.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    
        తర్వాత రెండు రోజులకే ఓ చిన్న సమాచారం అందింది.
    రామిరెడ్డి మృతిపట్ల దండోరుపల్లెలోని రంగారెడ్డి వర్గం మహా సంతోష పడుతున్నారట. " పీడ విరగడైంది " అంటూ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారట.
 అట్లాంటి స్పందనలు సహజమేననుకొన్నాడు ఓబుళరెడ్డి.
  తమగుండా వాళ్ళకు పరోక్షంగా కొంత నష్టమే జరిగివుంటుంది..  గొడవ జరిగినప్పుడంతా సుబ్బారెడ్డి వర్గం తమ ఆశ్రయం పొందుతుంది. కేసులు. కోర్టు వ్యవహారాలకు సంబందించిన సహాయాన్ని అందిస్తుంటారు.  పోలీసు వొత్తిళ్ళు లేకుండా  చూడటం ఆర్థిక సహాయం,  పైకం అందజేయటం... ఇట్లా ఓ వర్గానికి సమస్త సహాయమూ చేయటంతో సహజంగానే మరో వర్గానికి తమ మీద కసి వుండొచ్చు, వ్యతిరేకంగా స్పందించవచ్చు, అదేమి పెద్ద విశేషం కాదనుకొన్నాడు.
  సాయింత్రం పోరుమామిళ్ళ నించి జీపొచ్చింది.
 ఎస్సైతోటి మరో ఇద్దరు పోలీసులు దిగారు.
 " ఏం రెడ్డి  ! కొత్త సంగతులేమైనా వుండాయా..? " ఎస్సై అడిగాడు.
  " మా దగ్గరేముండాయి సారూ  ? మీరు సెప్పుతే మేం వినాల "  పెద్దిరెడ్డి చెప్పాడు.
  " మా పరిదిలో మేం గట్టిగానే ప్రయత్నిస్తుండాము.  పాతనేరస్తులను చాలా మందిని విచారించినాము.  హంతకుల ఆచూకీ చిక్కలేదు " అని చెప్పాడు.  తర్వాత కొంత ముందుకు వంగి లోగొంతుతో " అది సరే !
.. మీ పని ఎంతవరకు వొచ్చుండాది ? " అన్నాడు పెద్దిరెడ్డి కళ్ళల్లోకి చూస్తూ.
  " ఏం పని సారూ ? "
 " అదేనయ్యా మగడా ! మీరు తంటాలు బడేదే.."  కళ్ళెగరేశాడు.  సూచాయగా అర్థమైంది పెద్దిరెడ్డికి.
  " నాకన్నీ  తెలుసు రెడ్డీ !.. వేటకు మల్లుకొన్నెరు..మాటేసి వుండారు...అయితే మీకింకా ఏజీవి దొరకలే..కదూ  ? "
 రెండు చేతులెత్తి సమస్కరించాడు పెద్దిరెడ్డి  " మేమంత మాత్రపు మనుసులం కాదులే సారూ  ! "  అన్నాడు.  "  మావోడే వుండుండేనా  ?.. మేమొకరం పోయి వాడుండివుండేనా  ? నువ్వన్నట్టు వేటాడి వుండే వాడే  " చెప్పాడు.
  పెద్దిరెడ్డి కేసి తదేకంగా చూశాడు ఎస్సై " కనీసం అనుమానితుల పేర్లయినా చెప్పు రెడ్డీ ! మీ సేతులకు మట్టిగాకుండా మేం సూసుకుంటాము " అన్నాడు
 " చెబుతే నమ్మరుగాని ..మేమే తేల్చుకోలేకుండాము సారూ - అంత లావు శత్రువులు మాకెవురుండారా ? అని  "  చెప్పాడు.
  మరో సారి నొక్కి ప్రశ్నించి జీపు వద్దకు నడిచాడు ఎస్సై.  జీపులో కూచుంటూ అప్పుడే అక్కడకొస్తున్న ఓబుళరెడ్డితో చెప్పాడు " మీకు సరిపోనోల్ల పేర్లు జెప్పండి..వాల్లను పట్టుకోంటే అసలు ముద్దాయిలు బైటకొస్తారు.." అంటూ
  ఓబుళరెడ్డి నించి కూడా రాదే సమాధానం
ఎస్సై వెళ్ళిపోయాడు.
 " ఏదొక పేరు చెప్పించుకపోవటం,  వాల్లను తీసప్పోయి లోపలేసి బెదిరించి లెక్క ( డబ్బు ) రాబట్టడం... ఆ గడ్డి దినేందుకే ఈ అగసాట్లన్నీ "  ఓబుళరెడ్డి అన్నాడు.
     రాత్రికి  దండోరిపల్లెనుంచి యిద్దరు వ్యక్తులొచ్చారు.
    వాళ్ళు మోహాల్నిండా ఏదో చెప్పాలని ఆతృత.
   గొంతుల్లో సన్నని తడబాటు.
   " సంపింది  మావూర్నాకొడుకులే  ! నువ్వు నమ్ము, నమ్మకపో ఖాయంగా వాల్లే "  చెప్పాడు ఓ వ్యక్తి.
   ప్రశ్నార్థాకంగా చూశాడు ఓబుళరెడ్డి.
   " ఆ నాకొడుకు..వాడు...రంగారెడ్డి తమ్ముడు నాతోనే అన్నేడు. మీకు శివపురి రాంరెడ్డికి పట్టిన గతే పడ్తాదని.  "
  నొసలు ముడేశాడు ఓబుళరెడ్డి.  " నిజంగా నీతోనేనా  ?  "
  " అవునన్నా  !  నాతోనే .  "  నమ్మకంగా చెప్పాడు.
  " ఏ గొడవల్లేకుండా అంతలావు మాట ఎందుకొచ్చిందీ  ?  "
   చిన్నగా నిట్టూర్చాడు ఆవ్యక్తి.
  "  ఆ మద్య చిన్న తకరారు జరిగిందిలేన్నా  !  కొట్లాడుకొనేంతయ్యింది.  వాల్ల మాసుల్నంతా గుంపు జేసుకొన్నెరు. మాదిగోల్లను గుడకా పిల్చుకొన్నేరు. ఎందుకోమరి వున్నెట్టుండి ఎనకడుగు బేసినారు,  యీ లోపల మన రాంరెడ్డన్న పాయే... వున్నట్టుండి యిప్పుడు మల్లా కాలుదువ్వుతా వుండారు. "
   ఆలోచనల్లో పడ్డాడు ఓబుళరెడ్డి.
  దండోరిపల్లె వాల్ల చేష్టలు విశ్లేషించదగినవిగా  అన్పించింది పెద్దరెడ్డికి కూడా.
   గొడవ పెట్టుకోబోయి  చాలించటం, రామిరెడ్డి పోగానే తమ కుటుంబం విషాదంలో మునిగివున్నా యీ సమయంలో తిరిగి గొడవలు లేవదీయాలనుకోవటం,   రామిరెడ్డి చావును చూపి ప్రత్యర్థుల్ని బెదిరించిటం....అంటే.... ఇప్పుడు శివపురి వాల్ల సహాయం మీకందదని సుబ్బారెడ్డి వర్గాన్ని    హెచ్చరించట... అంటే...?
   " మనవాల్లందర్నీ పిలిపించరా  ! "  తమ్మునికి చెప్పాడు.
  తమకు సంబందించిన ముఖ్యులంతా భోజనాల తర్వాత రెడ్డిగారి ఇంటికి చేరారు. దండోరు పల్లె సుబ్బారెడ్డి కూడ వచ్చాడు.
   వాకిళ్ళేసుకొని  లోపల కూచున్నారు.
  యింటిబైట  అరుగుమీద కూచున్న ఆడవాళ్ళు పరిసరాల్ని గమనిస్తూ కబుర్లు  చెప్పుకొంటున్నారు.
   " మనోన్ని దండోరు పల్లె వాల్లే సంపినట్టుంది. "  చెప్పాడు పెద్దిరెడ్డి
  " రాంరెడ్డిని సంపితే వాల్లకేం లాభం  ? "   ప్రశ్న.
 " మనం సుబ్బారెడ్డి గుంపుకు సాయంజేస్తాండమా  ! సాయమంటే - కేసులున్నెప్పుడు వాల్లకు కూడుబెట్టి మన కల్లాలకాడనో, పొలాలకాడనో దాపెడ్తా వుండాము గదా  ! లాయర్లను మాట్లాడ్తా వుండాము,  పోలీసోల్లకు సెప్పిస్తా వుండాము గదా  ! అది రంగారెడ్డిగానికి నచ్చినట్లు లేదు...అయితే యీ నాయాండ్లు గూడ మర్యాదగా లేరు. "  సుబ్బారెడ్డి కేసి  వేలు చూపుతూ అన్నాడు  " యీ కులబట్టు  నాయాండ్లు గూడా కొన్ని తప్పుల్జేసినారు,  వస్తా వస్తా రంగారెడ్డి గాని గుంపువాల్ల ఇండ్లకాడ మేపుకొన్నె పొట్టేళ్ళను ఒకటినో రెండుంటినో దొంగతనంగా తెచ్చి కోసుకొన్నెరంట.  మామిడి కాయలు రాల్చుకొచ్చినారంట.  మాంచి కోడి పుంజుల్న సంకన బెట్టుకొచ్చినారంట...., మనకు తెల్సుంటే  సెప్పున గొట్టేవాల్లం.. యాడనో  సేలకాడ, సెడ్లకాడ కోసకతినిరి.  ఆ సంగతులన్నీ మాకు తెలిసే చేసినారని వాల్ల నమ్మకం. ఇంకోమాటలో చెప్పాలంటే మేమే సేయించినామని... అందుకే వాల్లంతలావు పనికి తెగించినారు...."  పెద్దిరెడ్డి చెప్పాడు.
   సుబ్బారెడ్డి సిగ్గుతో తలొంచుకొన్నాడు.
"  పొలాల్లో మనుసుల మీద సరిగ్గా గురిజూసి బాంబులేసే నాయాండ్లు ఎవరుండా రబ్బా  ! "  రెడ్డిగారి దాయాది కృష్ణారెడ్డి ప్రశ్న.
  " కాపోల్లెవరూ ( రెడ్ల ను రాయలసీమలో ’కాపులు ’ అని అంటారు ) లేరు మరి "  సుబ్బారెడ్డి చెప్పాడు.  "  అయితే మాదిగోల్లల్లో మాంచి దిట్టలుండారు.  వాల్లంతా రంగారెడ్డి గాడు ఎట్టజెపుతే అట్ల...., వాల్ల సేతనే బాంబులేయించి వుంటారు. "
  నిజమేననిపించింది అందరికీ.
  బాంబులేసిన వాళ్ళెవరో తెలిసిపోయినట్టుగా అన్పిస్తోంది, రామిరెడ్డిని చంపించిన మనుషులెవరో అర్థమవుతూ వుంది.
 అందరి గుండెల్లో సన్నని ఆందోళన, కనిపించని భయం. మునివేళ్ళు కంపించే ఆతృత.
  ఏం చేయాలో నిర్ణయించుకొన్నారు.
  ఎలా చేయాలో కూడా వ్యూహం రచించుకొన్నారు.
  తమ మాలిండ్లకు చెప్పి పంపారు.
  గ్రామస్తులంతా ముప్పైమంది దాకా గుంపయ్యారు - ఈటెలు్,గొరకలు, వేటకొడవళ్ళు సిద్దం చేసికొని.
  ఊరు దాటింతర్వాత ఇరువై మంది మాలలు వచ్చి కలిశారు.
  అప్పటికే రాత్రి మూడు జాములు దాటింది.
  నెలగుంకి నేలంతా చుక్కలు వెలుతురు పరుచుకొని వుంది పల్చగా. ఆకాశం నిర్మలంగా వుంది.
  వాతావరణం చల్లగా వుంది.
  అందరి గుండెల్లో ఏదో ఉత్సాహం, మరేదో అలజడి..
  అడుగులు వడివడిగా పడుతున్నాయి.
  ఏటి జేడల్లో నక్కల ఊళలు.
  అదే పనిగా తీతువు పిట్ట  హెచ్చరికలు.
  ఏట్లో అక్కడక్కడా సన్నని నీటి జాలులు
  ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్న  సరసరమనే శబ్దం తప్ప దండులోంచి మరో సవ్వడి బైటకు రావటం లేదు.
  ఏటి గడ్డల్నించి మొదలైన దట్టమైనా చీకుతుమ్మ కంపచెట్లు.
  వాటి మద్య కాలిబాట వెంట జాగ్రత్తగా నడుస్తున్నారు.
  నేరుగా దండోరుపల్లె పక్కన వున్న మాదిగిళ్ళ మీద కెళ్ళారు.
  నిద్రమత్తు వదిలించుకొని లేచి కుక్కలు గొంతు చించుకొనే లోపలే ఎంచుకొన్న నాలుగిళ్ళను చుట్టుముట్టారు.
  మగవాళ్ళను జుట్టుపట్టుకొని బైటకీడ్చి వీధుల్లో నిల్చోబెట్టారు.
  ఆడవాళ్ళు గోడుగోడుమంటున్నారు.
  ఓబుళరెడ్డి గొంతెత్తి చెప్పాడు  " వీల్ల మీంద మాకు అనుమానమొచ్చింది - బాంబులేసింది వీల్లేనని. నిజంగా తప్పుజేయకుంటే మేమేమీ అనం. మల్లా తీసుకొచ్చి యీడనే యిడ్చిపెట్టిపోతాం "
  అప్పటికే ఒకరిద్దరు మాదిగలు దండోరు పల్లెకేసి పరుగెత్తారు కేకలేసికొంటూ...
  ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు కాబట్టి నలుగురు మాదిగల్ని బర బర యీడ్చుకొంటూ ఏరు దాటించి తమవైపు దరికి తీసికెళ్ళారు.
  అక్కడ విచారణ ప్రారంభించారు.
  పెద్ద కష్టపడకుండానే సహకరించారు వాళ్ళు.
  వాళ్ళకు తెలుసు ఇలాంటి విషయాల్లో శిక్ష అంటూ వుంటే అది చిత్రవధేనని.
  రామిరెడ్డి మీద జరిపిన బాంబు దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని వాపోయారు, గతంలో చేసిన కొన్ని అకృత్యాలను ఏకరవు పెట్టటంలో తమ నిజాయితీని నిరూపించుకొంటూ, యీ విషయంలో మాత్రం తాము నిర్దోషలమని నమ్మబలికారు. ప్రమాణాలు కూడా చేశారు.
  " మీరు కాదు సరే  ! వొప్పుకొంటాం... మరి ఎవరు జేసినారీపని  ? "
  " ఏమో రెడ్డోరు ! మేమయితే కాదు. "
  " దొంగకు దొంగ జాడ, ముచ్చుకు ముచ్చు పోకడా తెలియకుంటదా  ? అదేపనిగా తిరుగుతూ వుండేటోల్లు మీకు తెలియకుండా ఎట్లుంటది  ? ఇక్కడ బాంబు పేలినప్పుడే అది ఎవురేసిందీ మీకు అర్థమై వుంటది. "
  " నిజంగా తెల్దు రెడ్డోరు ! " దీనంగా చెప్పారు.
 ఎంత సేపు గుచ్చి గుచ్చి అడిగినా అదే సమాధానం.
  ఓపిక నశించింది ఓబుళరెడ్డికి
 సమాచారం వాళ్ళవద్దనించే రావాలి.
  " సరే ఇప్పుడు మీరు తప్పు జేయలెదు. మరి లోగడ జేసింది మీరే గదా ! వొప్పుకుంటా వుండారుగదా !  వాటికైనా శిక్ష పడాల్సిందే..చెయ్యో కాలో యిరిస్తేగాని మీకు సిగ్గురాదు " అన్నాడు కఠినంగా.
  " రెడ్డోరు  "  లబోదిబోమన్నారు వాళ్ళు.
  " మీరిప్పుడు క్షేమంగా యెట్లా వచ్చిన వాళ్ళు అట్లా యిండ్లకు పోవాలంటే మాయన్న మీద బాంబులేసిన వాల్లెవురో చెప్పాల్సిందే "
  కొంత సేపు మౌనంగా వున్నారు వాళ్ళు.
  తర్వాత  వొకర్నొకరు సైగ చేసికొన్నారు.
  అప్పుడు గొంతు విప్పాడో వ్యక్తి.
  " బాంబులేసిందెవురో మాకు ఖాయంగా తెల్దుగాని రెడ్డోరూ ! ఆరోజు పొద్దుగూకే జామున మైదుకూరు పక్క మిట్టపల్లే మాదిగలు యేటి దరుల్లో తారట్లాడుతూ వుంటే సూసినాం. "
  " వాళ్ళు అట్లాంటోల్లేనా  ? "
   " అదే పనిమీద బతుకుతా వుండారు "
  ఆశ్చర్యంగా వుంది అందరికీ
 ఎక్కడ మిట్టపల్లె  ?  ఎక్కడ శివపురి ?
  వాళ్ళ మాటల్ని విశ్వసించలేకపోయారు.
 విశ్వసించకుండా చేసేదేమి లేదు.
  మరోసారి  తీవ్రంగా హెచ్చరించి మాదిగల్ని వదిలారు.
సమస్య కొత్త మలుపు తిరిగింది.
  మిట్ట పల్లెలో ఎంక్వయిరీ చేయాలంటే ప్రతాపరెడ్డి వద్దకేళ్ళాల్సిందే.  ఆ ఫిర్కాకంతటికీ మకుటం లేని మహారాజు అతను.
 మళ్ళీ రోజు ఉదయమే బద్వేలు వెళ్ళాడు ఓబుళరెడ్డి. సమితి ప్రెసిడెంటు చెన్నారెడ్డిని కలిశాడు.
  అతన్ని వెంటేసుకొని సాయింత్రానికి ప్రతాపరెడ్డి వూరు చేరాడు.
 చెన్నారెడ్డిని చూడగానే ఘనంగా స్వాగతించాడు ప్రతాపరెడ్డి. అప్పటికప్పుడు కోళ్ళకోసి విందు ఏర్పాటు చేశాడు.
ప్రతాపరెడ్డి సామ్రాజ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది ఓబుళరెడ్డికి, వచ్చిన జనాలంతా అతనికి వొంగి వొంగి దండాలు పెట్టేవాళ్ళే. కనుసన్నలనే సుగ్రీవాఙ్ఞలుగా శిరసావహించే వాళ్ళే.
 విషయం వింటూనే మాదిగిళ్ళకు కబురంపాడు రెడ్డి.
 తాంబూలం నమిలే లోపలే వొంగి వొంగి దండాలు పెడుతూ మిట్టపల్లె మాదిగ వ్యక్తి వచ్చాడు.
  " ఏంరా నారిగా ! అందరూ యిండ్లల్లోనే వుండారా  ? "  అడిగాడు ప్రతాపరెడ్డి.
  " వుండారు సోమీ  ! "
  " దసరా పండగ రోజు ఎవురన్నా పోరమామిళ్ళ యిలాకాకు పోయెచ్చినారా ? "
  " పొద్దుటూరు పోయినట్టుండారు సోమీ ! "
  " ప్రొద్దుటూరు గాదు,  పోరుమామిళ్ళ యిలాకాలో శివపురమనే వూరింది.  దసరా పండగ రోజు ఆ వూరికి పోయినోల్లెవురో నాకిప్పుడు తెలియాల, పండగ సూసేందుగ్గాడు వాల్లుబోయింది.  పని.. ..పనిమీద పోయినారంట.."  కొంత కటువుగా చెప్పాడు.  ’పని ’ అనే పదాన్ని వొత్తి పలుకుతూ.
  వెంటనే వెనుదిరిగాడు మాదిగ నారప్ప.
  పరుగులాంటి నడకతో వూరు దాటాడు.
 అర్థగంట సమయం కూడ గడవక ముందే తిరిగి వచ్చాడు.  " పోయినారంట సోమీ ! నలుగురు మాసులు పోయినారు పన్నెండువేల వొప్పందమంట. పనయిపించుకొని వొచ్చినారు. "  నలుగురి పేర్లు చెప్పాడు.
  వింటూవున్న ఓబుళరెడ్డికి ఆవేశం తన్నుకొస్తూ వుంది, ముక్కుపుటాల్లోంచి శ్వాస తీవ్రతరమైంది.  నొసలు ముడేసి నారప్ప కేసి తదేకంగా చూశాడు ప్రతాపరెడ్డి  "  పోకముందు నాకు చెప్పలేదు. వచ్చినాక కూడా మాట్లాడలేదు, అంటే..మొగోల్లయినారనే మాట..సరే సరే..మన సంగతి తర్వాత మాట్లాడుకుందాము గాని... "  అంటూ చెన్నారెడ్డి వైపు తిరిగి " అదీ సంగతి ..." అన్నట్లుగా తల ఎగరేశాడు.
  " ఆ మాసులెవురో మాకప్పగించు వాల్లతో వొప్పందం సేసుకున్నేదెవురో కనుక్కోవాల. " చెప్పాడు చెన్నారెడ్డి.
  " రవ్వంత ఓపికబట్టు. "  అంటూ ప్రతాపరెడ్డి లేచి మిట్టపల్లె మాదిగ నారప్ప వెంట కదిలాడు.
  మంచాల మీద పడుకున్నారు చెన్నారెడ్డి, ఓబుళరెడ్డిలు.
  ఓబుళరెడ్డికి టెన్షన్‌గా వుంది.
  చెన్నారెడ్డి మాటలకు వూకొడుతున్నాడేగాని మనస్సంతా ప్రతాపరెడ్డి తెచ్చే సమాచారం మీదనే వుంది.
శత్రువెవరో తెలిసిపోయే క్షణాలు దగ్గరపడుతున్నాయి. కిరాయి తీసుకొని హత్యలు చేయటం మిట్టపల్లె మాదిగలకు వృత్తివిద్యతో సమానమట. పల్లెనించి పట్నం దాకా ఎన్నో వొప్పందాలు చేసికొని నిర్వర్తించారట.
  ప్రతాపరెడ్డి మాటల్ని చూస్తే వాళ్ళ పాపంలో ఇతనికి కూడా భాగమున్నట్లుంది. వాళ్ళను పోలీసుల్నించీ, నాయకుల నుంచీ ఇతనే రక్షించి పోషిస్తోన్నట్లుంది.
  ప్రతాపరెడ్డి వచ్చేసరికి గంటయింది.
  దండోరిపల్లె మాదిగలు మిట్టపల్లే వాళ్ళకు చుట్టాలట, వాళ్ళద్వార యీ వొప్పందం కుదిరిందట.
  ఒప్పందం చేసికొన్న మనిషి పేరు విని అదిరిపడ్డాడు ఓబుళరెడ్డి. ఐదునిమిషాల దాకా అతని నోటినుంచి మాటే రాలేదు. కొయ్యబారినట్లు నిల్చుండిపోయాడు.
  రాత్రే ప్రయాణమై వద్దామనుకున్నాడు గాని, చెన్నారెడ్డి ససేమిరా అనటంతో అక్కడే నిద్ర చేయవలసి వచ్చింది.
  తన అన్నమీద బాంబింగ జరిపిన వ్యక్తుల్ని అప్పగించమని ఓబుళరెడ్డి అడిగాడుగాని,  ప్రతాపరెడ్డి నవ్వి తిరస్కరించాడు.
  " వాల్లు కూలినాకొడుకులు పోన్నా  ! మంచి సెడ్డా ఏం లేదు, మనోడు తనోడు అనేది లేదు. లెక్కిస్తే సాలు - నామీందయనా బాంబులేస్తారు ఈ నాకొడుకులు,  వాల్లదేముంది పోండి.."  అంటూ సాగనంపాడు.
 వాళ్ళను అన్ని విధాలుగా రక్షిస్తున్నట్లుంది అతను..
అంటే వాళ్ళ సంపాదనలో కూడ  అతనికి వాటా వున్నట్లే..!!
తెల్లార్లూ ఆలోచనలలోనే గడిచిఫొయింది ఓబుళరెడ్డికి.
  ఉదయమే లేచి ప్రయాణమై చెన్నారెడ్డిని బద్వేలులో వదిలేసి పదిగంటలకంతా శివపురి చేరుకున్నాడు. 

                                                                                ............సశేషం.

                                                                          .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.
     కొంతసేపటికి వూళ్ళో కోలాహలం తగ్గుముఖం పట్టింది.
   కుంకుమతో తడిసిన వాళ్ళు శుభ్రపరుచుకొంటున్నారు జనాలు
 ఉన్నట్టుండి మట్టిబాట మొదట్లోంచి గావుకేక విన్పించింది.
" ఓయమ్మో...ఓనాయనో..సంపిన్రు..ఖూనీ జేసినారు..ఖూనీ..ఖూనీ.."  అంటూ చావు కేకలేసుకొంటూ పరుగెత్తుకొస్తున్నాడు గాన్లోల్ల సుబ్బన్న - జారిపోతున్న పంచెను ఓ చేత్తో ఎగబట్టుకొంటూ.
 అందరూ ఎగమల్లి చూశారు.
 అదిరే గుండెల్తో ఎదురెళ్ళారు.
" యేందిరా..! ఎవుర్ని సంపినారబ్బీ ? " అంటూ గాభరాగా ప్రశ్నించారు.
సమాధానం యిచ్చేందుక్కూడ నోరు పెగల్లేదు సుబ్బన్నకు.
" ఆ..ఆ భాట కాడ..ఖూనీ " అంటూ ఆగకుండా పరుగెత్తి రెడ్డివారి యిళ్ళ సందుకెళ్ళాడు.
 మంచమ్మీద కూచునివున్న పెద్దరెడ్డిని చూడగానే గోడుగోడున ఏడుస్తూ " ఖూనీ.. సంపినారయ్యా..! " అంటూ ఆయన కాళ్ళ వద్ద కుప్పకూలిపోయాడు..
" యేందిరా  ? " అదిరిపడుతూ లేచాడు పెద్దిరెడ్డి.
 ఆవేశమూ, భయమూ, శోకమో వళ్ళంతా పదురుతోండగా " నడిపి రెడ్డోర్ని ఎవరో బాంబులతో కొట్టినారయ్యా  ! " చెప్పాడు.
" యాడా  ? " పక్కనే వున్న ఓబుళరెడ్డికి కళ్ళు బైర్లు కమ్మిన్నట్టుగా అనిపిస్తోండగా ప్రశ్నించాడు.
" బాట కాడ " చెయ్యెత్తి చూపాడు సుబ్బన్న.
 క్షణం ఆలశ్యం చేయలేదు అన్నదమ్ములిద్దరు.
జారుతున్న పంచెను సవరించుకుంటూ పరుగులాంటి నడకతో అటుకేసి అడుగులేశాడు పెద్దిరెడ్డి.
 జనాలంతా వాళ్ళ వెంట పరుగులు తీశారు.
 అప్పుడే జాలాడిలో ( ’జలకాలాడే గదిని జాలాడి ’= బాత్‌రూమ్ ) దూరి రెండవ చెంబునీళ్ళు తలమీద పోసుకుంటున్నాడు రామిరెడ్డి పెద్ద కొడుకు రమణారెడ్డి.
" అన్నా..అన్నా !! " వగరుస్తూ అక్కడికొచ్చాడు తమ్ముడు జయసింహ.
" నాయన్నెవురో బాంబులతో కొట్టినారంట, సేలకాడ పడిపోయిండంట.."
చేతిలో చెంబు జారిపడినంత పనయింది రమణారెడ్డికి.
 అడ్డపంచె చుట్టుకొని తల తుడుచుకుంటూ బైటపడ్డాడు.
అప్పటికే ఇంటినిండా విషాదంతో కూడిన ఆందోళన.
 ఏడుపులతో కూడిన ఆడాళ్ళ పరుగులు...
కిందా మీద పడుతూ ఇల్లుదాటాడు రమణారెడ్డి.
 ఊరంతా దావనలంలా వ్యాపించట్టుంది వార్త
సందుల్లో గొందుల్లో కూడా కదిలిక వచ్చింది.
 ఏడుపులతో, శాపనార్థాలతో వేరుసెనగ చేలమద్య మట్టిబాట తల్లడిల్లింది.
కుటుంబ సభ్యుల్ని శవం మీద పడకుండా చేయటం గగనమైంది.
 బోర్లాపడి వుంది రామిరెడ్డి శవం.
వీపంతా చిద్రమైపోయి భయంకరంగా వుంది.
 రక్తం కారి మడుగు కట్టి వుంది.
ఆడవాళ్ళు శోకం పట్టరానిదిగా వుంది.
 మగవాళ్ళకు కూడ గుండె చెరువైంది.
ఊరు వూరంతా అక్కడకొచ్చింది.
  అప్పటికే ఇరవైమందికి పైగా యువకులు ఈటెలు, వేటకొడవళ్ళు వడిసెలతో నాలుగు బృందాలుగా ఏర్పడి తలాదిశకు పరుగెత్తారు - హంతకుల ఆచూకి కోసం.
  రామిరెడ్డి మీద బాంబు దాడి జరగటం అందరికీ ఆశ్చర్యంగా వుంది. అర్థం కాకుండా వుంది, ఊహించటానికిక్కూడా వీల్లేని విషయంగా వుంది.
మనుషుల్ని చంపుకునేంత గొడవల్లో లేదు రెడ్డిగారి కుటుంబం.
  ఎన్ని కోణాల్నించి విశ్లేషించినా బాంబుదాడికి కారణాలే కన్పించటం లేదు.
అన్న వద్దకు వెళ్ళాడు ఓబుళరెడ్డి.
" బాంబులేసిన మాసుల జాడ దొరుకుతాదని నాకేం నమ్మకం లేదు, పోరుమామిళ్ళ పోలీస్టేషన్‌కు ఫిర్యాదు సేస్తే మంచిది " చెప్పాడు
   వెంటనే కార్యాచరణకు పూనుకొన్నాడు పెద్దిరెడ్డి.
గ్రామ మునసబుగా తనపని తాను చేసుకుపోయాడు.
  రిపోర్ట్‌రాసి పోరుమామిళ్ళ పోలీస్‌స్టేషన్‌కు పంపించాడు.
ఓ గంటకల్లా హంతకుల ఆచూకి కోసం వెళ్ళిన యువకుల బృందం వొఠ్ఠి చేతల్తో తిరిగి వచ్చింది.
 సగం రేత్రికంతా పోలీసులు కూడా వచ్చారు.
దగ్గరున్న వాళ్ళను దూరంగా పోమ్మంటూ కొంత జులుం కూడా ప్రదర్శించారు.
సారాయి తెప్పించుకుని తాగి, మంచాలు వేయించుకుని పడుకొన్నారు.
చాలామంది గ్రామస్తులు అక్కడే వుండిపోయారు.
వూర్లో రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు.
రెడ్డి గారి యింటివద్ద కెళ్ళి పరామర్శించి వస్తున్నారు, తమ సానుభూతి తెలుపుతున్నారు.
  ఎడమొహం, పెడమొహంగా వున్నవాళ్ళు సైతం వచ్చిపోతున్నారు.
నారమ్మ కూడా వచ్చింది.
  ఎన్నో ఏళ్ళుగా రెడ్డిగారి పేడనీళ్ళు ముట్టకుండా తొక్కని ఆవిడ సైతం కళ్ళనీళ్ళు పెట్టుకొంది, నోట్లో గుడ్డ కుక్కుకొని రోదనను ఆపుకొంది.
  తండ్రి శవం వద్ద కూచుని తదేకంగా అటే చూస్తూ దుఃఖిస్తున్నాడు రమణారెడ్డి, కనీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. తండ్రి చనిపోయాడంటే ఇప్పటికి మనసు అంగీకరించటం లేదు.
   పెదనాన్న పేరుకు పెద్దవాడే అయినా, గ్రామ మునసుబు గిరి చేస్తున్నా, గ్రామంలో పెత్తనమంతా తన తండ్రిదే. చిన్నాయన సహాయంతో పంచాయితీలు చేయటం, గనుల నిర్వహణ. అన్నిట్లో హుషారుగా వుండేవాడు. గనివద్ద కూలీలకు ఆయనంటే ప్రాణం.
  తమకు ఎవ్వరితోనూ పెద్ద గొడవల్లేవు.
ఎలక్షన్ల సమయంలో కొంత మొహరింపు ఉన్నా, తర్వాత తమ ఆధిపత్యాన్ని సవాల్ చేసేవాళ్ళే ఎవ్వరూ లేరు.
 మనుషుల్ని చంపుకునేంత శతృత్వం ఏవైపునుంచి వచ్చిందో అర్థం కాకుండా వుంది.
ఇకపై తండ్రి లేకపోవటం వూహకే భరించరానిదిగా వుంది.
       
      ఉదయం సి.ఐ వచ్చాడు.
మరోగంటకు డి ఎస్పీ కూడ వచ్చాడు.
 శవాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించారు.
రెడ్డిగారి యిళ్ళవద్ద కుర్చీ వేసుక్కూచుని ఎంక్వయిరీ ప్రారంభించాడు డి.ఎస్పీ.
 ఎవ్వరిమీద తమకు అనుమానం లేదని చెప్పాడు పెద్దరెడ్డి.
 కుటుంబ సభ్యులంతా అదేమాట వినిపించారు.
 ఆశ్చర్యపోవటం పోలీసు అధికారుల వంతయింది.
 ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా అదే సమాధానం.
  ఎన్నో కోణాలించి విచారించి చూశారు. గ్రామ కక్షలు, వ్యాపారం, భూమి తకరార్లు, రాజకీయాలు. చివరకు అక్రమ సంబంధాల్ని గురించి ఎంక్వయిరీ చేశారు.  గ్రామంలో కెళ్ళి రచ్చబండల వద్దా, వూరబావుల వద్దా, ఇళ్ళవద్దా కన్పించిన మనిషినల్లా ప్రశ్నించారు.
  ఖూనికి సంబంధించిన అనుమానం ఎవ్వరిమీద వ్యక్తం కాకపోవటం విచిత్రంగా వుంది.
 డి.ఎస్పీకి ఏదో అనుమానంగా వుంది.
 ఖూనీ చేయబడ్డ వాళ్ళకు శత్రువులు లేరని చెప్పటం హాస్యాస్పదంగా అన్పించింది ఆయనకు.
 వాళ్ళేదో దాస్తున్నారని అతని వూహ.
  శత్రువు మీద తామే స్వయంగా కసి దీర్చుకోవాలని భావిస్తూన్నారేమో..!! అందుకే శత్రువు పేరు దాస్తున్నారేమో..!! చివరగా పెద్దరెడ్డిని, ఓబుళరెడ్డిని దగ్గరకు పిల్చి నమ్మకంగా చెప్పాడు  " నేను చాలా స్ట్రిక్ట్. ఎవరి వొత్తిళ్ళకూ లొంగను, నేరస్తుడెవడో మీకు తెలీదంటే నమ్మేంత అమాయకన్నిగాదు వాడెవడో చెప్పండి. చట్టప్రకారం అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తా. నేను ప్రలోభాలకు లొంగేవాన్ని గాదు, నన్ను నమ్మండి " అని
  ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వాళ్ళ సమాధానం మారలేదు.
 వాళ్ళకేసి తదేకంగా చూస్తూ మెల్లిగా తలూపి మరోసారి హెచ్చరించి అక్కణ్నించి కదిలాడు ఆయన.
 పొద్దు వాటాలే సరికి శవం వచ్చింది.
  అప్పటికే చుట్టపట్ల పల్లెల జనంతో వూరంతా కటకటలాడుతోంది. గని కూలీలలంతా కుటుంబ సమేతంగా వచ్చారు. తమ కన్నీళ్ళతో ఆ ప్రాంతాన్ని పునీతం చేశారు.
 సాయింత్రం దాకా మనుషులు వస్తూనే వున్నారు.
  దండోరి పల్లెలోని తమవాడైన సుబ్బారెడ్డి వర్గీయులంతా అక్కడే వున్నారు.  జరిగిన సంఘటనను గురించి రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
  పొద్దుగుంకే ముందు సంప్రదాయబద్దంగా శవసంస్కారం జరిగింది.
  ఆ సమయంలో అక్కడి వాతావరణమంతా శొకసముద్రమైంది.
  అంతిమ వీడ్కోలు తర్వాత ఊరంతా ఒక గంభీర ప్రశాంతతతో నిండిపోయింది.  రామిరెడ్డిని గురించిన స్మృతులు ఒకరితో ఒకరు పంచుకోవటంతోటే వీధులన్నీ రాత్రిళ్ళు మేలుకొన్నాయి.
  రాత్రి పదిగంటల సమయంలో రెడ్డిగారి యింట్లో రహస్య సమావేశం జరిగింది.  బంధువులు, రక్త సంబంధీకుల్లోని ముఖ్యులు అందులో పాల్గొన్నారు.  దండోరు పల్లె మనుషులు కూడా ఒకరిద్దరు వున్నారు.
  సుదీర్ఘ సమాలోచనానంతరం ఒక కార్యచరణ ప్రణాళిక సిద్దమైంది. దాని ప్రకారం -  మెదట శత్రువెవరో గుర్తించాలి. హత్య చేసింది అతనేనని నిర్దారణ అయిన మరుక్షణం ప్రతీకారానికి ప్రణాళిక రచించాలి.
 ప్రతి చర్య ఖచ్చితంగా జరిగితీరాలి.

                                                 ********

    రామిరెడ్డి మరణవార్త వినగానే హుటాహుటిన శివపురికి వచ్చాడు సమితి ప్రెసిడెంటు చింతకుంట చెన్నారెడ్డి.
  అప్పటికే రెండ్రొజుల ఆలశ్యమైంది.
  పెద్దరెడ్డి కుటుంబ సభ్యులందర్నీ గాద్గదికంగా పలుకరించాడు.
  " రామిరెడ్డి నాకు కుడిభుజం లాంటి వాడు. ఆనాకొడుకులెవురో నా కుడిభుజాన్ని నరికినారు, ఈ కష్టం మీది కాదు నాది..యీ పన్జేసినోడెవుడో తెలిస్తే వాని అంతుకనుక్కొంటా. వాడెంతవాడయినా సరే వదిలేది లేదు.." చెప్పాడు.
  ఆయన మాటలు యువకలందరికీ ఉత్సాహాన్ని కలిగించాయి.
  " ఎమ్మెల్లే వెంబడి హైద్రాబాద్ పోయున్నే.  సంగతి తెలిసి వచ్చేసరికి చివరి సూపు గూడా దక్కకుండా పోయే. "  కొంత సేపు వాపోయాడు.
  తర్వాత రామిరెడ్డి కొడుకులు ముగ్గుర్ని, ఓబుళరెడ్డి కొడుకులు నలుగుర్నీ భుజాల మీద చేతులేసి వీపు చరిచి ధైర్యమిచ్చాడు.
  రమణారెడ్డిని కొంత దూరం తీసికెళ్ళి రహస్యంగా ఏదో చెప్పాడు.
 రాత్రి పెదనాన్న వద్దకెళ్ళాడు రమణారెడ్డి.
  పక్కన్నే చిన్నాన్న ఓబుళరెడ్డి కూడ వున్నాడు.
 " పెదనాయన  ! నేను కాలేజి సాలిస్తా .." తలొంచుకొని చెప్పాడు
చివుక్కున తలెత్తాడు ఓబుళరెడ్డి.
  అప్పటికే పెద్దిరెడ్డి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకొన్నాయి.. కొడుకు కేసి  చూస్తూ " ఎందుకు నాయనా? " అన్నాడు నొసలు ముడేస్తూ.
  కొంతసేపు తటపటాయించి చెప్పాడు  " నాయన్ను సంపినోల్ల మీద పగతీర్చుకోవాల "
 " మేమందరం లేమా ? " ఓబుళరెడ్డి అన్నాడు వెంటనే.
 " నా సేతులారా వాన్ని సంపాల "
 " నిన్ను లాయరుగా సూడాలని మీ నాయన కలలుగంటా వున్నెడబ్బీ ! వాని కలదీర్చు.."
 " ఆయనే లేనెప్పుడు  ఆయన కలలు మాత్రం బతికి లాభమేంది పెదనాయనా  ? "
  కొంతసేపు మౌనంగా అతనికేసి చూశాడు పెద్దిరెడ్డి.
  మెల్లిగా ఆయన కళ్ళల్లో తడివూరి అది నీటి బుగ్గ ఐంది. రెప్పల చాటున్నించి ఉబికి డిబికి బైటకు రాబోతోంది.. " నాయన లేకుంటే మేము లేమా పెద్దోడా ! " అన్నాడు గద్గదంగా.  " బాలుడొకడు పోరంబోకుగా గనుల్లో తిరుగుతాండె. నువ్వూ వానికి తోడయితే మిగతా నీ తమ్ముల్లంతా నీదారే బట్టరా ? "
  " జరిగేటియన్నీ నువ్వులేకున్నా జరుగుతాయిగానీ... ఇంటి సంగతులన్నీ యీన్నే వొదిలేసి నీ సదువు పూర్తిజేయి. " ఓబుళరెడ్డి చెప్పాడు.
 అప్పటికే ఓబుళరెడ్డి కొడుకు బాలుడు వగైరాలంతా అక్కడికి వచ్చి వున్నారు.
 " మన కేసులు వాదించేందుకన్నా నువ్వు లాయరువు కావాల్సిందేన్నో ! " బాలుడు చెప్పాడు.
 మరేమి మాట్లాడలేదు రమణారెడ్డి.
 అంతలో బైట అలికిడి అయ్యింది.
 ఎవరో వచ్చినట్లుంది.
 వాకిలిదాక వెళ్ళి వచ్చాడు చెన్నకేశవ.
  ఊర్లోని తమ దాయాదులే
 కొంతసేపటికి మరో నలుగురు  చేరారు.
  రామిరెడ్డి అజాత శతృత్వాన్ని పొగడటం, అతని చావు పట్ల విచారాన్ని వెలిబుచ్చటం,  అతని చంపిన వాళ్ళమీద కోపం వెళ్ళగక్కటం..ఎవరెవరి మీదో అనుమానాలు వ్యక్తీకరించటం..
  పొద్దు బోయేదాకా యవ్వారాలు చేసి వెళ్ళారు వాళ్ళు.
  రాత్రి కూడా సరిగ్గా నిద్రబట్టలేదు రమణారెడ్డికి.
  తండ్రిని చంపిన రాక్షసుల మీద పగతీర్చుకోవాలని నెత్తురు మరుగుతోంది అతనికి.  మరోవైపు తనమీద ఆయన పెట్టుకొన్న ఆశలు. పెదతండ్రి, పినతండ్రుల ఆదేశాలు మెదడుకు చల్ల బరుస్తున్నాయి.
  ఇరుభావాల వొరిపిడిలో నిద్రపట్టక తెల్లార్లూ పడకమీద ఊరకే పొర్లుతూ వుండిపోయాడు అతను.
   పొద్దు పొడిచేసరికి దండోరు పల్లె మనుషులు ఇద్దరొచ్చి వున్నారు.  నిద్రలేమి వల్ల ఎర్రబారిన కళ్ళతో బైటకొచ్చి, జయసింహ అందించిన వేపపుల్లను తీసుకొని నమిలి పళ్ళు తోముకొంటూ అటు చూసేసరికి వాళ్ళు పెదనాన్నతో ఏదో రహస్యాలాడుతున్నారు.  వినేందుకు ప్రయత్నిస్తూ మెల్లిగా అటుకేసి నడిచాడు.
 " మా వూర్నాకొడుకులు దప్ప యేరేవాల్లెవురూ యీ పన్జేసుండరు పెద్దయ్యా ! "  చెప్పాడు ఓ మనిషి.
 విని తలూపాడు పెద్దిరెడ్డి.  కొద్ది క్షణాలు మౌనం తర్వాత " వొట్టి వూహలు పనికిరావాబ్బీ ! మనకు నిర్దారణ కావాల. ఫలానావాడని నిగ్గుదేలాల, ఖాయంగా వాడేనని తేలితే..దేనికయినా సిద్దమే ? " చెప్పాడు.
  " ఖాయంగా వాల్లేబ్బా ! "
  " ఎట్ల ..?  ఒకా రుజువన్నా వుండొద్దా  ?  " నిలదీశాడు.
  అప్పుడు వాళ్ళు ఏకరువు పెట్టారు.  తమ ప్రత్యర్థుల అరాచకత్వాన్నీ. అమానుషత్వాన్నీ వివరించారు, అంతటి హేయమైన క్రూరమైన పనులు గతంలో చేశారు కాబట్టే రామిరెడ్డిని వాల్లే చంపి వుంటారని నిర్దారించేందుకు ప్రయత్నించారు.
  పెద్దిరెడ్డి వొప్పుకోలేదు.
   ఎందుకో - వాల్ల మాటల్లో కొంత నిజమున్నట్లుగా తోచింది రమణారెడ్డికి. " పెదనాయనా ! వీళ్ళుజెప్పినట్లూ..." అంటూ కొనసాగించే లోపలే  " రమణా ! నువ్వూరుకోరా ! "  ఖండించాడు పెద్దిరెడ్డి.  తర్వాత దండోరుపల్లె వాళ్ళకేసి తిరిగి " మీరు సెప్పేదంతా నిజమే. ఆ రంగారెడ్డిగాడు రాక్షసుడే, అయితే మనకు రుజువులు కావాల, యీపని వాడే జేసినట్లు తెలియాల. కనిపెట్టండిరా ! సాక్ష్యాలు బైటికి తీయండి..అప్పటిదాక రవ్వంత ఓపికబట్టండబ్బీ ! "  చెప్పాడు.
    వాళ్ళు వెళ్ళిపోగానే రమణారెడ్డిని దగ్గరకు పిల్చుకున్నాడు పెద్దిరెడ్డి.  " ఎన్నేండ్లనుంచో  యీల్లకూ, వాళ్ళకూ తగువులాటలు నాయనా ! ఎంత పోరాడినా యీ సుబ్బారెడ్డిగాని గుంపు రంగారెడ్డి గాన్ని వొంచలే కుండారు.  సందు దొరికింది గదాని మనకేసులో రంగారెడ్డిగాని మందిని యిరికించాలని సూస్తాండరేమో ! మనసేత ఎగస్పార్టీ వాల్లను దెబ్బదీయించాలని వుపాయమెత్తినారేమో..? కీడించి మేలెంచాల పెద్దోడా ! రెండ్రోజులు సూద్దాం, మనమూ విచారించుదాం మల్లనే నిర్ణయం దీసుకుందాం. తొందరేముంది నాయనా ! యిట్లాంటి విషయాల్లో జాగర్త పడకుంటే దుంపనాశనమవుతామురా పెద్దోడా ! ’ చెప్పాడు.
  తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు రమణారెడ్డి.
  హంతకుల ఆచూకి కోసం తనకు తెలిసిన వాళ్ళందరి సహాయమూ తీసుకోదల్చాడు పెద్దిరెడ్డి.  ఆ దిశగా  ఓబుళరెడ్డిని సమాయత్త పరిచాడు.
  గతంలో యిట్లాంటి బైటి వ్యవహారాల్లో రామిరెడ్డి చురుగ్గా వుండేవాడు.  ఇప్పుడు ..రెండు భాద్యతలు ఓబుళరెడ్డి మీద పడ్డాయి.
    గని కూలీల్ని కూడా హెచ్చరించాడు పెద్దిరెడ్డి,
 చిన్న తీగ దొరికినా దాన్ని పట్టుకొని డొంకంతా లాగొచ్చు, అనుమానమున్న పల్లెలకు మనుషుల్ని పంపారు.
 కిరాయి హంతకుల కదిలికల కోసం ఆయా వూరి రెడ్లను విచారించారు.  పెద్దకర్మ లోపలే హంతకుల్ని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు గాని సాధ్యం కాలేదు.
 కర్మ అయిపోగానే కాలేజికి వెళ్ళాడు రమణారెడ్డి..  అతని తమ్ముళ్ళల్లో బాలుడు మినహా మిగిలిన వాళ్ళంతా కూడా చదువులకు వెళ్ళారు.

                                                                                        ..........సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs