.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.



    ఆ రోజు పోరుమామిళ్ళలో పెళ్ళి.
  శివపురి ఏరియాకు సంబింధించిన వివాహం.
  తను తప్పక వెళ్ళి తీరాలి.
  జీపుల్నిండా జనాల్ని ఎక్కించుకొని కదిలాడు చెన్నారెడ్డి.
 జీపుల వరసలో నాలుగవ జీపులో వున్నాడు అతను
 అన్నీ వరసగా వేగంగా వెల్తున్నాయి.
  కొన్ని జీపుల్లోంచి తుపాకి బ్యారెల్స్ బైటకు కన్పిస్తున్నాయి.
  శివపురి ఏరియాకు వెళ్ళేసరికి కొంత ఇరుకుగా అనుభూతి చెందాడు. రోడ్డుకు కొంతదూరంలో శివపురి కన్పిస్తోంది.
 ఒకప్పుడు ఆవూరికీ తనకూ ఎంత అవినాభావ సంబంధమనీ !
 ఆ వూరిని చూసినా, అందులోకి ప్రవేశించినా ఎంతో భద్రత భావాన్ని ఫీలయ్యాడు.
కానీ....  ఇప్పుడు అదే వూరు తనలో అభద్రతా భావాన్ని రగుల్సుతోంది, ప్రధాన శత్రువుగా మారిన మిత్రున్నొకన్ని వేటాడి తన రాజకెయ జీవితానికి అవరోధాలు లేకుండా చేసుకొన్నాడు, అది తన మనుగడకు అనివార్యమైంది..తప్పలేదు. ఇప్పుడు అదే శత్రువుకు సంబంధించిన వ్యక్తులు తన వ్యక్తిగత జీవితానికి భద్రత లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళను భయపెట్టేందుకు కాకపోయినా తన రక్షణకోసమైనా ఇంతమంది జనాన్ని వెంటేసుకొని తిరగాల్సివస్తోంది.
  ఈ జనంతో కొంత ఇబ్బందీకరంగానే వుంది.
 తను పాదం మోపటమే గొప్పగా భావించే తన అనుయాయులు విందులు, వినోదాల్లో తనను ఆహ్వానించినప్పుడు ఇంతమందికీ భోజనసౌకర్యాలూ, మర్యాదలూ చేసి పంపుతున్నారు.
  పెళ్లిళ్లకు, ఫంక్షన్లకూ మందిని వేసుకుపోకూడదనుకొంటాడు గాని సాధ్యపడటం లేదు.
  జీపులు వరస పోరుమామిళ్ళలో ప్రవేశించింది.
 అమ్మవారిశాలలో ఓ పెళ్ళివుంది.
 ప్రధానంగా తను వెళ్ళవలసింది వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద జరిగే పెళ్ళికి. ముందుగా అమ్మవారి శాలకు వెళ్ళద్దామనుకొన్నాడు.
 గాంధిబొమ్మవద్ద సందులోకి మలుపు తిరిగాయి జీపులు.
  మొదటి జీపుతోటి రెండవ జీపుకూడా సందులోకి ప్రవేశించగానే మూడవ జీపు టక్కున ఆగిపోయింది.
 జీపుల ముందునించి ఏవో అరుపులు.
 ఉలిక్కి పడ్డాడు చెన్నారెడ్డి.
 ఏం జరిగింది అర్థం కాలేదు.
" అందర్నీ సంపుతా........ మిమ్మల్నందరినీ సంపుతా కొడకల్లారా ! ...."  ఎవరిదో అరుపు.
 గుండె దడ పెరిగింది చెన్నారెడ్డికి.
 గన్‌మెన్‌లు జీపుదిగి పోబోతోంటే వాళ్ళను ఆపాడు  " మీరిక్కడే వుండండి. ముందున్న జీపు వాల్లేమి..? - సచ్చినారా ! ఏందో సూడమనండి .."  కేకేశాడు
 ఆయనకేసి కొత్తగా చూశారు గన్‌మెన్‌లు.
 అప్పటికే ముందు జీపు వాల్లు దిగి వున్నారు.
 వెనక జీపుల వాళ్ళు కూడా దిగి అడ్డపంచెలు పైకెగజెక్కి ముందుకు దూసుకెళ్తున్నారు.
  "  రేయ్ !  పోరా .. పక్కకు ఫో..." ముందునించి కేకలు - "  తన్నండ్రా !... యింతసేపు పెట్టినారు యింకా ఈనాకొడుకునూ..."
 ఎవరో ఎవర్నో లాగటం..కొట్టటం.. యీడ్చటం... అవతలి వాడి కేకలు... గాండ్రింపులూ....
  " మజ్జిగ గోపాల్ లాగా ఎవడన్నా మరొకడు తయారయ్యాడా..? హఠాత్తుగా అనుమానం వచ్చింది చెన్నారెడ్డికి.
  అంతలో ముందుకు వెళ్ళిన వ్యక్తులు వెనుదిరిగి వస్తూ  " ఎవడో గుబులోడులే ...."  చెప్పారు.
  తేలిగ్గా వూపిరి పీల్చుకొన్నాడు చెన్నారెడ్డి.
  తర్వాత జీపులు కదిలాయి.
  ఎదలోపల ఎక్కడో అస్తిమిగంగానే వుంది.
  తనకు తెలీకుండానే సన్నని జలదరింపు.
 అమ్మవారిశాల వద్ద పెళ్ళి చూసుకొని వెనుదిరిగి మేయిన రోడ్‌లో కలిసి పోలీస్టేషన్ దాటి వేణుగోపాల స్వామి గుడివద్ద ఆగాయి జీపులు. అప్పటికే చాలా వాహనాలు రోడ్డుకు గుడి ప్రహరీకి మద్య పార్క్ చేయబడి వున్నాయి.
  జీపులు దిగగానే పెళ్ళివారు ప్రహరిగేటు వద్దకు ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు.
  తన జనంతో గేటు దాటి గుడి ఆవరణ అంతటా కలియచూశాడు చెన్నారెడ్డి.
 గుడికి తూర్పు వైపు ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలో పెళ్ళి జరుగుతున్నట్లుంది. చాలా మంది జనాలు ఆవరణ అంతటా నిల్చుని ముచ్చట్లాడుకుంటున్నారు. చెన్నారెడ్డిని చూడగానే ఒక్కక్కరే దగ్గరకు వస్తున్నారు, చేతులు కలుపుతున్నారు, నమస్కరిస్తున్నారు, చిరునవ్వులతో పలకరిస్తున్నారు.
  అతను గేటు లోపలికి అడుగుపెడుతూనే అంతవరకు గుడి అవరణలో తచ్చాడుతూవున్న ఓ వ్యక్తి గబగబ మంటపంకేసి వెళ్ళాడు.
  పెళ్ళిజనంతోటి ఓ మూలగా కూచుని వున్న రమణారెడ్డి వద్దకెళ్ళి చెవిలో వూదాడు.
 తనవాళ్ళకేసి అట్లా తేరపారిజూశాడు రమణారెడ్డి.
  కూడబలుక్కున్నట్లుగా పదిమంది వ్యక్తులు లేచి నిల్చున్నారు.
 ఒకరికొకరు సైగలు చేసుకొంటూ మెల్లిగా బైటకు కదిలారు.
  వాళ్ళల్లో బాలుడు, మజ్జిగ గోపాల్, చంద్ర, మధు, రాఘవ తదితరులున్నారు. నలుగురి చేతుల్లో క్యాష్ బ్యాగుల్లాంటివి వున్నాయి. అవి కొంచం ఉబ్బెత్తుగా వున్నాయి. మరికొందరి చేతులు ప్యాంట్ జేబుల్లోకి వెళ్ళాయి.
  ఒకరికొకరు మంటపంలోంచి బైటకు నడిచారు.
  గుడి చాటున్నించి బైటకొచ్చేసరికి మజ్జిగను గమనించాడు చెన్నారెడ్డి మనిషివొకడు. తనపక్కనున్నవాన్ని తట్టి అటుకేసి చూపుతూ  " మన సేతులకు మల్లా పనిబెన్నీట్టుంది "  అన్నాడు నవ్వుతూ.
  ఎన్నోసార్లు మజ్జిగ గోపాల్‌ను చితగ్గొటి వున్నారు వాళ్ళు.
  మరికొందరు అతన్ని గురించి వ్యాఖ్యానించుకొంటూ నవ్వుకొంటూన్నారు.
  వాళ్ళ వ్యాఖ్యలు చెన్నారెడ్డిని ఆకర్షించాయి.
  మంటపం కేసి తలెత్తి చూసిన అతనికి ఆప్రయత్నంగానే నొసలు ముడివడింది. అప్పటికే బాంబుస్క్వాడ్ మంటప ఆవరణ దాటివుంది.
 మెల్లిగా చెన్నారెడ్డి కేసి కదులుతోంది.
 ఎడమ చేతిలోని బ్యాగ్‍ల జిప్ తీస్తోన్న కుడి చేతులూ, ప్యాంటు జేబుల్లోంచి ఏదో వస్తువును పట్టుకొని బైటకు తీసేందుకు సిద్దమవుతోన్న పిడికిళ్ళూ....
  అక్కడి పరిస్థితిని క్షణంలో పసిగట్టాడు చెన్నారెడ్డి.
  తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
 గన్‌మెన్‌లకు సైగ చేశాడు - తన వెంట రమ్మంటూ.....
దగ్గరగా వున్న తన అనుచరులకు కూడా సైగ చేశాడు.
 గిరుక్కున వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగలతో గుడి అవరణ దాటి రోడ్డు మీదకొచ్చి జీపెక్కాడు.
  విషయమేమితో అర్థం కాక మిగతా అనుచరులు కూడా అతన్ను అనుసరించారు. రెండు నిమిషాలో అందరు జీపుల్లో దూరిపోయారు.
  జీపులు స్టార్టయి కదిలింతర్వాతగాని రమణారెడ్డి గుంపుకు అర్థం కాలేదు చెన్నారెడ్డి తప్పించుకొన్నాడని. పరుగెత్తిపోతూ వున్న రాఘవను భుజమ్మీద చెయ్యేసి ఆపాడు బాలుడు.
వెంబడించటం తెలివితక్కువతనం.
 తమ ప్రయత్నం బైట పడటం తప్ప ప్రయోజనం వుండదు.
 ఎమ్మెల్లే అర్థాంతరంగా ఎందుకు వెళ్ళిపోయాడొ పెళ్ళి వాళ్ళకు ఏమాత్రం అర్థం కాలేదు. తమ వాళ్ళ గుండా ఏమైనా పొరబాటు జరిగాయేమోనని భయపడ్డారు.
 బద్వేలు వెళ్ళేదాకా ఆగలేదు చెన్నారెడ్డి జీపులు.
  అక్కణ్నించి వెంట వచ్చిన జనాన్ని పార్టీ కార్యాలయం వద్ద వదలి నలుగురు అంతరింగికులు వెంటరాగా ఇంటికెళ్ళాడు.
 గన్‌మెన్స్ తోటి మరో పదిమంది ప్రవైట్ అంగరక్షకులు బైట నిల్చుని వున్నారు. లోపలికెళ్ళి మొహం కడుక్కొని హాల్‌లోకొచ్చాడు చెన్నారెడ్డి.. పనిమనిషి తెచ్చి యిచ్చిన మంచినీళ్ళు తాగుతున్నారు అప్పటికే సోఫాలో కూచుని వున్న అతని మనుషులు.
  " సెప్పాపెట్టకుండా వొస్చాము. వాల్లు మనస్సునొచ్చుకొని వుండరా దొరా! ... పెండ్లి కూతురికి రెండు అక్షింతలన్నా యేసొచ్చింటే బాగుండు గదా ! "  కొండయ్య అన్నాడు మీసాలకు అంటిన తేమను తుడుచుకొంటూ..
  " బాగానే వుండేది గాని..... "  కుర్చీలో కూచుంటూ  "  నా పరిస్థితి బాగ లేక రావాల్సొచ్చింది "  నవ్వాడు చెన్నారెడ్డి.  " అప్పటికే కడుపులో గుడాబెడా అంటూండె. పొద్దున్నే రెండుసార్లు బేదులయినాయి..! ఏమయితాదిలే అనుకున్యా.. మంటపం కాడ. కాసేపటికి తట్టుకోలేక పోయినా... "
 " అట్టనా  !.... ఎందుకయిందీ తెలవక కాసేపు గుబులు గుబులు అయ్యిందినుకో...  "  కొండయ్య చెప్పాడు.
  " నువ్వు సూసినావో లేదోన్నా ! పెండ్లికి మజ్జిగాడు వొచ్చినాడు, వాన్ని సూసి పెండ్లికాన్నే తన్నాల్సిండే అని మనోల్లు వొగస్తా వుండిరి, దాటొచ్చి సరిపోయిందనుకో..."  చిన్నపరెడ్డి అన్నాడు.
 " చూసినా  " చెప్పాడు చెన్నారెడ్డి.  " నాక్కూడా అదే అన్పించింది, కాని శుభమా అని వాళ్ళు పెండ్లి జేసుకొంటావుంటే మనం తన్నులాడకోవడం బాగోలేదనే...  అక్కన్నించి దాటుకోవడం మంచిదయందనుకొన్నె.
  " మజ్జిగాడు వొక్కడేగాదు.. ఎవురో కొత్తోల్లు గుడకా వున్నారు.... వాళ్ళను యాన్నో సూసినట్టుందన్నా ! గుర్తుకు రాలే... "  చిన్నపరెడ్డి మాట ముగించేలోపలే  " ఎవుడుంటే ఏమి ! అందర్నీ తన్నేదేగదబ్బీ ! "  చెన్నారెడ్డి అన్నాడు.  " సరే దాన్నింక వదిలేయండి...."   అంటూ కొంతసేపు మౌనంగా వుండి  " తొందర్లో సారాయి అంగళ్ళకు పాట జరగబోతాంది.  దాన్ని గురించి ఆలోచించండి..."  చెప్పాడు చెన్నారెడ్డి.
  చాలా సేపు సారాయి అమ్మకం షాపుల వేలం పాటల గురించి చర్చ జరిగింది.
 ఇన్నేళ్ళు సారా పాటలన్నీ ఏక పక్షంగానే జరిగిపోయాయి, అన్ని మండలాల్లోనూ తన అనుయాయులకే సారా అంగళ్ళు వచ్చేలా చేసేవాడు. అవతలి వర్గం నించి పోటీ కూడా వుండేది కాదు. తమ వర్గంలోనే చాలా మంది పోటీలు పడుతుండటంతో కాంప్రమైజ్ చేసి కొంత సొమ్మును గ్రామాభివృద్దికి యిచ్చేట్లుగా పాటా దారున్ని ఎన్నుకోవటం జరిగేది. మొదట కాంప్రమైజ్ డబ్బులు పోటీ దారులందరికీ సమానంగా పంచేవారు గాని. గత సంవత్సరం నుంచి బద్వేలు, పోరుమామిళ్ళ పట్టణాభివృద్దికి ఖర్చు పెట్టాలని నిర్ణయించారు.
 నిరుటి సంవత్సరం చెన్నారెడ్డి పాడాడు. నలభై ఐదు లక్షల రూపాయిల కాంప్రమైజ్ అవగాహనతో సారాయి షాపుల్ని దక్కించుకొన్నాడు. అయితే ఆ డబ్బు మొత్తాన్ని పెద్దమనుషుల చేతికివ్వలేదనీ, టౌను అభివృద్ది పనులకు వినియోగించలేదనీ చాటుమాటుగా వాపోతూ వుంటారు జనం.
 తనకంటే పెద్దమనుషులు ఎవరున్నారని డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేందుకు..? అందుకే తనవద్దే వుంచుకొన్నానంటాడు చెన్నారెడ్డి. తనవద్ద వున్న మొత్తానికి రెట్టింపు ఖర్చు చేశానని చెబుతాడు.
 "  ఆయన ఎమ్మెల్లేగా వుండబట్టేగద తాలుకాలో యింత అభివృద్ది జరిగింది - యిన్నె కోట్ల పనులు చేసింది. ఆయప్పను ఖర్చు అడిగేందుకు బుద్దుండాల "  అంటారు ఎమ్మెల్లేని సమర్థించే కొంతమంది.
 ఏది ఏమైతేనేం !! గత సంవత్సరపు సారాయి వేలం పాటలకు సంబందించిన నలభై ఐదు లక్షల్ని దిగ్విజయంగా స్వంతం చేసుకొన్నాడు చెన్నారెడ్డి.
 ఈ సంవత్సరం కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు.. సారాయి అంగళ్ళ చర్చ తర్వాత ఆయన అనుచర గణం వెళ్ళిపోయింది.
 తనను కలిసేందుకు ఎవర్నీ అనుమతించవద్దని బైటి మనుషులకు చెప్పి గదిలోకి వెళ్ళి పడకమీద వాలాడు చెన్నారెడ్డి.

                    **************

  మనసులో ఏదో అలజడి.
 అంతుబట్టని ఆందోళన..
  మాట్లాడుతోన్నా, భోంచేస్తోన్నా, సాయింత్రం పార్టీ కార్యాలయం వద్దకు వెళ్ళివస్తోన్న అదే అలజడి... అదే ఆందోళన...  కారణం కోసం వెదకి  దొరకించుకొంటే.....  అది....  శివపురి వాళ్ళు సృష్టించిందేనని స్పష్టమవుతుతుంది.
  ఎవ్వరూ చేయలేని పని వాళ్ళు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
  ఎవ్వరూ సాధించలేనిది వాళ్ళు సాధించాలనుకొంటున్నారు.
  ఉదయం నించి వాళ్ళ చర్యల్నీ, అతని మానసికాందోళననీ గమనిస్తూనే వుంది అతని భార్య రమాదేవి.
  రాత్రి అడిగింది  " బేదులు తగ్గినాయా ? "  అని
 అతను సమాధానమివ్వలేదు.
 " నిన్నేనబ్బా ! "
 "  అప్పుడే తగ్గినాయిలే.... "  చెప్పాడు
  " తగ్గితే...  పెండ్లికి పోయి రావొచ్చుగదా !  వాల్లేమైనా అనుకోరా..? "  అతనికేసి చూస్తూ అంది.
  కొంత విసుగేసింది అతనికి  " పోతే తగవులాడాల ..."
  " ఎవురితో..? "
 " మజ్జిగోడుండాడు గదా ! ...  వాన్ని తన్నాల... శుభాకర్యంలో గొడవలెందుకనీ...! "
  " ఏ పెండ్లి కాడ కొట్లాడనట్లూ...  ఎవురి పెండ్లీ సెడగొట్టనట్లూ...  "  గొణిగింది.
 " వినపడేట్లు మాట్లాడు... "  విసుగ్గా అన్నాడు.
 " మజ్జిగోన్ని చూసి బేదులు పెట్టినాయోమోననీ.... "  మరోవైపు తిరిగి అంది.
  " ఎన్ని సార్లే వాన్ని తన్ని వదిలిందీ !  వానికే గాదు  లోకంలో ఎవురికీ బయపడే నాకొడుకును కాదు..."  కోపంగా అరిచాడు.
  "  అవునవును ఎవురికీ బయపడవు.. మజ్జగోని ఎనకాల వున్న శివపురి వాల్లకు బయపడి పారుకొంటా వచ్చినావుగానీ ...."
  రవ రవ మండింది చెన్నారెడ్డికి.
  " లోకమంతటికీ నేను మొగున్నెయితే, యింట్లోకొచ్చేసరికి నువ్వు నాకు మొగునివయితండావు గదనే.. నియ్యమ్మ ! ... ఇంట్లోన్నా మనశ్శాంతిగా బతకనీయే..! "  స్వరం పెంచాడు.  " ఏ పెండ్లామయినా కొట్లాడొద్దని సెబుతాదిగాని మొగున్ని రెచ్చగొట్టే నీయట్లాంటిది ఎక్కడా వుండదే_.... "
" కొట్లాడక వూరుకుండి ఎవురి పానాల్దీస్తామనీ ?  "  గయ్‌మంది రమాదేవి.  " యుద్దానికి పోయి చేతులు ముడుచుకొని కూచుంటే పగోడు వూరుకుంటాడా ? తల తీసేస్తాడు....  ఊరుకుండాలనుకున్నోనివి కొట్లాటలకే పోకుండా తెలివిగా బతకాల. గొడవలకు దూరంగా మసలాల. ఎంతమంది ఆస్తుల్ని నాశనం జేసినావు ! ఎన్ని తలకాయలు తీసినావు..?  అప్పుడేమైంది యీ తెలివి ? ఇప్పుడు భయపడి పారుకుంటా వస్తే  వాల్లూరుకుంటారా ?  నిన్ను చంపుతారు.. నీ కొడుకులనూ చంపుతారు... నా మొగున్నీ, పిల్లోల్లనూ పోగొట్టుకొని నేను బతకలేను. అట్లాంటి ఆలోచన కూడా నేను సహించలేను... మీసాల్లేని మోగోడా ! - నీకు సేతగాకుంటే చెప్పు... నువ్వు ఇంట్లో కూచో... నీ తుపాకి నా చేతికీ... నా మొగున్నీ, నాపిల్లోల్లనూ నేను కాపాడుకొంటా...ఆ   "  కళ్ళు ఎర్రబారుతోండగా ఆవేశంగా అరిచింది.
  చెన్నారెడ్డికి నోట మాట రాలేదు.
 "  అన్ని తుపాకులు, అంతమంది మనుషుల్నూ పెట్టుకొని సిగ్గులేకుండా పారుకుంటా యింటికొచ్చినావు. సంపడమో  సావడమో తప్ప వేరే దారేడుంది నీకు ..?  వీల్లనూ సంపాల్సిందే.. తలెత్తితే ఎంతమందినైనా సంపి మనం కాపాడబడాల్సిందే...  తప్పదు  చెన్నారెడ్డి !... నిన్ను చీరలు తెమ్మనీ, బంగారు చేయించమనీ నేనడగను...  నీ శత్రువులను చంపు.. వాల్లు బతుకుతే నా మొగుడు, నా పిల్లలు నాకు దక్కరు....   "  ఆవేశంతో రొప్పుతూ ఇంట్లో కెళ్ళింది.
  కోపం ఓ వైపూ, ఆవేశం మరో వైపూ, ఆందోళన యింకోవైపూ అన్నీ కలగలసి నీరసంగా మారి మంచమ్మీద అడ్డంగా వాలిపోయాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  ఇంట్లోనే తనకు శత్రువు తయారైంది.
 మొదటినించే యింతే - ఆవేశాన్ని తట్టుకోలేదు.
  ఆందోళనని భరించలేదు.
  మొదట్లో యీ గొడవలు వద్దని పోరు జేసేది. గొడవలతో కూడిన ఎలక్షన్ల జోలికి పోవద్దని మొత్తుకొనేది.  ఆమె మాటల్ని ఖాతరు జేయకుండా తను గొడవల్లో పీకల దాకా కూరుకుపోయి గిలగిల్లాడ్తున్నప్పుడు స్వయంగా ఆమే రంగంలోకి దిగేది. ఎటూ తల దూర్చాము  కాబట్టి -  ఆ తల వున్నంత వరకు పోరాట పటిమ చూపించాలనే భావం కలిగించేది.
  మనుషుల్ని చంపటాన్ని ఆమె ఎప్పుడూ తీవ్రంగా వ్యతిరేకించేది.  రాజకీయావసరాల దృష్ట్యా జరిగిన మర్డర్లన్నీ స్థానికి ముఠా కక్షల వల్ల సంభవించినవేనని ఆమెను వొప్పించినా నిదానంగా నిజం తెలిసేది,  ఆ రోజు మాత్రం బాగా తిట్టేది. ఓబుళరెడ్డి, గురివిరెడ్డిలు మర్డరైనపుడు లబలబ ఏడ్చింది ఆమె. తనే స్వయంగా వాళ్ళను చంపించాడని తెలిసి విలవిల్లాడింది. తన మొగుడు, పిల్లలు దక్కకుండా పోయేకాలం దాపురించిందని వాపోయింది. అందుకే ఇప్పుడు శత్రువుల్ని చంపమని స్వయంగా చెబుతోంది.
 ఆమె ఆవేశాన్నీ,  ఆందోళననూ ఎదుటి మనిషిలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తుంది.
అదే తను భరించలేకున్నాడు.
  తన మానా తను ఆలోచించుకొని పని జరుపుకోనివ్వదు. ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఒకటే గొడవ. మానసిక ప్రశాంతతకు మారుపేరుగా వుండాల్సిన ఇల్లాలు అశాంతిని కలిగించే కారకమైంది. ఇంట్లో నిలవాలంటే కంపమీద పడుకున్నట్లుంటుంది. ఆ ఆందోళనల్తో బైటకు రావటం... ఎవరోకరిమీద నిప్పులా మండటం....
 ఏది ఏమైనప్పటికీ శివపురి వాళ్ళు తన కదలికల్ని నిశితంగా గమనిస్తున్నారనే సత్యం ఋజవైంది. తను పెళ్ళికి ఖచ్చితంగా వస్తాడని తెలిసే అన్నిరకాలుగా సిద్దపడి వున్నారు.
 తనకు తెలీకుండా వెంటాడుతోన్నట్లుంది వాళ్ళు.
  తన మనుషుల్ని కూడా ఒకరిద్దర్ని లోబరుచుకొని సి.ఐ.డిలుగా ఉపయోగించుకొంటునారేమో..!!
 బైట వాళ్ళ పోరు..
 ఇంట్లో పెళ్ళాం పోరు...
  కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు అతను.
  అప్పుడే అడుగుల సవ్వడి.
 మళ్ళీ వచ్చినట్లుంది ఆమె.
  అతను కళ్ళు తెరవతల్చుకోలేదు.
  " నిద్రొస్తా వుందా నీకు..?  ఎద్దాల దిని మొద్దాల నిద్రబొయ్యే వానికి యీ గొడవలన్నీ ఎందుకూ  ? "  గొణుగుతోంది.
  అతను మాత్రం  కళ్ళు తెరవలేదు.
 మళ్ళీ రోజు రాత్రికి అసలు ఇంటికే రాలేదు.
  అర్థరాత్రికంతా హైదరాబాద్ చేరుకున్నాడు.
  గన్‌మెన్‌లను  ఎమ్మెల్లే క్వార్టర్స్ వద్ద వదిలేసి నేరుగా దిల్‌షుక్‌నగర్‌లోని ఓ యింటి ముందు కారు దిగాడు.
  కాలైంగ్ బెల్ నొక్కగానే ఇంట్లోంచి ముప్పై ఐదేళ్ళ స్త్రీ బయటకొచ్చింది - నిద్రమత్తు కళ్ళతో.
  చెన్నారెడ్డిని చూడాగానే  కళ్ళు విప్ఫారితాలయ్యాయి.
  ఆప్యాయంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్ళింది అతన్ని.
 " సార్ లేడా  ? "  అడిగాడు ఆమె వెంట బెడ్‌రూంలోకి వెళుతూ.
 " లేడనే గదా వొచ్చిందీ !  "
  " అంతదూరం ఆలోచించలేదు..."
  " మరి ...?  "
 " నాలో ఏమీ లేకనే... ఖాళీని భరించలేకనే వచ్చినా  "
" నిండుతూనే వెళ్ళిపోతావు కదూ !  స్వార్థపరునివి.. "
  ’ నిజమేనేమో  ! "
  కిల కిల నవ్వింది ఆమె.
 "  సార్  లేడు గదా ! "
  " క్యాంపు కెళ్ళాడు  "
  " రెండ్రోజులు రావొద్దని చెప్పు  "
  అదోలా చూసింది ఆమె.
  అన్ని  ఆవేశాల్నీ, ఆందోళనల్నీ, సమస్యల్నీ మరచిపోయి ఆమె కౌగిళ్ళతో అద్భుతమైన ప్రశాంతతను అనుభవించాడు చెన్నారెడ్డి.
  ’ ఇలాంటి జీవితాన్ని కొనసాగించి వుంటే ఎంత బావుండేది...! ’   మనస్సు లోలోపలి పొరల్లో ఎక్కడో మూలిగింది.

                                                                                                             .......... సశేషం


1 comments:

Yemayya Ritaru!

Taruvaati Bhagam eppudu? maree inta letaa?

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs