కర్నాటకలోని ఉడిపి జిల్లాలో వున్నదీ ఈ "కార్కాల" అనే ఒక చిన్న పట్టణం. అసలీ వూరు పేరు నాకు తెలియడానికి ఒక చిన్న ఉపోధ్ఘతం వున్నది. ఎప్పుడో పదిహేను, ఇరువై సంవత్సరాల క్రితం నేను బెంగళూర్‌లో పార్ట్ టైమ్ జాబ్  చేస్తూ సినిమాటోగ్రఫ్రీ చదువుతున్న కాలంలో..  కార్పోరేషన్ సర్కిల్ నుండి విధాన సౌధకు వెళ్లే దారిని "నృప్తతుంగ" రోడ్ అని అంటారు. ఆ దారిలో కుడి వైపున రిజర్వ్ బ్యాంక్ పక్కనే "యువనిక" అని ఒక పెద్ద కేంద్రం వుంటుంది.  అది కళలకు, క్రీడలకు కేటాయించిన ఒక ప్రభుత్వరంగ సంస్థ. ఆ కేంద్రంలో ఒక పెద్ద ఆడిటోరియం వుంటుంది అందులో సాంస్కృతి కార్యక్రమాలతో పాటు శాస్త్రీయ నృత్యాలు,  సంగీత కచేరీలు జరిగేవి. అలానే క్రీడలకు కూడ అక్కడే ఏర్పాట్లు వుండేవి. ఆ సంస్థకు నేను పర్మనెంట్ పార్ట్ టైమ్ కెమెరామెన్‌ కమ్ ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తుండే వాడిని.



       ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా వీరప్ప మొయిలీ పని చేస్తుండే వారు, ఆయన హయాంలో జరిగే జాతీయ క్రీడలు వారి సొంతూరు "కార్కాల"లోనే నిర్వహించారు ఒక సారి. ఆ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఈ "కార్కాల" వూరి పేరును మొదటి సారిగా విన్నాను.  దాని యెక్క ప్రాచుర్యం కొద్దిగా తెలుసుకొన్నాను. హోటల్ రూమ్ నుండి క్రీడాస్థలానికి అటు ఇటూ తిరుగుతున్న సమయంలో పెద్ద కొండరాయి మీదున్న ఈ భారీ విగ్రహమైన బాహుబలిని వాహనంలో నుండే చూస్తుండే వాడిని. ఓహ్ శ్రావణబెలగళలోనే కాదు మరొకటి వున్నదా ఈ బాహుబలి విగ్రహం అని అనుకొన్నాను. అంతే కాదు అక్కడి ఆహారపు అలవాట్లు కూడ చిత్రంగా తోచేవి.  ఫైనాఫిల్, తెల్లటి ద్రాక్షతో కలిపి చట్నీని అక్కడ భోజనాలలొ నేను తిన్నాను.  నేనెప్పుడు అది ఎరుగలేదనే చెప్పాలి. అలా వూరి పేరు బాగా గుర్తుండిపోయి.  తర్వాతెప్పుడైనా ఇటువైపు వచ్చి ఈ భారీ విగ్రహాన్ని చూడాలని అనుకొన్నాను.




      అలా అనుకొంటూ పదిహేనేళ్లు గడిచిపోయాయి.  ఇదిగో గత సంవత్సరం రోడ్ ట్రిప్‌లో ఉడిపి ఎటు వెళ్తున్నాం కదా అక్కడ నుండి ఎలాగైనా ఏదో మార్గంలో ఈ కార్కాలను చూసి వెళ్లాలని అనుకొన్నాను. అనుకొన్నట్లుగానే ఉడిపి నుండి కూర్గ్ ( మడికెరి) వెళ్లే మార్గ మద్యలో ఈ కార్కాల ను చూసి వెళ్లొచ్చని తెలిసింది. అలా  కార్కాలను మళ్లీ పదిహేను సంవత్సరాల తర్వాత వెళ్లగలిగాను.



   ఈ బాహుబలి చరిత్ర గురించి అక్కడ ఎవరు చెప్పడానికి మనుషులు కనపడలేదు. కారణం మేము వెళ్లిన రోజు వర్షాలు బాగా పడుతున్నాయి. ఆ వర్షంలో ఆ పెద్ద రాతికొండ మీద ఒక బాల పూజారి మాత్రమే వున్నాడు. ఆ బాబుకు చరిత్ర గురించి ఏమి తెలియదని తెలిసింది. తర్వాత అంతర్జాలంలో వెదికాక దొరికిన సమాచారాన్నే నేని ఇక్కడ క్లుప్తంగా ఇస్తున్నాను. 

         జైనులు ఈ ప్రాంతాన్ని దాదాపుగా 300 ఏల్లు పరిపాలించారనే చెప్పాలి. వారి పాలనలో అప్పటికి వున్న పురాతనమైన పేరు "పాండ్య నగరి ".   మొట్టమొదటి పరిపాలుకులు మాత్రం "అలుపాస్" వంశస్థులు పాలించారు. వారి వారుసులైన "భైరరాస వొడియాస్" రాజు ఆ కార్కాల సామ్రాజ్యాన్ని చాలా పెద్దగా విస్తారించరట. ఈయన పరిపాలనలోనే చాకా ఖరీదైన ఆయుధాలతో పెద్ద సైన్యం కూడ వుండేదట.


      ఆ తర్వాత కాలంలో "వీర పాండ్య" అనే జైను రాజు తమ జైన మత గురువు "లలితాకీర్తి " ఆదేశానాల ప్రకారం 13 ఫిబ్రవరి 1432  సంవత్సరంలొ ఈ 42 అడుగుల "బాహుబలి గోమటేశ్వర "విగ్రహాన్ని  పెద్ద కొండలాంటి రాతి మీద ప్రతిష్టించారట.  ఇక ఈ విగ్రహానికి ముందున్న ధ్వజస్థంబం 54 అడుగులు వుంటుంది. 

     ఆ తర్వాతర్వత కాలంలో  "కర్రికల్లు" అనే పేరుతో పిలువబడింది.  కర్రికల్లు అనగా "నల్లటి రాయి" అని అర్థం. ఆ ప్రాంతమంతా నల్లటి గ్రానైట్‌తో నిండి వుంటుంది.  మన తెలుగులో నాలాంటి గ్యారెంటీ కలర్ వున్నోళ్లను "కర్రోడా" అని పిలుస్తుంటారుగా..!! బహుశ ఈ "కర్రి" అనే పదం కన్నడ నుండి అరువు తెచ్చుకొన్న పదమేమో మరి. దీనికి మరోక అర్థం కూడ వున్నది. అది వారి పురాతనమైన బాషలో చూసుకొంటే " Elephant Lake"  అని కూడ మరొక అర్థమున్నది.

  ఆతర్వాత ఈ కర్రి కల్లునే  "కార్కాల"గా ఇప్పుడు పిలువబడుతున్నది.

  ఇక పచ్చని కొబ్బరి చెట్ల మద్య కనపడుతున్న  ఆ రాళ్ల మంటంతో వున్న దేవాలయం కూడ ఆ తర్వాత జైనుల రాజులలో ముఖ్యడైన  "ఇమ్మడి భైరవ -II" అనే రాజు ఈ గోమటేశ్వరుడికి ఎదురుగా వున్న చిన్న రాతికొండ మీద 1586లో నిర్మించాడట.  మేము అక్కడికి వెళ్లితే  అక్కడ మనుషులంటూ ఎవరూ కనపడలేదు.  మేము మెట్లెక్కి వెళ్లటాన్ని ఎవరో దూరం నుండి గమనించిన స్త్రీ  దేవాలయంలోకి వచ్చారు.



  వయసు మల్లిన ఆవిడే అక్కడ పూజారి అట. మొత్తం దేవాలయాన్ని ఆవిడ ఆధ్వర్యంలోనే నడుస్తున్నదట. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా తనే  అక్కడికి వచ్చే సంధర్శకుల నుండి సేకరించే డబ్బుతోనే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. లోపలికి వెళ్లాక నిజమేనని అర్థమయ్యింది.



     లోపలంతా చీకటి. లైట్స్ వున్నా కరెంట్ బిల్లు ఆవిడే భరించాలట.. సంధర్శుకులు వచ్చిన సమయంలో మాత్రమే లైట్స్ వెలిగిస్తున్నది కరెంట్ బిల్లు భరించలేక. ఇక ఆ దేవాలయం చరిత్ర గురించి ఆవిడకు కూడ పెద్దగా తెలీదు కాని.  లోపల వెళ్లి చూడగానే మిగతా దేవాలయాలల్తో పోలిస్తే భిన్నంగా కనపడుతుంది.  ఈ దేవాలయం పేరు "చతుర్ముఖ బైడి" అనగా చతురశ్రాకారంలో నిర్మించబడింది కాబట్టి ఆ పేరు పెట్టారు.



     నాలుగు వైపుల రాతి స్థంబాలతో కూడిన  వరండాలతో నిర్మించి వున్నారు.  నాలుగు వైపుల ప్రధాన ద్వారాలున్నాయి. మొదటి ఎదురుగా గర్భగుడిలో ప్రధాన విగ్రహం తో పాటు మిగతా మూడు వైపుల  కూడ మనిషంత నిలువెత్తు విగ్రహాలున్నాయి. మేము టార్చి లైట్ వేసుకొని చూడాల్సి వొచ్చింది. అన్ని నల్ల రాతి గ్రానైట్ విగ్రహాలే. వేటిని కూడ సరిగ్గా పోల్చుకోలేకపోయాము. వారి మతంలో మొత్తం 24 తీర్థంకురులు వుంటారు. అందులో ముగ్గురు విగ్రహాలే ఇవి. ఈ మొత్తం దేవాలయాన్ని నిర్మించడానికి వారికి 30 ఏళ్లు పట్టిందట. దేవాలయం చుట్టూ మొత్తం 108  స్థంభాలతో నిర్మించబడింది.  



     మన తెలుగు రాష్ట్రాలే అనుకొన్నాను చారిత్రిక ప్రదేశాల పట్ల నిర్లక్ష్యం వహించడం ఇప్పటి వరకు. కాని టూరిజం మీద అధిక శాతం రెవెన్యూ సంపాదిస్తూ, అక్కడీ చారిత్రిక ప్రదేశాల పట్ల ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ వాటికి ఎన్నో వసతులు కల్పిస్తున్న కర్నాటక ప్రభుత్వంలో కూడ ఇలాంటివి ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా వుంటున్న చారిత్రాత్మక ప్రదేశాలున్నాయని అప్పుడు తెలిసింది మాకు.

     అక్కడ నుండి వర్షంలోనే ఆ కార్కాలకు 18 కిలోమీటర్ల దూరంలో వున్న మరొక జైనుల దేవాయలం వున్న "మూడబిదిరి" అనే వూరికి బయలు దేరాం.

   వెయ్యి స్థంభాల గుడి వరంగల్‌లో మాత్రమే వున్నదని అనుకొన్నాను ఇన్నాళ్లు. కాని మరొక వెయ్యి స్థంబాల దేవాలయం జైనులు కూడ నిర్మించారని ఈ "మూడబిద్రి" కి వెళ్లాక తెలిసింది.



  ఈ "మూడబిద్రి"  దక్షణ కాశీగా పిలువబడిందట.  17 వ శతాబ్దంలో చాలా వరకు పరిపాలన చేసిన జైన రాజ వంశీయుల కుటుంబాలు ఈ మూడబిద్రికి వలసొచ్చి స్థిరపడ్డారు. ఈ చిన్నట పట్టణానికి మరో ప్రాముఖ్యత వున్నది.  ఈ పట్టణం చుట్టూ 18 సరస్సులు, 18 జైన బసదీలు,18 జైన దేవాలయాలు, 18 రహదారులు వున్నాయట వాటిని కలుపుతూ మద్యలోఈ వేయి స్థంబాల దేవాలయం  నిర్మితమైందట.



      ఈ దేవాలయన్ని చంద్రనాథ దేవాలయం మరియు వేయి స్థంభాల దేవాలయం, సావిర కంబద బసది, త్రిభువన తిలక చూడామని అని ఇలా రక రకాలైన పేర్లతో పిలువబడుతున్నది. క్రీ.శ 1430 లో అప్పటి విజయనగర పరిపాలుకుడైన  "దేవరాయ వొడియార్" నిర్మించారట.  ప్రధాన గర్భగుడిలొ 8 అడుగుల లార్డ్ చంధ్రనాథ కాంస్య విగ్రహం వున్నది.


      ప్రధాన దేవాలయంలో నల్లటి గ్రానైట్ రాయితో మలిచిన స్థంభాలు. వాటి చుట్టూ శిల్పాలు చాలా వున్నాయి. శిల్ప చాతుర్యం పట్ల మక్కువ వున్నవాళ్లు వీటిని ఇష్టపడవచ్చు. 

      ఈ ప్రాంతం గురించి మీకింకా లొతైనా సమాచారం, చారిత్రిక విశేషాలు తెలుసుకోవాలనుకొంటే ఇంటర్‌నెట్‍లో చాలా వరకు దొరుకుతున్నది. 

     సౌత్ కెనరా ( దక్షిణ కన్నడ ) ని చాలా వరకు "జైనులే పరిపాలించారని" అర్థమవుతున్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో చూడవలసిన చారిత్రిక ప్రాంతాలు ఇంకా చాలా వున్నాయి. మాకు సరైనా సమాచారం లేక వాటిని చూడలేకపోయాము. ఆసక్తి వున్న వాళ్లు అంతర్జాలంలో వెదికితే చాలా కనపడతాయి.  

   వర్షాలు విపరీతంగా పడుతుండటం వలన సరైనా ఫోటొస్ ఎక్కువగా తీయలేకపోయాను..... అది నా డ్రా బ్యాక్.

     మద్యాహ్నం భోజనం చేసి ఇక్కడ నుండి కూర్గ్ ( మడికేరి ) కి బయలు దేరాం. దారి పొడవునా వర్షమే.. చాలా వరకు కొండల మద్యన ఘాట్ రోడ్ మీద ప్రయాణం. చుట్టూ పచ్చదనం కొండలు..ఒక్కో సారి మాతో ప్రాటే ప్రయాణిస్తూ వొస్తున్న చిన్న చిన్న నదులు, కొండల చుట్టూ మలుపులే మలుపులు.. పాములు మెలికిలు తిరుగుతున్నట్లుగా మా  ప్రయాణం.. ఆ వర్షంలో.. అలా మలుపులు తిరుగుతూ నల్లటి మబ్బుల్లో మెలోడి పాటలు వింటూ డ్రైవ్ చేయడమన్నది ఒక మంచి అనుభూతే..  అది ఎంజాయ్ చేసే వారికే అర్థమవుతుందేమో...ఆ అనుభవం.  సాయింత్రానికి కూర్గ్ చేరుకొన్నాం. అక్కడ కూడ నల్లటి మేఘాలు దట్టంగా మొత్తం కూర్గ్ నంతా అలుముకొని వున్నాయి. హోటల్ రూమ్ కిటికిల్లో నుండి ముసుగేసుకొని వాటిని చూస్తూ ఎప్పటికో ఏ అర్థ రాత్రికో నిద్రలోకి జారుకొన్నాం.














About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs