దెయ్యం

   " రేయ్ కిశోర్.. లేయిరా ! పనిమనిషి రాలేదుగాని నీళ్లు తెచ్చేపని పడింది నీకివాళ "
కిశోర్ తల్లి వకుళ వంట గదినుండి హాలులోకి వెళ్తూ మంచం మీద నిద్రిస్తున్న కిశోర్‌ని చేత్తో తట్టి వెళ్లింది అక్కడ నుండి. తల్లి పిలుపుతో నిద్ర మత్తులో ఉన్న కిశోర్ మసిలాడే గాని లేవలేదు, ఇంకాస్త గట్టిగా ముసుగు తన్ని పడుకున్నాడు.
  వకుళ చీపురు తీసుకొని చెత్త ఊడుస్తూ కిశోర్ నిద్రిస్తున్న మంచం వద్దకు వచ్చింది, ఇంకా నిద్రపోతున్న కిశోర్ వీపు మీద ఒక దెబ్బ వేసింది కాస్త బలంగానే. " అబ్బా ఏంటమ్మా " అరుస్తూ లేచాడు
 " మీ నాన్నేమో ఆఫీసు పనిమీద పొద్దున్నే క్యాంప్‌కి పోయినాడు, ఈ పనిమనిషి కూడ ఈరోజే రాలేదు. మరి ఇంటి పనులన్ని ఎవరు చేస్తర్రా..? "
" ఏమయ్యింది ఈ లక్ష్మమమ్మకు..? ఈ మద్యన బాగానే పని ఎగ్గొడ్తాంది..? "  అడిగాడు కిశోర్.
" దెయ్యం పట్టిందంటా  "
" దెయ్యమా...  ఈ కాలంలో కూడ దెయ్యాలేంటమ్మా..? "  అడిగాడు
" ఏమోరా..! ఆర్నెల్ల క్రితం చనిపోయిన వాళ్ల అమ్మమ్మ పట్టిందంట లక్ష్మమమ్మకు "
" వాళ్ల అవ్వకు ఏం పనిపాట లేదంటనా.."
" నీకు సమధానాలు చెప్పే ఓపిక లేదుగాని పోయి నీళ్ళు తాపో... ఇప్పటికే సానా టైం అయిపోయింది ఈ మున్సిపాల్టోల్లు నీళ్ళు ఆపేస్తారు "
" అయినా కిరణ్మయి వుంది కదా..! దాన్ని పంపొచ్చుకదా..? "  మంచం మీద నుంచి లేవకుండానే అడిగాడు.
" ఇంప్రూవ్‌మెంట్ కట్టింది కదా ! ఆ పరీక్షలకు పొద్దున్నే లేచి చదువుకుంటూ వుంది.."
" హు..ఎంత ఇంప్రూ‌మెంట్ కట్టి మళ్లీ పరీక్షలు రాసినా అవే మార్కులు..పెరగవ్ "
" ఒరేయ్.. నన్ను విసిగించకుండా వెళ్ళి నీళ్ళు తాపో..! అయినా నీకేమి పనివుంది..? ఇంజనీరింగ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేదాక పనేమి లేదుకదా..? పొద్దున లేచినప్పటి నుండి వూరి మీద పడి తిరగడమే కదా నీ పని !  ఈరోజు పనిమనిషి రాలేదు.. ఈ కాస్త పనులు కూడ చేయవా..? మీ నాన్నేమో అట్లా..! మీరేమో ఇట్లా ఒకరిమీద ఒకరు వంతులు... చస్తున్నా మీతో..! లేయి..లేచి నీళ్ళు తాపో.. లేకపోతే చస్తావ్ నాచేతిలో "  అంటూ చేతిలో వున్న చీపురు ఎత్తింది కొట్టడానికి.
 తల్లి అంతపని చేస్తుందన్న భయంతో మంచం మీద నుండి లేచి  " ఎప్పుడు నేనే తేవాలి నీళ్ళు, చెల్లెలు ఎప్పుడు పని చేయదు..! దాన్ని బాగా ’గోము ’చేస్తున్నావు, రేపు పెళ్ళాయ్యాక దాని మొగుడు చస్తాడు దీనికి చాకరి చేయలేక "  గొణుగుతూ పరిగెత్తాడు వంటింట్లోకి.
  ఒకే కాంపౌండ్‌లో కిందా పైనా గ్రౌండ్‌ఫోర్‌తో కలిపి ఐదు ఇల్లు ఇళ్ళు వున్న ప్రాంగణమది, త్రాగునీరుకోసం అందరూ అదే కాంపౌండ్‌లో ఉన్న కుళాయి వద్ద నీళ్ళు పట్టుకుంటారు ప్రతిరోజు ఉదయమే. కిశోర్ ఇత్తడి బిందెతో అక్కడి చేరి నీళ్ళు పట్టుకుంటున్నా  అతని ఆలోచనలు పనిమనిషి లక్ష్ముమమ్మ మీదకు మళ్లాయి. ’ఈ కాలంలో కూడ దెయ్యాలున్నాయని నమ్ముతున్నారా..?  అయినా చనిపోయిన వాళ్ళ అవ్వనే మనవరాలి ఒళ్ళొకి వస్తుందా..? ఎందుకు..? ’ఇలా పరివిదాలుగా ఆలోచిస్తున్నాడు. ఆ రోజు సాయింత్రం వూరి చివర్లో మనిషికి పట్టిన దెయ్యాలను విడిపించే మంత్రగాళ్ళ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టిన కాంపౌండ్‌లో చాలా వరకు దిగువ మధ్యతరగతి, క్రింద తరగతి మహిళలే ఒళ్ళులో దెయ్యం దూరినట్లుగా జుట్టంతా విరబోసుకొని ఊగుతూ ఏవేవో గొణుగుతున్నారు. అక్కడున్న మంత్రగాడు ఒక మహిళవద్ద నించోని వేప మండలతో కొడుతూ ఏవేవో నోటికొచ్చిన మంత్రాలను చదువుతున్నాడు, బహుశ ఆ దెబ్బలు తాలలేకో లేక హిస్టీరియా ఎక్కువై ఏమోగాని మంత్రగాడు వేపమండలతో కొట్టేకొద్దీ ఇంకా గట్టిగా ఘీంకరిస్తున్నారు.
  కిశోర్‌లో అకస్మాత్‌గా ఒక అనుమానం తట్టింది. ’అవునూ ఈ దెయ్యాలు కేవలం ఆడవారికే ఎందుకు పడ్తాయీ..? అదీనూ కోరి..కోరి దిగువ మద్యతరగతి మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.. ఎందుకలా..? మగవాళ్ళకు పట్టినా చాలా తక్కువ మంది వున్నారక్కడ ! ఇక  పైవర్గాల వారికి అంటే ధనిక వర్గాల ఆడవారికి ఎందుకు పట్టవ్...? దెయ్యాలకు కూడ పేదలంటేనే లోకువ..? వాటికి కూడ ధనిక, పేద అంటూ తార తమ్యాలున్నాయా..? ’ ఇలా సాగుతున్నాయి ఆలోచనలు అతనిలో.
   అతనిలోని ఆ ఆలోచనలు నిలువనీయలేదు.. వెంటనే  లైబ్రరీకి వెళ్లి ’దెయ్యాలు మనుషులకు ఎందుకు పడ్తాయి..’ విషయాల మీద అప్పటి వరకు వారపత్రికలలో వచ్చిన కొన్ని వ్యాసాలు, మరికొంతమంది సైక్రియాటిస్ట్స్ మానసిక స్థితిగతులమీద ( హిస్టీరియ ) వ్రాసిన పుస్తకాలు చదివాడు. ఆ పఠనం వలన అతనిలో మెల్లిమెల్లిగా మరి కొన్ని ఆలోచనలు సంతరించాయి. రెండు రోజుల తర్వాత ఉదయమే పనిమనిషి లక్ష్ముమమ్మ వచ్చింది పనిలోకి.
 " ఏమ్ లక్ష్ముమమ్మ ఇప్పుడెలా ఉంది ఆరోగ్యం "  అడిగాడు కిశోర్.
పెదవిప్పకుండానే  ’ ఊ..ఊ ’అంటూ తలూపుతూ పైకి శూన్యంలోకి చూసుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన వైపు చూస్తూ ఆలోచనలోకి వెళ్ళాడు కిశోర్..
    లక్ష్ముమమ్మ వయసు దాదాపుగా 45 దాక వుండొచ్చేమో..! వకుళ ఇంట్లో పనిమనిషి చేరే సమయానికి లక్ష్ముమమ్మకు పెళ్ళి అయి నాలుగు సంవత్సరాలై ఉంటుంది..! అప్పటికి ఇంకా కిశోర్ పుట్టలేదు ఆ యింట్లో. ఆమె వచ్చిన సంవత్సరానికి కిశోర్ పుట్టాడు.  పిల్లలేని లక్ష్ముమమ్మ కిశోర్‌ని చంకనేసుకొని తిరిగేది.. తన పిల్లాడిలాగే భావించేది.  మంచి రంగు వున్న మనిషి లక్ష్ముమమ్మ, కలవారింట్లో పుట్టి వుంటే మహరాణిలా ఉండిండేదేమో ఆమె దర్పం, ఆమె మేని ఛాయ చూస్తే అలానే అనిపిస్తుంది, మనిషి చాలా నెమ్మది ఎక్కవుగా మాట్లాడదు, ఎవరేమి కబుర్లు చెప్పినా చిరునవ్వుతో వింటూ వుంటుందేగాని వాటికి అవునని కాని కాదని అని కాని బదులు పలకదు, అందరి విషయాలు చిరునవ్వుతో వింటుందే కాని..ఒకరింట్లో మాటలు మరొకరి ఇంట్లో చెప్పదు, అందుకే ఆ వీధిలో లక్ష్ముమమ్మ అంటే చాలా మందికి ఇష్టం. అలాంటి లక్ష్ముమమ్మకు తర్వాతర్వాత మెల్లిగా కష్టాలు మొదలయ్యాయి.
    లక్ష్ముమమ్మ అవ్వ ( అమ్మమ్మ ) నుండి ఆమె అమ్మ, ఆమె కలసి ముగ్గురూ పనిమనుషులుగా పని చేస్తున్నారు ఆ వీధిలో. మూడు తరాల వారంతా పనిమనుషులుగానే వారి వృత్తి,  మేనమామ అయిన అమ్మ తమ్ముడినే అంటే లక్ష్ముమమ్మ అవ్వకు కూతురు తర్వాత చానా ఏళ్ళకు పుట్టిన  ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడైనా రంగడుకు తన పెద్ద కూతురు కూతురైన లక్ష్ముమమ్మని ఇచ్చి పెళ్లి చేసింది, అంటె తన కుమారుడికి తన మనవరాలిని ఇచ్చి పెళ్లి చేసింది, రంగడు రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు మనిషి చాలా మెతక ( రౌడి రకం కాదు.లేదా కూసింత సున్నితత్వం అని కూడ అనొచ్చేమో ), అతను కూడ లక్ష్ముమమ్మ లాగే మాటలకన్నిటికి చిరునవ్వే సమాదానం ఇస్తూ వుంటాడు.
   లక్ష్ముమమ్మ వకుళ ఇంట్లో పని చేస్తుండగానే కిశొర్‌ తర్వాత రెండేళ్ళకు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది, రంగడు కిశోర్, కిరణ్మయిలు పాఠశాలలకు వెళ్ళే వయసొచ్చేకాలానికి వారిని తన రిక్షాలో కాన్వెంట్‌కు తీసుకెళ్ళేవాడు. పెళ్ళి అయ్యి ఏడేనిమిదేళ్ళు గడిచినా పిల్లలు పుట్టలేదనే దిగులు తప్ప మరేమి కష్టాలు, బాదలు లేని సంసారం లక్ష్మమమ్మ, రంగడులది.  అయితే అప్పటి వరకు సాఫీగా సాగిన జీవన బతుకుబండి..! తర్వాత మెల్లిమెల్లిగా గతకుల బాట ఎక్కనారంబించింది, అది రంగడు రూపంలో. అకస్మాత్‌గా రంగడు ఎవరికీ కనపడకుండా మాయం అయ్యేవాడు.. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు, ఎక్కడున్నాడో కూడ సమాచారం ఇవ్వడు, ఓ మూడు నాలుగు నెలలకు తిరిగి ప్రత్యక్షమయ్యేవాడు, రంగడి అమ్మ, అక్క , లక్ష్ముమమ్మ ముగ్గురు ఏకమై గోల చేసినా ఉలకడు పలకడు..ఎంత బతిమాలినా ఎక్కడికెల్లింది చెప్పడు, చివరకు వకుళ, ఆమె భర్త కాస్త గట్టిగా అడిగితే  " ప్రకాశం, గుంటూర్‌ల వైపు వెళ్ళి వచ్చానని "  నొరువిప్పుతాడు.
  " అక్కడేం పని నీకు " అని అడిగితే
 " భవన నిర్మాణ కూలి పనులకు వెళ్ళా " నని చెబుతాడు.
 " మేస్త్రీ పనులకు వెళ్లినావా..? ఇక్కడ రిక్షా బాడుగలు బాగానే వున్నాయి కదా..! ఈ పని కంటే మేస్త్రీ పని కష్టతరమైంది కదా దానికెందుకు వెళ్లినావ్..? "  అడిగితే పలకడు,  బెల్లం కొట్టిన రాయిలా నించోని వుంటాడు. ఎంత అడిగినా ఉలకని పలకని మనిషితో  ’వీడింతే ’ అని అడగడం మానేసారు అందరు. తిరిగి తన మునపటి రిక్షా పని కొనసాగించేవాడు. రంగడు అదృశ్యమయిన కాలంలో ఇంటికి మగదిక్కులా రంగడి తమ్ముడు కిష్టప్ప వుండేవాడు, అతను తన అన్నలాగే రిక్షా తొక్కుతూ కుటుంబానికి అండగా వుంటూ అన్న ఒప్పుకున్న రోజువారి స్కూల్ పిల్లలని తీసుకెళ్ళే బాడుగలకు కిష్టప్పే దిక్కు అయ్యేవాడు.
   అలా ఒక నాలుగు నెలలు అన్ని పనులు సక్రమంగా చేస్తూవుండగానే రంగడు ఎవరికీ ఏమి చెప్పాపెట్టాకుండా మళ్లీ మటు మాయం..మొదట్లో కంగారుపడినా  తర్వాత్తర్వాత అతని ’మటు మాయాలు ’ సర్వసాదారణం కావడంతో అందరు అలవాటు పడిపోయారు. కాని ఒక్క లక్ష్ముమమ్మకే అతని ప్రవర్తన చాలా కష్టంగా వుంది, ’కడుపున ఒక కాయ కూడ కాయకపోయే.. ఈ మనిషికేమో ఆ ఊసే లేదు, మనిషి మాయం అయినప్పుడు మానసికంగా తోడు లేక మదన పడుతూ వుండేది, తను పని చేసే ఇళ్ళల్లోని అందరి సంసారాలలో కనపడే వారి ఆనందాలు, భార్యాభర్తల అనుభందాలు, పిల్లలతో జరిగే ఆటలు, ముచ్చట్లు, ఇవేవి తన జీవితంలో లేవనే విషయం తనకి స్పష్టంగా కనపడసాగింది. లక్ష్ముమమ్మకు తన తల్లి వద్ద కంటే అవ్వ వద్దే చాలా చనువు, అలా రంగడు చెప్పాపెట్టాకుండా పోయినప్పుడల్లా తన బాదనంత  అవ్వ వద్ద వెలిబుచ్చేది. అక్కడే ఒక శ్వాంతన పొందేది. ఇలా సాగుతున్న జీవితంలో ఒక మంచి తరుణాన లక్ష్ముమమ్మ గర్భందాల్చింది. అది ఇంటిల్లిపాదికంతా ఆనందాన్ని ఇచ్చింది, పిల్లలు పుట్టిన తర్వాతయిన రంగడిలో మార్పు రావచ్చని  అందరి ఆశ. కొన్నాళ్లకు ఒక ఆడపిల్లను కన్నది లక్ష్ముమమ్మ. రంగడి ఆనందానికి హద్దులేవు..ఇన్నాళ్లకు తనొక  ’మగాడి ’ని నిరూపించబడ్డాను అన్న ఆనందం అతనిది. గతంలోలా ఇప్పుడు  ఇంటినుండి చెప్పకుండా పోవడం జరగలేదు పాప పుట్టిన తర్వాత రంగడి విషయంలో. లక్ష్ముమమ్మకే కాక స్కూల్ పిల్లల రిక్షా బాడుగలు ఒప్పుకున్న వారికి కూడ రంగడిలోని మార్పు స్థిమిత పరిచింది
    ఒక సంవత్సరం గడిచాక రంగడు మళ్లీ మొదలెట్టాడు వెళ్లిపోవడం.., ఈ సారి మునపటిలాగ మూడు లేక నాలుగు నెలలకు తిరిగిరావడంలా కాకుండా ఏకంగా సంవత్సరం తర్వాత కనపడుతున్నాడు. ఇంట్లో అందరూ గొడవపడటమే అతనితో, అప్పుడు మాత్రం ఇక వెళ్లను అంటాడు, మళ్లీ ఒక నెలకే మటుమాయం, తర్వాతెప్పుడో సంవత్సరానికో లేక రెండేళ్ళకో కనపడతాడు.. అతనితో గొడవపడి..పడి అందరికీ విసుగెత్తి చివరకు వదిలేశారు ఎలాగైనా తగలడనీ అని. అలాంటి సమయంలో లక్ష్ముమమ్మ మరది కిష్టప్పనే కుటుంబానికి తోడు, ఆ తోడు చివరకు మానసికంగా లక్ష్ముమమ్మకు కూడ ఆసరా అయ్యింది, కిష్టప్ప కూడ ’వదినా..వదినా ’ అంటూ లక్ష్ముమమ్మ చెప్పే పనులన్నిటికీ తలూపుతూ తిరిగేవాడు. రంగడు లేని లోటుని అలా పూడ్చుకునేది లక్ష్ముమమ్మ.
   ఆ ఆనందం కూడ ఎన్నాల్లూ..? ఒక శుభముహుర్తాన కిష్టప్పకు ఒక సంబందం చూసి పెళ్ళి చేశారు కుటుంబ పెద్దలు. అంతే ఆ సంఘటనను అంత త్వరగా జీర్ణించుకోలేకపోయింది లక్ష్ముమమ్మ, తమ జీవితాంతం అతను తోడు వుంటాడని గాని..ఏదో ఒకరోజున తన మరది పెళ్ళి చేసుకొని ఒక ఇంటివాడవుతాడని స్పృహ వున్నా...! పెళ్ళి చేసుకొని తన పరది నుండి వెళ్ళిపోవడమన్నది అంత సులభంగా అంగీకరించలేక పోయింది ఆమె. మళ్లీ ఇప్పుడు తిరిగి తన శూన్యమే తనకు దిక్కు అయ్యింది. పెనిమిటి ఎప్పుడొస్తాడో తెలియదు, అస్సలు... వస్తాడో రాడో కూడ తెలియదు, తన చుట్టూ వున్న అందరి జీవితాల్లో నూరు శాతం ఆనందం లేకపోయినా తనలాంటి జీవితమైతే కాదు. ’భర్త, పిల్లలు..గొడవలు..అనందాలు..సుఖాలు, ఎక్కడికైనా సరే భర్తతో కలిసి వెళ్ళడాలు వున్నాయి అందరికీ ’ఈ భావన ఆమెలో అలజడి రేపసాగాయి. మునపటిలా ఆమె మొహంలో వున్న ’చిరునవ్వు ’ రోజు రోజుకు సన్నబడింది.. కొన్నాళ్ళకు పూర్తిగా ముభావాన్ని ఆశ్రయించింది.
  ఇలాంటి తరుణంలోనే లక్ష్ముమమ్మకు మరో విధ్యుత్‌త్ఘాతం... ’అవ్వ ’ మరణ రూపంలో తగిలింది.  చిన్నప్పటినుండి తనకున్న ఏకైక ఆత్మీయురాలు  అమ్మమ్మ దూరం మరింత కృంగదీసింది. జీవితాంతం తోడు అనుకున్న భర్త ఉనికి ఏమిటొ కూడ అర్థం కాని పరిస్థితి, శారీరక, మానసిక సుఖాలు ఏవి లేవు, ఉన్న ఒకరిద్దరు ఆత్మీయులు కూడ తనను ఒంటరి చేసి వెళ్ళిపోయారనే భావన. వున్న ఒక్క కూతురిని చూసుకుంటూ బతుకుతున్నా... మగతోడు లేని జీవితాన్ని భరించలేకపోతున్నది. ఆ విషయంలో లోలోపలే మధనపడుతున్నది. ఒక్కో సమయంలో ’హిస్టీరియా ’ లా అరిచేది. ఇళ్ళల్లో పనులకెళ్ళినప్పుడు మౌనంగా ఉంటూ అక్కడి పనులన్నీ చేస్తున్నది, ఇంటికి రాగానే మళ్లీ అవే ఆలోచనలు.. అంతే ఒళ్ళులోకి ఏదో ఆవహించినట్లు అరుపులతో గోల చేసేది..మొదట్లో అది అర్థం కాకపోయినా మెల్లిగా చుట్టుపక్కల వున్న వాళ్ళు అది గమనించి  ’దెయ్యం ’ పట్టింది లక్ష్ముమమ్మకు అని ప్రచారం చేశారు.. ఆ దెయ్యం ఎవరో కాదు లక్ష్ముమమ్మ ’అవ్వ ’ నే అని ఒక నిర్ణయానికొచ్చి అవే మాటలు లక్ష్ముమమ్మ ’హిస్టీరియా ’ గా కేకలు పెడ్తున్న సమయంలో ఆమె నోటి నుండే పలికించారు. అది మొదలు... వారంలో రెండు మూడు సార్లు వాళ్ళనుకొనే దెయ్యం వచ్చేది లక్ష్ముమమ్మ ఒళ్ళోకి.
  దెయ్యమనే హిస్టీరియా మహమ్మరి వలన చాలా మంది తమ ఇళ్ళల్లోకి పనులకు రానిచ్చేవారు కాదు..చివరకు వకుళ ఇంటితో పాటు మరో ఇంటికి మాత్రమే ఆమె పనులోకి వెల్తున్నది. లక్ష్ముమమ్మ మొగుడు తర్వాత కనపడలేదు, అసలు బతికే వున్నాడా.. లేడా..? విషయం కూడ తెలియదు.  కొన్నేళ్ళ తర్వాత వకుళ ఇంట్లో కూడ పని  మానేసింది.
   కిశోర్ ఉద్యోగ రిత్యా బెంగళూర్‌లో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు వూరికి వచ్చినప్పుడు...తనకు గుర్తుకొచ్చినప్పుడల్లా వకుళని అడుతూవుండేవాడు ’అమ్మా లక్ష్ముమమ్మ కనపడట్లేదు అసలు వున్నదా లేదా..ఎప్పుడన్న మనింటి వైపు వస్తున్నాదా..? "
  " ఏమోరా అస్సల్ కనపడలేదు..ఏమయ్యిందో ఏమో మరి "  వకుళ సమాదానం.
వున్న ఒక్క కూతురు కూడ ఇంటర్‌మీడియట్ చదువుతూండగానే ఒక తోడుని వెతుక్కొని చెప్పాపెట్టకుండా లక్ష్ముమమ్మను ఒంటిరి చేసి వెళ్లిపోయింది.
 ఒక సారి బెంగళూర్ నుండి తనూరికి వచ్చిన సందర్బంలో కిశోర్ బజార్లో వెల్తున్నసమయంలో లక్ష్ముమమ్మ ఎదురుపడింది, దూరంగా వస్తున్నప్పుడే చూశాడు కాని సరిగ్గా పోల్చుకోలేదు ఆమె అవునా కాదా అని చూస్తున్నాడు.. ! జుట్టు అంతా తైలం లేకుండా ఎండిపోయి రేగిపోయి వున్నది ముఖంలో మునపటి కళ లేదు, చర్మమంతా పీక్కుపోయి ఎముకలకు అతుక్కుపోయింది ఇప్పుడు నిజంగా ఆమే ఒక ’దెయ్యం ’ లా కనపడుతున్నది. కట్టుకొన్న చీర కూడ మాసిపోయి వున్నది..ఎప్పటిదో అది.  దగ్గరకొచ్చాక  పలకరించాడు కిశోర్.
 " లక్ష్ముమమ్మ బాగున్నావా..? "
" ఎవరూ "  అంటూ కిశోర్ మొహంలోకి చూసింది.. కాని మనిషిని గుర్తుపడుతున్నట్లుగా చూడట్లేదు ఏదో శూన్యంలోకి చూస్తున్నట్టుగా వుంది.
 " నేను వకుళ కొడుకుని.. కిశోర్‌ని "
 " ఆ బాగున్నావా నాయనా..? పిల్లలెంతమంది.. ? "  అలా అడగడంలోనే కిశోర్‌కి అర్థమయ్యింది ఆమె తనని గుర్తుపట్టలేదని
ఇంటికి పిలిచి ఆమెకు ఒక మంచి చీర ఇద్దామనుకొని చెప్పేలోపలే కిశోర్‌ని దాటుకొని ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది లక్ష్ముమమ్మ. కిశోర్ పిలిచినా వినపడనట్లే వెళ్ళిపోయింది. అసలు బయట ప్రపంచంతో సంబందం లేని మనిషిలా వున్నది ఆమె ప్రవర్తన.  ఒక నిట్టూర్పు విడిచి కదిలాడు అక్కడ నుండి కిశోర్.
 

                                                                 దేవుడు ( దేవత )

                " టైమ్ అయిపోతున్నది ఇంకా టెంకాయి కొట్టలేదా..?  ..ఇప్పటికే చాలా లేట్ అయ్యింది..ఇప్పుడు బయలుదేరితే మైసూర్‌కి ఎప్పటికి చేరుకుంటామో..ఊ..తొందరగా కానివ్వండి " అంటూ పెళ్ళి బస్సు వద్ద నుంచి వాసు ఇంట్లోకి వెళ్ళాను.
 వాసు తండ్రి నారాయణస్వామి ఎదురుపడ్డాడు నాకు.  " ఎంటి అంకుల్ ఇంకా తెమలలేదా.. ఇప్పటికే సమయం 12 గంటలు కావస్తున్నది " అన్నాను
" లేటైనా పర్లేదులేరా..! ఎలాగు ఘాట్‌రూట్‌లో వెళ్ళాలి మనమెళ్ళే సమయానికి  దొంగలు కూడ బాగా నిద్రపోతూవుంటారు "  అన్నాడు నారాయణస్వామి
’అబ్బా ఈయన చాదస్తంతో చస్తున్నాం కదరా బాబూ ’ మనసులో గొణుగుకుంటూ లోపలికెళ్ళి పెళ్ళివారినందరిని తొందరపెట్టాను.
     వాసు నా చిన్ననాటి స్నేహితుడు, వాసు కుటుంబసబ్యులతో కూడ చిన్నప్పటినుండి సాన్నిహిత్యం వుంది, మొత్తానికి వాసు ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు..అదీను ఎవరినో తెలుసా..? వాడు చదివిన కాలేజి లెక్చరర్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నాడు. వీడి ప్రేమ విషయం మొదట మాకు తెలిసినప్పుడు " అరె ఏమయ్యిందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎగిరిందీ.." సినిమా గుర్తుకొచ్చింది. తర్వాత  తన ప్రేమ విషయం విన్న వాసు నాన్న నారాయణస్వామి  " హట్.. నేనీ పెళ్ళికి ఒప్పుకోను.." ఎస్వీయార్ టైప్‌లో అరిచాడు, అందుకు వాసు " మా బందం ఇప్పటిది కాదు.. ఎప్పటినుండో వస్తున్న జన్మజన్మల బందం.., ఈ జన్మలోకూడ ఈ బందం అలాగే కొనసాగిస్తాను మీరు కాదన్నా సరే నేను ఇంట్లోనుండి బయటకు వెళ్తాను మీ ఆస్తి కూడ వద్దు నాకు "  అంటూ చివర్లో పలికిన " ఇంట్లోంచి వెళ్తాను " అన్న పదం మరీ నొక్కి వక్కానించాడు వాసు అమ్మకు బాగా వినిపడేట్లుగా. అలా ఒక సినిమాటిక్ మేలో డ్రామ పండించాడు. ఆ దెబ్బతో నారాయణస్వామి ’పులి వేషం ’వేశాడు. కాని వాసు అమ్మగారికి నారాయణస్వామి మీద కన్నా కొన్ని వేల టన్నుల ప్రేమ తన సుపుత్రుడు మీద వుంది. అందులోను " ఇంట్లోంచి వెళ్లిపోతాను " అన్న సుపుత్రుని మాటలు ఆమెని కలచివేశాయి. ఆ డైలాగ్స్ కావాలనే వాడాడు వాసు. కొడుకు ప్రేమ వ్యవహారం ఇష్టం లేకపోయినా సుపుత్రుని మీద ఉన్న మమకారం కష్టంగానైనా ఒప్పుకునేలా చేసింది. ఇంకేముంది హోండిపార్ట్‌మెంట్ ’పులితోక ’ను మెలితిప్పింది..అంతే నారాయణస్వామి ’మ్యావ్ ’ అనక తప్పలేదు. వాసు ప్రేమించిన అమ్మాయి తెలుగువారైనా..తరాల వారు ఉద్యోగరిత్యా  అప్పుడెప్పుడో మైసూర్ వెళ్ళి స్థిరపడ్డారట. అక్కడే పెళ్ళి చేస్తున్నారు.
     ఈ పెళ్ళి నారాయణస్వామికి ఇష్టం లేదు కాని తల్లి,కొడుకు కలిసి ముహర్తాలు పెట్టేశారు, ఏం చేస్తాడు... తప్పదన్నట్లు ఒప్పుకున్నాడు కాని అయిష్టత బాగా కనపడేది ఆయన ప్రవర్తనలో.. అందులోనూ కాస్త తొందరగా బయలుదేరుదాం అంటే ఆయనకున్న చాదస్తంతో ఒప్పుకోలేదు..లేట్‌గా బయలుదేరితే ఘాట్‌‍రోడ్ దగ్గరకు వెళ్ళే సమయానికి తెలవారుతూ వుంటుంది ఆ సమయంలో దారి దోపిడీ దొంగల భయం ఉండకపోవచ్చని ఆయన ఆలోచన. కడప టౌన్ దాటాక రాయచోటి వద్ద పెద్ద ఘాట్ రోడ్ వుంది, రాత్రి సమయాలలో అప్పుడప్పుడు అక్కడ దొంగతనాలు జరుగుతూ వుంటాయి, అందునా పెళ్ళి బస్సులనగానే కాచుకొని వుంటారు. అదీ ఆయన భయం.. దానికి విరుగుడుగా పెళ్ళికి బయలుదేరే బస్సులో సీట్స్ కింద ఇనుప రాడ్స్, ఈట కట్టెలు అప్పటికే పెట్టేసుకున్నాము మా యువతరమంతా..! ఘాట్‌రోడ్స్‌లలో పెళ్ళి బస్సుల ప్రయాణమనగానే అలా ’అన్నిటిని ’ సిద్దం చేసుకోవడం మాకలవాటే ఎప్పుడూనూ.
      మొత్తానికి అన్ని పూజా కార్యక్రమాలు ముగించుకొని బయలు దేరింది పెళ్ళి బస్సు. మద్యవయస్కులు, స్త్రీలు, ముసలి ముతకా మద్యన ఓ 15 మంది యువతరం అయిన మేము గోల గోల చేస్తూ.. మద్యలో అంతంక్ష్యరి పాడుకుంటూ తెలవారే దాక మా ప్రయాణం కొనసాగించాము. తర్వాత అలసిపోయి ఓ మూడుగంటల్లు నిద్రపోయాక నాకు మెలుకవ వచ్చి చూస్తే ఇంకా బెంగళూర్‌ చేరలేదు బస్సు..’ఏంటయ్యా. ఇది ’ అంటూ బస్సు డ్రైవర్‌ని అడిగితే  " సార్ ఈ బస్సు చూట్టానికి బయటకు కొత్తది కనిపిస్తుంది కాని లోపల పాత ఇంజన్ బిగించాడు ఈ బస్సు ఓనర్ " బదులిచ్చాడు డ్రైవర్. మా బస్సు వేగానికి ఎద్దుల బల్లు కూడ మమ్మల్ని క్రాస్ చేసి పోతున్నాయి..అంతటి గొప్ప వేగంగా పోతున్నది బస్సు. చివరకు సాయింత్రానికి 5 గంటల లోపలే మైసూర్ చేరుకున్నాము.
    అందరు కాలకృత్యాలు తీర్చుకొని ఒక గంట కునుకేసాక, పెళ్ళికొడుకైన వాసుని పెళ్ళి మంటపంలో వదిలి మిగతా జనమంతా కలిసి ’చాముండీ హిల్స్ ’కి బయలుదేరాము డొక్కు బస్సులో. సిటిలో నుండి చాముండీ హిల్స్‌ని ఎక్కనారంబించింది బస్సు.. నేను డ్రైవర్ వద్ద కూర్చొని బాతాకాని కొడ్తున్నా... ఇంతలో  " ..ఓ...ఓ...  ఆపండిరా..ఓ.ఆ..ఓ..ఆ.."  ఆడవారి గుంపు నుండి పెద్ద ప్రళయంలా  అరుపులు వినిపించాయి. ఒక్క సారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఏమిటా అని చూస్తే వాసు తరుపు బందువైన 50 ఏళ్ళ ఆవిడ సీట్‌లోనుండి లేచి హిస్టీరియాలా అరుస్తున్నది..." రేయ్ నేను చాముండినీ..బస్సు ఆపండ్రా...ఓ..ఓ.." అంటూ ఊగిపోతున్నది.
ఆమెని చూసి బెదిరిన వాసు తల్లి  " ఒరేయ్..ఒరేయ్.. బాసు ఆపించు..రా.." నాకు చెప్పి..పక్కకు తిరిగి  "నిమ్మకాయలుంటే చూడండి ఎవరి దగ్గరన్నా.. కుంకుమ, పసుపు కావాలి "  అడుగుతున్నది. 
 ఒకటి రెండు క్షణాల్లో నాకు విషయం అర్థమై.. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి.. బస్సు డ్రైవర్‌ వైపు తిరిగి  " అర్రె బాబు ఎవరేమి చెప్పినా బస్సు ఆపకు.." ఆర్డేసి ఒక్క అంగలో హిస్టీరియాలా ఊగుతున్న ఆవిడ దగ్గరకు వెళ్లాను అప్పటికే అందరూ నిమ్మకాయలు, కుంకుమ,పసుపుల కోసం వెతుకుతున్నారు..అవెక్కడ దొరుకుతాయి ఈ బస్సులో.. ఇది కేవలం చిన్నపాటి ప్రయాణం..అందరూ గాబరా పడ్తున్నారు. హిస్టీరియా వచ్చిన మనిషేమో ఆగట్లేదు.. పెద్ద కేకలు వేస్తున్నది వెంటనే నేను అందుకున్నాను..
 " యెహే  ఆపండి..మీ గోల దుర్గా మాత లేదు గిర్గామాత లేదు "  అంటూ ఆమె కంటే గట్టిగా కేకలేశాను.
కాని వాసు తల్లి గారు నా వైపు తిరిగి  " ఒరే నాయనా దుర్గామాత ఒళ్ళులోకి వచ్చిందిరా.. ఆమెను శాంత పరచాలి లేదంటే ఆగ్రహిస్తుందిరా.. నీకు పుణ్యముంటుంది బస్సుని ఆపరా "  బ్రతిమాలుతున్నది.
నాకు దుర్గామాత ఆగ్రహం కంటే ముందుగా బస్సు పరిస్థితి మీద నాకు అనుమానం వున్నది.. నా అనుమానాన్ని బలపరుస్తున్నట్టుగానే " బస్సు ఆపకుండ ఎలాగైనా కాపాడు " అన్నట్టుగా వున్నాయి నావైపు చూస్తున్న డ్రైవర్ చూపులు
ఆమెకు వత్తాసు పలుకుతున్న ఆడవారి వైపు తిరిగి " ఇప్పుడు బస్సు ఆపితే అంతే..ఈ బస్సుకు సరిగ్గా బ్రేకులు కూడ లేవు..కొండ మీద నుండి కింద పడి ప్రమాదం జరగొచ్చు లేదా.. ఒక్క సారి బస్సు ఆగితే మళ్లీ స్టార్ట్ అవ్వదు, అందరం కలసి బస్సును తోసుకుంటూ పైకి చేరాలి "  అరిచాను గట్టిగా.
 అంతే అంతవరకు హిస్టీరియా మనిషికి వత్తాసు పలుకున్న వారంతా ఒక్క సారిగా సైలంట్ అయిపోయారు ఎవరూ నోరు మెదపలేదు.. దుర్గామాతను శాంతపరచే కార్యక్రమం కన్నా ముందు తమను తాము ప్రమాదంలొ పడకుండ చూసుకోవాలి అన్న స్పృహ వారిలోకి వచ్చింది. విచిత్రమేమిటంటే అంతవరకు హిస్టీరియాలా అరుస్తున్నా ఆ ఆడ మనిషి కూడ సైలంట్ అయిపోయి ’బిక్క మొహం ’వేసుకొని కూర్చోని వున్నది.
  నా మాటలతో వాసు తల్లిగారికి ఏమి చేయాలొ పాలు పోక నావైపు తిరిగి  " రేయి నీవు చానా అసాద్యుడివిరా తండ్రీ....చెప్పిన మాట విననే వినవు " నింద మోపింది.
 " బస్సు పరిస్థితి ఆలోచించండి ముందు..ఇలాంటి సమయంలో బస్సు ఆపి నిమ్మకాయలు, కుంకుమ, పసుపు కోసం ఎక్కడ వెతుకుతారు..?  అవన్ని దొరికే ప్రాంతామా ఇది..? ఒక్క సారి బయటకు చూడండి  ఎలా వుందో నిర్మాణుషంగా...అందులోను చిమ్మచీకటి..ఏటవాలుగా వున్న కొండ ప్రాంతం..! బస్సు ఆగితే ఇంకేమన్న వుందా...? ఈ లోపల బస్సు స్టార్ట్ కాక వెనక్కి పోతే పరిస్థితి ఏంటి..? దుర్గామాత ఇప్పుడు ఒక్కరి ఒళ్ళులోకి మాత్రమే వచ్చింది.. అదే బస్సు ప్రమాదం జరిగితే అందరం కట్ట కలసి ఏకంగా దుర్గామాత వద్దకు చేరవచ్చు..! మరేమంటారు ఆపుదామంటారా బస్సు.... చెప్పండి ..? "  అని అడిగాను.
 ఆ మాటతో అందరూ మౌనాన్ని ఆశ్రయించారు.  జరగాల్సిన సంఘటన ఆగిపోయినందుకు ’హమ్మయ్యా ’ అనుకున్నాడు బస్సు డ్రైవర్. బస్సు అవసోపాలు పడుతూ మెల్లిగా కొండ ఎక్కుతున్నది..! బస్సులోని వాతావరణం గంబీరంగా వున్నది,  ఖాలీగా ఉన్న కుర్చీ చూసుకొని అందులో కూర్చున్నాక తలెత్తి అంతవరకు హిస్టీరియాలా అరిచిన ముసలావిడ వైపు చూశాను. ఆవిడ నావైపే చూస్తున్నది. ఆమె కళ్ళ కింద ముడతలు పడ్డ చర్మం ఆమె అనుభవాల్ని చెబుతున్నది.. ఆ కళ్ళలో చూస్తుంటే  " కనీసం ఈ చిన్నపాటి ఆనందాన్ని లేకుండా చేస్తావా నాకు "  అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి ఆమె చూపులు. నాలో చిన్నగా అంతర్మధనం..నేనేమన్న తప్పు చేశానా..? లేదే..!! ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేసిందే కరెక్ట్. మిగతా సమయాల్లో నేను అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోను..! నిజమే ఆమెకున్న ఈ చిన్న పాటి ఆనందానికి ప్రస్థుత పరిస్థితిలో అడ్డం పడ్డాను. తప్పదు మరి..! నాకు ఆవిడ గురించి.. ఆమె వెనుక వున్న బాదలు గురించి కూడ అవగాహన వున్నది.
    వాసు తల్లిగారి తరుపన దూరపు బందవైన ఆ ముసలావిడ పేరు వసంత, కడపకు 50 కిలోమీటర్ల దూరంలో వున్న రాజంపేట వూరు తనది. 16 ఏళ్ళకే పెళ్ళి అయి రెండేళ్ళు కాపరం చేశాక ఆమె భర్త సుబ్బరాయుడు గల్ఫ్ దేశాలైన కువైట్‌కి వెళ్లాడు బతుకు తెరువుకోసం. సహజంగా కరువు ప్రాంతమైన రాజంపేట ప్రాంతంలోని యువత, పెళ్ళి అయిన మగవాళ్లు, స్త్రీలు ఉపాధికోసం అరబ్ దేశాలకు వలస వెళ్లడం ఒక ఆనవాయితి. ఆ వూరిలో కువైట్‌నగర్, దుబాయ్ కాలనీలంటూ కొన్ని ఏరియాలు కూడ వున్నాయి.
   అలా ప్రవాసంలో వున్న సుబ్బరాయుడు పని చేస్తుంటే ఇక్కడ వున్న ఊరిలో తనొక్కతే సంసార సాగారాన్ని ఈదుతుండేది. రెండేళ్ళకో లేక మూడేళ్ళకో ఒక సారి వచ్చి రెండు మూడు నెలలు ఇండియాలో ఉండి వెళ్ళేవాడు వసంత భర్త. భర్త లేని కాలమంతా జీవితం దుర్లబంగానే వుండేది.. ఎన్ని దినారాలు అక్కడ నుండి పంపినా ఆర్థికమైన బలమొక్కటే సరిపోదుకదా..? జీవిత భాగస్వామి లేని లోటు తీర్చలేనిది. పిల్లలు కూడ లేని జీవితం తనది, అందునా భర్త దూరంగా ఉన్నాడనగానే ఆడ మనిషిమీద డేగ కళ్ళు పడటం సర్వసాదారణం వాటినన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటూ దాదాపుగా 12 ఏళ్ళు నెట్టుకొచ్చింది జీవితాన్ని ఒంటరిగా.
   12 ఏళ్ళ తర్వాత ఒక రోజు అకస్మాత్‌గా ఒక మళయాల అమ్మాయిని తోడూగా వెంటబెట్టుకొని కువైట్ నుండి వూర్లోకి దిగాడు. నేరుగా తనంటికి రాలేదు బయట లాడ్జీలో దిగి ఒక రోజంతా తిరిగి ఇల్లు చూసుకొని అందులో సంసారం పెట్టాడు ఆమె భర్త. ఈ సంఘటన శరఘ్ఘాతంలా తగిలింది వసంతకు. 12 ఏళ్ళు ఒంటరిగా భర్త కోసం ఎదురుచూస్తూ, ఎన్నో రాత్రులు నిదురపట్టక.. ఎన్ని అవస్థలు పడ్డదో...! ఏన్నెన్నో ఊహలను ఊహించుకుంటూ తన పెనిమిటీ గురించి ఆలోచిస్తూ బతికన జీవితానికి విలువే లేకుండా పోయందనిపించింది ఆమెకు. ఆ మనిషితో తన స్థితి గురించి అసలు ఏమని మాట్లాడాలో..ఎలా మొదలెట్టాలో.. అర్థం కాని అయోమయ పరిస్థితి. ఆకలి చూపుల నుండి తనను తాను కాపాడుకోవడానికి ఎంత శ్రమ పడిందో..!! నిద్రపట్టని రాత్రిల్లు తనను తాను సంబాలించుకోవడానికి ఎన్నెన్ని అవస్థలో..! తన ఆశలు, కన్న కలలు, వేదనా భరితమైనా విరహ వేదనా చెప్పినా అర్థమవుతుందా అతనికి..! అతని సమక్షం లేకుండా 12 ఏళ్ళు పాటు గడిపానే..కాని... అతను ఏ కాస్త తోడు లేని బ్రతుకును కూడ భరించలేక వెంటనే ఒక తోడును వెతుక్కున్నాడు..! ఆ విషయమే భరించలేకపోతున్నది. ఇంత జరిగినా తన చూట్టూ వున్న బందువులు కూడ అతనినే సమర్థిస్తున్నారు..అందుక్కారణం  డబ్బు..!  " జరిగిందేదో జరిగిపోయింది గొడవ పడకుండా సర్దుకుపోవాలి.. జీవితం అంటే ఇదే ..ఇలాగే వుంటుంది. తప్పదు రాజీ పడాలి "  వసంతకే హితబోదనలు చేశారు.
  చివరకు రాజి పడక తప్పలేదు.. కారణం.. వసంతకి ఆర్థిక స్వేచ్చ లేదు, కనీసం సంతోషంగా గడపడానికి పిల్లలు కూడ లేరు.. పిల్లలు పుట్టే వయసు దాటిపోయింది ఆమెకు. ఏదో బతుకుతున్నా అంటే బతుకుతున్నా అన్న రీతిలో వుంది వసంత జీవితం. ఎక్కువ కాలం మళయాల అమ్మాయితోనే గడిపేవాడు...  అక్కడి ఇంట్లోనే పిల్లలు కూడ పుట్టుకొచ్చారు.. మెల్లి మెల్లిగా మళయాల అమ్మాయి సంసారమే గుర్తింపు పొందిన కుటుంబంగా మారింది.  వాళ్ల పిల్లలు కూడ పెద్దవారైయ్యారు.. ఆ సమయంలోనే ఒక రాత్రి గుండెపోటుతో భర్త మరణించాడు.. వున్న ఒక బందం కూడ పోయింది. ఇప్పుడు పూర్తిగా మళయాల కుటుంబమే  అఫిషయల్‌గా అన్ని కార్యక్రమాలు జరిపించారు.. ఏమి చేయాలన్నా వారినే సంప్రదించేవారు.. చివరకు ఎవరికి ఏమి కాని తనొక అనాధ అయ్యింది.. ఒక్క సారి గడచిన తన జీవితాన్ని తిరిగి వెనక్కి చూసుకుంటే తన జీవితంలో అంత శూన్యమే కనపడుతున్నది, ఏ ఆనందాలు కాని గుర్తించికోతగ్గ సంఘటనలు కాని లేవు. కనీసపు ఒకరి భార్యను అనో లేక మనిషిని అనో గుర్తింపు కూడ లేదు..వయసు పెరిగే కొద్ది చుట్టూ వున్న ప్రపంచం కూడ వీరిని పరిగణలోకి తీసుకోవడం మానేస్తుంది.. అదింకా వసంతను బాద పెట్టేది..మెల్లి మెల్లిగా తనో ట్రాన్స్‌లో ఉన్నట్లుగా ప్రవర్తించడం మొదలెట్టింది.. అది ఎంత వరకు వచ్చిందంటే... తనలోకి ఒక దేవత ఆవహిస్తున్నది..అని...అది ముదిరి..ముదిరి తనో దేవత అనే విదంగా హిస్టీరియాలా ప్రవర్తించసాగింది.. అదే చుట్టుపక్కల అమ్మలక్కలకు అలవాటయ్యింది. ఎప్పుడంటే అప్పుడు  పూనకం వచ్చినట్లూ ఊగిపోయేది.. అందరు తనను మొక్కుతూ..నిమ్మకాయలు.. నోట్లో కుక్కుతూ  " అమ్మా తల్లి.. శాంతించు..శాంతించు..ఏమి కావాలి తల్లీ " అంటూ తనను బతిమాలుతూ ఊగిపోతుంటే.. అందులో తన ఆనందాన్ని..సంతృప్తిని, గుర్తింపుని వెతుక్కోసాగింది వసంత.
       అసలు వసంత జీవితం ఆమె ప్రమేయం లేకుండానే కొనసాగింది.. ఒక్క వసంతే కాదు మన ప్రపంచంలో చాలా మంది జీవితాలు కూడ అదే విదంగా వుంటాయి, మనుషుల జీవితాలను చుట్టు వున్న ప్రపంచం, సంఘమే నిర్దేశిస్తుంది. వాళ్ళు ఎలా బతకాలి..ఏవిదంగా జీవించాలి, వాటికి ఆచారాల పేరుతో నియమాలు, చట్రాలను బిగించి ఒక నమూనాని తయారు చేసి పెడుతుంది అంతే అది నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్లు అందరూ పాటించాల్సిందే. అలా పాటించిన వారిని  " దూషిస్తుంది, బహిష్కరిస్తుంది, సంఘ వ్యతిరేకి అంటుంది.. సంస్కృతిని కించపరుస్తున్నారు అని ఆరోపిస్తుంది, లోకమంతా ఒక దారి అయితే నీది ఉలిపిదారినా అని వెక్కరిస్తుంది..అవహేళన చేస్తుంది.
  కొద్దిగా వసంత జీవితాన్నే లోతుగా చూస్తే.." ఆమెకు తెలీకుండానే ఎవరో నిర్దేశించిన చట్రంలో బిగింపబడింది..’ పలానా నమూనా లాగ బతుకు సాగిస్తేనే  అదొక అద్భుతమైన జీవితమని,సమాజానికి అంగీకారమైన బతుకు అని దానికే అంతులేని గౌరవాలు, గుర్తింపులున్నాయనే భావనలో వుండిపోయింది.. అలాంటి జీవనం లేకుండా జీవించడం అన్నది ఆమోదయోగ్యమైనది కాదనే అపోహలో వుండిపోయింది. అసల్లాంటి జీవితం లేనిదే జీవితం కాదు అన్న భావజాలంలో కొట్టుకపోయింది. తనకో భర్త వున్నాడన్న భావన, గుర్తింపు తనకో ఆభరణం అనుకున్నది. పిల్లలు, సంసారం ఇవన్ని లోకంలో జరిగే సహజ సిద్దమైన పరిణామాలు అన్న భావనలో వుండి పోయింది.. ! అవి లేని జీవితం ఒక జీవితమేనా.. అని సందేహం ఆమెలో..! అవి జీవితంలో ఒక భాగమే కాని అవే జీవితం కాదు అన్న సత్యం తెలుసుకోలేకపోయింది. ఒక్క సారి ఆమె భర్త విషయమే గమనించండి..! అతను తనకిష్టమొచ్చినట్లు జీవించాడు.. సంఘం నిర్దేశించిన కట్టుబాట్లు, నియమ నిబందనలను తుంగలో తొక్కాడు..తనకు నచ్చిన విదంగా నడుచుకున్నాడు..! తనకున్న బాద్యతలని విస్మరించాడు, మరెవరు అతన్ని ఆక్షేపించలేదు..!
   మరి అలాగే వసంత కూడ భర్త అనే ఉనికి ఉంటేనే జీవితమా..? లేకుంటే లేదా...? భర్త లేకుండా తన జీవితం తాను జీవించలేదా...? అని తనను తాను ప్రశ్నీంచుకోలేదు... !  అదే ఉత్పన్నమై వుండుంటే తనో హిస్టీరియా పేషంట్‌లా మారుండే అవకాశాలుండేవి కావు..! తన జీవితం తనిష్టం తనకు నచ్చినట్లుగా జీవించొచ్చు..! తనకిష్టమొచ్చినట్లు వుండొచ్చు..! తనకో జీవితం వున్నది..అది తనకు మాత్రమే సొంతం. తన ఆనందాలు తనవి తప్ప మరొకరివి ఏమి కావు...అని అనుకునేంత పరిస్థితి కూడ వసంతకు లేదు..కారణం ఆమె అరకొర చదువు చదివిన ఒక సగటు మహిళ. అదే కాదు అలా ఆలోచించుకోవడానికి కూడ అవకాశమే లేని వాతావరణం ఆమె చుట్టూ వున్నది.
   నా ఆలోచనలోనే చాముండేశ్వరీ దేవాలయానికి చేరుకొన్నాము. ఆడవారంతా జరిగిన సంఘటన గుర్తుపెట్టుకొని చాముండేశ్వరినీ ప్రార్థించారు.. " తల్లీ ఇందాక  పెద్ద అపరాధం జరిగిపోయింది, మమ్మల్ని క్షమించి మాపై ఆగ్రహం చూపకుండా శాంతించు తల్లీ "  అని వేడుకున్నారు. తిరుగు ప్రయాణంలో అందరూ ఒక ఆలోచనకు వచ్చారు.." ఇప్పుడు బస్సుకు ఎటువంటి ప్రమాదం జరక్కుండా కిందకు చేరుకోగలిగితే దానిక్కారణం వారు చేసిన పూజలు.. వేడుకోలు.. అట..! ఏదన్న ప్రమాదం  జరిగితే నేను చేసిన అపచారం కారణంగానే జరుగువచ్చు " ఒక ఆర్డర్ పాస్ చేశారు.. నేను నవ్వి సరే అంటూ తలూపాను...
   మొత్తానికి ఏమి జరక్కుండానే క్షేమంగా మైసూర్‌కి చేరుకున్నాము.. అందరూ ’హమ్మాయ్య ’ అంటూ ఊపిరి పీల్చుకొన్నారు.

     
          నేను పెరిగిన ప్రాంతంలోనే " గ్రామ కక్షల " అనే ఒక రకపు జాడ్యం ఉందనుకనేవాడిని...! ఎప్పుడైతే ఈ కప్ప తనుండే బావి నుండి పక్కనున్న మరో బావిలోకి ఎగిరి వచ్చిపడిందో అక్కడున్న మరో రకపు జాడ్యాన్ని కొద్దికొద్దిగా గుర్తించసాగింది. అవును మరి..రాయలసీమ ప్రాంతంలో ఉన్న గ్రామకక్షలు  ( ఫ్యాక్షన్ ) ఆధిపత్యం కోసం మూర్ఖత్వంతో కూడిన కారణాలతో అవర్భించాయి.. దానిక్కారణాలు నాకు తెలిసినంత వరకు కొన్ని చెప్పగలను.. నిత్య కరువు వలన గ్రామాలలో చేయడానికి పనుల్లేక నాలుగాళ్ల మండపం వద్ద కూర్చోని పొద్దుపోని మాటల్లోంచి జనించిన పౌరుషాల నుండి కొన్ని రకాల కక్షలు పుట్టుకొస్తే..మరి కొన్ని అడుగు నేల కోసం, ఏ మాత్రం విలువ చేయని పశువులు వేసిన " పేడ " కోసం, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో పుట్టుకొస్తాయి. అవే తరతరాలను నాశనం చేస్తున్నాయి. ఇవి రాయలసీమ ప్రాంతపు జాడ్యం ఒకటైతే.. మరికొన్ని....

      ఓ 20 ఏళ్ళ క్రితం నేనుండే బావినుండి మా పొరుగున వున్న  హైదరాబాద్ అనే మరో బావిలోకి దూకాను. మొదట్లో అందరిలాగే నాకు కాస్త తికమకగా ఉన్నా..తర్వాతర్వాత మెల్లిగా అవగతం అవడం మొదలెట్టింది.  బస్‌స్టాప్‌లో నిలబడి అమాయకంగా నగరాన్ని గమనిస్తున్న యువకల్ని అకస్మాత్‌గా కొందరు జీపుల్లో వచ్చి కిడ్నాప్ చేస్తుండడం నేను నిత్యం కాకపోయినా తరచుగా చూస్తూ వుండే వాడిని.. వాటికి కారణాలు అప్పటికే నాకు పరిచయం అయిన కొంతమంది తెలంగాణ ప్రాంతపు మిత్రుల ద్వారా ( ఈ " ప్రాంతాల " పదం నాకు మొదట్లో వాడుకలో అలవాటు లేదు గాని ప్రస్తుత పరిస్థితుల్లో నాలో వచ్చి చేరిన భావ దారిద్ర్యం ) తెలుసుకున్నప్పుడు విధ్యుత్ఘాతం తగిలినంతగా ఉలిక్కిపడేవాడిని. వారిమాటల్లో వారి వెతలు తెలిసేవి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ " ఎన్‌కౌంటర్స్" జరిగినా, ఉపాధికోసం వచ్చి నగరంలో ఉన్న తెలంగాణ యువకులకు వారి ఇంటినుండి ఉత్తరాల ద్వారానో లేక చుట్టుపక్కల ఉన్న వారికి ఫోన్ ద్వారా " ఇక్కడ ఎన్‌కౌంటర్స్ జరిగాయి..ఇప్పట్లో మన వూర్లకు రాకండి..అక్కడే ఉండండి పండుగలొచ్చినా సెలవలొచ్చినా అక్కడే ఉండండి " అంటూ సమాచారం అందజేసేవారు. వూర్లకొస్తే ఎత్తుకపోయి " ఎన్‌కౌంటర్ " చేయడానికి చాలావరకు ఆస్కారముంటుంది... అలానే చాలా వరకు జరుగుతూనే వుంటాయి. అదే ఉద్దేశం వారి తల్లితండ్రులది. మా వూరిలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల మీద అవగాహన లేకపోయినా.. తెలంగాణ ప్రాంతపు నక్సలిజం మీద అవగాహన దినపత్రికల ద్వార తెలియడం వేరు ప్రత్యక్ష్యంగా చూడడం వేరు. నిజాం నుండి సాయుధపోరాటం ద్వారా విముక్తి పొందిన తర్వాత " నల్ల దొరల " విశృంఖల దాస్యంలో, వికృత చేష్టలలో నలుగుతూన్న పరిస్థితుల నుండి ఉద్భవించిన తిరుగుబాటు తనం మీద " నక్సలైట్స్ " అనె ముద్ర పడిందన్న విషయం నేను కొత్తగాచెప్పనవసరంలేదు..తెలుగువారికందరికీ తెలిసిన విషయమే.. ఈ దొరలు తమ నియంతృత్వపు దోరణిలతో అక్కడున్న ప్రజలను హీనాతి హీనంగా హింసిస్తూ చూడటం అదొక జాడ్యం ఆ ప్రాంతానికి. బహుశ ఈ జాడ్యం ఉత్తర భారతదేశం నుండి ప్రాకిన విదానమేమో..? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ఇలా.. మిగతా ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో పట్వారి, పఠాన్‌ల వర్ణ వ్యవస్థ అనాధిగా అధికారం చెలాయిస్తూ ఉన్నది.
       నేను మీడియాలో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా సన్నిహిత మిత్రుడు అయిన తెలంగాణ మీడియాసహచరుడి వూరికి వెళ్లాను, వరంగల్ దగ్గర గూడూరు తాలుకా అనుకుంటాను.. వారింటికి పోయినాక ఒక పదినిమిషాలకు ఆ వూరి దొరనుండి పిలుపొచ్చింది " మీ ఇంటికి ఎవరో కొత్తమనిషి వచ్చిండంట కదా..! తోల్కోని రమ్మని చెప్పిండు దొర " సెలవిచ్చాడు వచ్చిన మనిషి, నన్ను దొర ఇంటికి తీసుకుపోవడం నా మిత్రుడికి ఇష్టం లేదు.. వాళ్ల ఇంట్లో వారు నాకు ఎలా చెప్పాలో అని తర్జన భర్జన పడుతున్నారు..నాకూ వెళ్లడానికి ఇష్టం లేదు..దానికి కారణం నా చెప్పులు నా చేతుల్లో పట్టుకొని దొరముందు నించోవాలట..దొరగడిలో..! చివరకు దొర ఇంటికి వెళ్లకుండానే ఆ వూరినుండి బయలదేరి వచ్చేశాను.  దొరతనం.. ఫ్యూడలిజం..నియంత్రుత్వం అవన్ని ఈ ప్రాంతపు జాడ్యాలు.

  ఇక మూడవ ప్రాంతం..! ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయటి ప్రపంచంలో ఒక అన్నపూర్ణగా, నాగరికతకు ఆనవాలుగా కీర్తి తెచ్చిన ప్రాంతం కోస్తా, సర్కారు తీరప్రాంతాలు. మేథావులు, పండితులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. నీరు సంవృద్దిగా ఉన్న ప్రాంతాలలో..ఆర్థికాబివృద్ది హెచ్చుస్థాయిలో ఉంటుంది. ధనం ఎక్కడ పుష్కలంగా ఉంటుందో అక్కడ కళలు, కళాకారులు పుట్టుకొస్తారు. ఇదంతా వాస్తవం.నిజం. బయట ప్రపంచంనుండి..ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్లి కోస్తా ప్రాంతాలలో తిరిగే వారికి అక్కడి నీరు, ఎటు చూసినా కనుచూపుమేరా కనపడే పచ్చని పంటలు..." పచ్చని చేలా పావడ గట్టి.. కొండమల్లెలే కొప్పునబెట్టి వచ్చే దొరసాని " అన్న వేటూరి వారి పల్లవి గుర్తుకు వస్తుంది...చూసే వారికి ఈర్షపడేంతగా...!! జీవితానికి ఇంతకన్నా ఇంకేమి కావలి.. అనిపిస్తుంది అక్కడి వాతావరణం.. నిజమే బయట నుండి చూస్తే అలానే అనిపిస్తుంది..నేను కూడ అలాగే అనుకున్నాను...కాని..!!  మనుషులకు ఎటువంటి ఘర్షణ లేకుండా జీవితాన్ని సుఖంగా జీవించడం అన్నది  సప్పగా ఉంటుందేమో మరి..! అంతెందుకు.. ముస్లీములు, క్రిస్టెయన్స్ భారతదేశంలో లేనప్పుడు, కేవలం భారతీయులే ఉన్న కాలంలో వైష్ణవులు..శైవులు అంటూ వర్గాలుగా విడిపోయి తన్నుకొన్నారు.. మరీ అంత సుఖంగా జీవించడం మనకు అంత రుచించదు కదా..?  బయట నుండి చూసే వారికి ఇక్కడేమి లేదు..అంతా బాగు..బాగు అనిపిస్తుంది..కాని....!!
   మరి ఈ కప్ప ఎప్పుడైతే కడప బావి నుండి హైదరాబాద్ అనే బావిలోకి వెళ్లిందో..అక్కడే కోస్తా, సర్కారు ప్రాంత బావి జీవితం కనపడసాగింది...! అక్కడి ప్రజలు కులాలవారిగా.. వర్గాలుగా విడిపోయి జీవనం సాగిస్తున్నారులా అనిపిస్తుంది... కాస్త లోతుగా చూస్తేనే ఆ విషయం స్పష్టమవుతుంది. హైదరాబాద్‌లో మీడియాలో చేరిన సమయంలో కొంత మంది కోస్తా ప్రాంతపు మనుషుల పరిచయం సమయంలో కరచాలనం చేస్తూ ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటాము కదా...! ఆ సమయం నా పేరు చెప్పగానే..ఎదుటి మనిషి.." ఆహ  మీ పూర్తి పేరు ఏంటి..? " అని అడిగాడు.. నేను " పూర్తి పేరు ..? " అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టాను. ." అదే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు చివరన కూడ తోక ఉంటుంది కదా అది చెప్పండి " అని అడిగారు..! నాకది కొత్త అనుభవం నా ఊహ తెలిసినప్పటి నుండి మా బావిలోనే ఉండటం మూలాన మాకు ఇంటి పేరు లేకుండా మాకున్న నామదేయం చెప్పడమే అలవాటున్న బావిలోనే పెరిగాము.. సో.. నాకది కొత్తగానే అనిపించింది..కాని వారు అలా అడగడానికి వెనుకున్న కారణం కూడ వెంటనే స్పరించింది...! అది అర్థమై.." నాకు ఇంటి పేరు..వెనకా ముందు తోకలు ఏమి లేవండి "  అని చెప్పాను. నాకు ఇంటి పేరు చెప్పడం ఇష్టం లేదన్న సంగతి అర్థమై ...మౌనం వహించారు.  అలా ఇంటి పేరును బట్టి ఎదుటి వారి కులం ఏమటనేది వెంటనే గుర్తు పట్టి..సదరు వ్యక్తితో స్నేహం చేయవచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటారట..??. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే...రాయలసీమ ప్రాంతంలో ఇంటి పేరును బట్టి కులాన్ని గుర్తించలేరు.. ఒకే రకపు ఇంటి పేర్లు చాలా కులాలకు వుంటాయి.. అదీ కాక రక రకాల ఇంటి పేర్లు వుంటాయి.. అదీను కాక రాయలసీమ ప్రాంతంలో కులాల వారిగా వర్గాలుగా విడిపోయి జీవనం వుండదు. ఇక నాకున్న కోస్తా ప్రాంతపు ఎన్.ఆర్.ఐ మిత్రుల మాటల్లో బోలెడు విషయాలను విన్నాను. అసలు కాలేజి విధ్య అంతా కులాల వారిగానే సాగుతూ వుంటుందట..??! ఒక కులం వారు మరో కులం వారి కాలేజిల్లో చదవరట..చదివినా కులాల వారిగా హాస్టల్స్ ఉంటాయట..! ఒక కులం విధ్యార్థులు మరో కులం విధ్యార్థుల హాస్టల్ ముందు వెళ్తున్న సమయంలో ఎదురెదురు పడినా లేక ఎదురు పడకపోయినా వెళ్లె దారి మద్యలో మరో కులం వారి హాస్టల్ కనపడినా ఊరికూరికనే ఎటువంటి కారణాలు లేకుండా కొట్టుకొంటారట..??! వాళ్లు చెబుతుంటే నాకు వింతగా తోచేది...! మరి  బావి లోని ఈ " కప్ప" జీవితం వేరు కదా..!!
       ఒక సారి మీడియా కోసం ఒక డాక్యుమెంటరీ నిమిత్తిం అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో అమలాపురం సమీపంలో ఉన్న కొన్ని లంకల్లో డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నాము. నేనెక్కడ పనిచేసినా ఆ చుట్టుపక్కల వున్న అక్కడి వారితో మాటలు కలపడం, అక్కడి ఆచారాలు, సంస్కృతి, అక్కడి రైతుల విశేషాలు, ఏమేమి పండిస్తారో..ఎక్కువగా ఏమి పండుతుందో.., అక్కడి మనుషుల ఆలోచనలు తెలుసుకోవడం నాకున్న అలవాటుల్లో ఒకటి. అలానే ఆ లంకల్లో ఒకరిద్దరు బాగా సన్నిహితం అయ్యారు నాకు.. రెండు మూడు రోజులు అయ్యాక వారిలో ఒకతను.." సార్ మీ ఇంటి పేరు ఏటండి " అడిగాడు నన్ను..
 చిన్నగా నవ్వి " ఎందుకు " అని అడిగాను.
" మీ ఇంటి పేరు తెలిస్తే మీరు నాకేమి అవుతారే తెలుత్తాది కదాండి "  అన్నాడు. నేను పెద్దగా నవ్వాను. నా నవ్వు ఆర్థం కాక చూశాడతను.
" అయ్య బాబోయ్ అలా నవేత్తన్నారేటండీ " అడిగాడు
 " నా యింటి పేరు తెలుసుకొని ఏమి చేస్తావు "  అడిగాను
 " ఏముందండీ.. మీ ఇంటి పేరును చూసి మీరు నాకు బామ్మర్ధి వరస అవుతారా..? లేక వరసకు అన్నదమ్ములవతారా ..? అని తెలుత్తాది కదండీ "  అన్నాడు.
ఇంటి పేరును చూసి వీరెలా కులాన్ని, వరసల్ని గుర్తు పడతారో నాకెంత బుర్ర చించుకున్నా అర్థం కాలేదు..!  " తెలుసుకొని ఏమి చేస్తావయ్యా " అని అడిగాను
" మరే బామ్మర్ధి వరసయతే.. తాహతులో మీ అంత వున్నామా లేదా..? పౌరషం విషయంలో ఇక్కడ బావ బామ్మర్ధులకు ఎప్పుడు తగువులాటే.. ఏ విషయంలోనూ ఎవరికి ఎవరు తగ్గరు "  అంటూ ఏవేవో చెప్పుకుంటూ పోతున్నాడు.. చాలా వరకు నాకవేవి అర్థం కాలేదు గాని ఒక విషయం మాత్రం అర్థం అయ్యింది.. అనవసరపు పంతాలు..పట్టింపులు ఎక్కువుగా వున్నాయనే సంగతి అతని మాటల ద్వార అర్థమైంది.. బావా బామ్మర్ధులు ఒకరికొకరు తగువులాటల్లో తలలు పగలు గొట్టుకుంటారట.. అలా ఎన్నో చెబుతున్నాడు అతను. మద్యలో నేను అడ్డుకొని.." అలా తలలు ఊరికే పగలగొట్టుకునే బదులు ఒకే సారి చంపేసుకుంటే ఓ పనిపోతుంది కదా ..? " అని అడిగాను.
" అయ్య బాబోయి..అట్టా ఉత్తి పుణ్యానికే చంపేసుకుంటారాండీ.."  అడిగాడు.
" మరలా రోజూ కొట్టుకొంటూ చచ్చే కన్నా..ఒకే రొజు చంపేసుకుంటే పీడ పోతుంది కదా " అన్నాను. అంతే అతను మౌనం వహించాడు. ఇదొక అనుభవం నాకు.

   ఇలాంటివి చాలానే వున్నాయి అనుభవాలు..! ఇక అంతర్జాలంలో చెప్పనవసరం లేదు..కులాల వారిగా చీలిపోయి ఎంత బూతులు తిట్టుకుంటూ వుంటారో..! ఏదన్న ఒక విషయం మీద వ్యాసం లేక కామెంట్ రాస్తే అంతే అది నచ్చని వారు వ్యాసాన్ని అందులోని విషయాన్ని గ్రహించకుండా ఆ వ్యాసం రాసిన వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం.. నీవు పలాన కులంవాడివి కావున కులగజ్జి అంటూ తిట్టడం..! మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు..ఎందుకిలా జనాలు ఉన్నారనీ..? తర్వాతర్వాత అర్థమైంది ఏమిటంటే.. కోస్తా,  సర్కారు ప్రాంతంలో చాలా వరకు జనజీవనం కులాల వారిగా విడిపోయి వున్నదనీ..! అలాగే జీవనం సాగిస్తున్నారనీ..పెద్దలను చూసి వారిల్లల్లో వున్న పిల్లలు కూడ వాటికి బాగా అలవాటు పడిపోయి.. ఊహ తెలిసినప్పటి నుండి కులాల విభజన వారి మనస్సులో బాగా నాటుకపోయి అలా పెరిగి పెద్ద అవుతున్నారనే విషయం అవగతమవుతున్నది.  చివరకు కళారంగంలో కూడ ఈ కులబావన పాతుకపోయిందనిపిస్తుంది.. కులాల వారిగా అభిమానులు.. అభిమానాలు తయారయ్యాయి. నిరుడు సంవత్సరం పాటల రచయత వేటూరి గారి మరణం సమయంలో కూడ ఒక మగానుభావుడు ( మహానుభావుడు ) వేటూరి పాటలను కులం కోణం నుండి విశ్లేషించాడు నవతరంగంలో. ఇంతకన్న భావధారిద్ర్యం ఉంటుందా..? ప్రతి విషయాన్ని కులం కోణం నుండే చూస్తున్నారు.. చివరికి తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని కూడ.

   మరొక సంఘటన..! అక్కడెక్కడో ఉత్తర భారదేశంలో పుట్టి పెరిగిన ఒక తెలుగమ్మాయి. తన విద్యనంతా ఉత్తర భారదేశంలో అభ్యసించి. తర్వాత పి.జి మాత్రం తన మాతృభాష ప్రాంతంలోనే చేయాలనే తలంపుతో  తన మూలాలను వెదుక్కుంటూ వైజాగ్‌కు వచ్చి ఆంధ్రా యూనవర్శిటీలో చేరితే...! అక్కడి కులాల కుమ్ములాటలు చూసి  షాక్ అయ్యింది. " ఏంటండి.. ఎంతో ఆశతోనూ..తెలుగు బాష మీద మమకారంతోనూ.. నా మూలాలు ఇక్కడే ఉన్నాయనే వస్తే..! ఇక్కడేంటీ...!! నా ఫ్రెండ్స్ నాకో వార్నింగ్ ఇచ్చారు ’కలిస్తే ఏదో ఒక కులం వారితో కలువు అంతే గాని మూడు కులాలవారితో సమానంగా మెలగాలంటే మాత్రం కుదరదు  ’అని అన్నారు.. అదేమి గొడవో నాకు అర్థం కాలేదు.. నాకు అందరితోనూ కలవాలనే ఉంటుంది ఏమి చేయనూ..? ప్చ్..ఇక్కడి కంటే నాకు నార్త్ ఇండియానే బావుంది " అని చెప్పింది. ఆ అమ్మాయి కూడ అగ్రవర్ణ కుల వర్గమే కాని అక్కడున్న మూడు కులాల గ్రూపులో ఈ అమ్మాయి కులం లేదు. అదీ సంగతి.  ఇది ఇక్కడి కుల జాడ్యం.

      నిజానికి కులంగజ్జి, కులాభిమానం... ఇవన్ని నిజాలనుకుంటున్నారా.? అలా అనుకుంటే అంతె.. చారులో లెగ్ ఏసినట్లే..! ఎవరికీ వరి వారి కులం మీద అభిమానం ఉందనుకుంటె అంతె...! అంతకన్న మూర్ఖత్వం ఏది వుండదు...! మనిషికి " తను " అన్నది ముఖ్యం... అంతే కాని కులం, ప్రాంతం, మతం ఇవేమి కావు. " నా, నేను " వీటి తర్వాతే ఏవైనా.. కాకపోతే ఈ " నా, నేను " లు బయటి సమాజంలో చాలానే కోకొల్లలుగా ఉంటాయి..మరి వాటి మద్యలో " నేను " లు తమ మనుగడలు.. ఆస్థిత్వాన్ని కాపాడుకోవడం ఎలా..? అలా వెతుకులాటలో దొరికనవే.. కులాలు, మతాలు, ప్రాంతాలు అనబడే ఆలంబనలు. ఈ " నేను " లు బయట సమాజంలో ఒంటరిగా మనుగడ సాదించడంలో " భయాలు " ఎక్కువ..సో...వాటికో ఆధారం కావాలి..ఆలంబన కావాలి..అంటే ఒక సమూహం..ఉండాలి..! ఈ కులం అనే సమూహం వలన " నేను " అనే ఈ ఆస్థిత్వం తన భయం నుండి బయట పడుతుంది...! అంతే కాని నిజ్జంగా కులతత్వం అన్నది ఒక మిధ్య..నాణ్యానికి మరో కోణం ఉన్నది.. దానికో ప్రత్యేక వ్యాసంలో...

            విచిత్రమేమిటి అంటే ఈ మూడు రకాల జాడ్యాలు కేవలం ఈ మూడు ప్రాంతాలకే పరిమితం కాదు..మిగతా అన్ని ప్రాంతాలలోనూ ఉన్నవే.. గ్రామ కక్షలు ఒక్క రాయలసీమలోనే కాదు భారతదేశమంతా గ్రామాలలో ఉన్నవే.. కాకపోతే  వాటి రూపాలు వేరుగా ఉంటాయి, వాటి తీవ్రతలు మారుతూ వుంటాయి..ఆయా ప్రాంతాలను అనుసరించి.. అలాగే కుల తత్వం ఒక్క సర్కారు, కోస్తా ప్రాంతంలోనే కాదు మిగతా రెండు ప్రాంతాలలోనూ ఉన్నవే కాకపోతే అక్కడున్న ప్రాముఖ్యతలను బట్టి వాటి రూపాలు మరో విదంగా వుంటాయి, వాటి తీవ్రత వేరుగా ఉంటుంది.. అలాగే తెలంగాణ దొరల నియంత తత్వం విషయంలో కూడ అంతే. అన్ని చోట్ల ఫ్యూడలిజం ఉన్నదే..!
  అవన్ని మరచిపోయి.. ఒకరినొకరం మరొకరి గురించి రంద్రాణ్వేషణ చేసుకుంటూ.. ఎవరి వారికున్న రంద్రాలున్న విషయం మరచిపోయి ఒకరినొకర్ని తిట్టుకుంటూ బతుకుతున్నాము. మూడు ప్రాంతాలలో మూడు రకాల రంద్రాలున్నాయి...!  ఎవరివి వారికి అన్నీ బాగా తెలుసు..... తెలిసినా కూడ తెలియనట్లే నటిస్తూ.... తమకున్న రంద్రాలకు " లప్పం " పట్టించుకుంటూ ఎదుటి వారి మీద ద్వేషం కక్కుతున్నారు. హేళన చేస్తున్నారు..! మీకు సభ్యత, సంస్కారం, చదువు, విఙ్ఞానం మేము నేర్పాము అంటూ గొప్పలు చెప్పుకొంటూ ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటున్నారు.

     ఎక్కడైనా మనిషి మనిషే..    మనిషికుండే లక్షణాలు ఎక్కడైనా ఒక్కటే..! అది అమెరికా అయినా..ఐరాపా అయినా.. ఆసియా అయినా.. అవే ఉద్వేగాలు, మానవ సంబందాలు, ఆత్మీయత, అనురాగం, వాత్సల్యం, హింస, అసూయ, అనురాగం, ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ మనిషికి సంబందించినవే..! ప్రాంతాలనసరించి, కులాలననుసరించి మనుషులుండరని మనందరికీ తెలుసు అయినా కూడా వాటినిని పరిగణలోకి తీసుకోకుండా తెలియనట్లే నటిస్తూ..ఎదుటివారిమీద ద్వేషం కక్కుతూ వుంటాము.

        మన పాత సామెత ఒకటి ఉండనే ఉన్నది కదా..!! అదే.. ఒక వ్రేలు ఎదుటి వారి వైపు చూపిస్తే... మిగతా మూడు వ్రేల్లు మన వైపు చూపిస్తాయి అని..! కాబట్టి మన వైపు చూపిస్తున్నా ఆ మూడు వ్రేల్లు గురించి ఆలోచించండి తెలంగాణారాయలసీమకోస్తసర్కారు జనులారా..!!

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs