.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.
   
   రమణారెడ్డి వర్గానికి ఓ విషయం బాగా అర్థమైంది - చెన్నారెడ్డిలో భయం పుట్టుకొందని.
 అంతమంది జనాన్నీ, తుపాకుల్నీ, తోడుగా వుంచుకొని కూడా తమను చూడగానే పెళ్ళి మంటపం వద్దనుంచి పారిపోయాడంటే విచిత్రంగా వుంది.
  ప్రాణభయం పుట్టుకొంది అతనికి. సందేహం లేదు.
  ఈ ఒక్క మార్పుతో తాము సగం విజయం సాధించినట్టే లెఖ్క.  ఆనందంతో గెంతులేశారు,  పొట్టేల్ని కోసుకొని విందు చేసుకొన్నారు. ఏటి ఇసుకలో రాత్రిపూట పాటలు పాడుకొన్నారు, కబడి లాంటి ఆటలు కూడా ఆడారు.
  మర్నాటిరోజు బద్వేలు వెళ్ళినపుడు జీపియ్యార్‌లాంటి నాయకులకు చెప్పి ఉత్సాహపడ్డారు. కలసి ఆనందించారు.
 విషయం వినగానే సోమనాథరెడ్డి నొసలు ముడేశాడు  " ఇప్పట్నించే మీరు జాగ్రత్తగా వుండాల "  అన్నాడు.
అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాడు రమణారెడ్డి.
 " ఏ వ్యక్తి అయినా తన ప్రత్యర్థిని చూసి భయపడ్డాడంటే -...  నాలాంటి వాడైతే ఇంట్లోంచి బైటకు రాకుండా గడిపేస్తాడు. ప్రభాకర్‌లాంటి భయస్తుడయితే బేషరతుగా లొంగిపోయి దాసోహమంటాడు. చెన్నారెడ్డి లాంటి వాడయితే ఎంత వీలయితే అంత తొందరగా ప్రత్యర్థిని అడ్డు తొలగించుకోవటం గుండా తన భయాన్ని పోగొట్టుకోవాలని చూస్తాడు.....  ఇప్పుడు చెన్నారెడ్డి ఆ ప్రయత్నం మీదే వుంటాడు... అందుకే జాగ్రత్తగా వుండాలని చెప్పేది "  వివరించాడు సోమనాథరెడ్డి.
 ఆ విశ్లేషణ రమణారెడ్డికి కూడా నచ్చింది.
 తన పినతండ్రినీ, గురివిరెడ్డి వగైరాల్ని చంపింది కూడా భయపడటం వల్లే. అది రాజకీయ భయం కావొచ్చు... మరొకటి కావొచ్చు.. అతని పిరికితనమే అతని చేత ప్రత్యర్థుల్ని చంపించింది.
 తమ మీద కూడా దాడులు జరగొచ్చు.
  జాగ్రత్తగా వుండాలి.
 ఇప్పటి వరకు దాడిజేసేది తామేననుకొన్నారు. ఆ అవసరం తమకు మాత్రమే ఉందనుకొన్నారు.
 ఇప్పుడు చెన్నారెడ్డికి కూడా ఆ అవసరమే కలిగింది.
 ఆ అవకాశం అతనికివ్వకూడదు.
 తామే అందిపుచ్చుకోవాలి.
 తన వాళ్ళందర్నీ జాగ్రత్త పరిచాడు.
  ఈ హాడావిడిలోనే సారాయి అంగళ్ళ వేలం పాటలకు తేది ప్రకటించారు.
 సోమనాథరెడ్డి, రామనాథరెడ్డి, జీపియ్యార్ వగైరా ధనవంతులైన పార్టీ మనుషుల్ని సంప్రదించాడు రమణారెడ్డి.
  వేలం పాటల్లో పాల్గోనేందుకు వాళ్ళెవరూ సుముఖత వ్యక్తపరచలేదు. తాము వెనకనుంచి ఆర్థిక సాయం అందించే వాళ్ళే గాని ప్రత్యక్షంగా పాల్గొనేది లేదని చెప్పారు.  అంగళ్ళ మీద వచ్చే ఆదాయం కూడా తమకవసరం లేదనీ.. చెన్నారెడ్డికి పోటీబడితే చాలనీ అన్నారు.
 తమ్ముళ్ళతో, శ్రేయోభిలాషులతో చర్చించిన పిదప బద్వేలు తాలుకాలోని అన్ని మండలాలకు పోటీ పడాలని నిర్ణయించుకొన్నాడు రమణారెడ్డి. ఆ కార్యక్రమంలో భాగంగానే డిపాజిట్ కట్టేందుకు డి.డి లు తీశాడు.

                                    **********


  వాళ్ళ ప్రయత్నం చెన్నారెడ్డికి తెలిసింది.
 తీవ్రంగా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది.
 తన ఆర్థిక వనరులకు గండి కొట్టబోతున్నారు వాళ్ళు.
  ఆర్థికం సంగతి దెవుడెరుగు - తన ఆధిపత్యానికి కూడా గండి పడినట్లు అవుతుంది.
 తెగించి వున్నారు వాళ్ళు. తన వ్యతిరేకులు తన మీద అక్కసతో వాళ్ళకు దండిగా ఫండ్స్ యిచ్చినట్లున్నారు. ఎంత టార్గెట్ అయినా ఛేదించేందుకు సిద్దపడతారు. పోటీ పడితే అంగళ్ళన్నీ వాళ్ళకే పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం వుండదు.
 ఇప్పుడు రాజకీయమంతా సారా అంగళ్ళ చుట్టేవుంది. రాజకీయంలోకి దిగాలంటే ముందుగా సారాయి అంగళ్ళు నిర్వహించిన అనుభవం వుంటే మంచిది. ఎలక్షన్లు రాబోయే సరికి జనాన్ని బాగా బెదరగొట్టి అదుపులోకి తెచ్చుకోవచ్చు.  తాలుకా మూల మూలలు తిరగొచ్చు. అవసరమైతే పోలీసుల సహాయంతో టెర్రర్ సృష్టించొచ్చు.
 అందుకే సారా అంగళ్ళను అంత సులభంగా వదలదల్చుకోలేదు చెన్నారెడ్డి.  ఇప్పుడు గొడవపడటం కంటే కాంప్రమైజ్ కావటం మేలనుకొన్నాడు.  ప్రత్యర్థితో ఓ అవగాహనకు రావటం ఉత్తమం.  ఈలోపు అవకాశం దొరికితే వాళ్ళను చంపటం చాలించేది లేదు... అది అదే... ఇది ఇదే............!
  బంగారు అంగడి గుప్తను రాజీకి పంపాడు రమణారెడ్డి వద్దకు.
 వారం రోజుల కృషి తర్వాత రాజీమంత్రం ఫలించింది.
  శివపురి సోదరలకు ఇరువై లక్షల డబ్బు ఇచ్చేట్లుగా, వాళ్ళు తాలుకాలో ఎక్కడా పోటీకి రాకుండా వుండేట్లుగా వొప్పందం కుదిరింది.  ముందే డబ్బులిచ్చి అట్లా అగ్రిమెంటు కూడా రాయించికున్నాడు చెన్నారెడ్డి.
  సారాయి అంగళ్ళే రాజకీయ పునాదులని రమణారెడ్డికి బాగా తెలుసు, కానీ తమకు సారాయి అంగళ్ళకంటే యింకో ప్రక్రియ రాజకీయంగా పునాదులే కాదు అంతస్థుల్ని కూడా నిర్మించి యిస్తుంది.  చెన్నారెడ్డిని చంపగలిగినపుడు ఏ సారాయి అంగళ్ళు లేకుండానే తాలుకా రాజకీయమంతా పాదాక్రాంతమవుతుంది గదా !  చెన్నారెడ్డిని చంపలేనపుడు తమకు రాజకీయం మాత్రం ఎందుకు..?
  డబ్బంతా సూట్‌కేసు నిండా పేర్చుకొని సాయింత్రంగా శివపురికి వెళ్ళారు రమణారెడ్డి వర్గమంతా.
  సూట్ కేసులోని డబ్బును ఇనుప బీరువాలో సర్దారు.
 స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఏడుమంది అన్నదమ్ములూ బీరువాముందు కూచుని కొంతసేపు నిష్టగా ధ్యానించారు.
  తర్వాత రమణారెడ్డి పెద్దగొంతుతో శపథం చేస్తున్నట్లుగా మాట్లాడసాగాడు.
  "  చెన్నారెడ్డితో పార్టీ జెయ్యడమంటే మాటలు కాదు.  అంగబలం, ఆర్థికబలం పుష్టిగా వుండాలి. మనకు అంగబలం వుంది. దేవుని దయవల్ల యీనాటికి ఆర్థిక బలం కూడా సమకూడింది. మనకు యీ ఇరువైలక్షలే ప్రధాన వనరు, ఏడుమంది అన్నదమ్ములం యీ లెక్క సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాం - చెన్నారెడ్డి యిచ్చిన యీ ఇరువైలక్షలు డబ్బు ఖర్చయిపోయేలోపల అతన్ని చంపి తీరుతాం....   "
  చివరిమాట ఏడుమందీ ముక్త కంఠంతో పలికారు.
 అందరికీ హుషారొచ్చింది.
  రాత్రిపూట ఏట్లోకెళ్ళి మళ్ళీ విందు చేసుకొన్నారు.
  అంత మొత్తంలో డబ్బు సమకూరటం వాళ్ళకున్న అతిపెద్ద సమస్య తీరినట్లుగా అన్పించింది. సానుభూతి పరుల వద్దకు మరోసారి చందాలకు వెళ్ళాలనుకోంటోన్న తరుణంలో అనుకోకుండా వచ్చి పడిన అద్భుత అవకాశం యిది.
  ప్రస్తుతం యీడబ్బే ప్రధాన వనరు తమకు.
  చెన్నారెడ్డి యిచ్చిన యీ డబ్బుతోనే చెన్నారెడ్డిని చంపాలి.
  తాము మరికొన్ని ఆయుధాలు సమకూర్చుకోవాలి.
 జీపుల అవసరం లేదుగాని మోటార్ బైకులు వుండాలి.
  త్వరలో ఏంపి ఎలక్షన్స్ వస్తున్నాయి.
  బాంబుల ఉత్పత్తి పెంచాలి.
  ఎలక్షన్ల సందడిలో ఎక్కడోకచోట చెన్నారెడ్డిని దొరకపుచ్చుకొని లేపేయాలి.
  వాళ్ళు సిద్దపడుతూ వుండగానే మరో పదిరోజుల్లో ఎం. పి ఎలక్షన్స్‌కు నోటిఫికేషన్ వచ్చింది.
  ఏడు మోటార్ బైకుల్ని కొన్నాడు రమణారెడ్డి.
 మనుషుల్ని పిలిపించి ముగ్గుపిండి గని పరిసరాల్లోనే బాంబుల తయారీ చేపట్టాడు.
 మరోవైపు చెన్నారెడ్డి కదలికల్ని స్ఫష్టంగా గమనిస్తున్నాడు. అతని ఎన్నికల ప్రచార కార్యక్రమాల వివరాల్ని ముందుస్తుగానే సేకరిస్తున్నాడు.
 తాము కూడా ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకొన్నారు.
 పల్లె పల్లెకూ వెళుతున్నారు.
 జాతీయపార్టీకి అభిమానులు దండిగానే వున్నారు.
  పార్టీ అభిమానుల కంటే చెన్నారెడ్డి దౌర్జన్యాల్ని నిరసించే వాళ్ళ సంఖ్య మెజారిటీ స్థాయిలో వుంది.. కానీ వాళ్లెవరూ బూతు వద్దకు వచ్చే స్థితిలో లేరు.  చెన్నారెడ్డి బలగానికి భయపడుతున్నారు. పార్టీ తరపున ఏజంట్లుగా కూచునేందుకు చాలా పల్లెల్లో మనుషుల కరువయ్యారు.
  వాళ్ళ భయాన్ని పోగొట్టాలి.
 చెన్నారెడ్డిని ఎదుర్కొనే మరో శక్తి పుట్టిందనీ. అది తమకు అండగా వుంటుందనీ అందరిలో భావన కలగాలి.
 ఇంతవరకు తాము సాధించిన విజయమల్లా సారాయి టెండర్లలో చెనారెడ్డి వద్ద భాగం పట్టటం.
 అది ప్రజల్లో అంత నమ్మకం కలిగించేది కాదు.
  తాము త్వర పడాలి, ఏదొక ఇరుకు ప్రాంతంలో చిక్కించుకొని అతన్ని లేపేసేందుకు ప్రయత్నించాలి. రాక్షస సంహారం జరగాలి.
 పల్లె పల్లెలో తాము నియమించిన వ్యక్తులు హుషారుగానే సమాచారం అందజేస్తున్నారు. వాళ్ళ పరిధిలోకి వచ్చిన చెన్నారెడ్డి వార్తల్ని నిమిషాల మీద చేరవేస్తున్నారు.
  వేగుల వ్యవస్థనంతా జయసింహ, రాఘవ పర్యవేక్షిస్తున్నారు. మోటారు బైకుమీద తిరుగుతూ సమాచారాన్ని సేకరించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు రాఘవ. అప్పుడప్పుడు బాలుని వెంట వెళ్ళి బాంబుల ప్రయోగాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాడు.
  ఆరోజు రమణారెడ్డి జీపు ఒక్కటే బద్వేలు వెళ్ళింది. ఎప్పుడూ చెన్నారెడ్డికి రిగ్గింగ్ బూతుగా వున్న టౌను పక్క పల్లెలో జాతీయ పార్టీ తరపున రేపు ఎలక్షన్స్‌లో ఏజంట్లను నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండ్రోజులుగా ఆ వూరి మీదే దృష్టి నిలిపాడు.... పని జరిగేట్టుంది.
చెన్నారెడ్డి ప్రచార కార్యక్రమాలు అట్లూరి మండలంలో సాగుతున్నాయి. అక్కడ తమకు స్థానం లేదు. పల్లెలకు వెళ్ళినా ఆశ్రయం కల్పించే వారు లేరు. అందుకే రెండు రోజులుగా ఎమ్మెల్లేను పట్టించుకోకుండా వదిలేశారు.
  బాలుడు తన జనాన్నేసుకొని పిండిగని వద్దకెళ్ళాడు.
 మద్యాహ్నందాకా అక్కడుండి తర్వాత బద్వేలు వెళ్ళాలనేది వాళ్ళ ఆలోచన. మద్యాహ్నం అన్నతో కలిసి తిరగాలి.
 గతానికి ఇప్పటికీ ముగ్గుపిండిగని వద్ద చాలా మార్పొచ్చింది.
  నారమ్మ చేలోకి గని తవ్వకం చొచ్చుకు పోవటం వలన నాణ్యమైన పిండి వరస బైట బడింది.  దాంతో మార్కెట్ కూడా పెరిగింది. వచ్చిన ఆదాయాన్ని రాజకీయాలకు ఉపయోగించాల్సిన పనిలేదనీ, గని అభివృద్దికే ఖర్చు చేయమనీ పెదనాన్నకు చెప్పారు.
  గని దాటి యాభై గజాలు దూరంలో కంపచెట్ల మద్యనున్న గుడిసె వద్దకు నడిచాడు బాలుడు.
  లోపల ధీక్షగా పనిచేసుకొంటూ వున్న వ్యక్తులు కాస్తా వాళ్ళను చూడగానే పని ఆపి నమస్కరించారు. చుట్టూ వున్న వస్తువుల్ని ఏమాత్రం సోకకుండా మెల్లిగా బైటకొచ్చారు.
  దారపు వుండలు, గాజుముక్కలు. ఇనుప చీలలు. పేలుడు పదార్థాల మిశ్రమమూ, అప్పుడే చుట్టి తయారైన బాంబులూ, కొంత దూరంలో ఆరబెట్టిన బాంబులూ...   అక్కడక్కడా తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలూ..
  తయారైన సరకును గురించి వివరాలు అడిగాడు బాలుడు.
  తర్వాత అక్కణ్నించి గనివద్దకెళ్ళి పెదనాన్నతో మాట్లాడుతోంటే - వేగంగా వచ్చి ఆగింది మోటార్ బైకు ఒకటి.
  నొసలు ముడేసి అటుకేసి చూశాడు.
  శివపురిలో జయసింహ వద్ద వుంటోన్న రాఘవ
 బండి దిగి ఆతృతగా బాలుని వద్దకొచ్చాడు అతను.
  "  అన్నా  ! వాల్లు యీదోవకే వొస్చినారంట....  "  చెప్పాడు.  "  టౌనులో ప్రచారానికి పోయినారంట..  ఇప్పుడే చెన్నారెడ్డి జీపువొక్కటే పోరమామిళ్ళకు  వస్చాందంట.... మిగిలిన జీపులన్నీ బద్వేలులోనే వుండాయంట..  "
  ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు బాలుడు.
  తమ ఏరియాకు ఒంటిరిగా వస్తున్నాడంటే తమ ప్రోగ్రాం కూడ అతను సేకరించినట్టుంది.  తామెవ్వరూ ఇళ్ళవద్ద లేరని ధైర్యం చేస్తున్నాడేమో..!
 " ఎంతసేపయింది బైల్దేరి ?  "  ఉద్వేగంగా అడిగాడు.
 " పది నిమిషాలు అయ్యుంటుంది...  ఫోనొచ్చింది.. నేనొస్చినా.. అంతే  "
 ’ మరో పదినిమిషాల్లో యీ ప్రాంతానికి రావొచ్చు ’ మనస్సులోనే లెఖ్క గట్టాడు.
 " ఏదోవిధంగా నువ్వు అన్నోల్లకు సమాచారం పంపు... "  అతనికి చెప్పాడు బాలుడు.
  మోటారు బైకు వెనక్కి తిరిగింది.
  ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు వాళ్ళు.
  దాడి చేయాలని నిర్ణయం జరిగింది.
  అందరిలో ఆతృత... ఏదో ఉద్వేగం..
 బాంబ్ మేకర్ ఎక్కడికో వెళ్ళి నట్టుంది.
  తామే బాంబుల్ని బక్కెట్లకెత్తి జీపులో పెట్టారు.
  పెద్దాయన పిలుస్తోన్నా పలుకలేదు.
  మరొకరు మాట్లాడబోతోన్నా అనుమతించలేదు.
  జనమంతా ఎక్కగానే జీపు కదిలింది.
  అందరిలో టెన్షన్.
  ఎవరూ ఏమీ మాట్లాడుకోవటం లేదు.
 ఎవరి గుండె టక టకలు వాళ్ళకు స్పష్టంగా విన్పిస్తున్నాయి
  మందు అలవాటున్న వాళ్ళకు మూడవున్సులన్నా గొంతు దిగితే బావుండుననిపించింది.
  దానిక్కూడా సమయం లేదు.
 స్పాట్ ఎక్కడైంది నిర్ణయం జరగలేదింకా..
 జీపు సమీపిస్తూ  వుంటుంది.
  మనస్సంతా భరించరాని ఉద్వేగం...
  ఉన్నట్టుండి చెన్నకేశవ చెప్పాడు  " ఒంటికొట్టం కాడికి పోనీ !  అరుగు కాడ స్పాట్ బావుంటుంది. మనకు కలిసొచ్చిన తావు .."
  ఒక్క క్షణం ఆలోచించాడు బాలుడు.
 " పోనీ  " అన్నాడు
 ఒంటి కొట్టం వద్ద ఆగింది జీపు.
 బాలుడొక్కడే దిగి చూశాడు.
 రోడ్డు పక్కనే పెద్ద అరుగు.
 ఎదురుగా రోడ్డుకు అడ్డంగా స్పీడ్ బ్రేకర్.
  ఇంతకంటే మంచి తావు దొరకదు.
  దూరాన్నించి ఏదో జీపోస్తున్నట్లుంది.
 తమ జీపును అరుగు పక్కనే ఆపారు.
    జీపులోంచి బాలునికి తోడు నేలటూరి జయరామిరెడ్డి దిగాడు. జీపు చాటున్నే నిల్చుని ఏదో మాట్లాడుతోన్నట్లుగా నటించసాగారు.
 అంతలో వూర్లోనుంచి మోటారు బైకు వచ్చింది.  దాన్ని స్టాండేసి  ఆదరా బాదరాగా జీపువద్ద కొచ్చి ఎవ్వరూ చూడకుండా బక్కెట్లో నుండి రెండు బాంబుల్ని తీసి ఫ్యాంట్ జేబుల్లో వేసుకొని హుషారుగా అరుగెక్కి అక్కడి గ్రామస్థుల మద్య కూచున్నాడు -  రాఘవ.
  ఐదారు మంది కంటే ఎక్కువ లేరు అరుగుమీద. ఉన్నవాళ్ళు కూడా హుషారుగా పులిజూదం ఆడుతున్నారు.
  జీపుచాటున బాలుడు మొహరించి వుంటే, జీపులోని వ్యక్తులు ఏ క్షణాన్నయినా కిందకు దూకేందుకు సిద్దంగా వున్నారు. వాళ్ళ చేతుల్లోని బాంబులు ఏ క్షణాన్నయినా పిట్టల్లా ఎగిరిపోయేందుకు సిద్దంగా వున్నాయి.
  బద్వేలు వైపునించి వస్తోన్న జీపు శబ్దం రాను రాను దగ్గరవుతోంది.
  అది చెన్నారెడ్డిదేనని నిర్దారణ కావాలి.
  అందులో ఎమ్మెల్లే వున్న విషయం ఖచ్చితంగా తెలియాలి.
 ’ పార్టీ జెండా రెప రెపలాడుతోంది.  సందేహం లేదు.  అది చెన్నారెడ్డిదే ’ అనుకొన్నాడు జయసింహ.
  దగ్గరకు రాగానే స్పష్టమైంది - డ్రైవర్ వెనుక సీటులో తెల్లటి ఖద్దరు దుస్తుల్లో లావుపాటి వ్యక్తి చెన్నారెడ్డేనని.
  వెంటనే సన్నగా యీలేశాడు జీపు డ్రైవర్.
  జీపుచాటు వ్యక్తులు  కార్యోన్ముఖులయారు.
    చేతుల్లోని బాంబుల్ని అలవోకగా పట్టుకొని లేచి నిల్చున్నారు.
 అప్పుడే స్పీడ్‌బ్రేకర్ వద్దకొచ్చి స్లో అయ్యింది జీపు.
  రోడ్డు కేసే చూస్తున్నాడు చెన్నారెడ్డి.

                                                                                                          ........ సశేషం.

4 comments:

Author makes a very good suspense writer. Keeping it very gripping and crisp at the same time

అపరిచితుడికి.. ధన్యవాదాలు

Next episode kosam waiting andi......

వచ్చేవారంలో ప్రచురిస్తాను మిగతా భాగాలు..

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs