.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

  బక్కెట్లను మోసే భాద్యత తీసికొన్న ఎనుబోతుల సుబ్బారెడ్డి - రెండు బక్కెట్లను  రెండు చేతల్లో పట్టుకొని వాళ్ళకు అందకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు.
  అతనెందుకు పారిపోతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు.
 కేకలేసి పిల్చినా నిలబడలేదు.
 ప్రయోగించేందుకు చేతుల్లో బాంబులు లేవు.
 మొదటి గ్రూపు అప్పటికే దూరంగా వెళ్ళింది.
 ఏం చేయటానికి తోచలేదు.
 మూడవ గ్రూపు కేసి చూస్తూ కేకలేశారు  " బాంబులు...  బాంబులు తీసకరాండి...  "  అంటూ.
  వాళ్లు కూడా జరుగుతోన్న దృశ్యాన్ని గమనించారు.
 పొరబాటును సవరించేందుకు ముందుకు రాబోయారు.
 అప్పటికే రెండు నిమిషాల విలువైన సమయం దొరికింది చెన్నారెడ్డి గన్‌మెన్‌కు - తను షాక్ నించి తేరుకొనేందుకు.
 వెంటనే జీపులోంచి కిందకు దిగదూకారు.
ఎల్.ఎమ్.జి ఎయిమ్ చేసి గాల్లోకి రెండు రౌండ్లు పేల్చిన తర్వాత నేరుగా మూడవ గ్రూపు కేసి గురి పెట్టాడు.
 పరిస్థితి అర్థమై రెండు గ్రూపులూ దూరంగా పారిపోక తప్పలేదు.
 చెన్నారెడ్డిని జాగ్రత్తగా జీపు దింపి మరో జీపులో కూచోబెట్టి రివర్స్ చేసి టౌన్లోకి తీసుకెళ్లాడు గన్‌మెన్.
 శివపురి వర్గం కూడా తమ జీపులెక్కి పారిపోయారు.
 కొన్ని రోజుల పాటు వాళ్లంతా అఙ్ఞాత వాసంలోకి వెళ్ళక తప్పదు.
 మర్డర్ జరిగింది గాబట్టి కేసులుంటాయి, అరెస్టులుంటాయి, బెయిళ్ల కోసం ప్రయత్నించాలి.
 ఆ పది రోజులూ మినిష్టర్ గెస్ట్ హౌస్‌లో గడిపారు శివపురి వర్గమంతా.
 రెండవ దాడితో రమణారెడ్డి పేరు రాష్ట్రమంతటా పాకింది.  చెన్నారెడ్డి మీద హత్యాయత్నాన్ని గురించి రేడియోలు గీపెట్టాయి.  " మృత్యుంజయుడు చెన్నారెడ్డి "  అంటూ పత్రికలు వార్తలు రాశాయి.
  ఎనుబోతుల సుబ్బారెడ్డి ఎందుకట్లా బాంబులు బక్కెట్లను దూరంగా తీసికెళ్లి చెన్నారెడ్డి ప్రాణాలు కాపాడాడో అర్థం కాకుండా వుంది.
  అందరికీ బెయిలు తెచ్చుకొన్న తర్వాత ఒకనాడు జీపులో వెళ్లి సుబ్బారెడ్డిని లాక్కొచ్చాడు బాలుడు.
 నోటికి ఎట్లా వస్తే అట్లా తిడుతూ తలొక దెబ్బ వేశారు.
 లబలబ మొత్తుకొన్నాడు సుబ్బారెడ్డి.
 తనకు తెలిసి ఆపని చేయలేదన్నాడు.
 ఏదో మైకం కమ్మి అట్లా వెళ్లానన్నాడు.
ఎంత కొట్టినా అతన్నించి అదే సమాధానం.
  మెడబట్టి బైటకు నెట్టి వదిలేశారు అతన్ని.
  విషయమంతా విని వక్కాకు ఎంగిలి తుపుక్కున వూస్తూ  " మీకు తెలివిలేక వానిసేతికి బక్కెట్లిచ్చినారు... "  అన్నాడు పెద్దిరెడ్డి.
  పెదనాన్న కేసి ప్రశ్నార్థకంగా చూశాడు రమణారెడ్డి.
  " నీ చెయ్యి నరికినోన్ని,  వాని చెయ్యీ నరకాలని నీకు కసిగా వుంటాదిగాని, నీజేబులో లెక్క తీసుకొన్నోని సెయ్యి నరకాలని నీకెప్పుడూ వుండదబ్బీ ! వాడూ అంతే.... వాని కొడుకునో, తమ్మున్నో చెన్నారెడ్డి సంపింటే వానిగ్గూడా అతన్ని సంపాలని కసి వుండేది. తీసుకున్నె భూములు ఎప్పుడోకసారి యియ్యడా అని ఆశ..... ముందంతా బీరాలు తీసినోడు సంపేకాడికొచ్చేసరికి వానికి.. తెలియకుండానే కడుపులోంచి పాపభీతి తన్నుకొని వచ్చుంటాది... "  చెప్పాడు.
 పెద్దిరెడ్డి విశ్లేషణ అందరికీ నచ్చింది.
 తాము మరోసారి పొరబాటు చేశారు.
 మనుషుల్ని ఎన్నుకోవటంలో తప్పటడుగు వేసి లక్ష్యం సాధించలేక పోయారు.  తామెన్ని ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుందో - విజయం సాధించే సరికి... !
 రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి.
 మందూ మాంసమూ లేకుంటే జనాలు అడుగు ముందుకేసేట్టు లేరు.
 డబ్బు గురించి యిబ్బంది లేదుగాని ఎన్నాళ్లిలా అపజయాల మీద అపజయాల్ని మోయటం..!
   రాత్రి మిద్దె మీద పడుకున్నపుడు అందరూ తమ సహజశైలిలోనే తమాషాలాడుకొంటూ, తిట్టుకొంటూ ఏవేవో సంఘటనల్ని చెప్పుకొని నవ్వుకొంటూ గడుపుతున్నారు గాని రమణారెడ్డి వాళ్లల్లో కలవలేకపోయాడు. మనస్సులో అపజయానికి సంబంధించిన బాధ అతన్ని పీడిస్తూ వుంది. మళ్లీ ఇంతమంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుందని..!
  తను వేసిన జోకులకు నవ్వక పోయేసరికి మజ్జిగ గోపాల్ నొసలు ముడేసి చూశాడు. తన పిట్ట కథల్ని ఆసక్తిగా వినకపోయేసరికి చంద్ర ఆశ్చర్యపోయాడు. తమ మాటల్లో పాలుపంచుకోకుండా వున్న రమణారెడ్డి పరధ్యానాన్ని అందరూ పసిగట్టారు.
  " ఏమన్న !  వొల్లు బాగలేదా ? "  మజ్జిగ అడిగాడు.
 రెండు సార్లు తర్వాత అతన్నించి జవాబొచ్చింది.  " వొల్లు గాదు మనస్సే... "  
  " అదేందో అందరికీ సెబుతేగాదూ మంచీ చెడ్డా తెలిసేది. ? "
  " మీ అందరికీ తెలిసిందే ! "
  " అందరికీ తెలిసీ నిన్నొక్కన్నీ బాధపెట్టేది ఏందబ్బా ? "
  " అదేరా !  వాన్ని సంపలేకపోతనామనే బాధేరా ! వాడు మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటే మనతో అవుతుందా అని ఆలోచన.. "
 " ఓ... అదా ! "  అన్నట్లు తేలిగ్గా చూశాడు మజ్జిగ.  " పైరు బెట్టినాం బ్రదరూ ! నాట్లేసినాం - కలుపుతీసినాం... అది పండక మానదు. మనం కొయ్యకా మానం ..."
  సమధాన పడలేదు రమణారెడ్డి.
  కొంత సేపయింతర్వాత రాఘవ అతని దగ్గరగా వెళ్లాడు.  " అన్నా !  సేతనయినకాడికి ( చేతనయనంత వరకు )  పోరాడుదాం.  సేతగాని రోజు నా వొక్కని మీద వొదిలేయ్యండి...  వాన్ని నేనే సంపుతా ! "  అన్నాడు.
 అతనికేసి వింతగా చూశాడు రమణారెడ్డి.
  " అవున్నా ! ఇక్కడికి రాకుంటే నేనెప్పుడో చచ్చేవాన్ని, నా చావు ఖాయం జేసుకొనే మాయబ్బ( నాన్నకి నాన్న).... నన్నీడ విడిచిపెట్టింది.  వాన్ని మామూలుగా సంపలేమనుకో.....  వొడిగట్టుకొని వొడినిండా బాంబులు పోసుకొని వాని మీద దూకుతా.  వాన్ని సంపి నేనూ సస్తా...!  ఎమ్మెల్లే గాడు సావడనే భయం వొదిలిపెట్టన్నా ! "
  ఒక్క క్షణం ధిగ్భ్రాంతికి గురయ్యాడు రమణారెడ్డి.
 వింటూ వున్న వాళ్లంతా కూడా ఆశ్చర్యపోయారు.
  అతనికేసి అపురూపంగా చూడసాగారు.
  ఉన్నట్టుండి మజ్జిగ గోపాల్ అతని దగ్గరగా వెళ్లి  " తమ్మునివంటే నువ్వేరా ! "  అంటూ నడుము కరుచుకొని పైకెత్తి వదిలాడు.
 అక్కడంతా ఉత్తేజకరమైన వాతావరణం ఆవరించింది.
 కొత్త వుత్సాహంతో వాళ్లకు పొద్దు పొడిచింది.
  యధా ప్రకారపు కార్యకలాపాలకు మల్ళీ అంకితమయ్యారు.

                 *********

  చెన్నారెడ్డి తన చుట్టూ ఇప్పుడు అభేధ్యమైన రక్షణ వలయాన్ని నిర్మించుకొన్నాడు. ఇదివరకటిలా అతని మీద దాడి చేసేందుకు అవకాశంలేని గోడ సృష్టించుకొన్నాడు.
  అదను కోసం ఎదురు చూస్తూ వున్నారు వాళ్లు.
  కోర్టు వద్దనో, పోలీసు స్టేషన్ వద్దనో ఎదురు పడినపుడు వాళ్లకేసి మిర్రి మిర్రి చూస్తున్నాడు చెన్నారెడ్డి.  పొట్టిగా, నల్లగా, తనలో సగం కూడా లేని శివపురి సోదరుల్నించి తనకు ప్రాణభయం ! ఆలోచిస్తే సిగ్గు చేటుగా అన్పిస్తుంది.  కానీ వాస్తవాల్ని దాచలేం గదా !
  తనలాగా డబ్బుగానీ, రాజకీయంగానీ, అంగబలం గానీ వాళ్లకు లేవు -  తనను మర్డర్ చేయాలనే ఒక్క కమిట్‌మెంట్ తప్ప....  ఆ ధ్యేయమే వాళ్లకు డబ్బును, రాజకీయాన్ని సమకూర్చి పెడుతోంది.
వాళ్లిప్పుడు తనకు మొగుళ్లయి..  కాదు కాదు... యముళ్లయి కూచున్నారు.
  జీవితంలో మొట్టమొదటి సారిగా అతనికి అన్పించింది - తనేమైనా పొరబాటు చేశాడేమోనని.
 శివపురి ఓబుళరెడ్డిని చంపటం పొరబాటు కాదు గదా !
 తల అడ్డంగా తిప్పాడు.
 అతను తన రాజకీయ జీవితాన్ని చంపేందుకు ప్రయత్నించాడు.
  రాజకీయం లేకుంటే తన వునికి కష్టమే గదా !
 అందుకే తనతన్ని చంపించాడు.
 బైట శత్రువులకు తోడు తనకు ఇంట్లో కూడా ఓ శత్రువు.
 బైట జీవన్మరణ సమస్యలతో సతమతమవుతోంటే,  ఇంట్లో ఓదార్పు లభించటం మాట దేవుడెరుగు పెళ్లాం సాధింపులు ఎక్కువయ్యాయి.
  జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద అటాక్ జరిగిన రోజు ఇంట్లో ఆడదాని సాధింపులే తనకు బరువయ్యాయి.
 అందుకే యీ మద్యకాలంలో ఎక్కువగా హైద్రాబాదులోనే వుంటున్నాడు. ప్రియురాలి కౌగిలిలో సమస్తం మరిచిపోయి బతుకుతున్నాడు.  తన సమస్యలతో కొట్టుమిట్టాడే కొద్దీ జనం సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. అన్నిటికంటే పెద్ద సమస్య కరువు... వర్ష బావం వల్ల పైర్లన్నీ ఎండిపోయాయి.  వాళ్ల కోసం వడ్డీ మాఫీ, పంటల భీమా పథకంలాంటి వాటి మీద అసెంబ్లీలో నిలదీయాల్సిన సమయం.. వాటి పైకి మనస్సు పోవటం లేదు.  గ్రామ నాయకులు కూడా వాటిని గురించి పట్టించుకోవటం లేదు - ఎప్పుడూ తమ వ్యక్తిగత లాభాల కోసం ప్రయత్నించటం తప్ప వాళ్ల కోసం తను అప్పుడప్పుడూ కలెక్టర్ వద్దకో, ఆర్.డివో వద్దకో వెళ్లటం తప్ప ఎక్కడికీ తిరగటం లేదు.  ఎక్కిడికి వెళ్లినా విసృతమైన బందోబస్తు అవసరమవుతోంది. తన రక్షణ వలయంలో తనకే వూపిరాడనంత పరిస్థితి.
  జి.పి.ఆర్ వద్ద దాడిని గురించి ఆలోచిస్తే యీ రక్షణ అంతా మాయగా తోస్తుంది.
 అయినా తప్పనిసరి గదా  !
  ఎంతగా రాటు దేలారు శివపురి కుర్రాళ్లు. !
 అమాయకంగా కన్పించే రమణారెడ్డి ఎంత క్రూరంగా తయారయ్యాడనీ !
  ఈ గొడవలన్నిటికీ కారణం అతడేనేమో  !
  విజయవాడలో వాడు  ’లా ’ చదివేటపుడు తనకు ఓబుళరెడ్డికి మద్య పెట్టిన చిచ్చే యీ గొడవలన్నిటికీ మూలం.
 తనకు బాగా గుర్తుంది.
  రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న ఓబుళరెడ్డిని చూసి వద్దాం రమ్మని పిల్చాడు వాడు.
 తను జీపు తెచ్చుకోలేదని చెప్పాడు.
  వాస్తవానికి జీపు తెచ్చుకొనే వున్నాడు.  వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లటం కుదరక అట్లా చెప్పవలసి వచ్చింది.
  వ్యక్తిగతమంటే - అందమైన కోస్తా అమ్మాయితో గడిపే అవకాశం వచ్చింది ఆ రాత్రికి.
 తన జీపుని చూసినట్టుంది వాడు.
 చిన్నాయనకు వున్నవి లేనివి కల్పించి చెప్పాడు.
  ఆ రోజునించి ఓబుళరెడ్డి తనమీద కక్ష గట్టాడు.  తన పరువు తీయటం మొదలెట్టాడు.
  అన్నిటికీ ఓర్చుకొన్నాడు తను.
 చివరకు తన రాజకీయ జీవితాన్ని కూడా తుడిచివేయాలని చూశాడు.  తన జీవితాన్ని కాపాడుకొనేందుకు అతన్ని అడ్డు తొలిగించుకోక తప్పింది గాదు.
 ఇప్పుడది తనకు ఉరిగా మారింది.
 ’ దీనికంతటికీ కారణం ఆ పొట్టి వెధవే... ’
 కసిగా పళ్లు కొరికాడు చెన్నారెడ్డి.
 కిరాయి గూండాల చేత వాన్ని చంపిద్దామనుకొంటే సాధ్యపడేట్టు లేదు.  వాడు ఒక్కడు కాదు. గుంపు... ఎప్పుడూ మందితో కలిసి వుంటాడు. ముఖాముఖి యుద్దానికి దిగుదామంటే వీలయ్యేట్టు లేదు.
 పోలీస్టేషన్ ముందే గొడవలకు పూనుకొన్న తెగువ వుంది వాళ్లకు.
  తను ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టబడుతున్నాడు తప్ప - వాళ్లకు ఆ అవస్థను కల్పించలేక పోతున్నాడు.
  దీనికి కారణం బహుశా - తన శత్రువు రమణారెడ్డి ఒక్కడే కాదు గాబట్టి.
 వాడు పోయినా ఇంకొకడు.
  ఏడుమంది సోదరులు పోయినా మజ్జిగ గోపాల లాంటి వాళ్లయినా తన మీద కసిదీర్చుకొనేందుకు వెనుదీయరు.
  తన్ను చంపాలనే ధ్యేయం తప్ప వాళ్లకు మరొకటి లేదు.
 తన పక్క ఎంతమంది జనముంటే మాత్రం ఉపయోగమేముంది...? ప్రాణాలు అడ్డపెట్టేవాడు ఒక్కడన్న లేకుండా...!!
ఒక్కడు....  ఒక్కడైనా తనకు అండగా నిలబడొచ్చుగదా - జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద అటాక్ జరిగినపుడు.
  కావలసినన్ని ఆయుధాలు చేతబెట్టుకొని కూడా పారిపోయారు.
అంటే -  తన ప్రాణం కన్నా ఎవరి ప్రాణం వాళ్లకు గొప్పదైంది.
 అవతలి వాళ్లల్లో యీ భావన కన్పించటం లేదు.  తమ ధ్యేయం మూడు ప్రాణాల్ని చిత్తుకాగితాలతో సమానంగా చూస్తున్నారు.
  తన గన్‌మెన్‌కు ప్రాణం కంటే ఉద్యోగ ధర్మమే గొప్పదిగా అన్పించింది కాబట్టి తను బతికి పోయాడు.
  ఎప్పుడైనా కోర్టు వద్దో, పోలీస్టేషన్‌లోనో ఎదురు పడినపుడు శివపురి సోదరుల్ని చూస్తూనే చెన్నారెడ్డికి అన్పిస్తుంది  ’యీ అర్భకుల్ని తను చంపలేక పోవటమేమిటీ ? ’ అని.  ఇప్పటి కిప్పుడు తుపాకితో కాల్చిపారేస్తే మాత్రం ఏమౌతుందేమిటి..?  మహా అయితే కేసే గదా ’  అన్పిస్తుంది.
 అయితే - చెన్నారెడ్డిని చూసినపుడు బాలునికి కూడా అలాగే అన్పిస్తుంది. ’పరుగెత్తుకొంటూ వెళ్లి వాన్ని పొడిచి చంపితే ఏమవుతుందేమిటి ? ’ అని.  ’గన్‌మెన్ ఫైర్ జేస్తాడేమో ! ఇద్దరం చస్తాం అంతే గదా...  తనుపోయినా ఆరుగురు సోదరులు మిగులుతారు గదా ! ’
  అట్లాంటి ఆలోచనలు దగ్గరకే రానివ్వొద్దంటాడు రమణారెడ్డి.  తమ వైపునించి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదుట..!

                           *********

   చెన్నారెడ్డి గతంలోలాగా స్థానికంగా వుండేందుకు ఎక్కువ సమయం కేటాయించక పోవటం వలన అతను ఎక్కడో కాంట్రాక్ట్ పని తీసుకొని తన కొడుకుల్ని, అన్నకొడుకుని అక్కడే వుంచాడనే పుకార్లు వ్యాపించాయి తాలుకాలో.
  వాటిని పట్టించుకోలేదు రమణారెడ్డి.
  అతనిమీద దాడి జేసేందుకు కొత్త పథకాల్ని రచించే ప్రయత్నంలో తలమునకలుగా వున్నాడు.
  ఒకరోజు ఉదయమే ఇంట్లో ఫోను మోగింది.
 దగ్గరే వున్న రమణారెడ్డి రిసీవర్ ఎత్తాడు.
 " హలో !  ఎవురు ?  ప్రభాకరేనా ? "  అవతల్నించి ప్రశ్న.
 ’ ఏ ప్రభాకర్ ?  బాలుని ఫ్రెండేమో !!’
 " రేయి ! "  అంటూ బాలున్ని పిల్చి " ఫోన్ " అని చెప్పాడు.
 " ఆ... నేనే - చెప్పండి "  తనకే ఫోననుకొని పలికాడు బాలుడు.
 "  సాయింత్రం ట్రైన్‌కు పెద్దాయన వస్చాండాడు. జీపు దీస్కొని స్టేషన్‌కు రా !  నడింపల్లె మాసుల్ని రెండు జీపుల్నిండా తీస్కొని రా ! కడపలో దిగుతాడు.. "
  ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాడు బాలుడు.
 " ఆ...  సరే - " చెప్పి ఫోను పెట్టేశాడు.
  అతని మొహం నిండా చిరు చెమటలు జిబజిబమంటూ పొటమరించాయి.
 " అన్నా ! "  అన్నాడు ఉద్విగ్నంగా.
  అతని ముఖ కవళికలు చూసి ఆశ్చర్యపోతూ దగ్గరగా వచ్చాడు రమణారెడ్డి.  " ఏంబీ ?  ఏందీ ? "  అన్నాడు.
  జరిగిన విషయం చెప్పాడు..
  అతని ముఖ కవళికలు కూడా మారిపోయాయి.
  బద్వేలు పార్టీ ఆఫీసుకు వెళ్ల వలసిన ఫోను పొరబాటున తమ ఇంటికి వచ్చింది.
 చివరి రెండు డిజిట్స్ స్వల్ప తేడా వుండటం వలన అప్పుడప్పుడూ యీ పొరబాట్లు జరుగుతూ వుంటాయి.
  తాము కూడా బైట్నించి ఫోన్ చేసేటపుడు చాలా సార్లు వాళ్ల ఆఫీసు నెంబర్ డయల్ చేసే వాళ్లు.
 తమ ఫోన్ నంబర్ చివరి రెండంకెలు 72 అయితే వాళ్ల నంబర్ చివరి అంకెలు 27... చిన్న తేడా... కొద్ది పాటి పొరబాటు.
  ఆ పొరబాటే తమకిప్పుడు లాభిస్తూవుంది.
 మద్యాహ్నం నించి ప్రయాణమయ్యారు ఆయుధాలతో సహా.

                                                                                                ........... సశేషం

                                                                                  .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

   జీపు చాటున్నించి ఒక్క సారిగా బైటకొచ్చాడు బాలుడు.
  చేతిలోని బాంబును లాఘవంగా ముందుకు విసిరాడు.
 అది తెల్లగా పావురంలా ఎగురుకోంటూ దూసుకెళ్ళి జీపులోని చెన్నారెడ్డి చేతికి తగిలి జారిపడింది.
  బలంగా తాకటంతో  ’అబ్బా ’ అంటూ చేత్తో తడువుకొన్నాడు అతను..
 బాంబు పేలక పోవటంతో నిశ్చేష్టుడయ్యాడు బాలుడు.
 అప్పటికే జీపు డ్రైవర్ అలర్టయినట్టుంది.
 జీపు వేగం ఒక్కసారిగా పెరిగింది.
 అరుగుమీది జనాల మద్యనున్న రాఘవ హుషారుగా లేచి నిల్చున్నాడు. చేతిలోని బాంబును విసరికొట్టాడు డ్రైవర్‌కు గురిచూసి.
 అది వెళ్లి డ్రైవర్ భుజానికి తగిలింది.
 బాలుడు విసరిన మరో బాంబు జీపుకు తగిలింది.
 మూడు బాంబులూ పేలలేదు.
తనకు తగిలింది బాంబుగా అర్థమయ్యేసరికి చెన్నారెడ్డికి పై ప్రాణాలు పైన్నే పోయాయి.
 మొదట ఏదో రాయనుకొన్నాడు.
జారి కాళ్ళ మీద పండింతర్వాత తెలిసింది అది బాంబని.
 ఆగమేఘాల మీద అక్కణ్నించి దూరమైంది జీపు.
 అప్పటికే రివర్సయి రోడ్డు మీదకు వచ్చి వుంది శివపురి వాళ్ళ జీపుకూడ.
  చేతిలో బాంబుల్ని కసిగా నేలకేసి కొట్టాడు బాలుడు.
 నాలుగు బాదినాగాని ఒక్కటి పగల్లేదు.
 అంతులేని కోపంగా వుంది అతనికి.
 భరించరాని అసహనంగా వుంది.
 అద్భుతమైన అవకాశం చేజారిపోయింది.
 నేరుగా గనివద్ద కెళ్ళి బాంబ్ మేకర్ని కలిశాడు.
 " నన్నడగొచ్చు గదా రెడ్డీ ?  ఎందుకు తీస్కపోతనారో చెప్పక పోతిరి. నేనట్లా బైటకు పోయెచ్చేలోపల బక్కెట్లకు ఎత్తినారు, ఎనకనించి పిలుస్చా వున్న్యా వినపడ్లా.... మీరు తీస్కపోయిన బాంబులు ఇప్పుడే పిసికి ఆరబెట్టి వున్నే.....  గంటసేపన్నా ఆరివుంటే పేలేవి.  అయినా టెస్ట్ జెయ్యకుండా ఆయుధాలు వాడకూడదు రెడ్డీ ! "  చెప్పాడు బాంబ్ మేకర్.
  "  సరె సరే అర్జంటుగా మంచి బాంబులు బక్కెట్లకెత్తు... "
 బాలుడు చెప్పటంతో వెంటనే సిద్దపరచ బడ్డాయి.
  జీపు మళ్ళీ రోడ్డెక్కింది.
 అవగాహన రాహిత్యంతో అపూర్వావకాశాన్ని మిస్ చేసుకొన్నారు.
 ఇప్పుడయినా మించిపోయింది లేదు.
 ఒంటరి జీపుతో వెళుతున్నాడు ఎమ్మెల్లే
 పోరుమామిళ్ళలోనయనా  అటాక్ చేయాలి.
 శరవేగంతో దూసుక పోసాగింది జీపు.
  కనుచూపు మేరలో చెన్నారెడ్డి వాహనం కన్పించలేదు.
 అది అందదని తెలుసు ఏదైనా ఆటంకం జరిగితే తప్ప.
  అయినా తమ ప్రయత్నం మానకూడదు.
 పోరుమామిళ్ళ పొలిమేరలు సమీపించేసరికి వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఎమ్మెల్లే జీపు కన్పించేసరికి హుషారు పెరిగింది.
 డ్రైవర్‌ను తొందరించారు.
  జీపు వేగం మరింత పెరిగింది.
 బకెట్లలోని బాంబుల్ని తలా ఒకటి అందుకొన్నారు.
  జీపు ఏ మాత్రం అదుపు తప్పినా వాళ్ళ చేతిలోని బాంబుల్తో వాళ్ళే బలి కావలసి వస్తుంది.  ఆ విషయం అందరికీ తెలుసు. కర్తవ్యం కలిగించే హుషారు ముందు చావు భయం దగ్గరకు రావటం లేదు.
  వీళ్ళను గమనించునట్టుంది - చెన్నారెడ్డి జీపు కూడా వేగం పుంజుకొంది.
 అప్పుడే రోడ్డు దాటుతూ వున్న చివరి బర్రెనూ, చేలల్లోని మందను చూడగానే అర్థమైంది - ముందు జీపు ఎందుకింత ఆలస్యమైంది.
’బర్రె మహాతల్లులు మరికొంత కనికరం చూపించివుంటే బావుండేది. ’
 రెండు జీపులు టౌన్లోకి ప్రవేశించాయి.
 వాటి వేగానికి జనాలంతా ఆశ్చర్యపోతున్నారు.
 వందగజాల మధ్య దూరంతో విపరీత శబ్దాలు చేసుకొంటూ వెల్తున్నాయి.
 ఊళ్ళో ఎక్కడా నిలబడలేదు చెన్నారెడ్డి జీపు.
 ఊరికి ఉత్తర శివార్లలో వున్న పోలీసు స్టేషన్ వద్ద స్లో అయింది. నేరుగా స్టేషన్ ప్రహరీ ముందు ఆగింది. క్షణం కూడా ఆలశ్యం చేయకుండా అందులోంచి దిగదూకి గబగబ సి.ఐ. ఆఫీసులోకి వెళ్ళాడు చెన్నారెడ్డి.
  అతని చేతిలో పగలని బాంబుంది.
 ముందు జీపు వెనకే స్టేషన్ దాటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ముందు ఆగింది శివపురి వాళ్ళ జీపు కూడా.
  లోపల్నించి దిగకుండ స్టేషన్ కేసి చూస్తుండి పోయారు వాళ్ళు.
 పది నిమిషాలు గడిచినా చెన్నారెడ్డి బైటకు రాలేదు.
 రోడ్లోంచి వాళ్లు కదల్లేదు.
 పోలీసులు మాత్రం కాంపౌండ్ వాల్ లోపల్నించి నిక్కి నిక్కి చూస్తున్నారు. శివపురి జీపు కేసి వేలెత్తి చూపుతున్నారు.
 అంతలో రమణారెడ్డి జీపు వచ్చి తమ జీపు పక్కగా ఆగింది.
 వాళ్ళకు విషయం తెలిసి హుటాహుటిన వచ్చారుట.
 బాలునికి మరింత బలం పెరిగినట్లయింది.
 లోపల నించి ఓ పోలీసు నేరుగా వాళ్ళ వద్దకొచ్చాడు.
 రమణారెడ్డికి సెల్యూట్ చేశాడు.
 " ఎమ్మెల్లే లోపల కూచోనుండాడు.  మీరు ఎంట బన్న్యారంట... బాంబులు ఏసినారంట...  బాంబులు కూడా చేతబట్టకోనొచ్చినాడు..  - సి.ఐ. సార్ లేరు.  ఆయనొచ్చే లోపల మీరు వెళ్ళిపోండి... "  చెప్పాడు.
  " ఎందుకు పోవాల  ?  "  జయసింహ అన్నాడు.  " ఆయప్పే మామీద బాంబులేసి వొచ్చినాడు.  మేం కూడా కేసు బెట్టడానికే యిక్కడి కొచ్చింది. ఆయప్ప లోపలుండాడు. అతను బైటికి పోతే రావాలని మేమిక్కడ కాచుకొనుండాం "  చెప్పాడు.
  " స్టేషన్ వాల్లబ్బ సొమ్మంటనా.... ఎంత సేపైనా కూచోడానికి.. ?  బెరీన బైటకు పంపండి  లేదా మేమే వస్చాం... మీకెందుకు ట్రబులివ్వాలా అని మేమీడుండేది.  ఆయప్పకేం భయపడి కాదు..."  బాలుడన్నాడు.
 " పోవయ్యా !  ఎమ్మెల్లేను బైటకు పంపీపో... మేం రావాల.  బద్వేలులో హోం మినిస్టర్ ప్రోగ్రాముంది. సర్‌ఫ్రైజింగ్‌గా వస్తున్నాడు. మీ సి.ఐ కూడా అక్కడికే వెళ్ళుంటాడు. మేమూ పోవాలి.  సి.ఐ ని అక్కడే కలుస్చాం గాని ముందు ఎమ్మెల్లేను బైటికి పంపీండి..."  రమణారెడ్డి చెప్పటంతో కానిస్టేబుల్ రెండు చేతులెత్తి దండం పెట్టాడు.  " సార్  ! గొడవలయితాయి సార్ ! మాకు చెడ్డ పేరొస్చాది..  మీరు పోండి సార్ ! ".
" ముందు వాన్ని బైటికి రమ్మను  వాని కతేందో తేల్చుకొని ఈ రోజు హోం మినిస్టర్‌ను కలవాలి "  తీక్షణంగా చెప్పాడు రమణారెడ్డి.
 మరేం మాట్లాడకుండా పోలీసు వెనుదిరిగాడు.
 అదే సమయంలో రోడ్డుకు దక్షిణంగా రంపాడు క్రాస్ వద్ద కొచ్చి ఆగాయి ఆరు జీపులు.
  వాటిల్లోంచి దిగుతోన్న జనాన్ని చూడగానే రమణారెడ్డి వర్గానికి అర్థమైంది అవి ఎమ్మెల్లేకు సంబందించినవని.
 విషయం తెలిసి వచ్చినట్లుంది వాళ్ళంతా.
 కొంతమంది జీపుల్లోంచి బక్కెట్లు దించి పట్టుకొస్తున్నారు.
 యుద్దానికి సిద్దమయ్యే వచ్చినట్లుంది.
 క్షణం కూడా ఆలస్యం చేయలేదు శివపురి వాళ్ళు.
 జీపుల్లోంచి అందరూ కిందకు దిగారు.
 బక్కెట్లు కూడ దించబడ్డాయి.
 వెనక వచ్చిన రమణారెడ్డి కూడా కావలసినంత ’సరుకు ’ పట్టుకు రావటం వల్ల మేలయింది.
 బాంబులు చేతుల్లోకి తీసుకొన్నారు.
 మొదట చెన్నారెడ్డి గుంపు వైపున్నించే బాంబు దూసుకొచ్చింది. అది నడిరోడ్డు మీద పెద్ద శబ్దంతో పేలగానే జనం కకావికలయ్యారు. స్టేషన్‌ లోపలున్న పోలీసులు ఉలిక్కిపడి చూశారు. ఎదురుగా వున్న ఆంజనేయస్వామి గుడిలోని భక్తులు  " రామ రామా ! "  అంటూ చెవులు మూసుకొని వణకి పోసాగారు.
  ఇరువైపుల్నించి బాంబుల పోరాటం మొదలైంది.
  పోలీసు స్టేషన్‌కు ఉత్తరం వైపునించి ఓ ముఠా, దక్షిణం వైపునించి మరో ముఠా విసిరే బాంబులు స్టేషన్ గేటు ముందు ప్రాంతాన్నే వేదికగా చేసుకొని పేలుతున్నాయి.  వాటి శబ్దాలకు టౌనంతా అదిరిపడింది.
 తుపాకులు ఎక్కుపెట్టి గేటుదాక వచ్చి ఆగిపోయారు పోలీసులు.  " కాల్చండి -  కాల్చిపారేయండి నాకొడకల్ను. "  శివపురి వర్గం కేసి చేయి చాపుతూ వెనకనించి అరుస్తున్నాడు చెన్నారెడ్డి.
  " వాల్లను కాల్చినారనుకో... తగిలిన బుల్లెట్ కంతా లక్షరూపాయులు లెక్కిస్తా..  కానీండి మరి... "
 అతనికేసి వెర్రివాన్ని చూసినట్లుగా చూశాడు యస్,ఐ,  " ఇక్కడ కూడా వాగ్దానాలు సెయ్యల్నేమో ! "  అన్నాడు ఎటోతిరిగి గొణుక్కుంటోన్నట్లుగా.
  ఆ మాటలు చెన్నారెడ్డి చెవుల బడ్డాయి.
 " వాగ్దానాలు కాదయ్య.... నిజమే చెబుతావుండా "  అన్నాడు.
 " సార్ ! పిల్లలుగల్లోల్లం - మమ్మల్నిట్లా బతకనీండి... "  రెండు చేతులెత్తి నమస్కరించాడు ఎస్సై,  " మీ వాళ్ళకు చెప్పండి వెనక్కిపొమ్మని... గొడవే వుండదు గదా ? "  అన్నాడు.
  " అంటే..  మా వాల్లు వెనక్కిపోతే వాల్లచేత నామీద బాంబులేయిస్తామనా..?  "  గట్టిగా అరిచాడు చెన్నారెడ్డి.
  అతన్ని  వదిలేసి గేటు వద్దకెళ్ళాడు ఎస్సై.
 అప్పటికే ట్రాఫిక్ బందయింది.
  జనమంతా సుదూరంగా కోట కట్టినట్లు నిల్చుని చోద్యం చూస్తున్నారు.
 మేధావి వర్గానికి, చాలామందికి అనుమానమొచ్చింది - అస్సలు పోలీసు వ్యవస్థ వుందా ’ లేదా ’ అని.
హ్యాండ్ మైక్‌తో పోలీసులు కేకలేసి చెబుతున్నారు - ’ మర్యాదగా అక్కణ్నించి వెనుదిరగ కుంటే కాల్చి పారేస్తామని ’
  వాళ్ళ హెచ్చరికల్ని ఎవరూ లెఖ్క జేయలేదు.
 యధేచ్చగా బాంబింగ్ జరుగుతూనే వుంది.
 చెన్నారెడ్డి స్టేషన్ లోపల్నించి బూతులు తిడుతున్నాడు. శివపురి వాళ్ళ మీద సవాల్ విసురుతున్నాడు. ’ రేయ్ ’ మీ ఏరియాలో నా మీంద రెండుసార్లు అటాక్ జేసినారు, నేనట్లాగాదు నా ఏరియాలో మీ జోలికి రాను. అది మగతనం గాదు. మీ ఏరియాలోనే మీమీద దాడి జేస్తా. నా దెబ్బ ఏందో మీకు రుచి జూపిస్తా ’ అంటూ కేకలేశాడు.
వెంటనే అతని సవాలుకు ప్రతిస్పందించాడు బాలుడు  " ఫో పోరా ! - నువ్వొక మొగోనివీ..  నీకొక ఏరియా.... రేయ్ నువ్వు నిజంగా మొగపుట్టకే పుట్టింటే బైటకు రారా  తేల్చుకుందాం.. "  చేతులూపి, యీలేసి సవాల్ విసిరాడు.
 లోపల్నించి రొప్పుతున్నాడు చెన్నారెడ్డి.  " ఎస్సై పక్కకు తప్పుకో... నేను పోవాల..."  బైట కెళ్ళేందుకు ప్రయత్నించాడు చెన్నారెడ్డి.
 " పోతే మిగలవు సార్ !  ఇద్దరూ వూరి బైటికి పోయి కొట్లాడి చావుపోండి..  మా స్టేషన్ ముందు చస్తే మాకు పీకల మీదకొస్చాది.."  అడ్డుకొన్నాడు ఎస్సై.
 బైట్నించి రెచ్చగొడుతున్నాడు బాలుడు బగైరాలు.
 బాంబింగ్ జరపటంలో చాలా హుషారుదనాన్ని ప్రదర్శిస్తున్నాడు రాఘవ. అవతలి వాళ్ళు విసిరిన బాంబులు పేలుతోన్నా లెఖ్క జేయకుండా ముందుకు దూసుకెళ్లి ప్రయోగిస్తున్నాడు. అతని బాంబు దెబ్బకు బారెడు  వంతున వెనక్కి సర్దుకోవలసి వస్తోంది ఎమ్మెల్లే వర్గానికి.
 ఎర్రగా అందంగా వున్న ఆ యువకుడి విన్యాసాలు చెన్నారెడ్డిని కూడ ఆకట్టుకొన్నాయి. పరిశీలించి చూసేసరికి అతనెవరో అర్థమైంది. అరెకపాడు కేసు కళ్ళ ముందు మెదిలింది.
  అక్కడి పరిస్థితిని తన పై అధికారులకు సెట్లో చెబుతున్నాడు ఎస్సై...  పైన్నించి అదనపు సహాయం అందేదాక తనెట్లా యీ సమస్యను నిర్వహించాలో అర్థం కాలేదు.
 ’తనకు శనిలా దాపురించాడు ఎమ్మెల్లే.. గొడవలు పడేవాళ్ళు వూరిబైట కొట్టుకు చావొచ్చు గదా !  వాల్ల పీనిగెలకు కావలుండి పోస్టుమార్టం జరిపించే వాల్లం...  వాల్లకు పిండాకూడు పెట్టించే వాల్లం..’
  గొణుగళ్ల రూపంలో తిట్టుకొంటున్నాడు ఎస్సై.
  క్రమేణా బాంబింగ్ వేగం కొంత చల్లబడింది.
  పోలీసులకు అర్థమైంది ఇరువర్గాల వద్ద సరుకు అయిపోవచ్చిందని.
 అప్పుడు రంగంలోకి దిగారు ధైర్యం చేసి.
 స్టేషన్లో వున్న పోలీసులంతా మూకుమ్మడిగా రోడ్డు మీదకొచ్చారు. ఇరువర్గాల మధ్య నిల్చుని అందర్నీ చెల్ల చెదరు చేస్తోన్నట్లుగా లాఠీల్ని ఝళిపిస్తూ అటుఇటు పరిగెత్తారు.
  పోలీసులంతా బైటకెళ్ళేసరికి చెన్నారెడ్డి అటు ఇటు తేరపార జూశాడు. అతని కళ్లల్లో ఏదో బెదురు. వెంటనే తన గన్‌మెన్ తోటి తనూ స్టేషన్ బైటకు నడిచాడు.
  ఇరువైపుల రెండు గుంపులూ నెమ్మదిగా వెనక్కి సర్దుకొన్నాయి. ఇంకా సవాళ్ళు తీసుకొంటూనే జీపులెక్కి ఆ ప్రాంతం నించి నిష్క్రమించారు.
 తర్వాత రెండు గుంపుల మీదా కేసులు నమోదయ్యాయి.

                      **********

 అనుకోకుండా వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని సమర్థవంతంగా వినియోగించుకున్నారు గాని... కొద్దిపాటి అవగాహనా రాహిత్యం వల్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయారు శివపురి వర్గీయులు.
 అయితే యీ ఒక్క దాడితోనే వాళ్ల పేర్లు తాలుకా అంతటా మారుమ్రోగింది. చెన్నారెడ్డిని ఎదిరించే మొనగాళ్ళుగా గుర్తించబడ్డారు.
 ప్రయత్నం విఫలమైంతర్వాత శివపురి సోదరుల్లో మరింత కసి పెరిగింది.  ఈ వేడి మీదనే మరో సారి దాడి జేయాలని తీర్మానించుకొన్నారు.
 చెన్నారెడ్డి కూడా తన జాగ్రత్తలు తను తీసుకొంటున్నాడు.
వెంట జనం లేకుండా ఎక్కడికీ కదలటం లేదు.
 జీపుల కాన్వాయిలో తన జీపు స్థానాన్ని తేప తేపకు మార్చుకొంటున్నాడు. ఒకే జీపులో కాకుండా వేరు వేరు జీపుల్లో ప్రయాణిస్తున్నాడు.
 శివపురి ఏరియాలో ఎన్నికల ప్రచారం కూడా మానుకున్నాడు.
 పోలీస్టేషన్ ఎదుటే వాళ్ళ తెంపు చూసింతర్వాత తన పద్దతుల్ని చాలా వరకు మార్చుకోవలిసి వచ్చింది అతనికి.
  గత రెండ్రోజులుగా అట్లూరు మండలం మీద దృష్టి సారించాడు. ఇంకో మూడు రోజుల కార్యక్రమం వుంది అక్కడ.  బద్వేలు ఏరియాలోని మూడు మండలాల్ని గట్టి చేసుకొంటే చాలు మిగతా పోరుమామిళ్ల ఏరియా మూడు మండలాల్లో కొంచం అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. తనకు భారీ మెజారిటీ దక్కుతుంది.
 అతని ప్రోగ్రాం గురించిన వివరాలు పూర్తిగా అందాయి రమణారెడ్డికి.
 దొరికిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలనుకుంటున్నాడు.
 మిత్రులందర్నీ సమావేశ పరచి సుదీర్ఘీగంగా చర్చించాడు.
 అంతా కలసి పకడ్బందీ ప్లాన్ ఒకటి సిద్దం చేశారు.
 రేపు కూడా అట్లూరు మండలానికే వెల్తున్నాడుట చెన్నారెడ్డి. పల్లెల్లో కన్నా టౌన్లోనే అటాక్ చేయటం బావుంటందనుకొన్నారు.
 బద్వేలులోనే దాడి చేయాలని నిర్ణయం జరిగిపోయింది.
 దాడి చేసే ప్రాంతం కూడ సెలక్ట్ చేసుకొన్నారు.
  సిద్దవటం రోడ్డులో జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద తమ వ్యూహాన్ని అమలు చేయాలనుకొన్నారు.  ఒకటికి రెండు సార్లు ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా చూసి పరిస్థితుల్ని బాగా ఆకళింపు చేసుకొన్నారు.
 జి.పి.ఆర్ బిల్డింగ్ పై భాగానికి ఎక్కి విహంగ వీక్షణం చేశారు.
 అక్కణ్నించి ప్రాంతీయపార్టి కార్యాలయం స్పష్టంగా కన్పిస్తోంది.
 పరిసరాల ఎన్నిక పూర్తయింతర్వాత వ్యూహం అమలు గురించిన పథక రచన ప్రారంభమైంది.
 అటాక్‌లో పాల్గొనే  వారంతా మూడు గ్రూపులుగా విభజించబడ్డారు.
 గ్రూపుల వారీగా పని విభజన కూడా జరిగిపోయింది.
 ఎవరి పని వాళ్ళు చేసుకుపోవాలి తప్ప ఒకరి పనిలో మరొకరు వేలు పెట్టగూడదు. పొరబాటున కూడా మరొకరి భాద్యతల్ని తాము మోయాలని ప్రయత్నించకూడదు.  ఏ గ్రూపు భాద్యతలు ఆ గ్రూపే నిర్వర్తించాలి.  అట్లా చేయటం వలన తమ మీద తామే బాంబింగ్ జరుపుకొనే పొరబాట్లు దొర్లవు.
  మూడు గ్రూపుల్లోనూ చెన్నారెడ్డి ద్వారా తండ్రుల్ని, అన్నల్ని, తమ్ముళ్ళను పోగొట్టుకొని, అతన్ని చంపాలనే అంతులేని కసితో బతుకుతోన్న వాళ్లను మాత్రమే ఎంపిక చేసుకొన్నారు.
  అందరూ అత్మీయుల్ని పోగొట్టుకొని కసి పెంచుకొన్న వాళ్లే గ్రూపులుగా తయ్యారయ్యారు గాని రెండవ గ్రూపులో మాత్రం ఓ వ్యక్తి ఆస్తుల్ని పోగొట్టుకొని పగబట్టి వున్నవాడు.  తన ఆస్థినంతా లాక్కుని వూర్నించి తరిమేశాడుట చెన్నారెడ్డి.  అతన్ని ఎట్లైనా చంపాలనే ధ్యేయంతో వచ్చి శివపురి వర్గంలో కలిశాడు.
 అతని పేరు ఎనుబోతుల సుబ్బారెడ్డి... కలసపాడు ఏరియా.
 అందరికంటే ఎక్కువ కసితో చెలరేగి పోతున్నాడు అతను.

                                        **********


  రాత్రి బద్వేలులోనే తిష్టవేశారు అందరు.
 రేపు ఉదయం జరపబోయే కార్యక్రమాన్ని ఒకటికి రెండు సార్లు రిహాల్సల్స్ వేసుకొన్నారు.... తృప్తిపడ్డారు.
 ఉదయమే యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది.
 అప్పటికింకా పొద్దుకూడా పొడవలేదు.
 చీకట్లో లేచి ప్రయాణం కావటం చెన్నారెడ్డికి అలవాటు.
రోడ్డు మీద సన్నగా జనసంచారం మొదలైంది. పల్లెల్నించి కూరగాయలు, పాలక్యాన్లు టౌన్‌కు వస్తున్నాయి. అడపా దడపా బస్‌లు నడుస్తున్నాయి.
 జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద మూడు గ్రూపులూ మొహరించాయి.
  చెన్నారెడ్డి ఏ జీపులో వస్తున్నారో తెలిసికొని మొదటి గ్రూపుకు సంకేతాలిచ్చేందుకు ఓ వ్యక్తిని రెండంతస్థుల జి.పి.ఆర్ బిల్డింగ్ పైకి ఎక్కించారు.
  అక్కణ్నించి ప్రాంతీయ పార్టి కార్యాలయం వద్ద వున్న మనుషల్ని కూడా స్పష్టంగా పొల్చవచ్చు. చెన్నారెడ్డి ఏ జీపులో ఎక్కి వచ్చేది బిల్డింగ్ పైనున్న మనిషికి తెలుస్తుంది. వేళ్ల సంఙ్ఞల ద్వారా కాన్వాయ్‌లోని జీపు వరుస సంఖ్యను తెలియజేయాలి. మొదటి గ్రూపు వాళ్లు అతన్ని గమనిస్తూ, అతను అందించిన సమాచారాం ప్రకారం అటాక్ చేయాలి.
 ప్రస్తుతం యీ ఆపరేషన్ సక్సెస్ కావటానికి అతను అందించే సమాచారమే కీలకం. అందుకే అతనికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఒకటికి పదిసార్లు హెచ్చరించి మరీ టవర్ ఎక్కించారు.
  ఆరు గంటలకే చెన్నారెడ్డి జీపుల వరస పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది.
 ఆ సమాచారం శివపురి వర్గానికి తెలిసింది.
 బిల్డింగ్ పైనున్న మనిషికేసి ఆతృతగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మొదటి గ్రూపువాళ్ళు.
  అతను పార్టీ కార్యాలయం కేసి తదేకంగా చూస్తున్నాడు.
 ఒక్క నిమిషం తర్వాత పై మనిషి కుడి చేతిని పైకెత్తి హస్తాన్ని వాళ్లకేసి చూపించాడు.  తర్వాత నెమ్మదిగా రెండు వేళ్లను ముడిచాడు.
 అంటే -  ముందునించి మూడో జీపులో వస్తున్నాడన్నమాట చెన్నారెడ్డి. మొదటి గ్రూపు సిద్దపడింది.
  రోడ్డుమీద వచ్చే వాహనాల కోసం ఉత్కంఠగా ఎదురుచూడసాగింది.
 దాని ప్రధాన కర్తవ్యం చెన్నారెడ్డి జీపుమీద దాడిజేయటం. విచక్షణా రహితంగా బాంబింగ్ చేసి కాన్వాయ్‌ని చెదరగొట్టటం. అతన్ని ఒంటరిగాని చేయటం.
  అంతటితో మొదటి గ్రూపు పనయిపోతుంది.
 మరుక్షణం రెండవ గ్రూపు రంగంలోకి దిగవల్సి వస్తుంది.
 మొదటి గ్రూపు వాళ్ళు తమ పనిని మననం చేసుకొంటూనే రెండుచేతుల్లో రెండు బాంబుల్ని పట్టుకొని జీపుల రాక కోసం ఎదురుచూస్తూ అబ్బిళ్లు కొరుకుతూ పూని వున్నారు.
 జీపుల వరస వాళ్లకు దగ్గరగా వచ్చింది.
 ఒకటవ జీపు దాటుకెళ్లింది.
 రెండవ జీపు కూడా
 అప్పటికే పొజిషన్ తీసుకొని వున్నారు.
 పుట్ట చెండుల్లే లేచి వెళ్ళి మూడవ జీపుమీద పడ్డాయి తెల్లటి నాటు బాంబులు.
  వాటి పగుళ్లతో ఆ ప్రాంతమంతా ఒక్క సారిగా దద్దరిల్లింది.
 ఒక బాంబు సూటిగా వెళ్లి డ్రైవర్ తలకు తగిలి పేలింది.
 తల పగిలి వెనకసీటులోని చెన్నారెడ్డి ఎదల నిండా మెదడు, నెత్తురు చిందింది.
  చెన్నారెడ్డికే బాంబు దెబ్బ తగిలిందనుకొన్నారు ఆ దృశ్యాన్ని చూసి.
 ఒక్క క్షణంలో పరిస్థితి ఏమిటో అర్థమైంది వెనక ముందు జీపుల్లోని వాళ్లకు.
 కనురెప్పపాటులో ముందున్న రెండు జీపులూ శరవేగంతో దూసుకెళ్లి అదృశ్యమయ్యాయి. అవి బహుశా సిద్దవటం వద్దనున్న పెన్నానది ఒడ్డుకు వెళ్లిగాని వెనుదిరిగి చూడవు.
  వెనక జీపుల్ని రివర్స్ చేసుకొనేందుక్కూడా తోచక జీపుల్లోంచి దిగనురికి చావుబతుకుల మీద టౌన్లోకి పరారయ్యారు జనమంతా.
 తన జీపులో చెన్నారెడ్డి ఒక్కడే మిగిలాడు.
 జరిగిన సంఘటన అర్థమై అతను తేరుకొనే సరికి బాంబుల పొగ మద్య తన జీపు ఒక్కటే వుంది.  తను నమ్ముకొన్న జనమంతా తనను మృత్యు వొడిలోకి నెట్టి ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు.
 తన చచ్చాడే అనుకొన్నాడు.
 జీపు దిగేందుక్కూడా శరీరం సహకరించక అలాగే కూచుండి పోయాడు.
 బాంబు శబ్దాలు. హాహా కారాలు, తెల్లని పొగల మద్య తమ పనిని తాము దిగ్విజయంగా పూర్తి చేశారు మొదటి గ్రూపు వాళ్ళు.
  వెంటనే రెండవ గ్రూపు యాక్షన్ ప్రారంభం కావాలి.
  వాళ్ళు చెన్నారెడ్డిని లక్ష్యంగా బాంబు దాడులు జరపాలి. ఎంతమంది చచ్చినా ఫర్వాలేదు - అతన్ని మాత్రం చంపకుండా వదిలేందుకు లేదు.
 మూడవ గ్రూపు వాళ్లకు సమీపంలో మరో తావులో వుంటుంది. వాళ్ల పని - పై మాసులు రాకుండా అడ్డుకోవటం.
 మొదటి గ్రూపు యాక్షన్ పూర్తవగానే రెండవ గ్రూపు సిద్దమయ్యారు. తమ చేతుల్లోని బాంబుల్ని విసిరికొడుతూ పొగమేఘాలూ, భీకర శబ్దాలు సృష్టించుకొంటూ ముందుకు వస్తున్నారు.
 చేతిలోని బాంబులు అయిపోగానే తమ వెంట వస్తోన్న బాంబుల బక్కెట్లలోంచి అందుకొని తిరిగి ప్రయోగించాలి.
  మొదటి  నాలగయిదు బాంబులతో భీతావహ వాతావరణాన్ని సృష్టించిన రెండవ వర్గం వాళ్లు తమ చేతుల్లోని బాంబులు అయిపోగానే మరికొన్ని బాంబుల కోసం వెనక్కు తిరిగి బక్కెట్ల కేసి చూసి ఉలిక్కిపడ్డారు.

                                                                                                           .......... సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs