గీతంజలి - 2

     విశ్రాంతి సమయం వరకు కథానాయకి గీతాంజలి సంఘటనలతో కథాగమనమంతా నడిపి. తర్వాత కథానాయకకి కాన్సర్ ఉందన్నవిషయం ఒక షాక్‌లా తెలియపరచి అక్కడ నుండి కథానాయకి.. కథానాయుకల చిలిపి సంఘటనలతో మల్లి కథనం మొదలెడతాడు.
   గీతను కలవడానికి వాళ్ళ ఇంటికే వస్తాడు ప్రకాష్.. " నీకు కంజేనటల్ హార్ట్  అంటే ఏమిటొ తెలుసా " అడుగుతాడు
" ఊహ " తెలియదంటు తల ఊపుతుంది..గీత
వెంటనే గీత చెల్లెల్లు అందుకొని ఆ గుండెజబ్బు సమస్య గురించి,వాటి సాదకభాదలన్ని వివరిస్తారు చాలా సులువుగా..! చెప్పే విదానం చూడగానే హీరోకి,మనకు అర్థమవుతుంది వారికి ఆ సమస్య మీద ఎప్పటినుండొ అవగాహన వుంది..ఆ సమస్య బాదలకు వారు బాగ అలవాటుపడి పడ్డారని.
 " ఇవన్ని తెలిసి ఇలా వుండగలిగావా..? "  ప్రకాష ప్రశ్న.
" చూడు నీవు చచ్చిపోతావు..ఈ చిత్ర చచ్చిపోతుంది.. ఆ శారదుందే అది చచ్చిపోతుంది..పళ్ళు ఇకిలిస్తుందే చంటిదీ ఇదీ చచ్చిపోతుంది..ఈ చెట్లు..ఆ తీగా .. నేను చచ్చిపోతాను..కాకపోతె నాలుగురోజులు ముందు చచ్చిపోతాను .. అంతె నాకు రేపు గురించి బెంగ లేదు..ఈ రోజే నాకు ముఖ్యం..నేను ఇలాగే వుంటాను "  అంటూ బొలెడు చెప్పుకొస్తుంది గీతాంజలి..
  ఒక జీవిత సత్యాన్ని గీతాంజలి పాత్ర ద్వార చెప్పించాడు దర్శకుడు..నిజమే కదా..!! వాళ్ళిద్దరికి మరణం పలాన సమయంలో తధ్యం అని తెలుసు..కాబట్టి ప్రతిరోజు..ప్రతి నిమిషం.. ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ గడపవచ్చు. మనకు మరణం ఎప్పుడో తెలియదు కాని ఆశాదృక్పదంతో జీవనం సాగిస్తూ వుంటాము..  ఇప్పుడు జీవిగా వున్న మనిషి బయటకెళ్ళగానే ఏ ప్రమాదమో జరవచ్చు..లేద మరేదయనా ప్రాణం పోయే సంఘటన జరిగి విగతజీవిగా మారొచ్చు..అంటే జీవితం మీద కేవలం " ఆశ " మాత్రమే వుంటుంది..కాని ప్రాణం మీద భరోసా వుండదు. మరి వారికి భవిష్యత్త్ మీద ఆశ లేదు కాని ప్రస్తుత జీవనం మీద భరోసా వుంటుంది.
  గీతాంజలి మాటలతో ప్రకాష్‌లో కూడ అంతర్మధనం జరుగుతుంది. .’తను ఇన్నాళ్ళు ప్రపంచమంత తలక్రిందులైనట్లు, అసలు ప్రస్తుత జీవితమే లేనట్లు,ఏదో కోల్పోయిన వాడిలాగ ఒక శాలువ కప్పుకొని పుట్టలెమ్మడి, చెట్టులెమ్మడి తిరుగుతూ నాకు నేను నామీదే " జాలి " చూపించుకుంటూ బ్రతికాను.. అదెంత అవివేకమో.. ? జరుగుతున్న క్షణాన్ని అనుభవించకుండా ఎప్పుడో రాబోయే మరణం గురించి చింతిస్తూ ప్రస్తుత జీవితాన్ని నరకం చేసుకోవడం ఎంత వరకు సబబు..? "  తనలో తానే ఆత్మపరిశీలన చేసుకొని...ఒక జీవిత సత్యాన్ని కనుగొన్న మనిషిలా..మార్పు చెందే సన్నివేశంలో మార్పుకు గుర్తుగా ప్రకాష్ తాగుతున్న సిగిరెట్‌ని విసిరిగొట్టి గట్టిగ శ్వాస తీసుకొని ముందుకు పరిగెడతాడు.. ఆ పరుగులో అంతవరకున్న నైరాశ్యం..దిగులు..వీటి నుండి బయటకొస్తూ జీవితం జీవించడానికన్నట్లుగా ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది...  ఎటువంటి డైలాగ్స్ కూడ వుండవు కాని కేవలం దృశ్యపరంగా మనకు తెలిసిపోతుంది ఆ భావన.
   ఇక్కడ నుండి చిలిపి సంఘటనల సన్నివేశాలతో సినిమాని నడుపుతాడు దర్శకుడు.. ప్రకాష్ ప్రేమంటూ చేసే చిన్న చిన్న చిలిపి తగాదాలు..గీత ఒప్పుకొనే సన్నివేశం.. తర్వాతొచ్చే సన్నివేశంలో గీత ప్రకాష్‌ని అడుగుతుంది " నీవు చెప్పింది నిజమేనా..?
  " ఐ లవ్ యు "
" ఏ ..? "
" ఎందుకో తెలీదు..కాని నిజమని మాత్రం తెలుసు.."
 " ఎలా..? " గీత ప్రశ్న.. దానికి సమాదానంగా ప్రకాష్ గీత కుడి చేతిని తీసుకొని తన గుండె మీదుంచుకొని
" గుండె బద్దలయ్యేలా కొట్టుకొంటుంది "
" నాక్కూడ " గీతంటుంది
" నిజంగా..? "  అందుకు గీత ప్రకాష్ తలను తన గుండెల మీదుంచుకొని  " ఓం నమహః నయన శృతులకు "  అంటూ పాట ద్వార హృదయ స్పందనలు తెలియచేసె సన్నివేశం..!
 ఇక్కడ ఒక విషయం గమనిస్తే..అప్పటి వరకొచ్చిన తెలుగు సినిమాలలో కాని..లేక తమిళ డబ్బింగ్ సినిమాలలో కాని " ప్రేమ " భావానికి రకరకాల నిర్వచనాలు చెప్పేవారు..వాటిల్లో చాలా వరకు మేలో డ్రమటిక్ భావాలు, మరి కొన్నయితే బరించలేనంతగా సెంటిమెంట్‌ పండిస్తూ ఉండేవి..! అసలు ప్రేమకు " పలాన " అంటూ ఎవరైనా నిర్వచనం చెప్పగలరా..?  ప్రేమకు ఇదే సార్వజనీయమైన భావమని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు..చెప్పలేరు కూడ..! అందుకే దర్శకుడు ఇక్కడ ప్రకాష్ నోట " ఎందుకో తెలీదు..కాని నిజమని తెలుస "ని చెప్పించాడు..నిజమే కదా ..!!  అది ’పలాన ’ అని ఒక భావాన్ని ఎలా చెప్పగలం..? కాని మదిలో వున్న భావం మాత్రం నిజమని మాత్రమే చెప్పగలం..!

   ఇక గీత తనకు గుండెలో నొప్పంటూ ప్రకాష్‌ని తనింటికి పిలిపించుకున్న సమయంలో వారిద్దరి మద్యన జరిగే సంభాషణలు మనసున్న మనుషులని కదిలించక మానవు..!! " ఏంటి ఏమయింది..? గుండెలో నొప్పిగా ఉందా..? నాన్నగారితో చెప్పనా..? " ప్రకాష్ ప్రశ్నలకు  " అదెప్పుడు వుండేదే..కానీ ఈ రొజు ఎందుకో నీతోనే ఉండాలనుంది "  అంటుంది గీత.
 " నా కోసం ఒక పనిచేస్తావా..? "
 "............ "
" నన్ను నీ ఒడిలో పడుకోనిస్తావా..? "  ఇద్దరు అప్పుడప్పుడే మానసికంగా దగ్గరవుతున్న క్షణాల్లో వచ్చే అభ్యర్థనలవి.
  ఈ మాటలన్ని దేనిని సూచిస్తాయి..? రేపో మాపో చనిపోయే ఇద్దరు మనుషులు బ్రతికున్న రోజులని మరిచిపోని మధుర క్షణాలుగా మలుచుకోవడానికి పడే తాపత్రయంలా అనిపిస్తుంది..!! జరుగుతున్న ప్రతి నిమిషాన్ని..క్షణాన్నిఇద్దరు తమ కౌగిలింత స్పర్శలతో సంపూర్ణంగా త్యాధాత్మికత చెందుతున్నట్లుగా కనపడుతుంది.
" నేను నీకు నచ్చానా..? " గీత ప్రశ్న
" చాలా "
" రేపు నేను చచ్చిపోతే..? "
" రేపు గురించి నాకు బెంగ లేదు..! ఈ రోజే నాకు ముఖ్యం ఓ అమ్మాయి నాతో చెప్పిందీ "
ఇక్కడ కొన్ని డైలాగ్స్ కట్ చేసినట్లు అప్పట్లో కొందరి ద్వారా విన్నాను..మరెంతవరకు అవి నిజమో కాని..ఆ కట్ చేసిన మాటలు......
 " రేపు నేను చచ్చిపోతే నా కోసం దిగులుతో బాద పడుతూ బతుకుతావా..? "
 "....."
" మరో పెళ్ళి చేసుకోవా..? "
"........ "
" కాని నేను చచ్చిపోయాక నా కోసం నీవు కుళ్ళి కుళ్ళి ఏడవాలి, ప్రతి క్షణం నన్ను తలుచుకొని తలుచుకొని బాదపడాలి "  కోరుతుందట..గీత. ఇలా ఇంకా రెండు మూడు డైలాగ్స్ ఉన్నాయి..నాకు గుర్తు లేదు గాని...
 ఎవరన్న సరే మామూలుగా మనుషులు చనిపోయిన తర్వాత ఓ రెండు రోజులు తమకు కావాలసిన వాళ్ళు ఏడుస్తారు..తర్వాత రోజులు గడిచే కొద్ది మెల్లి మెల్లిగా మరిచిపోయి రోజువారి ధినచర్యల్లో మునిగిపోతారు..అది సర్వసాదారణం..కాని చనిపోయిన వారి గురించి జీవితాంతం ఏడవరు..పదే పదే గుర్తు చేసుకుంటూ మదనపడరు..! మిగతా ప్రపంచం కూడ ఆలోచించదు. అసలు అంతవరుకు బ్రతికున్న మనిషి యెక్క ఉనికి కూడ లేనంతాగా ప్రవర్తిస్తుంది ప్రపంచం..ఆ చనిపోయిన వారి ఉనికి లేనంత మాత్రాన ఈ ప్రపంచం ఏమి ఆగిపోదు..ఎవరూ ఏమి నష్టపోరు..మరి..ప్రతి క్షణం తమ ఉనికి గురించి.. ఆస్థిత్వం గురించి పదే పదే తలుచుకునేలా చేయడం ఎలా..? ఆ భావన మరణానికి సిద్దంగా వున్న మనుషుల మనసులో మెదులుతుంది..ఆ భావనను భరించడం కష్టం..దాని పర్యవసానమే ఇక్కడి గీత మాటల్లోని ఆంతర్యం అనుకుంటాను.
  మరీ ఇంత లోతైన మాటలను ప్రేక్షకులు జీర్ణించుకోవడం చాలా కష్టం అన్న ఉద్దేశంతో ఈ డైలాగ్స్‌ని నిర్మాత..మిగతా యూనిట్ సబ్యులు పట్టు బట్టి బలవంతంగా కట్ చేయించారట దర్శకుడు చేత..! ఇదెంత వరకు నిజమో మరి..?
  ఈ భావన నుండి వచ్చే పరావర్తన తరంగాలే తర్వాతొచ్చే సన్నివేశంలో కనపడుతుంది.. అర్థరాత్రి సమయం తండ్రి నిద్రపోతున్న గది తలుపుల వద్ద నించొని " నాన్నా " పిలుస్తుంది గీత
" ఎవర్రా అది అర్థరాత్రప్పుడు "
" గీత " సమాదానం...! ఇలా సాగే సంభాషణల్లొ గీత తండ్రిని అడుగుతుంది.." నాన్నా..!  నేనెందుకు చావాలీ..? నేనేమి తప్పు చేశాను నాన్న..? నాన్న నేను చావ కూడదు నాన్న..! ప్లీజ్..నేను సంతోషంగా వుండాలి. ఇంకా కొంత కాలం బతకాలి నాన్న "  తండ్రిని వేడుకొంటుంది. అంతవరకు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి క్షణం..ఈ రోజే మాత్రమే నాకు ముఖ్యం అనుకున్న మనిషి  ఇప్పుడు అకస్మాత్‌గా " నేను చావ కూడదు..బ్రతకాలి " అని కోరుకుంటుంది..అందుకు కారణం తనకంటూ ఒక మనిషి దొరకడం..ఆ మనిషి పరిష్వంగనలో సాంత్వన పొందడం..! ప్రేమను అనుభవించడం..!  అవన్ని తాత్కాలికమేనా..? కొన్ని రోజులేనా..? తనకు మిగతా వారిలా జీవితాంతం వాటిని పొందే అవకాశమే లేదా..? ఈ ఆలోచనల మద్యన కొట్టుమిట్టులాడతుండే పర్వంలో తండ్రిని ప్రశ్నిస్తుంది..! తనింకా కొద్ది కాలం బతకాలని అప్పటివరకు అనిపించలేదు..కాని తనకంటూ ఒక మనిషి తోడు దొరకడం మూలాన ఆ ప్రేమను..సాంత్వనను ఇంకా కావాలనే తపన..! తన చుట్టూ వున్న తన వాళ్ళ కోసం బతకాలని అనుకోదు..చూశారా..? అందరు రక్త సంబంధీకులే కాని.. ఒక పరాయి మనిషి తనవాడు అనుకోగానే బతకాలనే తపన.. అదే ప్రకృతి లక్షణం..!

      గీత  " ఏదయినా చేయండి " అని తండ్రినే అడిగినా..ఒక బ్రహ్మ దేవుడిని అడిగినట్లుంటుంది..! పురాణాల ప్రకారం జీవి పుట్టుకకు..జన్మలకు కారణం బ్రహ్మే కదా..?? తండ్రి ఆ స్థానంలో ఉన్నట్లే లెక్క..!  పుట్టుకకు కారణమ్యుండచ్చు కాని..చావునాపే శక్తి లేని అశక్తుడే( డాక్టర్ )తండ్రి.
     చివర్లో ప్రకాష్ జీవితం కూడ తనలాంటిదే అని తెలిసినప్పుడు గీతా తట్టుకోలేదు..ప్రకాష్ పదే పదే " ఏ " అని అడిగినప్పుడు  " నా ప్రాణం కంటే నీవు నాకు ముఖ్యం..! ఎందుకంటే నీవు నా ప్రాణంకంటే ముఖ్యమ " ని బయటపడుతుంది.

   చివరకు సినిమాని " ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారో తెలియదు..కాని బతికినన్నాళ్ళు సంతోషంగా బతుకుతారు " సుఖాంతాన్ని ఇస్తాడు దర్శకుడు..! నిజంగా ఇక్కడ జీవిత సత్యాన్ని తెలిపినట్లుండదు..? ఎవరు ఎన్నాళ్ళు బతికినా కోరుకొనేది సుఖంగా బతకడమే కదా..? అది కొన్నాళ్ళయినా.. కొన్ని సంవత్సరాలయినా..!!

   ఈ సినిమా కథను రెండు వ్యాక్యాలలో చెప్పాలంటే.. "  విభిన్న మనస్థత్వ గల ఇద్దరు రోగిష్టుల మధ్యన సాగే ప్రేమ కథ " కాని సినిమాసాంతం ఎంత గొప్పగా చిత్రీకరించారు..! కొన్ని రోజుల పాటు మనల్ను వెంటాడేలా లేదూ..? కథలోని పాత్రలు..సన్నివేశాలు అన్నిటిని మనం ఆశ్వాదిస్తాం.. అనుభూతి చెందుతాం కారణం..మన జీవితానికి దగ్గరగా ఉండడం మూలాన అనుకుంటా..!!
   ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం ముగ్గురే ముగ్గురు..వాళ్ళు.." మణిరత్నం, పి.సి.శ్రీరామ్, ఇళయరాజ " తమ ప్రతిభతో ప్రాణం పోసారు ఈ చిత్రానికి..
   దర్శకుడు గొప్పదనం గురించి నేనిప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ..వాటి జోలికి కూడ పోను గాని.. సన్నివేశాలను అల్లుకోవడంలో దర్శకుడు చూపిన నేర్పును గమనిస్తే.. సినిమా ప్రారంభంలో హీరో ఇంట్రడక్షన్‌తో హీరో తత్వం చెప్పేసి..తర్వాత హీరోయిన్‌తో చిన్న చిన్న చిలిపి సంఘటనలతో సినిమా మొదటిభాగం నడిపి విశ్రాంతి సమయంలో హీరోయిన్‌కున్న కాన్సర్ విషయం చెబుతారు.. కాని హీరో తనకు ఆ కాన్సర్ వుందన్న విషయం హీరోయిన్‌తో చెప్పడు చెబితే ఇక సినిమా అయిపోయినట్లే..! డాక్టరయిన హీరోయిన్ తండ్రితో ఒక పేషంట్ విషయాలు మరొకరికి చెప్పము అన్న మాట చెప్పించి రెండవ భాగమంతా సినిమా నడిపేశారు. ఒక పక్క విషయాన్నిచెబుతూ..చిలిపితనాన్ని జోడించి..సహజంగా ఇళ్ళల్లో జరిగే సంఘటనలాగే సాగిపోతూ వుంటుంది ఉదా: డైనింగ్ హాలులో హీరోయిన్ తండ్రితో సహా అందరూ భోజనాలు చేస్తున్న సన్నివేశంలొ టెలీఫోన్ మ్రోగుతుంది. గీత చివరి చెల్లెలు " నేను తీసుకుంటా..నేను తీసుకుంటా " అని పరిగెత్తడం..! వాస్తవంగా అలాంటివి చిన్న పిల్లలు వున్న ఇళ్ళల్లో జరుగుతూ వుంటాయి ఫోన్ మోగంగానే నేనంటు నేను అని ఫోన్ తీయడానికి పోటీ పడి పరిగెత్తుతారు..!  అవతలి వైపు ప్రకాష్ అని తెలియగానే  " గీతక్కా... నీకే ఫోన్ " చెప్పడం.. గీతా తన సహజధోరణిలో " ఎవరో ఏమిటో అడుగు " మనడం. అటువైపునుండి  " ఏమి లేదు పెళ్ళి చేసుకుందామని చెప్పింది..ఎప్పుడు ఎలా అని అడగాలి..! కొంచం అడిగి చెబుతావా..? " మాటలతో ఇంట్లో వారకందరికీ తెలిసేలా.. హీరో చెప్పే భావన..అలానే చూస్తున్న ప్రేక్షకులకు వారికి  " అయ్యో.. దొరికిపోయిందే " అనే ఒక తమాషయినా ఫీలింగ్. ఇలా అన్నీ ఒకే సన్నివేశంలో కుదిరేలా అల్లుకోవడం మణిరత్నం దర్శకత్వ ప్రతిభలో వుంది. ఇక చిన్న పిల్లల హావా భావాలు, వారి ప్రవర్తనను.. చాలా సహజంగా కరెక్ట్‌గా పోట్రేట్ చేయగల సామర్థ్యం ఒక్క మణిరత్నంకే వున్నదేమొ అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి..

   సినిమాటోగ్రఫి..పి.సి.శ్రీరామ్...! ఘర్షణ (తమిళ్ : అగ్ని నక్షత్రం), మౌనరాగం, నాయకుడు సినిమాల చూసిన వారికి పి.సి గురించి చెప్పనవసరంలేదు..!   అప్పటి వరకు అటు తమిళ్‌లో కాని..తెలుగులోకాని ఎక్కువగా ఫ్లాట్ లైటింగ్‌తో చేసిన సినిమాలు వస్తూవుండేవి..ఈయన రాకతో వాటి తీరే మారింది. ఎక్కువగా వెలుగునీడలను సృష్టించి చాలా ప్రతిభావంతంగా చిత్రీకరించే తత్వం వున్న సినిమాటోగ్రాఫర్ పి.సి. ఇప్పటి కాలానికి మారిన సాంకేతికతో పోలిస్తే గీతాంజలి సినిమాటోగ్రఫి పెద్దగా అనిపించకపోవచ్చు గాని..! ఆ సినిమా కాలానికి అదొక గొప్ప కాంట్రాస్ట్ లైటింగ్...! కథానుగుణంగా ఆ సన్నివేశానికి కావలసిన గాఢత కనపడేలా వెలుగు నీడలను సృష్టించడంలో దిట్ట పి.సి.శ్రీరామ్. బహుశ మణిరత్నం తన సినిమాలలో ఒకటికన్న ఎక్కువ సినిమాలకు ఒకే సినిమాటోగ్రఫర్‌తో పనిచేసింది పి.సి.శ్రీరామ్‌తో అనుకుంటాను.  సంతోష్ శివన్, పి.సి.శ్రీరామ్, మధు అంబట్, రాజీవ్ మీనన్, సరోజ్ చంద్ర పాడె, రవి యాదవ్.. వీళ్ళంత సమకాలికులు అప్పట్లో..

  సంగీతం: లయరాజ ..ఇళయరాజ గురించి ఎంత చెప్పినా తక్కువే..సినిమా పాటలు..నేపథ్య సంగీతం వేటికవే గొప్పగా చేసారు రాజ గారు.. అప్పట్లో పియానో సంగీతం మన తెలుగు సినిమాలలో వుండేది కాదు..! నేను ఆంగ్ల సినిమాలలో నేపథ్య సంగీతంగా పియానోని వాడినప్పుడల్లా చాలాసార్లు అనుకునే వాడిని.. పియానో సంగీతాన్ని మన వాళ్ళు ఎందుకు నేపథ్య సంగీతంలో వాడుకోరు..అని..! కాని గీతాంజలి సినిమాలో చాలా చోట్ల పియానో వాడారు ముఖ్యంగా హీరో ఊటిలో దిగి కారులో గెస్ట్‌హౌస్‌కి వచ్చే సంధర్భంలో తెల్లటి నురగల్లాంటి మబ్బుల మద్యన కొండాకోనల రోడ్‌లో కారు ప్రయాణం..అక్కడ వాడిన పియానో సంగీతం.. చూస్తున్న ప్రేక్షకులకు కూడ ఆ కారుతో  తెలుపు..బూడద రంగు కలయకలతో కూడిన మబ్బుల మద్యన ప్రయాణిస్తున్నట్లే అనిభూతినిస్తుంది.

  సంగీతం గురించి మాట్లాడుతూ..ఇక ఈయన గురించి చెప్పకుండా మానేస్తే మాత్రం ఈ సినిమాకు పరిపూర్ణత చేకూరనట్లే అవుతుంది...ఆయన ఎవరో కాదు..! తెనుగు పదాలను ఆలవోకగా తన కలంలో జాలువారేలా రాసే.." వేటూరి ", ఈ సినిమా కథని పాటలలో కూడ ప్రతిఫలించేలా వ్రాశారు.
 " మా ఊపిరి నిప్పుల వుప్పెన..మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కుటెల్లి పోయే.." యువతలో వున్న ఆవేశాన్ని..ఆలోచనలను తెలియచేస్తారు.
" నడిరేయే సూర్య దర్శనం..రగిలింది వయసు ఇంధనం.."  ఈ పదబందాలు..ఎవరు రాయగలరు..!!
 కథానాయుకుడుకున్న అనారోగ్యం తెలిసాక
   " ఆమని పాడవే హాయిగా..అంటూ.. తరాల నా కథ క్షణాలదే కదా..అని హీరో ఆస్థిత్వాన్ని తాత్వికంగా చెబుతాడు..!
    మరో ప్రపంచమే మరింత చేరువయి నివాళి కోరినా ఉగాది వేళలో గతించి పోనీ గాథ నేననీ.." కథానాయుకుని ఆవేదన ప్రతిపలిస్తాడు..
ఇక కథానాయకి .." జల్లంత కవ్వింత కావాలిలే..ఒళ్ళింత తుళ్ళింత కావాలిలే.." పాటలో.. ఏకంగా వానదేవునికి కళ్ళాపి చల్లే పని..వాయుదేవునికి ముగ్గేసే పని అప్పగిస్తాడు మన వేటూరి..! అలా దేవుళ్ళకే పనులప్పగించే సాహసం ఎవరు చేస్తారు..!!
  " సూరీడే ఒదిగి..ఒదిగి జాబిల్లిని ఒడిని అడిగే వేళ... ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం.."  ఎంత అద్భుతమైన తాత్విక శృంగార భావ ప్రకటన ..ఇది..!!  శిల్పం..వస్తువు వేరయినా..ఇదే శైలిని కొంత మంది గీత రచయతలు అనుసరించారని విన్నాను.
 ఇక కథానాయకి మరణానికి చేరువయిందన్న సంగతి తెలిసాక..కథానాయుకుడు పాడే పాటలో.." ఓ పాప లాలీ..జన్మకే లాలీ.. ప్రేమకే లాలి " తన ప్రియ సఖికి వీడ్కోలు పలుకుతూ.. చుట్టూ వున్న ప్రకృతిని సైతం తన నెచ్చెలికి అనుకూలంగా మసలమని లాలిపాట ద్వార కోరుతాడు.
 " నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా "
  ఈ సినిమాకు గీత రచయతగా వేటూరిని ఎన్నుకొని..సన్నివేశం వివరించి " కాస్త సున్నితమైన భావాలతో కూడిన పాటలు కావాలని " మణిరత్నం అడిగారట..! వెనువెంటనే ఒక అరగంటలో పాట రాసి ఇచ్చాడట..!..ఆ పాటను ఆంగ్లంలో తర్జమా చేయించుకొని విని.. మిగతా పాటలు విననవసరం లేదని చెప్పి..మొత్తం వేటూరితోనే రాయించారు. వేటూరి ఏమి వ్రాసిన వినకుండానే స్వీకరించేవారట..మణిరత్నం.. మరో విషయం కూడ వున్నదిక్కడ..ఆ తర్వాత మణిరత్నం ఏ తమిళ్ సినిమా చేసినా ఆ సినిమా తెలుగులో డబ్ చేయాలనె ఉద్దేశం ఉన్నట్లయితే ముందుగా వేటూరి గారితోనే తెలుగులో పాటలు రాయించి తర్వత తమిళ్‌ పాటలో ఆ భావం స్పరించేలా చేసుకునేవారట.. అంతలా ఆయన ఆస్థాన గీత రచయతయిపోయారు వేటూరి. నా మటుకు గీతరచయతల్లో వేటూరికే అగ్రతాంబూలం ఇస్తాను..శాస్త్రి అయినా..ఆత్రేయ అయినా..ఆరుద్రయినా..సినారే అయినా..సరే... వేటూరి తర్వాతే.. వారి స్థానాలు.

 చివర్లో..నటీనటుల నటన గురించి మాట్లాడుకుంటే...! నాగార్జున... దర్శకుడు ఎలా ఉండమంటే అలా ఉన్నాడు ఈ సినిమాలో..ఈ కథకు పూర్తిగా నప్పాడు ఆహర్య పరంగా..! నటన పరంగాను కూడ.! ఇక గీతాంజలి పాత్రధారిని.." గిరిజ " అసలు ఆమెకు మొదటి సినిమా అంటే ఎవరూ నమ్మలేనంతగా నటించింది..ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలాగ ఆ అమ్మాయే వుందేమొ ఆనిపించేలా నటించింది.  నటనలో ఎక్కడా కృత్రిమం కనపడదు. ఓవర్ యాక్షన్ లేదు..! మిగతా వారంతా ఎవరి పరిధిలో వారు చేశారు.

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs