నేను ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న రోజులవి,  అనుకోకుండా  మా వూరిలో కొన్ని వ్యక్తిగతమైన సమస్యలు ఎదురవడంతో  వాటి పరిష్కారం కోసం మా వూరికి వెళ్లిపోయాను, ఒక పదిరోజుల్లో  పరిష్కారం అవుతుందనుకుంటే అది కాస్తా, ప్రతి పదిహేను రోజులకొకసారి పొడిగిస్తూ అలా  మూడు నెలలు కొనసాగింది నా సమస్య పరిష్కారం కావడానికి. ప్రతి పదిహేను రోజులకొకసారి నేను పని చేస్తున్న మీడియా యజమాన్యానికి నా పరిస్థితి వివరిస్తూ సెలవలను పొడిగించమని సెలవు చీటి పంపుతూ వుండే వాడిని.

   మూడు నెలల తర్వాత పరిస్థితి ఒక కొలిక్కి రావడంతో హైదరాబాద్ తిరిగి  వచ్చాను మీడియాలో నా ఉద్యోగం కొనసాగిద్దామని!! అయితే ఏ ప్రైవేట్ సంస్థ కూడ అలా మూడు నెలలు పాటు సెలవలు ఇవ్వరు. ఆ  అవగాహన వున్నవాడినే కాబట్టి దానిని యధాతదంగా అంగీకరించడానికి మానసికంగా సిద్దంగా వున్నాను. నాలుగంతస్థుల మా మీడియా ఆఫీస్ సముదాయం గ్రౌండ్ ఫ్లోర్లో వున్న నా డిపార్ట్మెంట్ హెడ్ ని  కలిసి నారాజీనామా విషయం గురించి ప్రస్తావించగానే, ఆయన  " ఆ అవసరం లేదయ్యా..... నీవు రాగానే పైన జనరల్ మేనజర్ని కలవమన్నారు, వెళ్లి ఒక సారి కలువు, నీకు నీవుగా తొందర పడి రాజీనామా చేయకు" అన్నారు.

   జనరల్ మేనజర్ని కలసి  "మిమ్మల్ని కలమన్నారు మా ఇన్ ఛార్జ్"  అని చెప్పి నా సంగతంతా వివరించాను. సావదానంగా అన్ని విని "సరే ఓ రెండు రోజు లాగి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని కల్సి మాట్లాడండి" అని చెప్పారు.  ప్రైవేటు, ప్రభుత్వం రంగ సంస్థలంటూ తేడా లేకుండా ప్రపంచంలో ప్రతి చోట వుండే గ్రూపులు మా కంపెనీలో కూడ వున్నాయి,  కుల, ప్రాంత, తేడాలంటూ వుండవు వీటికి, కేవలం ఏదో ఒక మానసిక వ్యాపకం ఉండాలి మనిషికి.. చేసే పని మీద శ్రద్ద, చిత్త శుద్ధి కన్న వీటి మీదనే ఎక్కువ ఆసక్తి ఈ జనాలకు, అదొక జాడ్యం...! ఇలాంటి గ్రూపులకు దూరంగా వుండే మనుషులు కూడ అక్కడక్కడ వుంటారుగా...  అలాంటి వారిలో నేను ఒకడినే. అలా మా కంపెనీలో కూడ వున్న రెండు గ్రూపులకు చెందని వాడిని నేను కాబట్టి, రెండు గ్రూపులు వారు మాకు సంబంధం  లేదు అంటే..మాకు సంబంధం లేదు ఈ మనిషి అంటూ నన్ను వెలేశారు ఇలాంటి సమయంలో. నాకెలాగు వాటి గురించి పట్టింపు లేదు కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేవు.... భ్రమలు లేవు ఈ విషయంలో.

  రెండు రోజుల  తర్వాత అసిస్టెంట్ జనరల్ అండ్ టెక్నికల్ మేనేజర్ని కలవడానికి వెళ్తే..  "మరో రెండు రోజులాగి రండి కలసి మాట్లాడదాం" అన్నారు, అలా రెండు మూడు సార్లు అయ్యాక..చివర్లొ కలిసి చర్చలు జరిగాయి, అవి ఎలాంటివి అంటే..  " మీరు ఏ సమస్య మీద ఇన్ని రోజులు ఇంటి వద్ద వున్నారు..? ఎందుకు..అన్ని రోజులు వుండాల్సి వొచ్చింది" లాంటి ప్రశ్నలు !! అన్నిటికి సమాధానం ఇచ్చాను కాని నా వ్యక్తిగత సమస్య యెక్క కాంటెంట్ ఏమిటన్నది చెప్ప లేదు..నాకిష్టం లేకపోవడంతొ..!  ఆ విషయాన్ని ఆయన పదే పదే గుచ్చి గుచ్చి అడిగే వారు. ఊహూ.....ఎన్ని సార్లు అడిగినా నేను తప్పించేవాడిని తప్ప చెప్పే వాడిని కాదు..అది పుర్తిగా నా వ్యక్తిగతం, అందరికీ తెలియనవసరం లేదనే భావనతో. అలా రెండు మూడు సార్లుగా మా మద్యన చర్చలు జరిగాయి..కాని నేను ఉద్యోగంలో కొనసాగాలా వద్దా అనే విషయం ఒక కొలిక్కి రావట్లేదు....!  ఆ చర్చల్లో  ’ఈ ఉద్యోగం నీకెంత వరకు అవసరం..? ఈ ఉద్యోగం లేకపోతే ఏమి చేయాలనుకొంటున్నావు’ లాంటి విషయాలు కూడ అడగారాయన.....కొద్ది కొద్దిగా నాకు అర్థమయ్యింది..ఇక చాలు ఈ నాన్పుడు ధోరణి అని అనుకొని..ముందునుండే రాజీనామా  ఉత్తరం జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను, ఎప్పుడు అవసరం వచ్చినా  ఇవ్వొచ్చనే ఉద్దేశంతో.

 వెంటనే నేరుగా  జనరల్ మేనేజర్ వున్న చాంబర్లోకి వెళ్లాను, ఆయన నన్ను చూడగానే.. " ఏంటి మీ విషయం ఇంకా అయిపోలేదా,  జాయిన్ కాలేదా ?" అడిగారు.  మా మద్యన జరిగిన చర్చల సారాంశం మొత్తం చెప్పాను, దానికాయన  "మీరు సరిగ్గా  అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని  కన్విన్స్ చేయలేకపోతున్నట్లున్నారు"  అన్నారు,  "లేదండి వున్నవిషయాలన్నీ  చెప్పాను,  అంతకన్న నా వద్ద మరేమిలేవు"  నా సమాధానం.  "లేదు..లేదు మీరు సరిగ్గా అయన్ని కన్విన్స్ చేయనట్లున్నారు ..ఒక సారి ఆలొచించడి"  అన్నారు.  నాకు పూర్తిగా విషయం బోధపడింది...  "అంటే ఏ విధంగా   కన్విన్స్ చేయాలీ..?? ఏడ్చి... కన్నీళ్లు పెట్టుకొని... ఆయన కాళ్లు పట్టుకొంటే కానీ..కన్విన్స్ కారా..? అప్పుడూ కాని మీలో ఉన్న ఇగో సంతృప్తి చెందదా..?? సారీ సర్ నేనా పని చేయను" అన్నాను, నా మాటలకు ఆయన మొదట తెల్లబోయినా ఎన్నో ఢక్కా మొక్కీలు తిని ఈ స్థాయికి ఎదిగిన క్రమంలో నాలాంటి వారిని ఎందరినో.. ఎన్నో రకాల మనుషులు చూసి ఉన్న ... ఆ అనుభవంతొ  ఒక్క క్షణంలో వెంటనే సర్దుకొని "ఏం మాట్లాడుతున్నారు మీరు..? ఏమైనా అర్థమున్నదా?"  ప్రశ్నించారు. నేను మౌనంగా నా జేబులొ నుండి రాజీనామ ఉత్తరం తీసి ఆయన అందించాను.  ఆయనది చదవగానే.. "ఓహో..మీకు ఈ ఉద్యొగం అవసరం లేదన్న మాట" అంటు ఏమి మాట్లాడాలొ తెలీక అలా పలాయన వాదపు మాట వాడేసారు. "నా వృత్తే  అది...ఎక్కడైనా నేను చేయాల్సి ఉద్యోగమే అదైనపుడు  అవసరం లేకుండా ఎలా వుంటుంది..? నాకు అవసరం వున్నది కదా అని మీ అహాల్ని సంతృప్తి పరిచేంతగా నేను ఆత్మను చంపుకోలేను .... సారీ సర్"  అంటు మరో మాట మాట్లాడకుండా బయటకొచ్చాను.

  ఈ మేనేజర్స్ తత్వాలు నాకు చర్చల సమయంలో అర్థమయ్యింది, నాకు ఉద్యోగం చాలా అవసరమయి వుండాలి, కాని వారు ఉద్యోగంలో కొనసాగడం కష్టం అని చెప్పగానే నేను కళ్ల నీళ్లు పెట్టుకొని కాళ్లా వేళ్లా పడి బతిమాలాలి, అప్పుడు వారి అహం సంతృప్తి పడుతుంది.....దానితో వారు నా మీద సానుభూతి చూపిస్తూ.... జాలితో ఆ ఉద్యోగంలో కొనసాగించడానికి  అవకాశమిచ్చినట్లు ఇస్తారు.. మరో పక్కన రెండు గ్రూపులున్నాయి  కాబట్టి నేను మేనేజ్మెంట్ వారికి  నమ్మిన బంటుగా డిపార్ట్‌మెం‍ట్‌లో వుంటూ అక్కడ జరిగే విషయాలు చేరేవేయాలి.. ఒకే దెబ్బకు రెండు  పిట్టలు!! ఒకటి....మన పట్ల సానుభూతి చూపి వారి అహాన్ని తృప్తి పరుచుకోవడం, రెండవది నమ్మినబంటుగా పడుంటారుగా కదా..ఇది వారి ఆలొచన.

  ఇలా ఇక్కడే కాదు మనం చాలా చోట్ల ఇలాంటి సంఘటనలే చూడవచ్చు... మనకు ఏదైనా ఒక కావలసిన పని వుండి అది చేయవలసిన చోటకు వెళ్లి ఎన్ని సార్లు విన్నవించినా ’అంత సులభంగా ఆ పని కాదయ్య”  ససేమిరా అంటూ తలుపే మనుషుల వద్ద కాస్త ఏడుపు మొహంతో మాట్లాడివారికి కావలసింది వారికిస్తే గాని..పని అవదు.! తర్వాత తమ తోటి ఉద్యోగస్తులతో మాట్లాడే సంధర్భాలలో మన విషయం ప్రస్తావన రాగానే..  "ఆ...వాడి ఏడుపు చూడ లేక....పాపం పోనీలే అని చేసాను ఆ పని" అంటూ సెలవిస్తారు. అక్కడ ఏడవాలిసిన పని వుండదు..వారు చేయాల్సిన వారి విధి నిర్వహణను పక్కన బెట్టి..ప్రవర్తిస్తారు.కాని వీళ్లేదో జాలి పడి సానుభూతి తో  పని చేసినట్లు బయటకు చెప్పుకోవాలి. అదో తృప్తి కొంత మందికి.   తమ అహాన్ని సంతృప్తి పరుచుకొనే ఇదో రకపు సానుభూతి...!

                                                                 ***********

  మరో రకపు సానుభూతి..కథ....కమర్షియల్ గా ఇదెలా ఉపయోగపడుతుందో చూడండి.... ! కేరీర్ ఎదుగుదలలో సానుభూతి కూడ ఒక ప్రధాన భూమిక  వహిస్తుందేమో..!!?.

దారిద్ర్య రేఖ దిగువన ఉండే  మనుషుల కోసం, అలానే ప్రకృతి పరంగా అధార పడి జీవనం సాగిస్తున్న కొన్ని జాతుల, తెగల మనుగడ కోసం ఐక్యరాజ్య సమితి కొన్ని అంతర్జాతీయ చట్టాలను రూపొందించింది.  ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆ చట్టాలను గౌరవిస్తూ పాలన సాగించాల్సిందే..ఈ విషయంలో.!  అయితే ఈ తెగలు, జాతుల జీవనపాది మీద సెజ్ ల  పేరుతోనో లేక అభివృద్ది పేరుతోనో .. దెబ్బ తీస్తుంటాయి చాలా దేశాలు..కారణం ఎక్కడో మారుమూలన ఉండే ఈ తెగల, జాతుల గురించి బయట ప్రపంచానికి చాలా వరకు తెలియదు..అలాంటిది ఎక్కడో వున్న ఐక్యరాజ్య సమితికి కూడ వీటి గురించి పెద్దగా  సమాచారం వుండదు. ఇలాంటి విషయాల మీద కొన్ని అంతర్జాతీయ సంస్థలు పని చేస్తూ వుంటాయి, ఎక్కడ ఈ తెగల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందో గుర్తించి వాటిమీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చిత్రీకరించి, జాతీయ, అంతర్జాతీయ టి.వి చానల్లో ప్రసారం చేస్తూ ఐక్యరాజ్య సమితీ దృష్టికి తీసుకెళ్లతారు. ఇవన్ని చాలా స్వచ్చందంగా నిర్వహిస్తూ వుంటాయి కొన్ని సంస్థలు.

  అలాంటి ఒక అంతర్జాతీయ సంస్థ కొరకు డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణ కోసం ఐదేళ్ల క్రితం ఆ ప్రాజెక్ట్  డైరెక్టర్ తో  కలసి థాయిలాండ్ వెళ్లాను, బ్యాంకాక్ నుండి అ సంస్థ యెక్క అక్కడి మరో ఇద్దరి కో ఆర్డినేటర్ లతో  కలసి మరో పది గంటల పాటు బస్సులొ ప్రయాణం చేసి మరసటి రోజు ఉదయం "పాంగా" అనే జిల్లా చేరుకొన్నాం. అక్కడి ప్రాంతీయ భాష మాకు తెలీదు కాబట్టి ఆ కో-ఆర్డినేటర్స్ మాకు, అక్కడి మనుషులకు మద్యన వారధులు, అనువాదకులు  కూడాను.

  థాయిలాండ్‌లో 2004 లో వచ్చిన సునామీ  వలన ఒక తెగ చాలా వరకు అంతరించిపోయింది, ఆ తెగ కొన్ని నెలలు పాటు సముద్రంలో చేపల పట్టడంలొ వుండిపోతారు, తర్వాత మరికొన్ని నెలలు మాత్రమే భూమి మీద జీవినం సాగిస్తారట, అలాంటి తెగలొ ఒకే ఒక 20 ఏళ్ల కుర్రాడు సునామీ  వచ్చిన సమయంలో మరో నగరానికి ఏదో  పని మీద వెళ్లడంతో..ఆ సునామి ప్రమాదం నుండి అతనొక్కడే మిగిలిపోయాడు. అంతే గాక అతనికి ఉన్న  కొద్దిపాటి భూములను కూడ అక్కడి ప్రభుత్వం "సెజ్" ల పేరుతొ లాక్కొంటున్నారు,  అతని తెగ పూర్తిగా తుడిచి పెట్టుకపోయింది, మరో పక్క  అతనికి ఉన్న  ఒకే ఒక జీవనాధారాన్ని కూడ అక్కడి ప్రభుత్వం లాక్కుంటోంది . అతనితో పాటు  మరి కొన్ని విషయాల మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసి..అంతర్జాతీయ వేదికల మీద పెట్టాలనే ఉద్దేశం ఈ సంస్థది. ఈ సెజ్ ల  గొడవ ఒక్క మన దేశానికే వున్నదని అనుకొన్నాను అప్పటి వరకు!! చుట్టుపక్కల దేశాల మీద కూడ చాలా ప్రభావమే వున్నదని ఈ సంఘటనతో నాకు అర్థమయ్యింది.

 ఇక ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గురించి కాస్త వివరించాలి, ఈయన ఒక సత్ససాంప్రదాయ  కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి అయినా.. ఆయనలో చాలా వరకు కమ్యూనిస్ట్ భావాలు కనపడేవి, ఎన్నో పుస్తకాలు చదవారని, ఎంతో మేథస్సు వున్న మనిషని ఆయన మాటల్లొ అర్థమయ్యింది నాకు, అతనితో మాట్లాడుతుంటే..చాలా విషయాలు తెలియనవి తెలుసుకొంటూ వున్నాను..చాలా వరకు నేను వినడంలోనే వుండిపోయేవాడిని, నాతో మాట్లాడుతున్న కాలమంతా ఆయన చేతిలో సుదీప్ చక్రవర్తి రాసిన  "రెడ్ సన్" పుస్తకం ఉండేది..మద్య మద్యలో చదువుతూ వుండేవారాయన.అయితే అతను ఏ విషయాన్నైనా వివరిస్తున్న సమయంలో మధ్య మధ్యలో ఒక తమాషైనా మాట మాట్లాడే వారు , అతను చెబుతున్నప్పుడు నేను వింటున్న సమయంలో నా మొహంలో ఏ భావాలు కనపడట్లేదో లేక....వెర్రి మొహం వేసుకొని నించున్నట్లు కనపడే వాడినో  ఏమో కాని  "ఆహా..ఏమి లేదు నిన్ను ఎడ్యుకేట్ చేయాలని ఇవన్ని చెబుతున్నాను అంతే, ఏమనుకోవద్దు" అని పదే పదే ఇలా అంటూండే వారు.

  ఓ రెండు రోజుల పాటు అక్కడ వారి జీవన విదానం గురించి, నివాసాల సముదాయాల గురించి, సముద్రంలొ చేపల వేట ఎలా సాగిస్తారో వాటి విషయాల మీద కొన్ని దృశ్యాలను అక్కడక్కడ వున్న కొన్ని దీవుల్లో  చిత్రీకరించాం.  తర్వాత ఆ కుర్రాడి భూముల మద్యన వున్న ఇంటి వద్ద ఇంటర్‌వ్యూ చేయడం మొదలు పెట్టాం, అతని భాష మాకు..మా భాష అతనికి తెలియవు, ఇంగ్లీష్ కూడ రాదు మద్యలోదుబాసీలు గా  వున్న కోఆర్డినేటర్స్ ద్వారా ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నాము.

   అతను తన కుటుంబాన్ని సునామీలో  పోగొట్టుకొన్న వైనాన్ని, తనొక్కడే మిగిలిపోయినా తన భూముల్ని తనే పండించుకొంటు జీవనం సాగిస్తున్న విధానాన్ని వివరంగా చెప్పుకొస్తున్నాడు..భాష తెలియక పోయినా అతని మాటల్లోని భావం మాకు అర్థమవుతున్నది, నిజంగా తన వాళ్లందరినీ పోగొట్టుకొని ప్రపంచంలో ఒంటరిగా వుండటమన్నది, మనకు పెద్దగా అనిపించక పోవచ్చు కానీ  అనుభవిస్తున్న ఆ కుర్రాడికి  తన ఒంటరి తనపు భాద తాలుకా తెలుస్తుంటుంది, అయినా కూడ ఎక్కడా తన బాధను  వ్యక్త పరచట్లేదు, అలానే సెజ్ లో  భాగంగా కోల్పోతున్న తన భూములను తనకే మినహాయించమని కోరుకొంటున్నాడే కాని ఎక్కడా కూడ ఏడుపు రావట్లేదు! కనీసం  ఏడుపు మోహంతో  దైన్యంగా కూడ మాట్లాడటం లేదు.  చూస్తున్న మాకు కాస్త లోపల ఎక్కడో కదిలిస్తున్నది కాని ఆ కుర్రాడిలొ మాత్రం ఎటువంటి దుఃఖం, బాధ  వ్యక్తం కావట్లేదు. అలానే తన మాటల్లో ఎక్కడ కూడాను తమను పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం చేయట్లేదు. ప్రభుత్వం గురించి చాలా గౌరవంగా మాట్లాడుతూ తన పరిస్థితిని అర్థం చేసుకొని తన భూములను తనకే వదిలేయమని కోరుకొంటున్నాడు. నాకు చాలా గొప్పగా అనిపించింది అతని తత్వం, అదే విషయాన్ని నా వెనుకే కూర్చోని వున్న మా డైరెక్టర్తో  "చాలా బాగా మాట్లాడుతున్నాడు కదా "  అన్నాను

  దానికి ఆయన...."హయ్యో...అంతా బాగానే చెప్పాడు కాని... కొద్దిగా కూడ కన్నీళ్లు రావట్లేదు, కనీసపు ఏడుపు  మొహం కూడ పెట్టట్లేదు ..హ్మ్...ప్చ్..అలా కాదు కాస్త ఏడిస్తేనే చూసే వాళ్లకు బాగా ఎఫెక్టివ్ గా  వుంటుంది, మనకు కూడ గొప్పగా చేసినట్లు పేరు వొస్తుంది, ప్చ్ ఏడ్చి, కన్నీళ్ళు పెట్టుంటే చాలా బాగుండేది....అయ్యో....ఎఫెక్ట్ పోయిందే.."  అంటూ తల అడ్డంగా ఆడిస్తూ బాధ  పడుతున్నాడు. నాకు ఒక్కసారిగా అర్థం కాలేదు..ఏమి కోరుకొంటున్నాడు ఇతను...? తను చేస్తున్న ఫిల్మ్ కి మంచి ప్రశంసలు రావాలంటే మనుషులు ఏడవాలా..? దాని నుండి వచ్చే సానుభూతే ఇతని ప్రతిభకు తార్కాణమా ? మంచి కంటెంట్ వుండి ఒక అసలు సిసలైన  "మనిషి" ని ఇంటర్‌వ్యూ చేస్తున్నాము అని అనిపించింది నాకు, మరి ఇతనేంటి..దీని నుండి ఏమి కోరుకొంటున్నాడూ....? తను చేసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ పది మంది చూసి కంట తడిపెట్టి  "వావ్ చాలా బాగా చేసావయ్యా" అని  సానుభూతి తో  కూడిన ప్రశంసలు, అభినందనలు  వస్తే... అప్పుడు కానీ తనొక గొప్ప ప్రాజెక్ట్ చేసినట్లుగా భావించడా? సానుభూతే ఇతని ప్రతిభకు రుజువా?

 నాకు ఒకే సమయంలో పరస్పర విరుద్ధ  భావాలున్న మనుషుల తత్వం అనుభవం ఎదురైంది అనిపించింది. ఒకరిది ఖేదం..మరొకరిది వ్యాపారం..! వాస్తవంగా తన వాళ్లందరినీ పొగొట్టుకొన్న ఒక కుర్రాడు కంట తడిపెట్ట కుండా మాట్లాడడం అన్నది మనకు అదొక గొప్ప నిబ్బరం కలిగిన మనిషిగానూ..మనోధైర్యం వున్న మనిషిగానో అనిపిస్తుంది. అది మన భారతీయ జీవన విధానంలో పెరిగిన ఒక కోణం నుండి చూస్తే అలానే అనిపిస్తుంది, ఇలాంటివి ఏ కోణమనే రంగుటద్దం లేకుండా  యధాతదంగా ఈ థాయ్ కుర్రాడిని చూస్తే, అది అతి సర్వ సాధారణం  వారికి. వారి జీవన విదానమే అలా వుంటుంది..ఎక్కడ జాలి కోసం ఏడవరు, ప్రతీది ఎదుర్కోవడానికి అలవాటు బడ్డ మనుషులని అర్థమవుతుంది, అక్కడ ఈ మనో నిబ్బరం, మనోధైర్యం లాంటి భావాల గల పద బంధాల  అవసరమే వుండదు. .  కాని మనం మన భారతీయ జీవన విధానం లో పెరిగిన కోణంలో నుండి చూస్తే  "అబ్బా ఎంత నిబ్బరం గల మనిషి ఆహా.." అంటూ గొప్పగానో..  అబ్బుర పడుతూనో  చూస్తాం... అలా అనిపిస్తుంది మనకు.

  మరి ఎంతో మేధస్సు వుండి, ప్రపంచ చరిత్రల మీద, వ్యక్తుల మీద ఎంతో అవగాహన వున్న ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన ఈ మనిషి యెక్క తత్వం చూడండి ఎలా వున్నదో..?? సానుభూతితో తన ఎదుగుదలకు మెరుగు దిద్దుకోవాలనుకొంటున్నాడు. మేధస్సు వేరు  మనిషి తత్వం వేరు..అన్నది ఇలాంటి అనుభవాల ద్వారా మనకు అవగతమవుతుంది, ఇవెప్పుడు కలవని రెండు రైలు  పట్టాలు లాంటివి, దేని దారి దానిదే అని నిరూపిస్తుంది !  అక్కడేమో ఏమి చదువుకోని, అసలు బయట ప్రాపంచిక ఙ్ఞానమే లేని ఒక కుర్రాడి తత్వం దీనికి పూర్తి భిన్నంగా వున్నది.  పెరిగిన జీవన విధానం  కూడ మనుషుల మీద చాలా ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం.

 అంటే ఈ సానుభూతి వ్యాపార వస్తువుగా ఎంతగా  ఉపయోగ పడుతున్నదో......మనం నిత్యం టి.వి లలో ప్రతిభా పరమైన పోటీలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ ప్రోగ్రాములన్నీ  మల్టీ కెమరాస్ సెటప్ తో షూట్ చేస్తుంటారు. ఆ పోటీలలో ఎవరొ ఒకరు ఓడిపొక తప్పదు...అప్పుడు ఓడిపోయిన ఆ సదరు వ్యక్తి/పిల్లలో  ఖచ్చితంగా ఏడుస్తారు, వెంటనే ఈ ఫొగ్రాంని రికార్డ్ చేస్తూ నిర్వహిస్తున్న దర్శకుడు వెంటనే తన పి.సి.ఆర్ అనే రికార్డింగ్ గది నుండి  టాక్ బాక్ తో కెమరా మన్  కిసూచనలు ఇస్తాడు..." హే మ్యాన్  వెంటనే వెళ్లు... ఆ ఏడుస్తున్న మొహాన్ని క్లోజ్ అప్ చూపించు..జూమ్ చేయ్..పాస్ట్ మ్యాన్ ఫాస్ట్....ఏడుపు ఆగిపొతుంది..ఆగిపోయేలోపల జూమ్ వెళ్లూ... పట్టుకొ ఆ ఏడుపుని "  అంటు తొందర పెడుతూ వుంటారు.  ఆ ఏడుపు సీన్ ఎక్కడ మిస్ అవుతామో అనే భయం..! ఆ ఉద్వేగాలను టి.విలలొ చూపి..తమ తమ రేటింగ్స్ పెంచుకొవాలి..అది అలా జరిగితే ఆ ఫోగ్రాం చేస్తున్న డైరెక్టర్ కి ఆ ఫోగ్రాంకు కూడ మంచి ఫేరొస్తుంది.. "చాలా బాగా చేసావయ్యా...గుండెలు పిండేసావు..అందరివీ..! మంచి పేరొచ్చింది"  అనే ప్రశంస కోసం, అభినందన కోసం పడే పాట్లు  అవి ! అక్కడి మనుషుల ఉద్వేగాలతో ఎటువంటి అనుసందానం వుండదు వీరికి..కేవలం  మనుషుల ఉద్వేగాలతో వ్యాపారం చేయడానికి బాగా అలవాటు పడ్డారు. ఎంత ఉద్విగ్నిత వుంటే అంత లాభాసాటి, గొప్పగా చేసావనే మెచ్చుకోలు...మనుషులకు..!  ఒకరి ఏడుపుల సానుభూతితో మరొకరికి ధనలాభం..వ్యాపారం.

  మరొ సానుభూతి కథతో ఈ కథను ముగిస్తాను తొందరలో............

    చాలా సంవత్సరాల క్రితం...బెంగళూర్‌లో ఒక ప్రొఫిషనల్ కోర్స్‌లో సీట్ సంపాదించడం కోసం బాగా తిరుగుతున్న రోజులవి. ఆ సీట్ కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాకాని దొరకట్లేదు.కారణం..వారు నిర్ణయించుకొన్న నిబంధనలను అనుసరించి  ఖాళీగా  ఉంచుతున్నారే కాని వాటిని  భర్తీ చేయట్లేదు. నాకు ఆ కోర్స్ మీద విపరీతమైన ఆసక్తి..!  ఆ క్రమంలో ప్రతి రోజు సాంకేతిక కార్యాలయం,  అలానే కాలేజి చుట్టూ ప్రదక్షిణలు  చేస్తున్నాను. అలా తిరుగుతున్న రోజులలో నాలాగే్ అదే సీట్ కోసం ప్రయత్నిస్తున్న మరొకతను జతిన్ పరిచయం అయ్యారు. అతనితో అతని తల్లిగారు కూడ రోజు వస్తున్నారు. అలా ప్రతిరోజు కలుస్తుండడంతో బాగా పరిచయం అయ్యారు. అందరం కలసే ఖాళీ గా  మిగిలి ఉన్న సీట్స్‌ని భర్తీ చేయమని విఙ్ఞప్తి చేయడానికి అక్కడి సెక్రటరియేట్, అలానే తదిత మంత్రుల శాఖల చుట్టు ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు తిరుగుతూ వున్నాం.

     తమిళ వారైన జతిన్ కుటుంబం,  ఉత్తరాదిలొ డిఫెన్స్‌లో పని చేసి పదవీ విరమణ సమయంలొ బెంగళూర్‌ వచ్చి స్థిరపడ్డారు. ఆ కారణం చేత అతనికి కర్నాటక కాలేజీలొ సీట్ రావట్లేదు..అందునా కన్నడిగులకు తమిళలకు జాతి వైరం ఎప్పటి నుండో  ఉన్నదాయే .... అదొక కారణం.!! 

 జతిన్‌కు ఈ ప్రొఫిషినల్ కోర్స్ మీద అమితమైన ఆసక్తి, కాని సీట్ దొరకట్లేదు.అతన్ని  ఏయిర్ ఫోర్స్‌లో చేర్చాలని అతని తండ్రి అభిలాష, అది జతిన్‌కి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేకపోయినా కొడుకు ఇష్టాన్ని గౌరవిస్తూ అతని తల్లి అతనికే మద్దుతు పలుతున్నది. అందుకే ఆమె కూడ కొడుకుతో  కలిసి సీట్ కోసం తిరిగే వేటలో కాలేజికి వస్తున్నారు. ఒకే విషయం గురించి అందరం కలసే తిరగతున్నాం కాబట్టి నేను వారి కుటుంబానికి దగ్గర అయ్యాను. జతిన్‌ కుటుంబానికి ఒక్క తెలుగు తప్ప మిగతా హిందీ, కన్నడ, తమిళం, ఆంగ్లం భాషలన్నీ అనర్గళంగా మాట్లాడుతున్నారు, నాకు కన్నడ అంతంత మాత్రమే, ఆ సమయంలొ్ బేడ,బేకు, ఊట ఆయత్తా ఇలాంటి బతకడానికి అవసరమైన పొడి పొడి పదాలు తప్ప మరో వాక్యం  ఎంత తన్నుకొన్నా కూడ మాట్లాడ లేను..కాబట్టి..నాకొచ్చిన బట్లర్ ఇంగ్లీష్‌తోనే వారి బుర్ర తింటూవుండేవాడిని..పాపం ఏమ్ చేస్తారు భరించక. నేను వారి జాతివాడినే కదా..సీట్ కోసం తిరగడంలొ..!!

    ఒక రోజు జతిన్ రాలేదు కాని జతిన్ తల్లి గారు మాత్రమే వచ్చారు కాలేజీకి. జతిన్ నాన్న ఏదో పని వుండటంతో బయటతీసుకెళ్లారు అందుకే రాలేదన్న విషయం తెలిపారావిడ. కాలేజీలో ఒకరిద్దరిని కలిసాక. ఇక అదే కాంపౌండ్‌లో వున్న సాంకేతిక కార్యాలయం వైపుగా వెళ్లాం. అక్కడ కాలేజీలలో సీట్స్ భర్తీ చేయడానికి సంబందించిన ప్రిన్సిపల్   సెక్రటరీ ఉన్న కార్యాలయంలోకి అడుగు పెట్టాం కాని సెక్రటరీ లేరు ఆ సమయంలో. 

ఇక అక్కడున్న ఆయన పి.ఏ. ను మిగతా స్టా‌ఫ్‌తో కలసి మేమొచ్చిన విషయం గురించి చెబుతూ..కూర్చున్నాం.  నాకంటే జతిన్ తల్లిగారే ఎక్కువ మాట్లాడుతున్నారు కారణం నాకు వచ్చిన  బేడ..బేకు లాంటికొద్ది పాటి  కన్నడ పదాలు తప్ప మరేది తెలియకపోవడంతో.

  కాసేపటికి ఆవిడ మెల్లి మెల్లిగా ఏడవడం మొదలు పెట్టారు నోటికి కొంగు అడ్డం పెట్టుకొంటూ....అక్కడున్న స్టా‌ఫ్‌తో పాటు నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను.  బహుశ కొడుకు ఇష్టపడుతున్న ఒక ప్రొఫిషినల్ కోర్స్‌లో సీట్ సంపాదించలేకపోతున్నానే అనే వ్యధలో అలా కన్నీళ్లు వొస్తున్నాయేమో అనిపించింది. ఆమె ఏడుపులకు ఆఫీస్ స్టాప్ కూడ ఆవిడ వైపు "అయ్యో పాపం" అన్నట్లు సానుభూతిగా చూస్తున్నారు, తన కొడుకు రెండేళ్లుగా ఈ కోర్స్ గురించి తిరుగుతున్నారని..ఈ కోర్స్ చదవాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడని, అతని తండ్రికి ఇది ఏ  మాత్రం   ఇష్టం లేకపోవడంతో ఆయన దేనికీ సహకరించడం లేదని...అందువల్లే తానూ అందుకే  కొడుకుతో కలిసి ఇలా తిరగవలసి వస్తోందని.... ఇలా అన్ని విషయాలు వివరిస్తున్నారు ఆమె. ..,!

 తిండి నిద్ర కూడ ఆలోచించకుండా ప్రతి రోజుఎవరెవరిని కలుస్తున్నది, పొద్దు పొద్దున్నే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన విషయాలు... ఇలా అన్ని వివరాలు ఏవి వదలకుండా ఆ ఏడుపులోనే ఏకరవు పెడుతూ కోన సాగిస్తున్నారు .  స్టాఫ్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా అదే సానుభూతి మొహాలతో  ఫ్రీజ్ అయి వున్నారు.  

ఒకరిద్దరు మాత్రం  "అయ్యో..ప్చ్..పాపం" అంటు శబ్దాలు చేస్తున్నారు.  కాసేపటికి ఆమె ఉదృతి తగ్గి వాతావరణం చల్ల బడింది. ఇక మాట్లాడవలసిన విషయాలు ఏమి లేకపోవడంతో ఖాళీల భర్తీ గురించి, మేము తిరుగుతున విషయం గురిమ్చి పదే పదే చెప్పి బయటకు వచ్చాం ఇద్దరం.

   బయట కాంపౌండ్‌లోకి నడుస్తుండగా ఆమె  మాట్లాడటం మొదలు పెట్టారు  " అక్కడ స్టాఫ్ వద్ద అలా ఎందుకు ఏడ్చానో తెలుసా...? ఎందుకంటే మగాళ్ల కన్న ఒక స్త్రీ అలా తిరుగుతూ కన్నీళ్లు పెడితే ’అయ్యో పాపం ఎంత కష్ట పడుతున్నారో్ ’ అనే సానుభూతితో అయినా సీట్ రావచ్చేమో అనే ఉద్దేశంలో అలా కనీళ్లు పెట్టాను. జతిన్ నాతో ఈ రోజు వస్తానని చెప్పినా నేనే వద్దని చెప్పి ఒక్కదానినే వచ్చాను ఇందుకే "  నవ్వుతూ... ఒక గొప్ప సత్యం నాకు చెబుతున్నట్లుగా చెప్పారు. 

 అక్కడ ఆఫీస్ గదిలో ఎంతలా దుఃఖ వదనంతో వున్నారో... అసలు ఆ దుఃఖచాయలే కనపడకుండా ఇప్పుడూ కేవలం ఐదు నిమిషాలలో ఆవిడ నవ్వుతున్నారు తను చెప్పిన విషయానికి. ఇంతలో ఎంతలా వాతావరణం మార్పు అనిపించింది నాకు.

  అలా అని ఈ విషయాన్ని ఆవిడ ఏమి దాచుకోవట్లేదు, దాచుకొని మోసపుచ్చాలని ప్రయత్నించట్లేదు నా ముందు, హాయిగా బహిరంగంగా  చెప్పుకొంటున్నారు.  అందులో ఒకరిని ఏమార్చాలని  కాని మరొకటికాని లేదు.  కేవలం తన కొడుకుకు సీట్ సంపాదించాలి దానికి కావలసిన మార్గాలన్నీ వెతుక్కుంటున్నారు, అందులొ ఇది ఒక భాగం అని మాత్రమే అని భావనలో ఆమె వున్నారనిపించింది. 

ఇక్కడ నాకు మరో విషయం అర్థమయ్యీ కాక అర్థమవుతున్నట్లుంది...  చాలా ఏడుపుల వెనుక కారణాలు సానుభూతి ఆశించడం ఉంటుందా  అని..? 

..... అలా మాటల్లోనే.. నడుచుకొంటూ వస్తూ ఆ కాంపౌండ్‌లో వున్న ఒక పెద్ద చెట్టు కింద వున్న సీమెంట్ బెంచి మీద కూర్చున్నాం.

  అప్పుడు  చెప్పడం మొదలు పెట్టారు జతిన్ పరిస్థితి గురించి. ఇంట్లో తండ్రి కొడుకుల మద్యన జరుగుతున్న కోల్డ్ వార్.. గురించి !  ఈ సంవత్సరంలొ సీట్ సంపాదించుకోలేకపొతే తను  చెప్పినట్లు ఏయిర్ ఫోర్స్‌లో చేరాల్సిందే అని జతిన్‌కు తండ్రి ఆల్టిమేట్ ఇవ్వడం....తండ్రి వార్నింగ్‌తో కొడుకు కుమిలిపోవడం .ఇదంతా చూస్తూ తానూ తట్టుకోలేక పోవడం... మొత్తం వివరించారు..!

ఈ రోజు ఇద్దరం కలిసే వద్దామని అనుకొన్నా...  జతిన్‌ని వొద్దంటూ ఆపి తనొక్కరే రావడం, ఇక్కడ తను స్త్రీ కదా... మగాళ్ల కన్న ఒక స్త్రీ ఏడిస్తే మరింత సానుభూతి వస్తుందనే ఉద్దేశంతో వచ్చానని విషయాలు చెప్పుకొచ్చారు.

  ఆఫీసులో జతిన్ తల్లి ఏడుస్తున్నప్పుడు అక్కడున్న స్టాఫ్ అంతా తమ తమ పరిధులలో   ఒక సానుభూతి ని మొహాల్లో  ప్రకటించారు  ఈమెకు. అంటే వాళ్ళు కూడ తమ జీవితంలొ రోజూ  కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి ఏడుపులు  చూస్తూనే వుంటారు, వారు కూడ వీటికి అలవాటు పడిపోయి ఒక సానుభూతి మొహాన్ని వీళ్లకు పడేసి ఎవరికి వారు బాగా నటించేస్తున్నారు. 

 ఒకరిద్దరు నిజంగా స్పందించొచ్చు.  చాల వరకు ఏడ్చే ఏడుపులన్నీ  కేవలం సానుభూతి కోసమే అనే భావం అర్థమయ్యింది నాకప్పుడు. అదొక తెలియని విషయం నాకు మొదటి సారిగా తెలిసింది.

                                                        **********

  ఇది జరిగిన ఓ రెండు మూడేళ్లకు అనుకొంటాను....!  మా వూళ్లో ఒక సంఘటన ఎదురైంది. నా మేనమామ ఒకతను  ’ఎమ్.ఎల్.ఏ వద్ద ఒక పంచాయితి వున్నది వెళ్తున్నాను, వస్తావా...  అని   పిలవడంతో నేను వెళ్లాను.   రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు కాని పాక్షికంగా వున్నారు. అప్పుడప్పుడు ఎమ్.ఎల్.ఏ తో కలుస్తూ వుంటారు నా మేన మామ, అలా పంచాయితీలు జరుగుతున్న సమయంలొ ఈయన పాల్గొంటూ వుంటారు.

  ఎమ్.ఎల్.ఏ ఆఫీస్‌లోకి ప్రవేశించాం, చిన్న కాంపౌండ్ ఉండి తర్వాత ఒక పెద్ద వసారా వున్నది, అక్కడే ఓ ఇరువై కుర్చీలు వున్నాయి ఓ పదిహేను మంది దాక రెండు వర్గాలుగా చెరో వైపు కూర్చోని వున్నారు.  ఎమ్.ఎల్.ఏ ఇంకా రానట్లున్నారు... ఆయన  కుర్చీ ఖాళీగా  కనపడుతున్నది.  

మన దేశంలొ ముఖ్యంగా మన తెలుగునాడులొ జరిగే పంచాయితీలన్నీ ఎక్కువగా ఆస్థి పంపకాలో లేక భార్యభర్తల మద్యన జరిగే గొడవలు, విడాకుల గురించే వుంటాయి. మహాభారతంలొ మంచికి గుర్తుగా పాండవులను చెడుకు గుర్తుగా కౌరవులను పెట్టి పెద్ద కౌరవ సభే జరుగుతూ ఉంటుంది...అప్పటి రచయతలు అలా మంచి చెడులకు ప్రతినిధులుగా రెండు వర్గాలను సృష్టించాడు..కాని నిజ జీవితంలో ఎప్పుడూ కూడ మంచి, చెడులు చెరో వైపు ఎప్పుడూ ఉండవు. రెండు వర్గాల వాదనలు వారి వైపు నుండి వింటే అన్ని కరెక్టేగానే కనపడతాయి మరి.  ఎటువైపు..న్యాయ అన్యాయాలున్నాయో కూడ అర్థంకాదు. ప్రస్తుతం జరుగుతున్నది ముగ్గురు అన్నదమ్ముల ఆస్థి తగాదాల పంచాయితి.


    కాసేపటికి  ఎమ్.ఎల్.ఏ వచ్చి కూర్చున్నారు. అక్కడున్న ఒక వర్గంలొ ఒకటి పెద్దన్నయ్య వర్గం, ఆయన తన భార్యతో సహా వచ్చారు పంచాయితీకి. మరొక వర్గంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆమె రాకతో ఇద్దరు తమ్ములున్న వర్గంలొ గుసగుసలు మొదలయ్యాయి.

 ఇన్నాళ్లుగా  కేవలం ముగ్గురు అన్నదమ్ములే పంచాయితిలొ కూర్చుంటున్నా...పెద్ద అతని భార్య .తన  భర్తకు వెనుకుండి పంచాయితీలో ఎలా మాట్లాడాలి, ఏవేవి విషయాలు చెప్పాలి, ఎదుటి వర్గం ఏ ఎత్తు వేస్తే తామేమి సమాధానాలు ఇవ్వాలి లాంటి విషయాలు సూచనలిస్తూన్నారే గాని, ఆమె మాత్రం ఎప్పుడు పంచాయితీ వైపు తొంగి చూడనేలేదు. 

అలాంటిది ఇప్పుడు ఆమే స్వయంగా పంచాయితికి రావడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడున్న ఇద్దరి తమ్ముళ్ల వర్గపు పంచాయితీ పెద్ద మనుషుల్లో. వారి గుసగుసలు నా చెవిన పడుతున్నా... నాకు అర్థమయ్యి అర్థం కాక అయోమయంలో వున్నా...నాలో వున్న మరో మనిషికి మాత్రం ఏదో అర్థమయ్యి నన్ను గెలుకుతున్నాడు. వాడికేదో అర్థమయ్యింది.  ఆ విషయమే నాకు చెప్పబోతుంటే  "యెహే ఆపు నీ గోల  కాసేపు వేయిట్ చేయి..అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు"  అని కసురు కొన్నాను.

  పెద్దన్నయ్య వర్గం వైపు చూస్తూ మొదట ఎమ్.ఎల్.ఏ నోరు విప్పారు, "ఇన్నాళ్లుగా పంచాయితీ జరుగుతున్నా ఇంకా ఒక కొలిక్కి రాలేదు మీ విషయం..ఏంటి.... ఏమ్ చేద్దామనుకొంటున్నారు"  అన్నాడు. ఆయన అలా అనగానే..పెద్దన్నయ్య భార్య  చెప్పనారంభించారు. " సర్  నేను మొదటి నుండి ఏమి జరిగిందో చెబుతాను మీరే ఒక నిర్ణయానికి రండి, నా పెళ్లి అయ్యే సమయానికి ఈయన తమ్ముళ్లిద్దరు స్కూల్ చదివే పిల్లలు, తల్లి తండ్రులు లేకపోయినా నేను తల్లిగా బాధ్యతలు  తీసుకొని పెంచాను ఇద్దరినీ..మాకంటూ ఏమి ఆలొచించకుండా డబ్బులన్నీ వీళ్ల చదువులకే ఖర్చు పెట్టాం, ఆ సమయంలో నేను సరిగ్గా చూడట్లేదనీ.. నన్ను వీళ్ల బంధువులు అందరు  ఎంతో ఆడిపోసుకొన్నారు, ఎన్నో పుకార్లు పుట్టించారు, నానా రకాలుగా బయట చెప్పుకొన్నారు. ....ఆ అవమానాలన్నీ భరించి వీళ్ల భాగోగుల కోసం ఆస్థింతా ఖర్చు చేసాం " ఈ మాటలుంటున్న సమయంలొ ఆమె గొంతు గద్గదమైపోయి వొస్తున్న ఏడుపును కొంగు అడ్డం పెట్టుకొని ఆపుకొంటున్నట్లు మాట్లాడుతున్నారు, ఆ సమయంలో అక్కడి వాతావరణం చాలా గంభీరంగా మారిపోయింది..అక్కడ కూర్చున్న మగాళ్లందరూ.. తమ్ముళ్లిద్దరి వైపు చూస్తున్నారు ఏంటయ్యా ఇది..... అనే చందాన.

  ఆమె తన ఏడుపులోనే.. "నేను అవి చేసాను, ఇలా చూసుకొన్నాను ఇంతంత ఖర్చు పెట్టాం"  అంటూ కొన్నిలెఖ్కలు చూపించారు. తర్వాత నెమ్మదిగా ఇక వున్న ఆస్థిలో ఆవిడే పంపకాలు చేయనారంభించారు,  "నాకు ఇద్దరాడ పిల్లలు అందులో ఒకమ్మాయి రెండు మూడేళ్లలో పెళ్లీడుకొస్తున్నది..వాళ్ల చదువులకు డబ్బులు కావాలి, కాబట్టి  నేను మాఇంటాయన తమ్ములిద్దరిని అన్నో అవమానాలు భరిస్తూ కూడ పెంచినందుకు మిగిలి వున్న బంగారంలో నా కూతిళ్లిద్దరికి సమానంగా ఇవ్వాలి,"  ఇలా ఆవిడ ఆ సానుభూతి భావంలొ అన్నీను ఎలా తనకు మాత్రమే చెందాలో  చెప్పుకొస్తున్నారు, పంచేస్తున్నారు. చివర్లో చేతికి అంటుకొని మిగిలున్న అన్నం మెతుకులు విదిలిచినట్లు ఆమె మరదులకు కొంత భాగం ఇచ్చారు. 

 అది ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదు.."ఇంకా చాలా వున్నది ఆస్థి..అన్నిటిని మా చదువుల కింద ఖర్చు చేసినట్లు చెబుతున్నారు కాని అదంతా అబద్దం" అంటు కొన్ని సాక్ష్యాలు కూడ చూపించారు.  అయినా పెద్దన్నయ్య భార్య  "అవన్ని వాళ్ల బందువులు చెప్పిన చెప్పుడూ మాటలు"  అంటూ ఏడుపు గొంతుతో కొట్టి పడేస్తున్నారు. ఆమె తన ఏడుపులొనే సానుభూతిని సంపాదిస్తూ  తనకు కావలసిన విదంగా ఆస్థిలొ సింహ భాగం చాలా తెలివిగా తనకు పంచేసుకొని మిగిలిన కొద్ది పాటి ఆస్థిని మరదులకు ఇస్తున్నారు, విపరీతమైన ఆశ ఆమెలో కనపడుతున్నది..ఆస్థిలో ఎక్కువ భాగం చాలా తెలివిగా కేటాయించుకొన్నప్పుడే  కనపడుతున్నది, అది బయటకు కనపడ కుండా  ఏడుపును ఆశ్రయించి..సానుభూతి ద్వార తాను పొందాలనుకొన్నది పొందడానికి ప్రయత్నిస్తున్నది.

  ఇంతలో నాలో ఉన్న మరో మనిషి బయటకొచ్చి డకనక డకనకా అంటూ చిందులేస్తున్నాడు.. "ఏంట్రా నీ గొడవ"  అని అడిగితే.. "నేను చెప్పలా  అప్పుడే....?  చూసావా నేను చెప్పిందే నిజం అయ్యింది, నాకు తెలుసు ఆమె ఎందుకొచ్చిందో ...!? హ..హ..హ..హ ఈ ప్రపంచం నిండా నిండుకొని వున్న స్త్రీ ఏడుపుకు చాలా విలువ వున్నది,  బాగా సానుభూతిని నింపారు, దానిని ఆసరాగా  తీసుకొని ఇలా పది మంది మగాళ్ల మద్యన జరిగే పంచాయితిలో ఒక స్త్రీ వచ్చి కూర్చోని మాట్లాడితే..ఇంకా ఆ సానుభూతికి మైలేజి వొస్తుందని తెలుసుకొని దానిని ఉపయోగించుకోడానికి వచ్చిందనే సంగతి నాకు ముందే తెలుసు గురువా "  అంటూ చిందులేస్తున్నాడు.

  ఇంతలో నాలోని మనిషి చెప్పిన భావాలకు అనుగుణంగానే మా ఎమ్.ఎల్.ఏ  " ఎందుకయ్యా మీ వొదిన్ని ఇట్లా ఆస్థుల పేరుతో బజారు కీడుస్తారు,  కాస్త చూసుకొని సర్దుకపోండి "  అన్నాడు. ఒక్కసారిగా ఆ తమ్ముళ్లిద్దరికీ ఏమి చెప్పాలో అర్థం కాలేదు..పరిస్థితి ఇలా మారిపోవడం వారికి మింగుడపడట్లేదు..చూస్తుంటే ఇద్దరు వాళ్లన్నయ్య లాగే మూగెద్దుల్లా వున్నారు.  విచిత్రమేమిటంటే పెద్దన్నయ్య భార్య అలా పంచాయితీకి ఎందుకొచ్చారో....అక్కడున్న మగాళ్లందరికీ ఆ విషయం బాగా స్పష్టంగా అర్థమయ్యింది, సానుభూతి కోసమే అని తెలుసు అందరికీను. కాని బయటకు మాత్రం ఆమె మాట్లాడిన మాటలకు సానుకూలంగానే ప్రవర్తిస్తున్నారు. అంటే లోకంలో అధికంగా ఏ భావానికి అమోదముద్ర వున్నదో దానికే వత్తాసు పలుకుతున్నారు.  తప్పదు అదొక అనివార్యమైన పని..వ్యతిరేకంగా మాట్లాడారో అంతే సమాజం చీల్చి చెండాడుతుంది.

   ఆ సమయంలో నేను కల్పించుకొంటూ  "బాగుందన్నా పంచాయితి చాలా బాగుంది, ఏడిస్తే చాలన్న మాట న్యాయ అన్యాయాలతో పనేమి లేదు. ఒక్క ఏడుపుతో అన్యాయం న్యాయం అయిపోతుందా..?"  అన్నాను.  నా మాటతో ఎమ్.ఎల్.ఏ తో సహా పెద్దన్నయ్య భార్య కూడ నా వైపు విస్తుపోతూ చూసారు. వెంటనే  " ఏమయ్యా .......ఇప్పుడేమి చేద్దామంటావు అయితే..?" అడిగారు తన సహజదోరణిలో చాలా నిదానంగా ఎమ్.ఎల్.ఏ.  ఈయన మాటలు చాలా నిదానంగా గూడ్స్ బండిలా ఒక్కో పదం గంభీరంగా మాట్లాడతారు .

  వెంటనే నేను ఆ ఇద్దరి తమ్ముళ్ల వైపు తిరిగి  "ఏమన్నా మీకు పెళ్ళిళ్ళు  కాలేదా"  అడిగాను. "నాకు  ఒక్కడికే అయ్యింది" అంటూ నడిపతను చెప్పాడు, "మరింకేం మీ భార్యను కూడ రేపు ఈ పంచాయితీకి పిలుచుకొని రా, ఆమె చేత కూడ నాలుగు ఏడుపులు ఏడిపించేయ్.. సరిపోతుంది, చూసారుగా ఇక్కడ ఏడుపులకు ఎంత విలువ వున్నదో, అప్పుడూ మీకు నాలుగు సానుభూతి మాటలు వొస్తాయి, దానితో పాటే మీక్కావలసిన ఆస్థిని పొందొచ్చు కదా.. ?"  అన్నాను.  

నా మాటలకు నిరసనగా పెద్దన్నయ్య భార్య నా వైపు చూస్తున్నది, ఆమె వేసిన పాచికను ఇలా బహిరంగ పరచడంతో .!  పాపం ఆమె ఉపాయం నావలన దెబ్బ తినడం భరించలేకపోతున్నట్లు  అసహనంగా అటు ఇటు ఆమె కదిలే కదిలికల్లో అర్థమవుతున్నది. ’వీడెవడ్రా ఇంతవరకు ఒక్కో ఇటుక పేర్చుకొంటూ వచ్చిన నా వాదనను ఇలా ఒక్క మాటతో కుప్ప కూల్చాడు ’ అన్నట్లుగా వున్నాయి ఆమె చూపులు.  ఆమె అనుకొన్నట్లే.. అయ్యింది.  ఎమ్.ఎల్.ఏ  నోరు విప్పారు

  నా మాటలతో పునరాలచనలో పడ్డ ఎమ్.ఎల్.ఏ  "ఇద్దరి వైపునుండి మీ మీ ఆస్థి వివరాలు ఇవ్వండి, దానిని బట్టి ముగ్గురికి సమానంగా ఎవరికీ అన్యాయం కాకుండా పంచడానికి ప్రయత్నిస్తాను. సరే రెండు రోజులాగి రండి ఆలోచించుకొని చెబుతాను "  అంటూ ఆ పంచాయితీని అర్థాంతరంగా ముగించారు ఆయన.

 ఈ కథకు పూర్తిగా వ్యతిరేకమైన, భిన్నమైన మరో రకపు సానుభూతి కథ కొద్ది రోజుల్లో .....!!

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs