోచనావిదానంలో కూడ తేడా ఉన్నట్లే కదా..? వారి దృక్పదాలు వేరుగా ఉన్నట్లే కదా..? పోనీ మరో విదానం తీసుకుందాము...నవలలు చదివే వారికి యండమూరి నవలలు బాగా పరిచయమే ఉంటుంది. ఆయన కమర్షియల్ నవలలో ఉండే కొన్ని స్త్రీ పాత్రలు..ఎంతో దృడచిత్తంతో, మనోనిబ్బరంతోనూ వ్యవహరిస్తూ..అద్భుతమైన తెలివితేటలతో అన్ని విషయాల్లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తూ ఉంటాయి...! అలాంటి పాత్రలు నిజజీవితంలో టార్చిలైట్ పెట్టుకొని ఎంత వెదికినా.. ఎక్కడా కనపడవు....!! ఎందుకనీ...??? అందుకు కారణం ఆ పాత్రలన్ని యండమూరి అనబడే ఒక మగ దృక్పోణం నుండి తయారు చేయబడినవి.. ఒక మగ రచయత తను ఎలాంటి స్త్రీని ఇష్టపడతాడో..ఆ స్త్రీ ఎలా ఉండాలనుకుంటాడో దానికి అనుగునంగా ఒక స్త్రీ పాత్రను సృష్టించుకుంటాడు..ఆఫ్‌కోర్స్..తనకు ఎదురైన..లేక తన జీవితానుభవంలో చూసిన కొంతమంది స్త్రీలను తన కోణంనుండి చూసిండవచ్చు..వారినే కాస్త అటో ఇటోమార్పులు చేసి తన నవలలో జొప్పిండవచ్చు.. కాని అది కూడ మగ దృక్పోణమే నుండే కదా..?? అంతెగాని నిజానికి స్త్రీ తనకు తాను ఎలా ఉంటుందో ఆ స్త్రీకి తప్ప పక్కవారికి ఎవరికీ తెలియదు..అంతెందుకు ఆ నవలలు చదివే స్త్రీ పాఠకులు కూడ ఆ నవలలోని స్త్రీ పాత్రలను చాలా అబ్బరంగా చూస్తారు..ఆరాధనగా చూస్తారు..కొందరు ఇష్టపడతారు..కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. అందుకు కారణం ఆ పాత్రలన్నీ నిజజీవిత స్త్రీల దృక్పదాని ప్రతిబింబించట్లేదు కనుక..!?  ఇలాంటిదే మరో ఉదాహరణ... 1994 లో అనుకుంటాను " ప్రేమ " అనే ఒక కాన్సెప్ట్ మీద ముగ్గురు రచయతల నుండి సీరియల్ రాయించింది ఆంధ్రజ్యోతి వారపత్రిక యజమాన్యం. యండమూరి, యుద్దనపూడి , మూడో రచయత్రి.. ఎప్పుడూ వినని కొత్తపేరు.. వెన్నెలకంటి వసంతసేన... ఈ ముగ్గరి సీరియల్స్ ఒకేసారి ప్రతివారం వారం పక్క పక్కనే ప్రచురితమయ్యాయి. వాటిని గమనిస్తే చాలా వరకు అర్థమవుతుంది. యండమూరి నవల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..యూనివర్సల్‌గా మానసిక విశ్లేషణతో నవల అసాంతం నడిపిస్తారు.. అదీను చదివే పాఠకులను ఆకట్టుకునే విదంగా రాయగల సమర్ధుడాయన.. కాబట్టి ఆయన నవల మీద పెదగా చర్చించినవసరం లేదు. మిగిలింది 23 ఏళ్ళ వెన్నెలకంటి వసంతసేన రాసిన నవల గురించి చాలానే చర్చించవచ్చు అందులో ప్రతి పాత్ర తనవైపునుండి మాట్లాడుతున్నప్పుడూ నిజమే అనిపించేలా చర్చిస్తుంది..! మానవసంబందాల మీద ఒక 23 ఏళ్ళ అమ్మాయి విశ్లేషణాత్మకంగా నవల రాయడం ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో ఈ సీరియల్ మీద ఆంధ్రజ్యోతిలో చాలానే వేడి వేడిగా..వాడి..వాడిగా చర్చలు జరిగాయి. ఇక మిగిలింది యుద్దనపూడి గారు రాసిన నవల..అది అచ్చు ఒక మహిళా దృక్కోణంనుండే వెలవడినట్లు స్పష్టంగా కనపడుతుంది.. అందులోని స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక స్త్రీ తన కోణంలో చూసే దృక్పదం ప్రస్పటంగా కనపడుతుంది. మరి వెన్నెలకంటి వసంతసేన కూడ స్త్రీనే కదా..? అని అనుకోవచ్చు..కానీ తీరా చూస్తే ఆ నవల రాసింది తోటకూర రఘు అని ఒక రచయత అమ్మాయి పేరు మీద నవల రాసారట..!!, ఈ విషయం కోందరి నా రచయత మిత్రులద్వార తెలుసుకున్నాను. ఒకే కాన్సెప్ట్‌తో ఉన్న ఈ మూడునవలలను మా అమ్మగారితో సహా కొంతమంది రకరకాల వయసులో ఉన్న స్త్రీల చేత చదివించాను.. విచిత్రమేమంటే..యండమూరి రాసిన నవల విషయంలో పెద్ద మాట్లాడకపోయినా..వెన్నెలకంటి వసంతసేన ( తోటకూర రఘు) రాసిన నవలను విపరీతంగా విమర్శించారు. యూనివర్సల్‌గా స్త్రీలందరికీ యుద్దనపూడి గారి నవల తెగ నచ్చేసింది...! అర్థమైనదనే అనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్నదేమిటో...??.

  మరో నా స్వీయ అనుభవం...1994 కాలంలో అనుకుంటాను బెంగళూర్‌లో ఒక ప్రొఫిషినల్ కోర్స్ చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న " యువనిక " అనే  సంస్కృతి, సాహిత్య, స్పోర్ట్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక ప్రభుత్వ సంస్థలో నేను పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అప్పటి ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ తన స్వంత వూళ్ళో జాతీయ ఆటలపోటీలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలను కవరేజ్ చేయడానికి కొంతమంది పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్స్‌‍తో సహా నేను, ఆ సంస్థ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఆ గేమ్స్‌లలో పాల్గోనేందుకొస్తున్నా పి.ఆర్.ఓ గారి కూతురు, ఓ ఐదుగురు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మిని బస్‌లో ముఖ్యమంత్రిగారి ఊరయిన " కార్కాల " కు బయలుదేరాము. మంగళూర్‌కి వెళ్ళే మార్గమద్యంలో ఒక చోట " సుబ్రమణ్య " అని ఒక పుణ్యక్షేత్రమున్నది. ఇది అచ్చు మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం లాగ ఉంటుంది చూడడానికి. పాత్రికేయమిత్రులంతా ఒక సారి దేవాలయానికి వెళ్ళి వద్దాం అని అనడంతో..అటువైపుకు వెళ్ళాము. దారి పొడవునా రహదారికిరువైపుల పెద్ద పెద్ద చెట్లతో పచ్చని ప్రకృతి. ఆ దారి మద్యలో ఒక చోట నది ప్రవహిస్తూ ఉండి దానిమీద చెక్కతో చేసిన పెద్ద బ్రిడ్జి మీదుగా వెళ్ళాము..అది చూసిన మేమందరం బస్సుని ఆపి ఆ అమ్మాయిలు తప్ప  డ్రైవర్‌తో సహా అందరం దిగాము. ప్రకృతిని చూసి పరవశించని జీవి అంటూ ప్రపంచంలో ఉండదనే అనుకోవచ్చు. ఆ ప్రకృతిని చూస్తూ మైమరిచిపోతున్నారు అందరూ.. అక్కడున్న నదిలో నీరు చాలా స్వచ్చంగా అడుగుభాగన ఉన్న రాళ్ళతో సహ కనపడుతూ తేటతెల్లగా ఉన్నాయి. అవన్నిమైమరిచి చూస్తున్న పి.ఆర్.ఓ బస్సు‍లోనే ఉన్న తన కూతుర్ని. ఆ అమ్మాయి ఫ్రెండ్స్‌ని పిలిచాడు. వాళ్ళు చెవుల్లో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని బాలీవుడ్ హీరో షారుఖ్  ఖాన్ " సోకాల్డ్ ప్రేమ "  పాటలు వింటూ " ఊహు " అంటు తల అడ్డంగా ఊపారు రామంటూ..!  చూస్తున్న నాకు కాస్త ఆశ్చర్యమేసింది..!! పూర్వకాలం నుండి మన భావకవులు తమ కవిత్వంలో స్త్రీని ప్రకృతితో పోలుస్తారు కదా..!! మరి వీళ్ళేమిటి...!! ఈ ప్రకృతి వీళ్ళనేమి కదిలించట్లేదా..?. అసలు సినిమాలలో దర్శకులు చూపిస్తున్న హీరోయిన్ ప్రకృతికి ప్రవశించిపోయే దృశ్యాలు మన మెదుల్లో నిక్షిప్తమయ్యాయా..? ఒక సారిగా  మణిరత్నం తీసిన " గీతాంజలి " సినిమా గుర్తొచ్చింది..అందులోని కథానాయకి ప్రకృతివడిలో వర్షంలో తడుస్తూ పాట పాడే దృశ్యం కదలాడింది..! మరి ఈ అమ్మాయిలేంటి..?? సినిమాలోలాగ అమ్మాయిలందరూ ఎగిరి గంతులేస్తూ పాటపాడతారనీ కాదు గాని.., ప్రకృతిని తిలకించడానికి ఆసక్తి చూపట్లేదే..?  అలా అని ఆ ఐదుగురు అమ్మాయిల్లాగే  ప్రపంచంలోని మిగతా స్త్రీలందరూ ఉంటారనుకునే మూర్ఖుడ్ని కాను నేను..ఆ విషయం వేరు..ఇక్కడ అనవసరం కూడాను..కాని ఆ సంఘటన వలన నాకో కొత్త విషయం... కాస్త లోతుగా ఆలోచించడానికి అవకాశమొచ్చింది..కొద్దిగా కొద్దిగా అంతక్షవులు తెరుచుకోవడం మొదలెట్టాయి..! 
      
       గీతాంజలి సినిమాలో మణిరత్నం కోణంలోని హీరోయిన్ అలా గంతులేస్తూ ప్రకృతిని ఆశ్వాదిస్తున్నది..అంటే అదొక మగవాడి దృక్కోణం. మణిరత్నంకి నచ్చేవిదంగా తన దృక్కోణంనుండి సృష్టించబడ్డ స్త్రీ పాత్ర అది..! తన దృష్టిలో స్త్రీ ఎలా ఉంటే బాగుంటుందో..నచ్చుతుందో  అలాంటి స్త్రీని తను సృష్టించుకున్నాడు. అదీ అందరికీ నచ్చేలా కమర్షియల్ యాంగిల్‌లో అవిష్కరించాడు. అంతేకాని నిజజీవితంలోని స్త్రీ అంతరంగం వేరు..అన్నది స్పష్టమవుతూ వచ్చింది  అప్పటినుండే పెణి అనో లేక పెన్వి అనో సరిగ్గ గుర్తులేదుగాని..నటి, దర్శకురాలైనా రేవతి దర్శకత్వం వహించిన ఒక టి.వి సీరియల్‌తో మొదలుపెట్టి మహిళా దర్శకుల సినిమాలు  చూడడం ప్రారంభించాను. వాటిల్లో ఖచ్చితంగా గమనించవచ్చు స్త్రీల దృక్పదం. అలా మీరా నాయర్, అపర్ణాసేన్, గురిందర్ చద్దా, అప్పుడెప్పుడో..సినిమాలు చేసినా పాక్షికంగా స్త్రీల దృక్పదం కనపడే శ్రీమతి భానుమతి రామక్రృష్ణ సినిమాలలో స్త్రీల దృక్కోణం చూడవచ్చేమో..!! ఇక రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావుల సినిమాలలో ఉండే స్త్రీ పాత్రలు వారి వారి కోణమే నుండి వచ్చినవే తప్ప..నిజమైన స్త్రీలు కాదనుకుంటా..! తర్వాత బాలచందర్, భారతీరాజ సినిమాలలోని స్త్రీలు కూడ అంతే..! కాకపోతే ఇక్కడ మహిళా సమస్యలు వేరు..మహిళా దృక్కోణం వేరు ఈ రెండిటిని ఒకే గాటన కట్టి చూడకండి. చాలా మంది అదే చేస్తున్నారు.. బాలచందర్ మహిళా దర్శకులకంటే మహిళా సమస్యలమీద సినిమాలు బాగా తీయగలడు అని అంటున్నారు..అక్కడ దృక్కోణం వేరు..సమస్యలు వేరు..మళ్ళీ ఇక్కడో తిరకాసు ఉన్నది..ఒక మగవాడికి మహిళా సమస్యల పట్ల ఉన్న perspective వేరు..అదే సమస్యల పట్ల స్త్రీలకున్న perspective వేరుగా ఉంటుంది.
        చూట్టూ వున్న సమాజాన్ని, ప్రపంచాన్ని చూసే స్త్రీ దృక్పదం మగాళ్ళకంటే ఖచ్చితంగా బిన్నంగా ఉంటుందన్నది సుస్పష్టం..! అలాగే మగాళ్ళ దృక్పదం కూడా స్త్రీల దృక్పదానికి భిన్నమే..! ఆ విషయాన్నే నవతరంగంలో ప్రస్తావించారనుకుంటున్నాను. దర్శకురాలైనా నందినిగారి ఇంటర్‌వ్యూ నేను చూడలేదు ..చదవలేదు..! వ్యాసంలో చెప్పినట్లుగా మరోకరిలాగ సినిమా తీయను అనో..లేక తీస్తాననో చెప్పడం అన్నదే కాస్త ఆలోచనలో పడేస్తున్నది.. ఒకరిలాగ సినిమా తీయడమేమిటి..? ఉదా: ఒక కొత్త దర్శకుడు/ దర్శకురాలు వచ్చి నేను పలాన దర్శకుడిలా.. ఏ విశ్వనాధో..మణిరత్నంలానో. రామ్‌గోపాల్‍వర్మలానో సినిమా తీస్తాను అని చెబితే..! వారిలాగ తీస్తానన్న కొత్త దర్శకుడితో ఎందుకు సినిమా తీయించాలి..అదేదో...విశ్వనాధగారితోనో ..మణిరత్నం..వర్మ గారితోనే సినిమా మొదలెట్టవచ్చుకదా..? మళ్ళీ కొత్త దర్శకుడితో తీయడమెందుకూ..? ఎవరికి వారికంటూ వారి సొంత ఆలోచనా..కొత్తదనం ఉండాలి గాని..! అలా  స్టేట్‌మెంట్ ఇచ్చేముందు తరచి చూసుకునే ఉండుంటే బాగుండేమో..?. ఎన్నో కష్టాలు పడి..ఎంతోమంది నిర్మాతలను కలిసి వారిని తన కథతో ఒప్పించడానికి నానా యాతలు, తిప్పలు పడివుంటారు..ఎన్నో కష్టాలు ఓర్చింటారు..బహుశ ఆ ప్రస్టేషన్‌లో వచ్చే స్టేట్‌మెంట్ అలా వుంటుందేమో..?? కాకపోతే  ఆవిడ తీసిన ఏ సినిమా రిలీజ్ కాకమునుపే అభిప్రాయాలు..నిర్దశాలు..వ్యక్తపరచడం..అంత సబబు కాదేమో..!!?

                                                                                                        .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.


   డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు వెలువడింది.
  బాలుడు, ఓబుళరెడ్డితోటి మరో ఐదుమంది మీద నేరం నిరూపించబడింది. ముగ్గురికి లైఫ్ జెప్పారు. మిగతా నలుగురికి మూడేళ్ళు జైలు శిక్ష చెప్పారు.
  అందర్నీ రిమాండ్‌కు  తీసుకొన్నారు.
 చెన్నారెడ్డి వచ్చి పలకరించాడు.
  కేసును హైకోర్టుకు అప్పీలు చేద్దామన్నాడు.
  కోర్టు పనుల్ని చూసికొనేందుకు లా చదువుతోన్న రమణారెడ్డి వచ్చాడు విజయవాడనుంచి.
  దుఃఖంతో కుమిలిపోతూవున్న కుటుంబాన్ని ఓదార్చాడు.
  హైకోర్టుకు అప్పీలు చేయించాడు.
 హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
  రమణారెడ్డి మళ్ళీ కాలేజికి వెళ్ళాడు.
  ఈలోపు ముద్దాయిలందర్నీ రాజమండ్రి సెంట్రల్‌జైలుకు తరలించారు.
  శివపురి ఓబుళరెడ్డి కథ తాలుకా అంతటా చర్చనీయాంశమైంది.
  అతని శకం ముగిసినట్లేనని భావించారు చాలామంది.
 ఎమ్మెల్లేకు కుడి భుజం లాంటివాడనీ, అతడులేని లోటును చెన్నారెడ్డి ఎట్లా పూడ్చుకోగలడోననీ లెక్కలు వేయసాగారు కొందరు.
  నెలరోజులు గడిచాయి.
 ఈలోపు ఓబుళరెడ్డికి ఆత్మీయులైన కొందరు రాజమండ్రి వెళ్ళి పరామర్శించి వస్తున్నారు.
  విజయవాడలో వున్న రమణారెడ్డి వారానికొకసారి హైదరాబాద్ వెళ్ళి లాయర్ని  కలిసి కేసు విషయం తెలిసికొని, అట్నించి రాజమండ్రికి కూడా వెళ్ళి చిన్నాన్నకు విషయం చెప్పి వస్తున్నాడు. కోర్ట్ వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు.
  తర్వాత కొన్ని రోజులకు -
  విజయవాడలో కాలేజికి వెల్తూవున్న రమణారెడ్డికి హఠాత్తుగా కన్పించాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  " మామా ! బాగుండావా  ?  "  పలకరించాడు
 "  ఓ.. నువ్వంటోయి  !.. ఏంది యిక్కడుండావు..?  "  దగ్గరకు తీసికొని వీపుతడుతూ అడిగాడు చెన్నారెడ్డి.
  " నేనిక్కడ లాజేస్తాండ  మామా ! " 
   "  ఔను గదూ  ! మరిచేపోయా...ఆ ఏంది సంగతి  ? బాగానే సదూతాండావా  ?  మంచి లాయరువుగావాల .. మన కేసులన్నీ నువ్వే వాదించాల  "  నవ్వుతూ చెప్పాడు.
  " యీ మద్య చిన్నాయనోల్లను సూసొస్తివా మామా  ? "
  " ఎందుకు లేదోయ్  ! మొన్ననే గద కడపకు పోయింది.."
  " ఇప్పుడు  కడపలో లేరు..రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చి చాలా రోజులైంది.."
  గతుక్కుమన్నాడు చెన్నారెడ్డి..అంతలోనే తేరుకొని  " అదేనోయ్  !  మారకముందే సూసొచ్చినా.  మల్లా పోదామంటే  తీరికేదీ.. మొన్న గూడా పోరుమామిల్ల సుబ్బరాయునితో అంటిని - రాజమండ్రి పోదామని...  ఆయప్పా సరేననె.. యాడబోతి ! నన్ను ఎమ్మెల్లేను జేసి జనాలమద్య యిడిసిపాయె మీ చిన్నాయన.  నాకదే జైలయింది. నన్ను నిద్రబోనిస్తా వుండారా ? ఉచ్చకు గూడా ఒక్కన్నీ పోనీయరనుకో. చెవుకాడ గీ పెడతానే వుంటారు... ఇంక యాడిపోతినోయ్  రాజమండ్రికి ? "
     " పోయిరాపో  మామా  ! నువ్వు పోతానంటే నేను తోడొస్తా. చిన్నాయన కూడా నిన్ను చూడాలంటా వుండాడు. నువ్వు కూడా చూసినట్టుంటుంది.. మాట్లడినట్టుంటాది  "  చెప్పాడు రమణారెడ్డి.
  " పోతే బాగానే వుంటదోయ్  ! పోవాల..  వాల్లను సూడకుండా నేనెవుర్ని సూడాల  ?  నా ఖర్మగాలి ఈరోజే జీపు తెచ్చుకోలేదు దొరా !  యింకోకనాడు వస్తా ! ఇద్దరం కలిసే పోదాంలే.. "  చెప్పాడు
  " సరే మామా !  "  అంటూ వెళ్ళిపోయాడు రమణారెడ్డి.
   సాయింత్రంగా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రకాశం బ్యారేజి వద్దకెళ్ళి తిరిగి వస్తుంటే ఓ జీపులో ఎమ్మెల్లే చెన్నారెడ్డి కూచుని వున్నట్లుగా అన్పించి ఆశ్చర్యపోతూ అటుకేసి పరిశీలనగా చూశాడు.
  చెన్నారెడ్డే... సందేహం లేదు.
 నంబర్ ప్లేట్ చూశాడు
  జీపు కూడా అతనిదే
  తనతో అబద్దం చెప్పినట్టుంది  ’ జీపు తెచ్చుకోలేదని ’.
 అంటే ..అంటే .. రాజమండ్రి వెళ్ళి చిన్నాన్నను చూసేందుకు యిష్టం లేకనే అబద్దలాడాడేమో !  చిన్నాన్న ఏ జైలులో వుండేది కూడా అతనికి గుర్తులేదంటే తమను ఆయన ఎంతగా మర్చిపోయిందీ అర్థమవుతోంది.
  ఆ భావన భరించలేకపోయాడు రమణారెడ్డి.
  మళ్ళీ రోజే ప్రయాణమై హైదరాబాదు వెళ్ళి కోర్ట్ విషయాలు సేకరించుకొని రాజమండ్రి చేరాడు.
  చిన్నాయనకు విషయమంతా వివరించాడు.
   ఆయన మండి పడ్డాడు.
  చెన్నారెడ్డి ప్రవర్తన పట్ల ఆగ్రహోదగ్రుడయ్యాడు.
  శిక్షపడ్డ నేరస్తుల్ని చూసేందుకు సిగ్గు పడుతున్నాడేమో..!!
  శిక్ష అనుభవించే వాళ్ళ గుండా తనకు లాభంలేదని వదిలేశాడేమో ! ఇంతలోనే చేసిన మేలు మరిచాడంటే - వాడెంతటి నీచుడు !
  బహుశా వాని చర్యల్ని తను విమర్శించడం వల్లనే తమకు దూరంగా జరుగుతున్నాడేమో !
  తాను ఖండించింది  మానవత్వం లేని పనుల్నేగదా !
  తనగుండా ఏలాభం పొందని వాళ్ళు సైతం తన్ను చూడ్డానికొచ్చారు.
  తను ఓట్లు గుద్దిపోస్తే ఎమ్మెల్లే అయిన వ్యక్తి తన్ను తృణీకరించి కనీసం చూసేందుక్కూడ  రాలేదంటే..?
  కష్టాల్లో వున్నప్పుడు పలకరించి హృదయాన్ని తగిలేలా ఆత్మీయ వ్యాకాన్ని పలికేవాడేగదా  మిత్రుడంటే -
  శత్రువుకంటే హీనం.
  తనకిప్పుడు అనుమానమొస్తోంది - పోలీసు సాక్ష్యాన్ని లోబరుచుకొనేందుకు సరైనా ప్రయత్నం చేయలేదేమోననని.
   నమ్మి అతనికి భాద్యత అప్పగించాడు తను.
  కడుపులో పెట్టుకొని చేసినట్టుంది.  అతన్ని బహిరంగంగా వ్యతిరేకించినందుకు లోలోపల ప్రతిచర్య చూపినట్టుంది.
  చెన్నారెడ్డి ప్రవర్తనను భరించలేకపోతున్నాడు ఓబుళరెడ్డి.

                                    ******

    కోర్టు తీర్పు అనుకొన్నంత తొందరగా వెలువడలేదు
  ఎమ్మెల్లే రాజమండ్రికి వెళ్ళి చూసిరాలేదు.
   రోజు రోజుకు అతని మీద వ్యతిరేకత పెరుగుతోంది ఓబుళరెడ్డికి.
  తమను చూడ్డానికొచ్చిన శేయోభిలాషుల ముందు అక్కసంతా వెల్లగక్కుతున్నాడు. చెన్నారెడ్డి కృతఘ్నత గురించి చెబుతున్నాడు.
  అది పామని తెలీక దాని దలమీద కిరీటం పెట్టించి తాలుకా ప్రజలందర్నీ దాని పడగ కిందికి తెచ్చాననీ,  ఆ పాపమే తననీవిదంగా కాల్చుకు తింటోందనీ వాపోయాడు.
  విచారణ అనంతరం ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది.
  బాలునికి ఒక్కనికే లైఫ్ జెప్పారు.
  మిగతా వాళ్ళంతా  ఇళ్ళకొచ్చారు.
  బాలునికి కూడా శిక్ష పడకూడదనీ సుప్రీం కోర్టుకు అప్పీలు చేయాలని అనుకొన్నారు  గాని  సన్నిహితులైన లాయర్లు వద్దని చెప్పటంతో విరమించారు.
  బాలుని గురించి కుటుంబమంతా తల్లడిల్లుతూ వుంది.
  అందరి  బదలూ అతనొక్కడే శిక్ష అనుభవించటం బాధాకరంగా వుంది.
  మరోవైపు చెన్నారెడ్డి ప్రవర్తన రంపం పెట్టి కోస్తూ వుంది.
   తాము ఇంటికొచ్చిన తర్వాత కూడా కలవలేదు అతను. మర్యాదకైనా వచ్చి పలకరించిపోలేదు.
  చెన్నారెడ్డి నిర్లక్షాన్ని ఎట్లా జీర్ణించుకోవాలో అర్థం కావటం లేదు ఓబుళరెడ్డికి. ఒక్కోసారి అన్పిస్తూ వుంటుంది - అతను పూర్తి స్థాయి ఎమ్మెల్లే అయ్యాడని.  తాని ఎమ్మెల్లే తప్ప మామూలు మనిషిని కాదనుకొంటున్నాడేమో  !  చెన్నారెడ్డిగానే వుండుంటే తాము గుర్తుండేవాళ్ళం. తమ స్నేహం గుర్తుండేది.  పాతరోజులు గుర్తొచ్చేవి.... మానసికంగా కూడా అతను పూర్తిగా ఎమ్మెల్లేగా మారిపోయాడు.  తాలుకాలోని అందరి ఓటర్లలో తమనూ ఒకరిని చేశాడు.
  చెన్నారెడ్డి  దూరమవుతున్నాడనే భావన మొలకెత్తి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ  అతనిమీద ద్వేషం కూడా సమానస్థాయిలో పెరుగసాగింది. కనిపించిన ప్రతివాడివద్దనల్లా  తన కోపాన్ని వెళ్ళగక్క సాగాడు.  " నేను చేస్తేనే ఎమ్మెల్లే అయినాడు.. వానికింతా పొగురా  ? "  అంటూ వ్యాక్యానించసాగాడు.
  ఓబుళరెడ్డి మాటలు తూ.చ తప్పకుండా చెన్నారెడ్డికి చేరుతున్నాయి. పరిస్థితి ముదరకముందే  సర్ధుబాటు చేసికోవటం విఙ్ఞుల లక్షణమనుకొన్నాడు అతను  ’ ఓబుళరెడ్డిని బద్వేలు రమ్మని మనిషిని పెట్టి మరీ చెప్పి పంపాడు.
  " నేను వానికాడికి రావాలంటనా ? "  మండిపడ్డాడు కబురుతెచ్చిన మనిషివద్దే ఓబుళరెడ్డి.  " ఎమ్మెల్లే కాగానే అంతలావు బలుస్తే మంచిదిగాదు.  ఆ ఎమ్మెల్లే ఎట్లయిండో రోంత (కొద్దిగ) గుర్తుకు తెచ్చుకోమను. మేము జేస్తే ఎమ్మెల్లే అయినాడు - మామీందనే అధికారం చూపిస్తాడా ? "  అంటూ విదిలించి పారేశాడు.
  చెన్నారెడ్డి రోషానికి పోలేదు.
  తనే వస్తున్నాననీ, ఇంటివద్దే వుండమనీ చెప్పి పంపాడు.
  చెన్నారెడ్డి వెళ్ళేసరికి ఓబుళరెడ్డి వూరు వదిలాడు,  అతనికి అందకుండా పోరుమామిళ్ళలో మిత్రుని యింట కూచున్నాడు.
  " ఏంది మామా యిదెంతా  ? నేనేం జేసినానీ  నా మీంద కచ్చెగట్టినారు ? మీకంత ఇష్టం లేకుంటే చెప్పండి యిప్పుడే రాజీనామా గీకేస్తా !  యీ ఎమ్మెల్లే పదవి సరే - ఏంటికె సరే .."  అంటూ పెద్దిరెడ్డి ముందు వాపోయాడు.
  చెన్నారెడ్డి తప్పుల్ని నిర్మోహమాటంగా  ఎత్తిచూపాడు పెద్దిరెడ్డి. చివరగా చెప్పాడు ’ యిద్దరూ ఎదురెదురు కుచుని మనసి విప్పి మాటాడుకొని మనస్పర్థలు తుడిచేసుకోమని.
  " నేనందుకే గద మామా వొచ్చింది .."  తలపట్టుకొన్నాడు.
  " మావోడు రోంత పెంకె. మాటొస్తే పడడు. ఒక్క సిటికె నువ్వే ఓర్పు బట్టాల దొరా ! మీరిద్దరూ కొట్లాడుకోంటే చూసేవాల్లు నవ్వుతారు  "  చెప్పాడు.
  " దానికే గద మామా నేనుబయటపడేది.  అతగాన్ని రమ్మను. తప్పుంటే చొక్కాపట్టుకొని మాట్లాడమను. అంతేగాని దూరదూరంగా వుండొద్దని చెప్పు  "  అంటూ జీపెక్కాడు.
  తర్వాత పదిరోజులకు మరోసారి ప్రయత్నించాడు చెన్నారెడ్డి.
 తనతో కలిసే అవకాశం అతనికి ఏమాత్రమూ యివ్వటంలేదు ఓబుళరెడ్డి.  తన పనిమీద తాను తిరుగుతున్నాడు. బ్రాంది షాపు లైసెన్స్ కోసం అప్లై చేసుకొని వున్నాడు. దాని విషయంగా అధికారుల చుట్టూ తెగ తిరుగుతున్నాడు.
  తనెన్ని ప్రయత్నాల్లో వున్నా చెన్నారెడ్డిని తిట్టటం మాత్రం చాలించలేదు ఓబుళరెడ్డి.  తన ముందు ఎమ్మెల్లే గురించి ఎవరైనా మాట్లాడితే మండిపడతాడు.  " వాని సంగతి నాకాడ ఎత్తగాకండి.. నేను జేస్తే ఎమ్మెల్లే అయినాడు. నాకాడనా వానిగొప్పజెప్పేది ? "  అంటూ విదిలించి పారేస్తున్నాడు.
  ఎమ్మెల్లే మెప్పుకోసం ఆ మాటలన్నీ పొల్లుబోకుండా తీసికెళ్ళి ఆయన చెవినేస్తున్నారు కొందరు.
  ఓబుళరెడ్డి ప్రవర్తన ఎమ్మెల్లేకు కొంత యిబ్బందికరంగా అన్పించింది.  అవమానకరంగా కూడా తోచింది.
  డిగ్రీ అయిపోయి ఇంటివద్దే వున్నాడు ఓబుళరెడ్డి కొడుకు నర్సిరెడ్డి. బ్రాందిషాపు లైసెన్స్ గురించి తను ఇన్‌చార్జి తీసుకొని తిరగటం మొదలెట్టాడు.
  రెండ్రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగే సరికీ అర్థమైంది  దానికి మినిస్టర్ రెకమండేషన్ వుంటేగాని పన్జరగదని.
  ఆఫీసుర్‌తో మాట్లాడుతూ వుంటే ఎమ్మెల్లే చెన్నారెడ్డి వచ్చాడు.
 తన్నితను గుర్తుబట్టి నట్టు లేదు.
  అదే మంచిదని లేచి బైటకొచ్చాడు.
  పదినిమిషాల తర్వాత వాచ్‌మన్ వచ్చి తన పేరుబెట్టి పిల్చేసరికి ఆశ్చర్యపోయాడు నర్శిరెడ్డి.
  " నిన్నే సార్  ! పెద్ద సారు పిలుస్తావుండాడు  "  చెప్పాడు.
  లోపలికి నడిచాడు.
  " ఏం  వోయ్ ! నేనంటే కనుక్కోలేదు నువ్వయినా పలుకరించేది లేదా ?.. రా.. కూచో.."  అన్నాడు చెన్నారెడ్డి.  " షాపు లైసెన్స్ కావాలంటే ఒక్క మాట నాకు చెప్పిపంపుతే నేను తెచ్చివ్వనా ! నేనుండేది ఎందుకోయ్ - మీ పనులగ్గూడా మీరు రావాల్నా ? "  అన్నాడు
 " రేపొద్దున్నే నాతోరా  ! "  చెప్పాడు
  మళ్ళీరోజు  నర్శిరెడ్డిని వెంటబెట్టుకొని హైదరాబాదు వెళ్ళాడు.
 నేరుగా ఎక్సైజ్ మినిస్టర్ చాంబర్‌లోకి తీసికెళ్ళాడు.
  " ఇతను నా అల్లుడు. నాకు ఆత్మీయుడు... నా నియోజకవర్గంలో ఒక మండలమంతా వీళ్ళ చేతికింద వుంది. నేను ఎమ్మెల్లే కావడానికి ప్రధాన కారుకులు వీళ్ళే. నెత్తురు పుసుకొని ఎలక్షన్ చేశారు.  పదివేల ఓట్లు గుద్దిపోసి నన్ను గెలిపించారు.  వీళ్ళకు పన్జేస్తే మీరు నాకు పన్జేసినట్లే .."  అంటూ మినిస్టర్ వద్ద గొప్పగా చెప్పాడు. లైసెన్స్ వచ్చేందుకు లైన్ క్లియర్ చేశాడు.
  బైటకొచ్చిన తర్వాత నర్శిరెడ్డిని పక్కనే కూచోబెట్టుకొని  " చూడోయ్  మినిస్టర్ కాడ కూడా చెప్పినా నేను ఎమ్మెల్లే అయ్యేందుకు కారణం మీరేనని. నేను మీరు చేసిన ఎమ్మెల్లేనని....మీరు చేస్తేనేనోయ్ నేను ఎమ్మెల్లే అయ్యిందీ !  ఆ విషయం  అందరిలో నేను చెప్పుకుంటే మీకు గౌరవం వుంటదిగాని, మీరు చెప్పుకొంటే కాదు దొరా ! రొవ్వంత మీ నాయనకు చెప్పు.. ఎగతాలిగా మాట్లాడొద్దని చెప్పు. నాకు అవమానమైతే మీకు అవమానం గాదా ! "  అంటూ బతిమాలాడు.
  ఆయన మాటల్లో నిజముందనిపించింది నర్శిరెడ్డికి కూడ.
  ఇంటికెళ్ళి పెదనాన్న వద్ద తన మనసు విప్పాడుగాని తండ్రి వద్ద నోరెత్తలేకపోయాడు.  ఎమ్మెల్లే తన్ను ఆదరించిన విషయం, పనిచేయించిన సంగతీ మాత్రం అందరిముందూ ప్రకటించాడు. విననట్టుగా ఎటో చూస్తూ వెళ్ళిపోయాడు ఓబుళరెడ్డి.
  తన ధోరణి మాత్రం మార్చుకోలేదు.
  మరోసారి  నర్శిరెడ్డి వద్ద తన బాధను వెళ్ళబోసుకొన్నాడు ఎమ్మెల్లే.
  అతని మాటలు నమ్మే స్థితిలో లేడు ఒబుళరెడ్డి.  బ్రతిమాలాటాలు, బాధను వ్యక్తపరచటాలూ, ఇవన్నీ పచ్చి నటనలని అతని అభిప్రాయం.  తనవాళ్ళవద్దా, లోకుల వద్దా ’ అయ్యో పాపం ! ’ అనిపించుకోవాటానికి చేస్తున్న చేష్టలు అవి.  ఎమ్మెల్లే అంతటి వాడు బంగపడుతోన్నా ( బతిమాలుతున్నా ) లెఖ్కజేయని తలబిరుసు మనిషి శివపురి ఓబుళరెడ్డి ’ అని నలుగురూ భావించాలని అతని ఆలోచన అని.
  అతను పూర్వపు చెన్నారెడ్డే అయ్యుంటే తనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చేవాడు కాదు. కూలి తీసికొని మనుషుల్ని చంపించే వాడు కాదు.  సారా వేలం పాటల్ని దౌర్జన్యంగా చేజిక్కించుకొనేవాడు కాదు.  ఇప్పటికే చాలా పల్లెల్లో మద్యం షాపులన్నీ అతని అనుచరులవే. అన్నిట్లో అతనికి భాగముందని వినికిడి. డబ్బు సంపాదన కోసం ఎన్నెన్నో అడ్డదారులు తొక్కుతున్నాడు.
  చెన్నారెడ్డిని తల్చుకొంటే చాలు తను జైల్లో వున్న రోజులే గుర్తొస్తాయి. తన్ను చూసేందుక్కూడ యిష్టపడని అతని చర్య గుర్తుకొస్తుంది. అతనిమీద అంతులేని ఏహ్యభావం కలుగుతుంది. ఎదురుగా ఎవరైనా వుంటే వాళ్ళ ముందే అతన్ని తిడతాడు. ఎవరూ లేకుంటే గోడకేసి తిరిగి అయినా తిట్టుకొంటాడు.
  ఓబుళరెడ్డి తిట్టటం మానుకోకపోయేసరికి క్రమేణా అతనిమీద నమ్మకం నశించింది ఎమ్మెల్లేకు కూడా. రాయబారాలు పంపటం చాలించాడు. రమణారెడ్డి, నర్శిరెడ్డెలు కన్పించినా  ఇదివరకటిలా ఆప్యాయంగా పలుకరించటం మానాడు.
  ఓబుళరెడ్డి, చెన్నారెడ్డి లిద్దరూ ఎక్కడైనా పరస్పరం ఎదురుపడినా పలుకరించుకోవటం లేదు. ఒకరి మొగాలొకరు చూసికోవటం లేదు.
  ఇద్దరి మద్యా అగాథం ఏర్పడింది.
  ఆ విషయంలో తాలుకా అంతటా తెలిసిపోయింది.
  జాతీయపార్టి వాళ్ళకు కొంత ఆశ చిగురించింది.
  చెన్నారెడ్డి వ్యతిరేక వర్గీయులంతా రహస్యంగా సమావేశమయ్యారు. ఓబుళరెడ్డిని  జాతీయపార్టిలోకి లాక్కొంటే ఎలా వుంటుందా..? అని చర్చలు జరిపారు.
  చెన్నారెడ్డిని వ్యతిరేకంచి, ఎదురించే బలమైనా మొరటైన వర్గం ఒకటి వచ్చి కలవటం వలన జాతీయ పార్టి బలపడుతుందని భావించారు.
  శివపురి వాళ్ళను జాతీయపార్టిలోకి లాగాలని తీర్మానించారు.
  కొందరు అనుభవఙ్ఞులు ఆ భారాన్ని తమ భుజానేసుకొన్నారు.

                                                                                                        ........ సశేషం

                                                                                                          .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.                                                                      

      చెన్నారెడ్డి గెలుపు పండుగ నియోజక వర్గమంతా చుట్టివచ్చేసరికి దాదాపు మూడునెలలు పట్టింది. సుమారైనా నాయుకలంతా ఎమ్మెల్లేను తమ వూరికి పిలవటం, పొట్టేళ్ళను కోసి, వచ్చిన వాళ్ళందరికీ విందులివ్వటం, తమ వూరి సమస్యల్ని ఆయన ముందు చిట్టా విప్పటం.
   రాష్ట్రంలో కూడా ప్రాంతీయపార్టి ప్రభుత్వం ఏర్పడటం వలన తాలుకా అభివృద్దికి ఆటంకం వుండబోదని అందరికీ ఆశ.
  చెన్నారెడ్డి వెంట తనూ కొన్ని వూళ్ళకు వెళ్ళాడుగాని, తర్వాత ఎందుకో ఇష్టపడలేదు ఓబుళరెడ్డికి.
  కోర్టు వాయిదాలు వేగమంతమయ్యాయి.
  మీద మీద డేట్లిస్తున్నారు
  సాక్ష్యాల్ని రికార్డు చేస్తున్నారు.
  దగ్గిర దగ్గిర వాయిదాలు వేయటం వలన ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అప్పులకోసం చేయి చాచాల్సిన పరిస్థితి వస్తోంది. మొన్న ఎలక్షన్స్‌లో చేతి చమురు చాలా వదిలింది.
  చెన్నారెడ్డి వద్దకెళ్ళి యింత ఖర్చయిందని చెప్పేందుకు అహం అడ్డు.  తనయినా గుర్తెరిగి ఇవ్వాల్సిన భాద్యత వుంది... కానీ జోబులోంచి ఒక్క రూపాయి కూడా బైటకు తీయలేదు.
  ముగ్గుపిండి గనుల మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టాడు ఓబుళరెడ్డి. దిగుబడిని పెంచేందుకు కృషి చేస్తున్నాడు. మద్యదళారీల్ని నమ్ముకోకుండా నేరుగా మద్రాసు ఫ్యాక్టరీలకు తామే తరలించేందుకు నడుం బిగించాడు. ఎమ్మెల్లే సహాయంతో మార్గాన్ని సుగమం చేసుకొన్నాడు.
   కోర్టు కేసు ఓబుళరెడ్డిని మానసికాందోళనకు గురిచేస్తోంది. కేసు పర్యవసానం ఏమవుతోందనని అలజడి. సాక్షల్ని కొంత వరకు లోబరుచుకొన్నారుగాని పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. పోలీసు సాక్ష్యం కొంత ఇబ్బందికరంగా తయారైంది. అతనికి యస్.పి భరోసా ఇచ్చినట్లుంది... లోంగటం లేదు.
   ఇప్పుడు ప్రభుత్వం మారిందిగదా ! మనవాడే ఎమ్మెల్లే అయ్యాడుగదా !  ఎస్పీ మీద వొత్తిడి తెస్తే ఫలితంముంటుందేమో అనే ఆశ. అందుకే రెండు మూడుసార్లు చెన్నారెడ్డి వద్ద ఆ విషయం ప్రస్తావించాడు.
  అతని చుట్టూ  ఒకటే రద్దీ, ఒకటే కోలాహలం... తన మాటలు అతని చెవిదాకా వెళ్ళనీయట్లేదు జనాలు. చివరకు ఎలాగోలా అతని చెవినేస్తే  " యీరోజే మాట్లాడ్తానోయ్ !  ప్రభుత్వం మనది గదా !  మనమాట ఎందుకినడూ  ? "  అన్నాడు.
  తర్వాత మాట్లాడాడో లేదో తెలీదు.
  పోలీసు సాక్ష్యం కూడా రికార్డయ్యింది.
  బాలుని మీద బాగా నేరం మోపినట్లుంది.
   సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్లేగా బాగా నిల్దొక్కున్నాడు చెన్నారెడ్డి.  తన వర్గం వాళ్ళకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నాడు. ముఖ్యంగా గొడవలున్నచోట ఆయుధాల్నించి మనుషులదాక అందిస్తున్నాడు.
  కొన్ని ఏరియాల్లో రాజకీయం చాలా మార్పులకు గురవుతోంది, పల్లెల్లో చెన్నారెడ్డి వర్గీయుల దాడులు అధికమయ్యాయి. ఇంతదాకా తమదే పైచేయిగా ఆధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళు కాస్తా ఇప్పుడు ఎదురుదెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తోంది. తనవాళ్ళ పట్ల చెన్నారెడ్డి ప్రత్యేక శ్రద్ద కనబరచటం వలన చెలరేగిపోయి ప్రత్యుర్థల్ని లొంగదీయటంలో సఫలీకృతమవుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోడానికి బలమైన పునాదులు వేయిస్తున్నాడు ఎమ్మెల్లే.  ఆ క్రమంలో కొన్నిచోట్ల పెద్ద గొడవలయ్యాయి. పోలీసు కేసులయ్యాయి. ఒకటి రెండు ఖూనీలు కూడ పడ్డాయి.
  కేసుల కోసం టౌనుకొచ్చిన ప్రత్యుర్థుల మీద దాడుల చేయించి భయబ్రాంతుల్ని చేసే కొత్తరకపు చర్యలకు కూడా శ్రీకారం చుట్టాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి. టౌన్‌లోనే సంసారం వుండటం వలన మెరికల్లాంటి మనుషుల్ని తయారుచేసి ప్రత్యుర్థలమీద దాడులకు వినియోగిస్తున్నాడు.
   అతని చర్యల్ని అడ్డుకోనేందుకు మొదట నాగిరెడ్డి వర్గం ప్రయత్నించింది గాని అతని మొరటుదనం ముందు నిలబడలేకపోయింది. టౌనులోని తమ ఆస్తుల్ని పరిరక్షించుకోంటే చాలనే స్థితికి చేరారు వాళ్ళు.
             
                                     *******

    దండోరుపల్లెలో మళ్ళీ గొడవలు.
  ఏరుదాటి వచ్చిన సుబ్బారెడ్డివర్గానికి తాము రక్షణ కల్పించక తప్పటంలేదు.  వాళ్ళ కేసులు కూడా తామే చూడాల్సి వస్తోంది ఓబుళరెడ్డికి.  అది తమకు తప్పనిసరి భాద్యత కూడా.
   నరసింహారెడ్డి విజయవాడలో లా చదవడానికి వెళ్ళాడు. మిగతావాళ్ళు కూడా చదువుల్లో బాగానే ఎక్కిపోతున్నారు.
  దండోరు పల్లెలో గొడవలు మరింత పెరిగాయి.
  ఒకనాటి రాత్రి సుబ్బారెడ్డి వర్గమంతా ఏటికడ్డంగా పారిపోయొ వచ్చి ఓబుళరెడ్డిని శరణుపొందారు.
   కొత్త మనుషల్ని తెచ్చి బాంబులేస్తూ తరుముకున్నాడుట రంగారెడ్డి.  దొరికివుంటే చంపేవాళ్ళట.
  తమకు కూడా బాంబులు కావలన్నాడు సుబ్బారెడి. బాంబింగ్ చేసే మనుషులు కూడా కావాలిట.  సప్లై చేయమన్నాడు. ఎంత ఖర్చయినా భరించుకొంటామని చెప్పాడు.
   ఓబుళరెడ్డి వొప్పుకోలేదు.
  ఖూనీలు చేసి తాము పొందే అనుభవమేమితో స్పష్టంగా తెలుస్తూనే వుంది.  దాని లాభమెంతో అర్థమవుతూ వుంది. తమ వెంట చాలా సార్లు లాయర్ల వద్దకూ కోర్టుల వద్దకూ అతను కూడా తిరిగాడు కాబట్టి యీ అగచాట్లు అతనికి కూడా తెలుసు.
  ఏ క్షణం తీర్పు వెలుబడుతుందో తెలీదు.  వాటి స్వరూపం ఎట్లా వుంటుందో కూడా అర్థం కాలేదు.   లైఫ్ చెప్పినా చెప్పొచ్చు.  క్షణం క్షణం కోర్టు తీర్పును వూహిస్తూ మానసికంగా సగం చచ్చిపోవాలి.
   తమని చూసి జాగ్రత్తపడమని సలహాయిచ్చాడు సుబ్బారెడ్డికి.
  తర్వాత  తనమనుషుల్ని దండోరుపల్లెకు పంపి గ్రామపరిస్థితిని తెలుసుకొన్నాడు.
  గ్రామంలో ఆడవాళ్ళు జోలికి రావటం లేదట. వామిదొడ్లను ( గడ్డితో పెద్ద పెద్దగా వాములు చెయటం =గడ్డివాము), పశువుల్ని, పంటల్ని నాశనం చేసే పనులకు వొడికట్టటం లేదుట.
  పూర్వం నించీ సాంప్రాదాయకంగా వస్తోన్న న్యాయమే అది, ఎంతపెద్ద గొడవలైనా, ఎన్ని ఖూనీలు పడినా ఆడవాళ్ళ జోలికి పోయేదిలేదు. చిన్న పిల్లల్ని ఏమనేదిలేదు. పశువుల్ని చంపటమో, పైర్లూ నాశనం చేయటమో జరగదు. గొడవల్లో కూడా ఒక యుద్దనీతి వుంది.  ఆధిపత్యపోరాటాలో, వ్యక్తిగత కక్షలే కాబట్టి గొడవలు కూడా ఆ పరిధిలోనే వుంటాయి.
  దండోరుపల్లెకు  మద్యవర్తుల్ని పంపాడు ఓబుళరెడ్డి. కొత్తవాళ్ళను తెచ్చుకొని దాడులు చేయించటం మంచిపద్దతి కాదనీ, గతంలో ఒకసారి తమవూరికి కొత్త మనుషుల్ని పంపి ఎట్లా భంగపడ్డారో గుర్తు చేసుకొమ్మనీ, పద్దతి మార్చుకోకపోతే తాము కూడా మనుషుల్ని పంపించవలసి వస్తుందనీ ఘాటుగా చెప్పించాడు.
    తర్వాత నాలుగు రోజులకే గొడవ సద్దుమణిగింది గాని పదిరోజుల తర్వాత సుబ్బారెడ్డి మళ్ళీ వచ్చాడు.
   " మామా !  రంగారెడ్డి గాన్ని నమ్మలేకుండాము.  వాడు లోపల్లోపల యేందో సేస్తాండాడు. కొత్తమాసుల అలికిడి తగ్గలేదు.  రాత్రిల్లు  మావోల్లు ఇండ్లల్లోంచి బైటికి రావాలంటే భయపడ్తాండారు.  ఎప్పుడేం జరుగుతదో అంతుబట్టడంలే... యీధిల్లోకి రాడానికిగ్గూడా బయపడ్తాండం.. యీ సావు మేం సావలేం మామా ! యీ బాధ తట్టుకోలేం..  వాన్ని బేసెయ్యకుంటే మాకు నిద్దర్రాదు... "  చెప్పాడు.
    అతనికేసి తదేకంగా చూశాడు ఓబుళరెడ్డి.
  "  ఎమ్మెల్లేతో ఒక్క మాట సెప్పరాదా ! "  అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు.
  నొసలు ముడేస్తూ  " ఏమని ? " అడిగాడు ఓబుళరెడ్డి.
  " మనుషులను పంపమను వాల్లకు నేనే లెక్కించుకుంటా. రంగారెడ్డిగాన్ని బేసి పోతారు ( వేసేసిపోతారు).... మాకా పీడ తప్పించు మామా  ! "
   ఆశ్చర్యంగా అతని కేసి చూశాడు.
  " ఎమ్మేల్లేకాడ లెక్కల్దీసుకొని  ఖూనీల్జేసే మనుషులుండారా  ? "  అన్నాడు
  ఇప్పుడు ఆశ్చర్యపోవటం  సుబ్బారెడ్డి వంతయింది.
   " ఏమి ఎరగనట్టు మాట్లాడ్తావేంది మామా  !  మెరికల్లాంటి మనుసులుండారు.  ఆయప్ప మాసుల్ని తెచ్చుకుంటే పోలీసు కేసులకు కూడా సాయం జేస్చాడు.. "
  మారు పలకలేదు ఓబుళరెడ్డి.
  అతనికి నోరు పెగల్లేదు.
  చెన్నారెడ్డి తన వర్గీయులకు మాట సాయం, మంది సాయం చేస్తాడని తెలుసుగాని. కిరాయికి ఖూనీలు చేయించే పనిపెట్టుకొన్నాడని వినలేదు.  అట్లాంటి  ఆలొచన చెన్నారెడ్డికి వస్తుందని కూడ వూహించలేదు.
   " నేన్జెప్పింది మర్చిపోగాకు మామా ! "  అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళాడు సుబ్బారెడ్డి.
  అతని అభియోగం నమ్మదగినదిగా అన్పించలేదు ఓబుళరెడ్డికి. కమ్యూనిస్టులతో సంబంధాలున్నవాడు, కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడు.. అలాంటి నీచస్థాయికి దిగజారతాడని అతను భావించటం లేదు.
    అందుకే సుబ్బారెడ్డి కోరికను, దాన్ని తీర్చుకొనేందుకు అతను సూచించిన మార్గాన్నీ స్మృతినుంచి తప్పించేశాడు.

                                              *****

       వర్షాకాలం వచ్చింది.
  వానదేవుడు కొంత కరుణించనట్లుంది.
  సగిలేరు పొంగి ప్రవహిస్తోంది
  ఇలాంటి సమయంలోనే దండోరుపల్లెల్లో గొడవలు రాజుకొనేది, బైటి ప్రపంచంతో సంబంధాలు తెగినపుడు రంగారెడ్డి విజృంభిస్తాడు.  అవతలి వర్గం మీద యుద్దం ప్రకటిస్తాడు. ఇరువర్గాలూ మిద్దెల మీద బండ్లకొద్దీ రాళ్ళు పోసుకొంటారు. చేతులు నొప్పి పుట్టేదాక విసురుకొంటారు, అవకాశమొస్తే కర్రలతో తలలు పగులగొట్టుకొంటారు. ఏరు తగ్గేదాక సరైన వైద్య సహాయం కూడా వుండదు.
  రాళ్ళ యుద్దంలో ఆడవాళ్ళు, పిల్లలు కూడా పాలుపంచుకొంటారు.  ఆడవాళ్ళు రాళ్ళు విసరటంలో సాయం చేస్తుంటారు, మగపిల్లలు తమ తండ్రుల తోటి తాము హుషారుగా రాళ్ళు విసురుతారు.
  ఆ నాలుగు రోజులూ మగాళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతారు,  అవతలి వాళ్ళ చేల మద్య తమ చేలున్నపుడు ఇంటి ఇల్లాల్లే కూలీల సాయంతో వ్యవసాయం చేయిస్తుంటారు.
  వ్యవసాయి పనుల్ని ఎవ్వరూ అడ్డుకొనేది లేదు.
  ఏటి చెలిమల్లో నీల్లు కూడా వంతుల వారీగా తెచ్చుకొంటారు.
వారం రోజులైనా ఏటి ఉరవడి తగ్గలేదు
  దండోరుపల్లె వాల్ల ఆచూకి తెలియలేదు.
  మాటల సందర్భంలో వాళ్ళ ప్రస్తావన వచ్చినపుడు ఆందోళన ప్రకటించాడు ఓబుళరెడ్డి.
  క్రమేణా ఏటి ఉరవడి తగ్గింది
  వాటం తెలిసిన మనిషి ఏటిని దాటగలుగుతున్నాడు.
  ఆ తరుణంలోనే ఏటి అవతల్నించి నలుగురు మనుషులు జట్టుగా కూడి వచ్చారు.
  వాళ్ళు అందించిన తొలిసమాచారం ’ సుబ్బారెడ్డిని పోలీసులు తీసుకెళ్ళారట ! ’
  " ఎందుకూ  ? "  పెద్దిరెడ్డి కంఠంలో ఆదుర్దా.
 " మీకింగా తెల్దా ? రంగారెడ్డి ఖూనీ అయ్యిన్లే ! "
 విన్నవాళ్ళంతా నమ్మలేనట్టుగా చూశారు.
  " బద్వేలు పోయిన్నెడంట  ఆడేం జరిగిందో ఏమో ! ..లాడ్జి కాన్నే నరికినారంట.  మీకు తెల్సింటాదనే అనుకున్నెం "
  " ఎప్పుడు రా ? "
  " రేత్రేనంట పెద్దయ్యా ! "
  ఓబుళరెడ్డి ప్రయాణమయ్యాడు
  " మాగ్గూడకా  యీ పొద్దున్నే తెల్సింది పోలీసోల్లొచ్చి సుబ్బారెడ్డి యింటి కాడికి పోయినాంకనే "
  ఓబుళరెడ్డికి నమ్మశక్యం కాలేదు.
  సుబ్బారెడ్డికి తెలీకుండా రంగారెడ్డి ఖూనీగావటం అసంబద్దమైన విషయంగా తోచింది.  కూలికి ఖూనీ చేసే వాళ్ళగురించి  తన్నతను అడిగిన విషయం కూడా గుర్తుకొచ్చింది.
  జనాన్ని వెంటేసుకొని పోరుమామిళ్ళ చేరాడు.  పోలీసు స్టేషన్‌కు వెళ్ళి సుబ్బారెడ్డిని కలిశాడు.
  స్టేషన్‌లో విచారిస్తే అతనిమీద ఇంకా కేసు బుక్ చేయలేదని తెలిసింది. ఎంక్వయిరీ చేస్తున్నారట.
  బద్వేల్ వెళ్ళి లాయర్‌ను కలిశాడు.
  అతనితో చాలా సేపు మాట్లాడి ఎమ్మెల్లేకు ఫోన్ చేయించాడు.  ఊల్లో లేడుట ఎమ్మెల్లే.
 సాయింత్రానికి గాని రాలేదు అతను
  విషయం వినగానే  "  అదెట్లా ? అతనికేం సంబంధముందనీ అరెస్ట్ చేస్తారు..?  ఖూనీ జరిగింది ఎక్కడో  ?  చంపింది ఎవురో ?  ఆ టైంలో అతను ఇంటికాన్నే వున్నేడుగదా..!  పోదాం  పా.. ఆ ఎస్సై సంగతెందో తేలుస్తా.. "  అంటూ జీపును బయటకు తీయించాడు.
  అంతా చూసినట్లు మాట్లాడుతున్నాడు చెన్నారెడ్డి.
  తను అభ్యర్థించకముందే  కేసుపట్ల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఓబుళరెడ్డికి ఆశ్చర్యంగా వుంది.
   పోరుమామిళ్ళ పోలీసు స్టేషన్లో ఎస్సైని దబాయించాడు చెన్నారెడ్డి. తన ఎమ్మెల్లే ప్రతాపాన్నంతా చూపించాడు. ఇప్పుడే హోం మినిస్టర్‌తో ఫోన్ చేయిస్తానన్నాడు.  సాక్ష్యాలుంటే నిరభ్యంతరంగా అరెస్ట్ చేయమన్నాడు.  టౌన్ వాళ్ళతో ఏవో గొడవలవల్ల రంగారెడ్డి ఖూనీ చేయబడ్డాడేగాని .. సుబ్బారెడ్డికి కేసుకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు.
  డి ఎస్పీ వచ్చి సర్ది చెబితేగాని వినుకోలేదు చెన్నారెడ్డి.
  ఎంక్వయిరీ చేస్తున్నామనీ, సుబ్బారెడ్డి నిర్దోషిగా నిరూపణ అయితే వదిలేస్తామని చెప్పాడు డి ఎస్పీ.
  బైట కొచ్చిన తర్వాత ఓబుళరెడ్డికి చెప్పాడు  "  పోలీసులకు కొంత ఎక్కువ మొత్తమే ముట్టజెప్పమని "
  తర్వాత పోలీసులకు అందవలసిన డబ్బు అందింది.
  సుబ్బారెడ్డి తోటి మరో నలుగురిమీద కేసు రిజస్టరయ్యింది.  బేయిలబుల్ సెక్షన్స్ కాబటి సులభంగానే బైటకొచ్చారు వాళ్ళు.

                                *****

    ఒక రోజు శివపురికి వెళ్ళాడు సుబ్బారెడ్డి. అత్యంత రహస్యంగా ఓబుళరెడ్డి చెవిలో అసలు రహస్యం వూదాడు. చెన్నారెడ్డి మనుషులేనట రంగారెడ్డిని ఖూనీ చేసింది. చింతకుంట గొల్లలు యిలాంటి విషయాల్లో ఆరితేరారుట. వాళ్ళనే పంపాడట.  వారం రోజుల ముందే వాళ్ళకు తను రంగారెడ్డిని చూపించాడుట. ఇరువై ఐదువేల రూపాయల వొప్పందమట.
  మనస్సు వికలమైంది ఓబుళరెడ్డికి
   అన్న వద్దకెళ్ళి సంగతి చెప్పగానే ఆయనకూడా నొచ్చుకున్నాడు. చెన్నారెడ్డి అలాంటి పనులు చేయిస్తున్నాడంటే మనస్సులో ఓ వైపు నమ్మకం కలుగటం లేదుగాని  వాస్తవాన్ని ఎట్లా కాదనగలరు..?
  మరో నెల తర్వాత సుబ్బారెడ్డి వచ్చి కలిశాడు.
  " ఎట్లా జెయ్యాల మామా ? "  అన్నాడు దిగాలుగా
  విషయమేదో చెప్పమన్నట్లుగా అతనికేసి చూశాడు ఓబుళరెడ్డి.  కొంతసేపు తటపటాయించి తర్వాత తలెత్తాడు సుబ్బారెడ్డి. " ఒప్పందం సేసుకొన్నెనా ! ఇరువై ఐదువేలు ఎత్తకపోయి ఎమ్మెల్లేకిచ్చినా  పనేమో జరిగిందిగాని  యవ్వారం రోంత తిరగడ కొచ్చింది "
  ఓబుళరెడ్డి చూస్తూనే వున్నాడు.
  " మొన్న మల్లా వొచ్చినారు చింతకుంట మాసులు.. ఇది నాలుగోసారి రావడం... లెక్కకొచ్చినారు. ఐదువేలు ముట్టిందంట..ఇరువైవేలు బ్యాలెన్స్ రావాలట. ఎమ్మెల్లేకు లెక్కంతా యిచ్చినానని కూడా చెప్పలేదు  ఏమి యిబ్బందోనని నే్నేమో ఎమ్మెల్లేను అడగలేకుండా. పోనీ అడగనీకి దొమ్మల్లేవు..."
  " అయితే నన్నేం జెయ్యమంటావు ? "  అన్నట్లుగా చూశాడు.
  " ఎమ్మెల్లేకు సెప్పి ఆ లెక్క వాల్లకిప్పీ మామా  !  "  బేలమొహంతో అడిగాడు.
   సుబ్బారెడ్డి కేసి ఎగాదిగా చూశాడు ఓబుళరెడ్డి.
   తర్వాత ఓ నిట్టూర్పు నిగిడించి " నేను మద్యవర్తిని కాదు కదా..ఎట్లా చెప్పాల  ? "  అన్నాడు
   " మామా  !... మామా  ! "  ప్రాధేయపడ్డాడు.
   " చూడోయ్  !"  గొంతు గంభీరమైంది ఓబుళరెడ్డికి  " మీ వూరి నీటిబ్బందులుంటే చెప్పు నేనొస్తా ! పోలీసు కేసులుంటే చెప్పి పంపు.. చేసిపెడతా. పూచికత్తు యిచ్చి బెయిలు తెప్పిస్తా... ఖర్చులకు చాలకుందని అడుగు లెక్క తెచ్చిస్తా... మీ గుంపంతా వొచ్చినా మూడోకంటికి తెలీకుండా నెలల గాలాలు సాకుతా... అంతేగాని యిట్లాంటి బ్రోకర్ పనులు నాసేయను నాకు చేతగాదు. నాకు చెప్పగాకు... నువ్వు మాట్లాడుకొనేప్పుడు నేను లేను కదా..? పని చేయించుకొనేప్పుడు లేను.. లెక్కలిచ్చేప్పుడు నేను లేను.. మద్యలో నన్నెందుకు యిరికిస్తావు  ? "  అన్నాడు.
  మరింకేమి మాట్లాడలేదు  సుబారెడ్డి.
   ఓబుళరెడ్డికి తెలీకుండా పనిచేయించటం తప్పే. తెలిస్తే వొప్పుకోడని భయపడ్డాడు తను. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుందనుకొన్నాడు.  వ్యవహారం మడత బడింది. మరోసారి డబ్బులివ్వటం తప్ప గత్యంతరం కన్పించటం లేదు.
   ఓబుళరెడ్డి మనసు కలతగా వుంది
  చెన్నారెడ్డి చర్యపట్ల అసహ్యం కలుగుతోంది.
  అతని పట్ల అంతరాంతరాళల్లో ఏదో అపనమ్మకం. మరేదో అవిశ్వాసం.  తన భావాల్ని అన్నతో పంచుకొన్నాడు.
  ఆయన కూడా తనలాగే స్పందించాడు.
   ఎమ్మెల్లే అయింతర్వాత క్రమేనా అతను నైతిక విలువలు కోల్పోతూ వుండటం పట్ల బాధ పడ్డారు ఇద్దరు.
      వారం రోజుల తర్వాత ఓ పెళ్ళిలో చెన్నారెడ్డిని కలవటం తటస్థించింది ఓబుళరెడ్డికి.  అతన్ని పక్కకు పిల్చి తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. ఇలాంటి చర్యలు మంచివి కావంటూ తన అబిప్రాయన్ని నిర్మొహమాటంగా వెలిబుచ్చాడు.
   కొద్ది క్షణాల మౌనం తర్వాత చెన్నారెడ్డి అన్నాడు  "  తప్పదోయి దొరా  ! మనవాళ్ళు దెబ్బతింటావుంటే సూస్తా వూరకుండలేం గదా ! "
  " అభిమానం కొద్దీ సహాయం చేయటం వేరు .."
   ఎంతమంది మీద అభిమానం చూపగలం  ? "
  " ఏమైనా....  నువ్వు చేసేది  తప్పే .."
  " తప్పంటే ఎట్లా ? గతాన్ని గుర్తుజేసుకో... నువ్వు మాత్రం  పిల్చుకోలేదా బాంబులేసే మనుషుల్ని  !  గొడవలు జరిగి బాంబులేసికోనుంటే వాల్లు ఖాయంగా  ఎవురోకర్ని బేసి పోయేవాల్లేగద  !  "
   ఓబుళరెడ్డికి కోపమొచ్చింది.  " వాల్లకు వీల్లకు ఏం సంబంధం..?  వీల్లట్లా వాళ్ళు మాసుల్ను  సంపేందుకు రాలేదు. తోడొచ్చినారు ".
   " అంతా  అదేలే దొరా ! ఎందుకు రట్టు జేస్తావుగానీ. నేనేం జేసినా మనోల్లకే మేలు జేస్చాండగదా  ! నా దారిన నన్ను సాగనీ. గుంపు నిలుపుకోవాలంటే కొన్ని కొన్ని యిష్టం లేని పనులు గూడా చేయక తప్పదు మరి.  శ్రీ క్రిష్ణ భగవానునికే తప్పలేదంట....  రా..రా....రా  "   అంటూ జనంలోకి లాక్కుపోయాడు.
  చెన్నారెడ్డిలో  కొత్త వ్యక్తి  కన్పించసాగడు ఓబుళరెడ్డికి.

                                                                                                  ..............  సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs