చాలా సంవత్సరాల క్రితం...బెంగళూర్‌లో ఒక ప్రొఫిషనల్ కోర్స్‌లో సీట్ సంపాదించడం కోసం బాగా తిరుగుతున్న రోజులవి. ఆ సీట్ కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాకాని దొరకట్లేదు.కారణం..వారు నిర్ణయించుకొన్న నిబంధనలను అనుసరించి  ఖాళీగా  ఉంచుతున్నారే కాని వాటిని  భర్తీ చేయట్లేదు. నాకు ఆ కోర్స్ మీద విపరీతమైన ఆసక్తి..!  ఆ క్రమంలో ప్రతి రోజు సాంకేతిక కార్యాలయం,  అలానే కాలేజి చుట్టూ ప్రదక్షిణలు  చేస్తున్నాను. అలా తిరుగుతున్న రోజులలో నాలాగే్ అదే సీట్ కోసం ప్రయత్నిస్తున్న మరొకతను జతిన్ పరిచయం అయ్యారు. అతనితో అతని తల్లిగారు కూడ రోజు వస్తున్నారు. అలా ప్రతిరోజు కలుస్తుండడంతో బాగా పరిచయం అయ్యారు. అందరం కలసే ఖాళీ గా  మిగిలి ఉన్న సీట్స్‌ని భర్తీ చేయమని విఙ్ఞప్తి చేయడానికి అక్కడి సెక్రటరియేట్, అలానే తదిత మంత్రుల శాఖల చుట్టు ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు తిరుగుతూ వున్నాం.

     తమిళ వారైన జతిన్ కుటుంబం,  ఉత్తరాదిలొ డిఫెన్స్‌లో పని చేసి పదవీ విరమణ సమయంలొ బెంగళూర్‌ వచ్చి స్థిరపడ్డారు. ఆ కారణం చేత అతనికి కర్నాటక కాలేజీలొ సీట్ రావట్లేదు..అందునా కన్నడిగులకు తమిళలకు జాతి వైరం ఎప్పటి నుండో  ఉన్నదాయే .... అదొక కారణం.!! 

 జతిన్‌కు ఈ ప్రొఫిషినల్ కోర్స్ మీద అమితమైన ఆసక్తి, కాని సీట్ దొరకట్లేదు.అతన్ని  ఏయిర్ ఫోర్స్‌లో చేర్చాలని అతని తండ్రి అభిలాష, అది జతిన్‌కి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేకపోయినా కొడుకు ఇష్టాన్ని గౌరవిస్తూ అతని తల్లి అతనికే మద్దుతు పలుతున్నది. అందుకే ఆమె కూడ కొడుకుతో  కలిసి సీట్ కోసం తిరిగే వేటలో కాలేజికి వస్తున్నారు. ఒకే విషయం గురించి అందరం కలసే తిరగతున్నాం కాబట్టి నేను వారి కుటుంబానికి దగ్గర అయ్యాను. జతిన్‌ కుటుంబానికి ఒక్క తెలుగు తప్ప మిగతా హిందీ, కన్నడ, తమిళం, ఆంగ్లం భాషలన్నీ అనర్గళంగా మాట్లాడుతున్నారు, నాకు కన్నడ అంతంత మాత్రమే, ఆ సమయంలొ్ బేడ,బేకు, ఊట ఆయత్తా ఇలాంటి బతకడానికి అవసరమైన పొడి పొడి పదాలు తప్ప మరో వాక్యం  ఎంత తన్నుకొన్నా కూడ మాట్లాడ లేను..కాబట్టి..నాకొచ్చిన బట్లర్ ఇంగ్లీష్‌తోనే వారి బుర్ర తింటూవుండేవాడిని..పాపం ఏమ్ చేస్తారు భరించక. నేను వారి జాతివాడినే కదా..సీట్ కోసం తిరగడంలొ..!!

    ఒక రోజు జతిన్ రాలేదు కాని జతిన్ తల్లి గారు మాత్రమే వచ్చారు కాలేజీకి. జతిన్ నాన్న ఏదో పని వుండటంతో బయటతీసుకెళ్లారు అందుకే రాలేదన్న విషయం తెలిపారావిడ. కాలేజీలో ఒకరిద్దరిని కలిసాక. ఇక అదే కాంపౌండ్‌లో వున్న సాంకేతిక కార్యాలయం వైపుగా వెళ్లాం. అక్కడ కాలేజీలలో సీట్స్ భర్తీ చేయడానికి సంబందించిన ప్రిన్సిపల్   సెక్రటరీ ఉన్న కార్యాలయంలోకి అడుగు పెట్టాం కాని సెక్రటరీ లేరు ఆ సమయంలో. 

ఇక అక్కడున్న ఆయన పి.ఏ. ను మిగతా స్టా‌ఫ్‌తో కలసి మేమొచ్చిన విషయం గురించి చెబుతూ..కూర్చున్నాం.  నాకంటే జతిన్ తల్లిగారే ఎక్కువ మాట్లాడుతున్నారు కారణం నాకు వచ్చిన  బేడ..బేకు లాంటికొద్ది పాటి  కన్నడ పదాలు తప్ప మరేది తెలియకపోవడంతో.

  కాసేపటికి ఆవిడ మెల్లి మెల్లిగా ఏడవడం మొదలు పెట్టారు నోటికి కొంగు అడ్డం పెట్టుకొంటూ....అక్కడున్న స్టా‌ఫ్‌తో పాటు నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను.  బహుశ కొడుకు ఇష్టపడుతున్న ఒక ప్రొఫిషినల్ కోర్స్‌లో సీట్ సంపాదించలేకపోతున్నానే అనే వ్యధలో అలా కన్నీళ్లు వొస్తున్నాయేమో అనిపించింది. ఆమె ఏడుపులకు ఆఫీస్ స్టాప్ కూడ ఆవిడ వైపు "అయ్యో పాపం" అన్నట్లు సానుభూతిగా చూస్తున్నారు, తన కొడుకు రెండేళ్లుగా ఈ కోర్స్ గురించి తిరుగుతున్నారని..ఈ కోర్స్ చదవాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడని, అతని తండ్రికి ఇది ఏ  మాత్రం   ఇష్టం లేకపోవడంతో ఆయన దేనికీ సహకరించడం లేదని...అందువల్లే తానూ అందుకే  కొడుకుతో కలిసి ఇలా తిరగవలసి వస్తోందని.... ఇలా అన్ని విషయాలు వివరిస్తున్నారు ఆమె. ..,!

 తిండి నిద్ర కూడ ఆలోచించకుండా ప్రతి రోజుఎవరెవరిని కలుస్తున్నది, పొద్దు పొద్దున్నే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన విషయాలు... ఇలా అన్ని వివరాలు ఏవి వదలకుండా ఆ ఏడుపులోనే ఏకరవు పెడుతూ కోన సాగిస్తున్నారు .  స్టాఫ్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా అదే సానుభూతి మొహాలతో  ఫ్రీజ్ అయి వున్నారు.  

ఒకరిద్దరు మాత్రం  "అయ్యో..ప్చ్..పాపం" అంటు శబ్దాలు చేస్తున్నారు.  కాసేపటికి ఆమె ఉదృతి తగ్గి వాతావరణం చల్ల బడింది. ఇక మాట్లాడవలసిన విషయాలు ఏమి లేకపోవడంతో ఖాళీల భర్తీ గురించి, మేము తిరుగుతున విషయం గురిమ్చి పదే పదే చెప్పి బయటకు వచ్చాం ఇద్దరం.

   బయట కాంపౌండ్‌లోకి నడుస్తుండగా ఆమె  మాట్లాడటం మొదలు పెట్టారు  " అక్కడ స్టాఫ్ వద్ద అలా ఎందుకు ఏడ్చానో తెలుసా...? ఎందుకంటే మగాళ్ల కన్న ఒక స్త్రీ అలా తిరుగుతూ కన్నీళ్లు పెడితే ’అయ్యో పాపం ఎంత కష్ట పడుతున్నారో్ ’ అనే సానుభూతితో అయినా సీట్ రావచ్చేమో అనే ఉద్దేశంలో అలా కనీళ్లు పెట్టాను. జతిన్ నాతో ఈ రోజు వస్తానని చెప్పినా నేనే వద్దని చెప్పి ఒక్కదానినే వచ్చాను ఇందుకే "  నవ్వుతూ... ఒక గొప్ప సత్యం నాకు చెబుతున్నట్లుగా చెప్పారు. 

 అక్కడ ఆఫీస్ గదిలో ఎంతలా దుఃఖ వదనంతో వున్నారో... అసలు ఆ దుఃఖచాయలే కనపడకుండా ఇప్పుడూ కేవలం ఐదు నిమిషాలలో ఆవిడ నవ్వుతున్నారు తను చెప్పిన విషయానికి. ఇంతలో ఎంతలా వాతావరణం మార్పు అనిపించింది నాకు.

  అలా అని ఈ విషయాన్ని ఆవిడ ఏమి దాచుకోవట్లేదు, దాచుకొని మోసపుచ్చాలని ప్రయత్నించట్లేదు నా ముందు, హాయిగా బహిరంగంగా  చెప్పుకొంటున్నారు.  అందులో ఒకరిని ఏమార్చాలని  కాని మరొకటికాని లేదు.  కేవలం తన కొడుకుకు సీట్ సంపాదించాలి దానికి కావలసిన మార్గాలన్నీ వెతుక్కుంటున్నారు, అందులొ ఇది ఒక భాగం అని మాత్రమే అని భావనలో ఆమె వున్నారనిపించింది. 

ఇక్కడ నాకు మరో విషయం అర్థమయ్యీ కాక అర్థమవుతున్నట్లుంది...  చాలా ఏడుపుల వెనుక కారణాలు సానుభూతి ఆశించడం ఉంటుందా  అని..? 

..... అలా మాటల్లోనే.. నడుచుకొంటూ వస్తూ ఆ కాంపౌండ్‌లో వున్న ఒక పెద్ద చెట్టు కింద వున్న సీమెంట్ బెంచి మీద కూర్చున్నాం.

  అప్పుడు  చెప్పడం మొదలు పెట్టారు జతిన్ పరిస్థితి గురించి. ఇంట్లో తండ్రి కొడుకుల మద్యన జరుగుతున్న కోల్డ్ వార్.. గురించి !  ఈ సంవత్సరంలొ సీట్ సంపాదించుకోలేకపొతే తను  చెప్పినట్లు ఏయిర్ ఫోర్స్‌లో చేరాల్సిందే అని జతిన్‌కు తండ్రి ఆల్టిమేట్ ఇవ్వడం....తండ్రి వార్నింగ్‌తో కొడుకు కుమిలిపోవడం .ఇదంతా చూస్తూ తానూ తట్టుకోలేక పోవడం... మొత్తం వివరించారు..!

ఈ రోజు ఇద్దరం కలిసే వద్దామని అనుకొన్నా...  జతిన్‌ని వొద్దంటూ ఆపి తనొక్కరే రావడం, ఇక్కడ తను స్త్రీ కదా... మగాళ్ల కన్న ఒక స్త్రీ ఏడిస్తే మరింత సానుభూతి వస్తుందనే ఉద్దేశంతో వచ్చానని విషయాలు చెప్పుకొచ్చారు.

  ఆఫీసులో జతిన్ తల్లి ఏడుస్తున్నప్పుడు అక్కడున్న స్టాఫ్ అంతా తమ తమ పరిధులలో   ఒక సానుభూతి ని మొహాల్లో  ప్రకటించారు  ఈమెకు. అంటే వాళ్ళు కూడ తమ జీవితంలొ రోజూ  కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి ఏడుపులు  చూస్తూనే వుంటారు, వారు కూడ వీటికి అలవాటు పడిపోయి ఒక సానుభూతి మొహాన్ని వీళ్లకు పడేసి ఎవరికి వారు బాగా నటించేస్తున్నారు. 

 ఒకరిద్దరు నిజంగా స్పందించొచ్చు.  చాల వరకు ఏడ్చే ఏడుపులన్నీ  కేవలం సానుభూతి కోసమే అనే భావం అర్థమయ్యింది నాకప్పుడు. అదొక తెలియని విషయం నాకు మొదటి సారిగా తెలిసింది.

                                                        **********

  ఇది జరిగిన ఓ రెండు మూడేళ్లకు అనుకొంటాను....!  మా వూళ్లో ఒక సంఘటన ఎదురైంది. నా మేనమామ ఒకతను  ’ఎమ్.ఎల్.ఏ వద్ద ఒక పంచాయితి వున్నది వెళ్తున్నాను, వస్తావా...  అని   పిలవడంతో నేను వెళ్లాను.   రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు కాని పాక్షికంగా వున్నారు. అప్పుడప్పుడు ఎమ్.ఎల్.ఏ తో కలుస్తూ వుంటారు నా మేన మామ, అలా పంచాయితీలు జరుగుతున్న సమయంలొ ఈయన పాల్గొంటూ వుంటారు.

  ఎమ్.ఎల్.ఏ ఆఫీస్‌లోకి ప్రవేశించాం, చిన్న కాంపౌండ్ ఉండి తర్వాత ఒక పెద్ద వసారా వున్నది, అక్కడే ఓ ఇరువై కుర్చీలు వున్నాయి ఓ పదిహేను మంది దాక రెండు వర్గాలుగా చెరో వైపు కూర్చోని వున్నారు.  ఎమ్.ఎల్.ఏ ఇంకా రానట్లున్నారు... ఆయన  కుర్చీ ఖాళీగా  కనపడుతున్నది.  

మన దేశంలొ ముఖ్యంగా మన తెలుగునాడులొ జరిగే పంచాయితీలన్నీ ఎక్కువగా ఆస్థి పంపకాలో లేక భార్యభర్తల మద్యన జరిగే గొడవలు, విడాకుల గురించే వుంటాయి. మహాభారతంలొ మంచికి గుర్తుగా పాండవులను చెడుకు గుర్తుగా కౌరవులను పెట్టి పెద్ద కౌరవ సభే జరుగుతూ ఉంటుంది...అప్పటి రచయతలు అలా మంచి చెడులకు ప్రతినిధులుగా రెండు వర్గాలను సృష్టించాడు..కాని నిజ జీవితంలో ఎప్పుడూ కూడ మంచి, చెడులు చెరో వైపు ఎప్పుడూ ఉండవు. రెండు వర్గాల వాదనలు వారి వైపు నుండి వింటే అన్ని కరెక్టేగానే కనపడతాయి మరి.  ఎటువైపు..న్యాయ అన్యాయాలున్నాయో కూడ అర్థంకాదు. ప్రస్తుతం జరుగుతున్నది ముగ్గురు అన్నదమ్ముల ఆస్థి తగాదాల పంచాయితి.


    కాసేపటికి  ఎమ్.ఎల్.ఏ వచ్చి కూర్చున్నారు. అక్కడున్న ఒక వర్గంలొ ఒకటి పెద్దన్నయ్య వర్గం, ఆయన తన భార్యతో సహా వచ్చారు పంచాయితీకి. మరొక వర్గంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆమె రాకతో ఇద్దరు తమ్ములున్న వర్గంలొ గుసగుసలు మొదలయ్యాయి.

 ఇన్నాళ్లుగా  కేవలం ముగ్గురు అన్నదమ్ములే పంచాయితిలొ కూర్చుంటున్నా...పెద్ద అతని భార్య .తన  భర్తకు వెనుకుండి పంచాయితీలో ఎలా మాట్లాడాలి, ఏవేవి విషయాలు చెప్పాలి, ఎదుటి వర్గం ఏ ఎత్తు వేస్తే తామేమి సమాధానాలు ఇవ్వాలి లాంటి విషయాలు సూచనలిస్తూన్నారే గాని, ఆమె మాత్రం ఎప్పుడు పంచాయితీ వైపు తొంగి చూడనేలేదు. 

అలాంటిది ఇప్పుడు ఆమే స్వయంగా పంచాయితికి రావడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడున్న ఇద్దరి తమ్ముళ్ల వర్గపు పంచాయితీ పెద్ద మనుషుల్లో. వారి గుసగుసలు నా చెవిన పడుతున్నా... నాకు అర్థమయ్యి అర్థం కాక అయోమయంలో వున్నా...నాలో వున్న మరో మనిషికి మాత్రం ఏదో అర్థమయ్యి నన్ను గెలుకుతున్నాడు. వాడికేదో అర్థమయ్యింది.  ఆ విషయమే నాకు చెప్పబోతుంటే  "యెహే ఆపు నీ గోల  కాసేపు వేయిట్ చేయి..అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు"  అని కసురు కొన్నాను.

  పెద్దన్నయ్య వర్గం వైపు చూస్తూ మొదట ఎమ్.ఎల్.ఏ నోరు విప్పారు, "ఇన్నాళ్లుగా పంచాయితీ జరుగుతున్నా ఇంకా ఒక కొలిక్కి రాలేదు మీ విషయం..ఏంటి.... ఏమ్ చేద్దామనుకొంటున్నారు"  అన్నాడు. ఆయన అలా అనగానే..పెద్దన్నయ్య భార్య  చెప్పనారంభించారు. " సర్  నేను మొదటి నుండి ఏమి జరిగిందో చెబుతాను మీరే ఒక నిర్ణయానికి రండి, నా పెళ్లి అయ్యే సమయానికి ఈయన తమ్ముళ్లిద్దరు స్కూల్ చదివే పిల్లలు, తల్లి తండ్రులు లేకపోయినా నేను తల్లిగా బాధ్యతలు  తీసుకొని పెంచాను ఇద్దరినీ..మాకంటూ ఏమి ఆలొచించకుండా డబ్బులన్నీ వీళ్ల చదువులకే ఖర్చు పెట్టాం, ఆ సమయంలో నేను సరిగ్గా చూడట్లేదనీ.. నన్ను వీళ్ల బంధువులు అందరు  ఎంతో ఆడిపోసుకొన్నారు, ఎన్నో పుకార్లు పుట్టించారు, నానా రకాలుగా బయట చెప్పుకొన్నారు. ....ఆ అవమానాలన్నీ భరించి వీళ్ల భాగోగుల కోసం ఆస్థింతా ఖర్చు చేసాం " ఈ మాటలుంటున్న సమయంలొ ఆమె గొంతు గద్గదమైపోయి వొస్తున్న ఏడుపును కొంగు అడ్డం పెట్టుకొని ఆపుకొంటున్నట్లు మాట్లాడుతున్నారు, ఆ సమయంలో అక్కడి వాతావరణం చాలా గంభీరంగా మారిపోయింది..అక్కడ కూర్చున్న మగాళ్లందరూ.. తమ్ముళ్లిద్దరి వైపు చూస్తున్నారు ఏంటయ్యా ఇది..... అనే చందాన.

  ఆమె తన ఏడుపులోనే.. "నేను అవి చేసాను, ఇలా చూసుకొన్నాను ఇంతంత ఖర్చు పెట్టాం"  అంటూ కొన్నిలెఖ్కలు చూపించారు. తర్వాత నెమ్మదిగా ఇక వున్న ఆస్థిలో ఆవిడే పంపకాలు చేయనారంభించారు,  "నాకు ఇద్దరాడ పిల్లలు అందులో ఒకమ్మాయి రెండు మూడేళ్లలో పెళ్లీడుకొస్తున్నది..వాళ్ల చదువులకు డబ్బులు కావాలి, కాబట్టి  నేను మాఇంటాయన తమ్ములిద్దరిని అన్నో అవమానాలు భరిస్తూ కూడ పెంచినందుకు మిగిలి వున్న బంగారంలో నా కూతిళ్లిద్దరికి సమానంగా ఇవ్వాలి,"  ఇలా ఆవిడ ఆ సానుభూతి భావంలొ అన్నీను ఎలా తనకు మాత్రమే చెందాలో  చెప్పుకొస్తున్నారు, పంచేస్తున్నారు. చివర్లో చేతికి అంటుకొని మిగిలున్న అన్నం మెతుకులు విదిలిచినట్లు ఆమె మరదులకు కొంత భాగం ఇచ్చారు. 

 అది ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదు.."ఇంకా చాలా వున్నది ఆస్థి..అన్నిటిని మా చదువుల కింద ఖర్చు చేసినట్లు చెబుతున్నారు కాని అదంతా అబద్దం" అంటు కొన్ని సాక్ష్యాలు కూడ చూపించారు.  అయినా పెద్దన్నయ్య భార్య  "అవన్ని వాళ్ల బందువులు చెప్పిన చెప్పుడూ మాటలు"  అంటూ ఏడుపు గొంతుతో కొట్టి పడేస్తున్నారు. ఆమె తన ఏడుపులొనే సానుభూతిని సంపాదిస్తూ  తనకు కావలసిన విదంగా ఆస్థిలొ సింహ భాగం చాలా తెలివిగా తనకు పంచేసుకొని మిగిలిన కొద్ది పాటి ఆస్థిని మరదులకు ఇస్తున్నారు, విపరీతమైన ఆశ ఆమెలో కనపడుతున్నది..ఆస్థిలో ఎక్కువ భాగం చాలా తెలివిగా కేటాయించుకొన్నప్పుడే  కనపడుతున్నది, అది బయటకు కనపడ కుండా  ఏడుపును ఆశ్రయించి..సానుభూతి ద్వార తాను పొందాలనుకొన్నది పొందడానికి ప్రయత్నిస్తున్నది.

  ఇంతలో నాలో ఉన్న మరో మనిషి బయటకొచ్చి డకనక డకనకా అంటూ చిందులేస్తున్నాడు.. "ఏంట్రా నీ గొడవ"  అని అడిగితే.. "నేను చెప్పలా  అప్పుడే....?  చూసావా నేను చెప్పిందే నిజం అయ్యింది, నాకు తెలుసు ఆమె ఎందుకొచ్చిందో ...!? హ..హ..హ..హ ఈ ప్రపంచం నిండా నిండుకొని వున్న స్త్రీ ఏడుపుకు చాలా విలువ వున్నది,  బాగా సానుభూతిని నింపారు, దానిని ఆసరాగా  తీసుకొని ఇలా పది మంది మగాళ్ల మద్యన జరిగే పంచాయితిలో ఒక స్త్రీ వచ్చి కూర్చోని మాట్లాడితే..ఇంకా ఆ సానుభూతికి మైలేజి వొస్తుందని తెలుసుకొని దానిని ఉపయోగించుకోడానికి వచ్చిందనే సంగతి నాకు ముందే తెలుసు గురువా "  అంటూ చిందులేస్తున్నాడు.

  ఇంతలో నాలోని మనిషి చెప్పిన భావాలకు అనుగుణంగానే మా ఎమ్.ఎల్.ఏ  " ఎందుకయ్యా మీ వొదిన్ని ఇట్లా ఆస్థుల పేరుతో బజారు కీడుస్తారు,  కాస్త చూసుకొని సర్దుకపోండి "  అన్నాడు. ఒక్కసారిగా ఆ తమ్ముళ్లిద్దరికీ ఏమి చెప్పాలో అర్థం కాలేదు..పరిస్థితి ఇలా మారిపోవడం వారికి మింగుడపడట్లేదు..చూస్తుంటే ఇద్దరు వాళ్లన్నయ్య లాగే మూగెద్దుల్లా వున్నారు.  విచిత్రమేమిటంటే పెద్దన్నయ్య భార్య అలా పంచాయితీకి ఎందుకొచ్చారో....అక్కడున్న మగాళ్లందరికీ ఆ విషయం బాగా స్పష్టంగా అర్థమయ్యింది, సానుభూతి కోసమే అని తెలుసు అందరికీను. కాని బయటకు మాత్రం ఆమె మాట్లాడిన మాటలకు సానుకూలంగానే ప్రవర్తిస్తున్నారు. అంటే లోకంలో అధికంగా ఏ భావానికి అమోదముద్ర వున్నదో దానికే వత్తాసు పలుకుతున్నారు.  తప్పదు అదొక అనివార్యమైన పని..వ్యతిరేకంగా మాట్లాడారో అంతే సమాజం చీల్చి చెండాడుతుంది.

   ఆ సమయంలో నేను కల్పించుకొంటూ  "బాగుందన్నా పంచాయితి చాలా బాగుంది, ఏడిస్తే చాలన్న మాట న్యాయ అన్యాయాలతో పనేమి లేదు. ఒక్క ఏడుపుతో అన్యాయం న్యాయం అయిపోతుందా..?"  అన్నాను.  నా మాటతో ఎమ్.ఎల్.ఏ తో సహా పెద్దన్నయ్య భార్య కూడ నా వైపు విస్తుపోతూ చూసారు. వెంటనే  " ఏమయ్యా .......ఇప్పుడేమి చేద్దామంటావు అయితే..?" అడిగారు తన సహజదోరణిలో చాలా నిదానంగా ఎమ్.ఎల్.ఏ.  ఈయన మాటలు చాలా నిదానంగా గూడ్స్ బండిలా ఒక్కో పదం గంభీరంగా మాట్లాడతారు .

  వెంటనే నేను ఆ ఇద్దరి తమ్ముళ్ల వైపు తిరిగి  "ఏమన్నా మీకు పెళ్ళిళ్ళు  కాలేదా"  అడిగాను. "నాకు  ఒక్కడికే అయ్యింది" అంటూ నడిపతను చెప్పాడు, "మరింకేం మీ భార్యను కూడ రేపు ఈ పంచాయితీకి పిలుచుకొని రా, ఆమె చేత కూడ నాలుగు ఏడుపులు ఏడిపించేయ్.. సరిపోతుంది, చూసారుగా ఇక్కడ ఏడుపులకు ఎంత విలువ వున్నదో, అప్పుడూ మీకు నాలుగు సానుభూతి మాటలు వొస్తాయి, దానితో పాటే మీక్కావలసిన ఆస్థిని పొందొచ్చు కదా.. ?"  అన్నాను.  

నా మాటలకు నిరసనగా పెద్దన్నయ్య భార్య నా వైపు చూస్తున్నది, ఆమె వేసిన పాచికను ఇలా బహిరంగ పరచడంతో .!  పాపం ఆమె ఉపాయం నావలన దెబ్బ తినడం భరించలేకపోతున్నట్లు  అసహనంగా అటు ఇటు ఆమె కదిలే కదిలికల్లో అర్థమవుతున్నది. ’వీడెవడ్రా ఇంతవరకు ఒక్కో ఇటుక పేర్చుకొంటూ వచ్చిన నా వాదనను ఇలా ఒక్క మాటతో కుప్ప కూల్చాడు ’ అన్నట్లుగా వున్నాయి ఆమె చూపులు.  ఆమె అనుకొన్నట్లే.. అయ్యింది.  ఎమ్.ఎల్.ఏ  నోరు విప్పారు

  నా మాటలతో పునరాలచనలో పడ్డ ఎమ్.ఎల్.ఏ  "ఇద్దరి వైపునుండి మీ మీ ఆస్థి వివరాలు ఇవ్వండి, దానిని బట్టి ముగ్గురికి సమానంగా ఎవరికీ అన్యాయం కాకుండా పంచడానికి ప్రయత్నిస్తాను. సరే రెండు రోజులాగి రండి ఆలోచించుకొని చెబుతాను "  అంటూ ఆ పంచాయితీని అర్థాంతరంగా ముగించారు ఆయన.

 ఈ కథకు పూర్తిగా వ్యతిరేకమైన, భిన్నమైన మరో రకపు సానుభూతి కథ కొద్ది రోజుల్లో .....!!

4 comments:

/చాల వరకు ఏడ్చే ఏడుపులన్నీ కేవలం సానుభూతి కోసమే/
అద్భుతమైన సత్యాన్ని చెప్పారు.
ఒంటరిగా వున్నప్పుడు ఏడ్చే ఏడుపులు సానుభూతులు ఆశించవు.
మీరు చెప్పిన కథ/అనుభవం గుర్తుండిపోయేంత నచ్చింది.

hmm....ఎన్ని ఎత్తులు ఎన్ని ఏడుపులు

" మహాభారతంలొ మంచికి గుర్తుగా పాండవులను చెడుకు గుర్తుగా కౌరవులను పెట్టి పెద్ద కౌరవ సభే జరుగుతూ ఉంటుంది...అప్పటి రచయతలు అలా మంచి చెడులకు ప్రతినిధులుగా రెండు వర్గాలను సృష్టించాడు..కాని నిజ జీవితంలో ఎప్పుడూ కూడ మంచి, చెడులు చెరో వైపు ఎప్పుడూ ఉండవు. రెండు వర్గాల వాదనలు వారి వైపు నుండి వింటే అన్ని కరెక్టేగానే కనపడతాయి మరి."


సో ట్రూ!!

@ SNKR,

యా అవును నిజమే..మీరన్నది ఒంటరిగా వున్న సమయాలలో వచ్చే ఏడుపులు..ఏమి ఆశించవు..అయితే ఇక్కడ మరో తిరకాసు కూడ వున్నది..కొన్ని చోట్ల సెల్ఫ్ పిటితో కూడ ఏడ్చుకొంటూ కూర్చుంటారు ఒంటరిగా వున్న సమయాలలో..! తమ మీద తమకే జాలి అన్న మాట..ఇవి గుర్తించడంలొ కాస్త జాగ్రత్తగా గమనిస్తేనే..అవగతం అవుతాయి అనుకొంటాను.

@ ప్రవీణ,
హ...హ..హ..హ ఆ ఏడుపులన్నీ ఎత్తుల కోసమే కదండి.! కామెంటినందుకు చాలా థ్యాంక్సండి

@ నిషిగంధ గారికి,
థ్యాంక్సండి. :-)

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs