.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

     బద్వేలు నించి తన అంతరంగిక అనుయాయి కొండన్న
 " అన్నా!  పదిరోజుల్నించి శివపురి రమణారెడ్డి జీపు ఒక్కటే తిరుగుతావుంది. దాంట్లో కూడా ఐదుమందికి మించిలేరు.. "
  విషయమేమిటో అర్థం కాలేదు చెన్నారెడ్డికి.  " అసలు సంగతేందో చెప్పారా ? "
  " నువ్వీడ సరిగ్గా వుండడం లేదుగదా !  వాల్లు గూడా ఎవురూరికి వాల్లు పోయినట్టుంది. "
 " అన్నదమ్మలయినా వుంటారు గదబ్బీ ! "
 " సగం మంది కనపల్లే.. నాకండ్లతో జూసినా.. ఇయ్యాలయితే వాడూ, బాలుడూ, ఎవురో యిద్దరు.. జీపంతా నలుగురే. రేత్రి గూడ కొందరు వూర్లకు పోయినారంట.. వాడిప్పుడు వొంటరి గాడయిండన్నా !  ఇదే సమయం.. వాన్ని బేస్తే పోలేదా ! "
 ఒక్క నిమిషం మౌనంగా వుండిపోయాడు చెన్నారెడ్డి.
 అతనికి ఏమి పాలుపోలేదు.
 " కుంట మాసులకు ఫోన్ జేసి చెప్పన్నా !  నువ్వు చెబుతేగాని వాల్లు కదలరు. మిగతాదంతా నేన్జూసుకుంటా. రేపు పొద్దుగుంకే యాలకు వాన్ని బద్దేలి చెరువు కట్టకు బలిస్తా.. నువ్వు మాకు అందుబాటులో వుండన్నా ! "  చెప్పాడు అవతల్నించి.
  " సరే.. సరే.. జాగ్రత్త.."
  అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడు.
 గుండెల్లో సన్నని కంపన మొదలయింది చెన్నారెడ్డికి.
 కోఠి...  వస్తువులు.. ప్రియురాలు.. భోజనమూ - అన్నిటినీ మరచిపోయాడు కొంతసేపు.
 కుంటకు ఫోన్ చేశాడు.
 తనకు కావలసిన వ్యక్తి దొరికాడు.
 అతనికి అన్ని విషయాలు చెప్పాడు.
  కొంత టెన్షన్‌గా వుంది చెన్నారెడ్డికి.
 శత్రువును లేపేందుకు మంచి  ఛాన్స్ దొరికింది. తనవాడు పటిష్టమైన వ్యూహంతో పని సాధిస్తాడో లేదోనని అనుమానం.
 కొండన్న మంచి వ్యూహాలు పన్నగలడు. నమ్మకంగా పని చేయగలడు, ఉత్సాహం వుంది. స్వామి భక్తి వుంది... కానీ వ్యూహాలు పన్నినంత పకడ్బందీగా ప్రణాళికను తుదకంటూ నిర్వహించలేడు.
  ఆ విషయాన్ని ఒకటి రెండు సార్లు తను గమనించాడు.
  గోపవరం నించి బద్వేలుకు వచ్చే దారిలో అప్పోజిషన్ వాన్ని ఒకన్ని నరికినపుడు, గొడవలకు సంబంధించిన వాడు కాదనే వుద్దేశ్యంతో పక్కనే వున్న వ్యక్తిని వదిలేశాడు.  తర్వాత వాడు సాక్షిగా మారేసరికి ఆ కేసునించి తప్పించుకోవటానికి ఎన్నో అగచాట్లు పడవలసి వచ్చింది.
  ఇట్లాంటి విషయాల్లో కేవలం మేధావితనమే గాదు - కొంత మూర్ఖత్వం కూడా అవసరమే. గుండె ధైర్యం ఒక్కటే గాదు - కొంత కరకుదనం కూడా వుండాలి. అడవికి అగ్గి బెడితే ఎండు కర్రతోటి పచ్చ కర్ర కూడా కాలుతుంది.. సమదృష్టితో చూసే కసాయితనం కూడా వుండాలి.
 ఈ గుణాలేవి కొండన్నకు లేవు.
 వానికి మరొకర్ని తోడుంచాలి.
 ఎవరైతే సరిపోగలరు..?
  చాలా సేపు ఆలోచించాడు.
 గతంలో అయితే తనే సూచనలిచ్చి నడిపించేవాడు.
 ఇప్పుడెట్లా ?
 అతని దృష్టి తాలుకా సాంతం గిరగిర తిరుగుతూ వెదకింది.
 చివరకు అతని దృష్టిలో ఒకే ఒక వ్యక్తి నిలిచాడు.
భీమునిపల్లె పెంచలయ్య...  ఇట్టాంటి విషయాల్లో ఘటికుడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేసే రకం. కాని పెంచలయ్యకు ఫోన్ సౌకర్యంలేదు సమాచారం ఎలా అందజేయాలి..?  తన చిన్నకొడుకు హర్ష ద్వార సమాచారం  అందించాలి.... తప్పదు వాన్ని పంపాల్సిందే.
 భార్యకు తెలీకుండా వాడికి విషయం చెప్పి సమాచారం అప్పజెప్పే భాద్యత అప్పగించాలి.
  వీలైతే రాత్రికే తను ప్రయాణమై పోవాలి.
 ఇంటికి ఫోన్ పెట్టాడు.
 సులభంగానే లైన్ దొరికింది.
 అవతల ఫోన్ ఎత్తిన చప్పుడు.
 గొంతు వినగానే మరేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు.
 పది నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించాడు.
 తిరిగి ఆమె గొంతే.
 అసహనంగా కుర్చీలో కూలబడ్డాడు.
 అంత టెన్షన్ లోనూ తన ప్రేయసి గుర్తొచ్చింది.
 ఎదురు చూస్తుంటుందేమో !
 తనక్కడికి వెళ్లే  ఛాన్స్ లేదు.
 ఫోన్ చేసి చెప్పాడు ఆమెకు.
 అవతల్నించి అంతులేని నిరాశతో తడిసిన స్వరం.
 ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించాడు.
  ఆ సమయానికి రాఘవ తన బైకు మీద వెళ్లి ఆమె ఇళ్లున్న సందు మొగదల మాటేసి వున్నాడు.
 వేట కొడవలి నొకదాన్ని సీటుపక్క లాఘవంగా అమర్చుకొని వున్నాడు.
 చెన్నారెడ్డి కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు.
 శివపురి నుంచి ఉదయమే దిగిన చెన్నకేశవ వగైరాలు ఎమ్మెల్లేను చంపేందుకు అద్భుతమైన వ్యూహాన్నొకదాన్ని పట్టుకొచ్చామంటూ హంగామా చేస్తున్నారు.
 తను వాటిని విన్పించుకోదల్చలేదు.
  ఇట్లా హంగామా చేసిన ప్రతిసారీ అపజయం తప్ప మరొకటి మిగలటం లేదు. ఇప్పుడు కూడా ఫలితం అదే..  సందేహం లేదు.
  పథకాన్ని వాళ్లు రేపు అమలు చేయబోతున్నారు.
 తను యీ రాత్రికే చెన్నారెడ్డి తల నరికి వాళ్లకు కానుకగా ఇవ్వబోతున్నాడు.  వాళ్లెవరూ చేయలేని పనిని తను చేయబోతున్నాడు.
 ఆలోచిస్తూ వున్నాడు అతను.
 అప్పటికి సమయం తొమ్మిది గంటలు దాటుతూ వుంది.
 ఆ టయానికి చెన్నారెడ్డి తన కుర్చీలో అసహనంగా కదలుతున్నాడు. మరొక్క సారి హర్ష కోసం ప్రయత్నిద్దామని రిసీవర్ మీద చేయిబోతోండగా ఫోన్ మోగింది.
 రిసీవర్ ఎత్తాడు.
 బద్వేలు నించి కొండన్న.
 " అన్నా !  అన్నా ! మన అదృష్టం పండింది.."
  " ఏమబ్బీ ! "
 " వాని తమ్ముండ్లు హైదరాబాద్ వస్చాండారని సమాచారం. నంద్యాల కొచ్చి ట్రైనెక్కినారంట. ఎవురో చుట్టాలింటికంట. గంపెడు మామిడి పండ్లు గూడా ఎత్తకపోయినారని వినికిడి.. ఇంటికాడ వాడొక్కడే వుండాడంట.."
  " హైదరాబాదా ? "
 " అవ్వన్నా ! హైదరాబాదే...... న్నోవ్ ! వాల్లు తిరిగి ఇంటికి రాగూడదు.. తెల్సిందా ! "
  " సరే సరే !  ఇక్కడి సంగతి నాకొదిలేయండి. ఇప్పుడే బాబు ద్వారా పెంచలయ్యకి సెబుతా ఇద్దరూ కలిసి శివపురోన్ని ముగించండి. "  చెప్పాడు.
  ఫోన్ పెట్టింతర్వాత శరీరం నిండా అంతులేని ఉత్సాహాన్ని తెచ్చుకొన్నాడు చెన్నారెడ్డి.
 సిటిలో రాటుదేలిన కసాయి గుండాల ముఠాల్ని కొన్నింటిని గుర్తు జేసికొని డైరిలోని వాళ్ల నంబర్ తీసి నోట్ చేసికొని ఫోన్ చేశాడు.
 " హలో నేను... కడప చెన్నారెడ్డిని.. "
 వెంటనే అవతలి గొంతులో వినమ్రత  " నమస్తే అన్నా ! "
  " నీతో పనిబడింది వీరూ ! "
 " సెప్పన్నా ! "
 " ఇక్కడకురా - చెబుతా.. "
  పదినిమిషాల్లో వచ్చాడు వీరూ.  " నమస్తే అన్నా !  ఎంతకాలంనుంచో అనుకుంటున్నా నీ పని ఒక్కటన్న సేసి పెట్టాలని చెప్పన్నా ! "
  విషయమంతా అతనికి చెప్పాడు.
 శివపురి మనుషుల్ని చూపించేందుకు సిటిలోనే వున్న తన వాళ్లను ఇద్దర్ని పిలిపించాడు.
 వాళ్లను వీరూకి అప్పగించాడు.
 ట్రైన్ టైం చెప్పాడు.
 వాళ్లు వెళ్లింతర్వాత గుర్తొచ్చింది కొడుక్కు ఫోన్ చేయలేదని.
 వెంటనే ఆ పనిమీద కెళ్లాడు.
 కొంత ఆలస్యంగానే అయినా యీ సారి భార్య గొంతు విన్పించలేదు.
 అన్ని విషయాలూ వివరంగా చెప్పాడు హర్షకు.
  తమను పట్టి పీడిస్తూ వున్న సమస్యను పరిష్కరించకొనేందుకు చక్కటి అవకాశం దొరికిందనీ, దీన్నిప్పుడు సద్వినియోగం చేసికొంటే తాలుకాలో తిరుగు వుండదనీ చెప్పాడు.  దీన్ని జీవన్మరణ సమస్యగా భావించి అన్ని శక్తి యుక్తుల్ని పూర్తిగా వినియోగించి పని పూర్తి చేయమనీ, ఏ మాత్రం నిర్లక్ష్య పెట్ట వద్దనీ హెచ్చరించాడు.

                                                     ********

   జీపు నేరుగా ముగ్గిపిండి గనివద్దకు వెళ్లి ఆగింది.
 అందులోంచి బాలుడు, రమణారెడ్డి వగైరాలు దిగారు.
 పరిసరాల్ని నిశితంగా పరిశీలిస్తూ నేల మీద ఏదో వెదుకుతున్నాడు. బాలుడు.  భూమిలోంచి బైటకొచ్చిన గుడ్డపీలిక, కంపచెట్టు, బోటి రాయి వగైరాలు వద్ద అతను సూచిస్తోంటే మిగిలిన వాళ్లు జాగ్రత్తగా తవ్వి ప్లాస్టిక్ బక్కెట్లను బైటకు తీస్తున్నారు.
 అన్ని బక్కెట్లను ఒక చోటుంచి పై పొట్టును తొలగించి వరసగా పేర్చి వున్న బాంబుల్లోంచి ఏదో ఒకటి ఎన్నుకొని పరీక్షించాడు బాలుడు.
 ఒకటి రెండు బక్కెట్లు మినహా అన్ని బక్కెట్లోని బాంబులూ నాణ్యంగా పేలాయి. గని ప్రాంతాన్నంతా దద్దరిల్ల జేశాయి.
 బక్కెట్లోంచి పాతిక బాంబుల్ని ఏరి మిగిలిన వాటిని యధా ప్రకారం భూమిలో పూడ్చి పెట్టారు.
 జీపులోంచి గంపను కిందకు దించి అందులోని పొట్టును నేలమీద పోశాడు బాలుడు. తర్వాత పొట్టును గంపలో పోయటం, ఓ వరస బాంబుల్ని పేర్చటం, మళ్లీ పొట్టు పోయటం, తిరిగి బాంబుల్ని పేర్చటం, వరసకు వరసకూ బాంబుకు బాంబుకు మద్య దండిగా వరిపొట్టు వుండేలా జాగ్రత్త పడ్డాడు.  గంపలో ఇంకా ఖాళీ వుంది. దానికి గుడ్డ కట్టి జీపుకెత్తారు.
  బాంబుల గంప తెల్లారే సరికి హైదరాబాదులో వుండాలి.
  దాన్ని ఇలాగే జీపులో తీసికెళ్లటం కష్టం. ఎక్కడంటే అక్కడ పోలీసు చెకింగ్‌లుంటాయి. నంద్యాల వరకు జీపులో పట్టుకెళ్లి అక్కడ ట్రైన్ ఎక్కిస్తే పని సులభంగా జరిగిపోతుంది.
  బాంబుల గంప వెంట బాలుడు, చంద్ర, వాసులు వెళ్లాలని నిర్ణయం జరిగిపోయింది.
  సాయింత్రంగా పోరుమామిళ్ల వెళ్లి ఓ వంద మామిడి పళ్లను తెచ్చారు. వాటిల్లో కొన్నింటిని రెండువరసలుగా గంపలో పేర్చి పైన గుడ్డ కట్టారు.
  రాత్రి బాలుడు, చంద్ర, వాసులతో జీపు నంద్యాలకు బైల్దేరింది.
 మామూలు వేగంతో వెళ్లినా రైలు వచ్చే సమయానికంటే అర్థగంట ముందే స్టేషన్ చేరుకోగలరు.
 చేయబోయే పనిని గురించి వూహించుకొంటున్నారు.
 కొంత ఉద్విగ్నతకు గురవుతున్నారు.
 జీపు వేగంగా వెళుతూ వుంది.
 మరో ఇరువై కిలోమీటర్ల ప్రయాణం చేస్తే నంద్యాల వస్తుంది.
 అక్కడ ట్రాఫిక్ బందయివుంది.
 ఏదో యాక్సిడెంటు జరిగిందట.  జనం గుంపయ్యారు. వాహనాన్ని నిలేశారు.  వెనక ముందు వాహనాలతో రోడ్డంతా నిండిపోయింది.
 వాహనాల వరస దండిగానే వుంది.
వెనక్కి వెళ్లేందుకు మరో దారిలేదు.
 ట్రాఫిక్ సమస్య ఎప్పుడు క్లియరవుతుందో తెలీదు.
 ’ అర్ధ గంట లోపల క్లియర్ కాదా ! ’  అనే ధీమా
  మరో వైపు ట్రైన్ మిస్సవుతుందనే భయం.
  పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసేసరికి ఖచ్చితంగా అర్ధగంట సమయం పట్టింది.
  ఆగమేఘాల మీద నంద్యాల రైల్వేస్టేషన్ చేరుకొంది బాలుని జీపు.
 ఆదరాబాదరా స్టేషన్‌ లోకి నడిచారు.
 ఐదునిమిషాల క్రితమే ట్రైన్ వెళ్లిపోయిందట.
  దిక్కు తోచలేదు వాళ్లకు.
 తల పట్టుకొన్నారు కొంత సేపు.
 వెంటనే బస్ రూట్ పైకి తీసికెళ్లారు జీపుని.
  ఏదైనా లారీలో వెళ్లాలని వాళ్ల ఆలోచన.
 అర్థగంట సేపు ప్రయత్నిస్తేగాని లారీ ఆపలేదు.
 సవాలక్ష ప్రశ్నలడిగి కాని డ్రైవర్ వాళ్లను ఎక్కించుకోలేదు.
 ’అమ్మయ్య ’ అంటూ గుండెనిండా గాలి పీల్చుకొని వదిలారు ముగ్గురూ.
 జీపు వెనక్కి వెళ్లింది.
 లారీ టౌన్ లిమిట్స్ దాటింతర్వాత ఓ డాబా వద్ద ఆగింది.
 " ఏం సర్ !  భోంచేయరా ? "  లారి దిగి డాబాలోకి వెళుతూ అడిగాడు డ్రైవర్  " మందు కూడా దొరుకుద్ది "  చెప్పాడు.
  రెండు నిమిషాల తర్వాత వాసు కిందకు దిగాడు.
 డ్రైవర్ వెంట డాబాలోకి వెళ్లి మందు, నంజుళ్లు, వాటర్ బాటిల్స్ తీసుకొని లారీ క్యాబిన్ పైకి ఎక్కాడు.
  అక్కడ కూచుని ముగ్గురూ మందు కార్యక్రమాన్ని పూర్తి జేశారు.
 వాతావరణం ఆహ్లాదకరంగా వుంది.
 కడుపులోకి నిషా ఎక్కేసరికి మంచి హుషారొచ్చింది.
 లారీ కదలి వెళుతోంటే దాని రొదకంటే వాళ్లు పాడే పాటల సంగీతపు మోత ఎక్కువైంది.
 ఎవ్వరూ నిద్ర పోదల్చుకోలెదు.
 ఒకరు మార్చి మరొకరు పాటలు పాడుతూనే వున్నారు.
 మద్య మద్యన డ్రైవర్‌ను హెచ్చరిస్తున్నారు.
 కర్నూలు వచ్చింది.
 అక్కడో చాయ్ తాగి మళ్లీ కదిలింది లారీ.
 ఓ అర్ధ గంట ప్రయాణించి వుంటుంది.
 ఉన్నట్టుండి ’తుస్ ’ మనే శబ్దమూ, దానితోటి సైడులాగుతూ రోడ్డునించి పొలాల్లోకి వెళ్లాలనే లారీ ప్రయత్నమూ.
 బలంగా బ్రేకు తొక్కి లారీని ఆపాడు డ్రైవర్
 ఎడమ వైపు ఫ్రంట్ వీల్ పంచరయ్యింది.
 ’ఎంతసేపు ?  పదినిమిషాలేగదా టైర్ మార్చేందుకు ! ’ అనుకొన్నారు క్యాబిన్ పైన్నించి.
 " గోవిందా గోవింద ! "  అంటూ రెండు చేతుల్ని గాల్లో కెత్తి లారీ ఎక్కాడు డ్రైవర్.  " పండుకోండి సార్ ! పొద్దున్నే పోదాం "  అన్నాడు వాళ్లకేసి తిరిగి.
 " ఏం ? స్టెఫ్నీ లేదా.."
  " ఉంది.. ఉంటే ?  యీ జామున ఎవురు మారుస్తారు సారూ ! "
 " అర్జంటు పని.. మేం సాయం జేస్తాం..  రొవ్వంతా సేపే గదా ! టైరు మార్చుకొని పోదాం పాన్నా ! "  వాసు అన్నాడు.
 " ఇదిగో ఇట్లా మాట్లాడ్తారనే నాలారీలో ఎవుర్నీ ఎక్కించుకోను ఏదో.. మీరు బంగపడ్తాంటే కాదననందుకు యిదొక గూటమా నాకు... పండుకోండి.. పండుకోండహే.. "  చెబుతూ క్యాబిన్‌లో దూరాడు.  " నేను ముందే ఖర్మ నాకొడుకును.. నాకన్న తలమాసిన్నాయాండ్లు మీరు.. "  లోపల్నించి గొణుక్కొంటున్నాడు.
  వాళ్లెంత బతిమాలినా డ్రైవర్ వినుకోలేదు.
 అతను కూడా కైపు మీదున్నాడు.
  వాళ్లు డిమాండ్ చేసే కొద్దీ అతను మండి పడుతున్నాడు.
 " ఏం నాకొడుకువురా నువ్వు ! తాగుడుబోతు నాకొడకా ! పచ్చి సరుకొరే యిది. ఓనర్ నాశనమైతాడురా.. "  వాసు అన్నాడు.
 ఆ మాటలు డ్రైవర్ తలకెక్కలేదు.
 " ఇట్లా కాదుగానీ.. "  అంటూ బాంబుల గంపకు కట్టిన గుడ్డను కొద్దిగా తొలగించి లోపల్లికి చెయ్యి జొనిపి ఓ బాంబును బైటకు లాగాడు చంద్ర.  " అన్నా !  దీంతో బేస్తా నాకొడుకును.. కైపు దిగి పోతాది "  అన్నాడు అబ్బిళ్లు కొరుకుతూ.
 వెంటనే అతని చేయి పట్టుకొన్నాడు బాలుడు.  " తప్పు నీది గాదురా !.. కైపు అట్లాంటిది.."  అంటూ అతని చేతిలోని బాంబును సున్నితంగా లాక్కొని గంపలో యధాప్రకారంగా వుంచి గుడ్డ కట్టాడు.
  డ్రైవర్ క్యాబిన్‌లోంచి దిగేట్టు లేడు.
 మరొక వెహికల్‌ను పట్టుకొని వెళ్లాలి.
 తెల్లారే సరికి ఖచ్చితంగా హైదరాబాద్ చేరాలి.
 గంపను దిందకు దించారు.
 ఏదో వెహికల్ వస్తోంది.
 ’ఏదన్నా కానీ.....’  చెయెత్తారు.
 దగ్గరగా వచ్చి ఆగింది.. బస్సు
  గంపను బస్సుకెత్తారు.
 " మామిడి పండ్లన్నా ! హైదరాబాదులో చుట్టాలకు.. "  అంటూ గంపను జాగ్రత్తగా ఓ చోటుంచి దాన్ని గమనిస్తూ కూచున్నారు.
 కంటి మీద కునుకు రాలేదు వాళ్లకు.
  పొరబాటున నిద్రమబ్బుతో ఎవడైనా గంపలో కాలుబెడతాడేమోనని భయం. నిద్ర లేకుంటే లేకపోయింది బస్సయినా ట్రబులివ్వకుండా పోతే అదే పదివేలనుకొన్నారు.
  వాళ్ల ఆశల్ని వమ్ముచేస్తూ సిటీకి ఇరువై కిలోమీటర్ల ఇవతల ఆగిపోయింది బస్సు.
  ఇంజన్లో ఏదో ట్రబులట.
 గంప కిందకు దించి అటుగా వెల్తోన్న ఆటోను ఆపారు.
 " మామిడి పండ్ల గంప, ముగ్గురం మనుషులం "  చెప్పాడు బాలుడు.
 బేరమాడి ఆటో ఎక్కారు.

                                                          ******************

  రాత్రంతా సరిగ్గా నిద్రబట్టలేదు చెన్నారెడ్డికి.
 ఇంట్లాంటి ఎన్ని కేసుల్ని తను అలవోకగా నిర్వహించాడనీ ! ఏమాత్రం టెన్షన్ లేకుండా రాత్రంతా హాయిగా నిద్రబోయి ఉదయం లేచి ఉపహారం తీసుకొన్నంత సులభంగా చేయించాడు.
  ఇప్పుడెందుకో - ఎంత అనచుకొందామనుకొన్నా ఆగని గుండె దడ... మరచిపోదామన్నా వీలు కాని టెన్షన్.
  మొట్ట మొదటి మర్డర్ చేయబోతోన్న వాడికి వున్నంత టెన్షన్.
  తను పడుకొంటే వీరూ నించి గానీ, హర్షనించిగానీ ఫోనొస్తుందేమో ! తన సహాయం ఏదైనా అవసరమవుతుందేమో !
  కుర్చీ మీద కూచుంటే ఎప్పుడో తనకు తెలీకుండానే వచ్చి కమ్ముకునే నిద్ర.... పదినిమిషాలు కూడా గడవక ముందే ఉలిక్కిపడి లేచి పచార్లు చేయటం..  తెల్లార్లూ అదే అవస్థ...
  తెల్లారింది... ట్రైన్ టైమైంది..
  వీరునించి వచ్చే పోన్ కాల్ కోసం క్షణమొక యుగమైంది.
 మనస్సంతా ఉద్విగ్నంగా వుంది.
 పదిహేను నిమిషాల టెన్షన్ తర్వాత ఫోన్ మోగింది.
 వీరూ నించి ఫోన్
  శివపురి వాళ్లెవరూ ట్రైన్‌లో రాలేదుట.
 ఆశ్చర్యంగా వుంది చెన్నారెడ్డికి..   నమ్మలేకున్నాడు.
 వీరూ వద్ద వున్న తన మనషులతో మాట్లాడాడు.
 ట్రైనంతా గాలించి చూసినా కన్పించలేదుట.
  షడన్‌గా అతనికో అనుమానం వచ్చింది.
 ట్రైన్ మిస్సవటం వలన ఏదైనా బస్ పట్టుకొచ్చారేమో !
 తక్షణం తన అనుమానాన్ని వీరూ ముందుంచాడు.
 మరుక్షణమే ఫోన్ పెట్టేశాడు వీరూ.
  అతని సామర్థ్యం చెన్నారెడ్డికి బాగా వినికిడే.
  నిమిషం సమయాన్ని కూడా వృధా చేయడు.
 బస్టాండ్ వెళ్లి వుంటాడు.
 ’ శివపురి నాయాళ్లు కనబడితే సాలు..  అర్థగంటలో వాల్ల తలకాయలు తన కాళ్లకాడుంటాయి..! ’
  వీరూ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాడు.
  పదిహేను..ఇరువై.. ఇరువై ఐదు నిమిషాలు.. క్షణం క్షణం ఎదురు చూపులు.. వీరూ ఫోన్ కోసం... నిరీక్షణాలు...
  ఫోన్ మోగింది.  హర్ష నించి..
 కుంట మనుషులు, భీమునిపల్లె పెంచలయ్య వచ్చారుట. శివపురి మీదకే వెల్దామంటున్నారుట.
  వద్దని చెప్పాడు చెన్నారెడ్డి.
 శివపురినుంచి పోరుమామిళ్ల దాకా రెండు మూడు చోట్ల దారులు కాయమని చెప్పాడు.  అన్నిచోట్ల తప్పించుకొన్నా బద్వేలులో మాత్రం గురి తప్పకూడదు.
  కుంట మనుషుల వద్ద నాటు తుపాకులున్నాయనీ, అవసరమైతే ఉపయోగించమని చెప్పాడు పెంచలయ్యతో.
 మాట్లాడి ఫోన్ పెట్టేయగానే వెంటనే మళ్లీ రింగయింది.
 వీరూ మనుషులనించి ఫోన్
 బస్సుల్లోంచి కూడా దిగలేదుట శివపురి వాళ్లు.
 తను చాలా డిసప్పాయింట్ అవుతున్నానని చెప్పాడు వీరూ. రెడ్డిగారి పనిని అత్యంత సమర్థవంతంగా జరిపి ఆయన మెప్పుపొందాలని కోరికగా వుండేదట.
 చెన్నారెడ్డి కూడా నీరసపడ్డాడు.
  శివపురి సోదరులు నగరానికి రావటమంటే తన బోనులోకి అడుగు పెట్టటమేననీ, వాళ్ల మెడ సులభంగా కొరికేద్దామనీ అనుకొన్నాడు.
 ట్రైన్ కాకుండా, బస్సు కాకుండా ఏ దారిన వచ్చినట్లు !
  లారీ ఎక్కి వుంటారా ?
 ఛ ఛ..  ఆ పని చచ్చినా చేయరు.
 ఎక్కడో పొరబాటు జరిగింది.
 వాళ్లు హైదరాబాదు కాకుండా మరేదో ప్రాంతానికయినా వెళ్లుండాలి. లేదా బస్సు యాక్సిడెంటో, మరో ఆటంకమో జరిగి బాగా ఆలస్యమైనా అయ్యుండాలి.
  ఏది ఏమైనా మరో రెండు దినాలు వాళ్ల కోసం బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో వెదకటం మేలు.
  అదే విషయం చెప్పాడు తన వాళ్లకు.
 వాచ్ చూసుకొన్నాడు.
 హఠాత్తుగా అతనికి పెళ్లి గుర్తుకొచ్చింది.

                                                                                                 ........ సశేషం

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs