.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

     రాత్రి పదిగంటలు దాటి వుంటుంది
  అప్పుడప్పుడూ చందమామను తమ కొంగుచాటున దాచుకొని కొంత సేపు దాగుడు మూతలు ఆడుకొని వదిలేస్తున్నాయి మేఘాలు.
  శివపురి వీధుల్లోని రచ్చబండల మీద ఇంకా నిద్రరాని ఒకరిద్దరు వ్యక్తులు బీడిముక్కలు పీల్చుతూ సన్నగా కబుర్లాడుకొంటున్నారు.
 పెద్దిరెడ్డిగారి పాతకాలంనాటి సువిశాలమైన మట్టి మిద్దెమీద చాపలు పరుచుకొని అప్పుడే నడుం వాల్చేందుకు సిద్దమవుతున్నారు జనం.
 మిద్దెమీద నైఋతి మూలన బండెడు రాళ్ళు కుప్పబోసి వున్నాయి., ఏరుకొని తెచ్చినట్లుగా అన్నీ కనికెడు లావున ఒకే సైజులో వున్నాయి.
  సాంప్రదాయక ఆయుధాలు కొన్ని అక్కడక్కడా పక్కల్లో భద్రపరచబడి వున్నాయి.
  రమణారెడ్డి ఇంకా కిందకు దిగిపోలేదు.
  అతని పక్కన కూచుని ఏదో చర్చిస్తున్నారు మజ్జిగ గోపాల్, నేలటూరి జయరాం, పాయలకుంట్ల మధు, అట్లూరు చంద్ర వగైరాలు. తమ పనుల్లోని ప్రోగ్రెస్‌ను సమీక్షిస్తున్నారు. పడుకొన్న వాళ్ళు కూడా తమ చెవుల్లో ఒకదాని అటుకేసి మళ్ళించారు.
  ఉన్నట్టుండి గూళ్ళుగా గూళ్ళుగా వచ్చిన సిగరెట్ పొగ రమణారెడ్డి బృందాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది.
  " ఒరే  ఒరే.. లేచి దూరంగా పోయి తాగరా ! "  చంద్ర అన్నాడు పొగవస్తోన్న జయరాం కేసి చూస్తూ..
  " ఆ ..మీరంతా పెద్ద ససవర్లయినట్టూ (బుద్దిమంతులైనట్టూ)..... "  జయరాం సమాధానం
 " మేమయితే మాకోసమే తాగుతాము అందరికోసం కాదు "  మధు చెప్పాడు జయరాం కేసి తిరిగి.
  " పరోపకారం తెలవన్నాకొడుకులు మీరు..."
 " పూర్వజన్మలో వాడు రైలింజనైవుంటాడు.. ఎప్పుడూ నోట్లోంచి పొగరావాల్సిందే..."
  " ఉత్త పొగే అయితే ఏదొక రకంగా ఏగొచ్చు..మందు తాగినప్పుడు సూడాల...సేతల్తో బువ్వదినేదే., పళ్లెంలో బోర్లబడిగదూ తినేది.."  గోపాల్ మాటతో నవ్వారు.
  " అంతగా సిగరెట్లు తాగి అందర్నీ యిబ్బంది పెట్టకుంటే అవి తగ్గించేందుకు ఏదన్నా ఉపాయం కనిపెట్టకూడదా ? "  రమణారెడ్డి అన్నాడు.
  " అదేదో నువ్వేచెప్పు బాసూ .."  జయరాం స్పందనా
  " నువ్వు మందు తాగేది ఎప్పుడోకసారి గదబ్బీ !.. మందు తాగినప్పుడే సిగరెట్టు తాగాలని ఒట్టుపెట్టుకో.. "  చెప్పాడు.
  వెంటనే అందుకొన్నాడు చల్లగరుగుల శ్రీను  " అన్నా... నువ్వు జెప్పే ఉపాయం చాలా డేంజర్కొస్చాది.. "  అన్నాడు.
  ఏమన్నట్లుగా చూశాడు రమణారెడ్డి.
  " వానికి సిగరెట్టు తాగాలనిపించినపుడంతా మందు తాగుతాడు.."  శ్రీను మాటలకు  పక పక నవ్వారు అందరూ.
  మళ్ళీ మామూలు విషయాల్లోకి వచ్చారు.
  " మనం పొరబాటేమైనా సేస్తుండామేమో  బ్రదరూ ! "  మజ్జిగ గోపాల్ అన్నాడు సాలోచనగా చూస్తూ.
  అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాడు రమణారెడ్డి.
  " మనపని మనం సైగ్గా ( చాటుగా, బయటకు తెలీకుండా)  సేసుకోకుండా ఆయప్ప జాగర్తబడేటట్టు సేస్తాండమేమో ! మనం రెండు జీపుల్నిండా మందినేసుకొని తిరుగుతాంటే ఆయన ఎనిమిది జీపులు కొనె. వందమందికి పైగా జనాన్నేసుకొని తిరగబట్టె. మనల్ని ఎంటికె మాత్రం కూడా లెఖ్కజేసినట్టులేదు..  "  చెప్పాడు.
  " నీ మొగంలేరా ! మనల్ను లెఖ్కజెయ్యనోడయితే ఎనిమిది జీపులు ఎందుక్కొన్నెట్టు..?  అంతమంది జనాన్ని ఎందుకు వెంటేసుకొన్నెట్టు ?.. మనకు భయపడి కాకుంటే..."  బాలుడు అన్నాడు.
  " అది భయమెందుకయితాది ?  జాగ్రత్త... ఆయప్ప మెలుకువలో ఆయప్ప వుండాడు. ఇరుకునబడి దొరుకుతే మనమల్ని అదమాలనే వుండాడు. యీ అగచాట్లన్నీ నేను పడినాగద బ్రదరూ ! అందుకే నా యిబ్బందులే మనందరికీ రాకుండా రోంత హుషారుగా వుండాల "
  " ఒరే తమ్ముడూ.. "  బాలుడన్నాడు గంభీరంగా  " పానాలకు వొగదెగిన వాల్లం మనం, ఆదాయంకోసం తిరిగే వాల్లు ఆయప్పకాడుండే మాసులు, మనం ఒక్కరమైనా సరే వాల్లు పదిమందైనా సరే.. భయమెందుకూ ? "
  తర్వాత సంభాషణ పెద్ద సాగదీయబడలేదు.
 మెల్లిగా ఎవరి స్థలాలకు వాళ్ళు చేరుకొన్నారు.
  ఉదయం లేచి మిద్దెదిగి బైటకు వెళ్ళొచ్చేసరికి ఓ మోటర్ బైకు వచ్చి యింటిముందు ఆగింది.
  ఎవరో కొత్తమనిషి.
  అందరి కళ్ళు ప్రశ్నార్థకంగా అతనికేసి చూస్తోంటే  " అన్నా " అంటూ రమణారెడ్డి కేసి రాబోయాడు.
  దారిలోనే అడ్డుకొన్నాడు గోపాల్ " ఎవర్నువ్వు " అంటూ
 " సోమనాధరెడ్డి కాడ పన్జేసే మాసినన్నా ! మారెడ్డి చీటి రాసిచ్చినాడు. అన్నకిమ్మన్నేడు... "  జేబులోంచి కాగితం తీసి యిచ్చాడు.
 దాన్ని అందుకొని రమణారెడ్డికి యిచ్చాడు మజ్జిగ గోపాల్
  చీటి చదవగానే రమణారెడ్డి మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి.
  " నువ్వు పామ్మా ! మేమొస్తాండామని చెప్పు "  అన్నాడు కొత్తవ్యక్తికేసి చూస్తూ.
  తర్వాత వెనిదిరిగి ఇంట్లోకి నడిచాడు.
  తన వెనక వచ్చిన వాళ్ళతో చెప్పాడు  " రాత్రి పొద్దుబోయినాంక సోమనాధరెడ్డి యింటి మీద దాడి జరిగిందంట.."  అని.
  ఎవరు చేశారని అడగలేదు వాళ్ళు.
  " నష్టమా ? ... దెబ్బలేమన్నా..."
  " వివరాలు తెలీదు "  చీటి వాళ్ళ చేతికిస్తూ  " బెరీన రడీ కాండి..."  చెప్పాడు అందరికేసి చూస్తూ.
  పదినిమిషాల్లో అందరూ సిద్దమయ్యారు.
  వాళ్ళు వెల్లేసరికి సోమనాధరెడ్డి ఇంటినిండా విషాదం అలుముకొని వుంది.
  జీపుల శబ్దం విని కిటికీల్ గుండా చూసి మరీ తలుపులు తీశారు.
  చాలా హర్టయినట్టున్నాడు సోమనాధరెడ్డి.
  రాత్రి చెన్నారెడ్డి సృష్టించిన బీభత్సం ఇంటి ఆడాళ్ళ మొహాల్లో ఇంకా దోబూచులాడుతోంది.
  మందినేసుకొని ఇంటిమీదకొచ్చాడట..
 గేటుముందు నిల్చుని బండబూతులు తిట్టాడట.
  వీధిలో ఒకటిరెండు బాంబుల్ని కూడా వేశాడట.
  గేటుతీసుకొని లోపలికొచ్చిన అతని మనుషులు తలుపులు బాదారట.
 బయటకు రమ్మని సవాల్ చేశాడట చెన్నారెడ్డి.
  పోలీసులకు ఫోన్ చేస్తే ఎస్సైగానీ.. సి.ఐ గాని వూర్లో లేరని తెలిసింది. అరాచకశక్తులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించేట్టున్నాయి. ఏం చేసేందుకు దిక్కుతోచని పరిస్థితి. తలుపులు బిగించుకొని ఇంటిల్లిపాది ఒక చోట కూచుని భరించరాని ఉద్విగ్నత అనుభవించారట. తన దయనీయ స్థితి పట్ల తనకే జాలేసిందని వాపోయాడు సోమనాధరెడ్డి.
  గంటకు పైగా వాళ్ళు వీధిలో వీరంగం తొక్కారట.
 నిద్రలేమి వల్ల ఎర్రబారిన కళ్ళతో అంతలేని విషాదం నిండిన వదనంతో దయనీయమైన గొంతుకతో చెప్పుకుపోతున్నాడు అతను. మద్య మద్యలో గొంతు సవరించుకొంటున్నాడు.
  తాము చందాలిచ్చి గూండాల్ని తయారు చేసి చెన్నారెడ్డి పైకి పంపుతున్నారట. అతని ఆధిపత్యాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారట.
  తను మూడో కన్ను తెరిస్తే ఎవరూ ఆపలేరనీ, యిది కేవలం శాంపిల్ మాత్రమేననీ దమ్మున్నవాళ్ళెవరైనా వుంటే అడ్డుకొనేందుకు రమ్మని సవాల్ జేసి మరీ వెళ్ళాడట చెన్నారెడ్డి.
  తమను ఎదిరించిన వాళ్ళందరికీ అదెగతి పడుతుందని కూడా హెచ్చరించాడట.
  జరిగిన సంఘటన వెనక ఉద్దేశ్యమేమిటో అర్థమైంది రమణారెడ్డికి.
 తమకు చందాలిచ్చి ప్రోత్సహిస్తున్నాడని సోమనాధరెడ్డి మీద దాడిజేశారు.
  ఈ చర్య తమకు హెచ్చరికలాంటిదే. సందేహం లేదు. తమ మద్దతుదారుల మరికొందరి మీద త్వరలో దాడులు జరగవచ్చు. తమ వాళ్ళను తాము రక్షించుకొనే పెనుభారం వొకటి ఎదుటబడింది.
  కొంతసేపు ఆలోచించేసరికి కొత్త విషయమేదో స్పురించినట్లయి ఉలిక్కిపడ్డాడు రమణారెడ్డి.
  తమను ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టాడు చెన్నారెడ్డి.
 ఈ స్థితి అతనికి కల్పించాలని తాము ఇన్నిరోజులూ ప్రయత్నించారు.
  కానీ అతను దాన్ని సులభంగా సాధించి గలిగాడు.
 రెడ్డి ఇంట్లో కూచుని జరిగిన సంఘటన గురించి చాలా సేపు చర్చించుకొన్నారు. కారణాల్ని విశ్లేషించారు.
  చెన్నారెడ్డి యీ విధమైన ఆలోచనకు రావటానికి కారణం బహుశా తామింకా అతన్ని టార్గెట్ చేసుకోవటంలో సపలం కాలేదేమో ! లక్ష్యమైతే వుందిగాని దాన్ని సాధించుకొనేందుకు క్రమశిక్షణతో కూడిన వ్యూహాన్ని పన్ని అమలు పరచటం లేదేమో ! నేరుగా అతన్ని టార్గెట్ చేసుకొన్న చర్య ఒక్కదాన్ని కూడా తాము ప్రారంభించలేదుగదా !
  చెన్నారెడ్డికిలా తమకు చాలినన్ని పాతదారులు లేవు. అన్నీ కొత్తగా తాము సృష్టించుకొనేవే.
  ఇప్పుడేం చేయటానికి పాలుపోలేదు.
  కుర్రాళ్ళంతా ఆవేశపడుతున్నారు. వాళ్ళ ఆలోచన ప్రకారం నేరుగా అతని మీద దూకేందుకు లేదు. ఖచ్చితంగా గురితప్పుతుంది. అతను గట్టి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసికొన్నాడు. ఎప్పుడయినా అతన్ని చాటుమాటుగా దెబ్బదీయాల్సిందే. తగిలిన దెబ్బ తిరిగి కోలుకొనే విధంగా వుండకూడదు. చాలా బలమైనదిగా వుండాలి.
  అతనిలాగే తాము కూడా అతని మద్దతుదారుల మీద దాడిజేస్తే..?
 తిరిగి తమ సానుభూతి పరుల మీద దాడులు మొదలవుతాయి.
 దానికి అంతం వుండదు.
 అట్లా చేయటం వలన తమగురి బహుముఖాలవుతుంది.
  "  మీరట్లా కరచి చాలించుకుంటే ఆయప్ప చెలరేగుతాడు. వాని అరాచకత్వాన్ని అడ్డుకొనే ఓపికా మాకు లేదు. మమ్మల్నందర్నీ ఒక్కొక్కర్నే యేరి నలుపుతాడు. ఏదోకటి గట్టి నిర్ణయం తీసుకోండి రమణారెడ్డి ! "  సోమనాధరెడ్డి చెప్పాడు.
  ఆయన చెప్పింది కూడా నిజమే.
  ఈరోజు సోమనాధరెడ్డి.. రేపు రామసుబ్బారెడ్డి, ఎల్లుండి జీపియ్యార్ వరసబెట్టొచ్చు అతను.
  తాము త్వరపడాలి.
  వ్యూహాన్ని మార్చుకోవాలి.
  కార్యాచరణ వేగవంతం చేయాలి.
 వీధిరౌడీల్ని కొట్టటం, అధికారుల్ని బెదిరించటం లాంటివి చేయటం వల్లే చెన్నారెడ్డి జాగ్రత్త పడినట్లుంది. బలమైన అడుగు వేసేందుకు నిర్ణయించుకొన్నట్లుంది.
  " మజ్జిగ !  రాత్రి నువ్వు చెప్పింది నిజమేరా ! "  అన్నాడు మజ్జిగగోపాల్‌తో.

                              *************

  రాత్రి చాలా సేపు చర్చించుకొంటూ వుండిపోయరు.
  తమను చెన్నారెడ్డి వుత్త ఆవేశపరులుగా చూస్తోన్నట్లుంది.
 అందుకే వీధి యుద్దాలకు పిలుస్తున్నాడు.
  చాటుమాటుగా  చంపి వచ్చేందుకు అతని వద్ద కిరాయి మనుషులున్నారు.
  మందిబలంతో  ముందుకొచ్చేందుకు గుంపులు కూడా వున్నాయి.
  తమ వద్ద ఆరెండు బలాలు తక్కువేగాని, వ్యూహాత్మకంగా ముందుకు దూసుకెళ్ళేందుకు ప్రాణాలైనా యిచ్చేవ్యక్తులున్నారు.
 తమ ప్రధాన బలం యిదే.
 దీన్నే బహుముఖాలుగా విస్తరింపజేయాలి.
  తమ సానుభూతి పరుల సేవల్ని కూడా వినియోగించుకోవాలి.
 ఆలోచిస్తూ నిద్రలోకి జారాడు.
 రాత్రి నెమ్మైదిగా కరిగిపోతూ వుంది.
  దూరంగా తార్రోడ్డుమీద అడపాదడపా వాహనాలు పరుగెడుతొన్న శబ్ధం విన్పిస్తోంది.
  ఉన్నట్టుండి మట్టిబాట వచ్చి వీధిలో కలిసేచోట ఆరమోడ్పు కళ్ళతో పడుకొనివున్న కుక్కలు ఒక్కసారిగా మొరగటం ప్రారంభించాయి.
  ఎవరో వాటిని అదిలించబోతున్నారు.
 అప్పటికే చుట్టుపక్కల వాళ్ళకు మెలకువ వచ్చింది.  " ఎవరు ? ఎవరదీ..! మిమ్మల్నే...  "  గద్దించనట్లుగా ప్రశ్నలు.
 కుక్కల మొరుగుళ్ళలో కలిసిపోయిన ఎదుటివాళ్ళ సమాధానాలు.
  " ఓ నాయనా !  రమణారెడ్డి .. ఎవురో కొత్తోల్లోచ్చిన్నారు.. "  ముసలాయన కేక.
 మిద్దె మీద కదిలికలు.
  నిద్రమత్తు ఎటో ఎగిరిపోయిన దృశ్యాలు.
  ఆయుధాల్ని అందుకొని దబ దబ కిందకు దిగదూకారు.
  తుపాకులు బాంబులతో అటుకేసి దూసుకెళ్ళారు.
  వాళ్ళను చూస్తూనే నిశ్చేష్టులై నిల్చుండి పోయారు కొత్తవ్యక్తులు.
  " అయ్యా ! మేం మీకు పగోల్లం కాదు తండ్రీ ! "  రెండు చేతులెత్తి దండం పెడుతూ గట్టిగా అరచి చెప్పాడు అక్కడ నిల్చున్న ఇద్దరిలోని  ముసలి వ్యక్తి..
  " మరెందుకొచ్చినారు  యీ జామున....?  "
 " ఓబుల్రెడ్డి కొడుకును కలసి పోదామనీ  !  "
 నలుగురు మనుషులు వెళ్ళి వాళ్ళవద్ద ఆయుధాలు లేవని నిర్దారణ చేసికొన్న తర్వాత రెడ్డిగారి యిళ్ళవద్దకు తీసుకెళ్ళారు.
  " రవంతన్న బుద్దుండాల ఏ జామున్నంటే ఆ జామునొస్తే ఎట్లనుకొన్యావ్ ? కాలమెట్లాండాది తెల్దా ముసిలోడా ?  మామూలు కొంపలైతే సరే - ఖూనీల్జేసుకొనే కొంపగదా... బుద్దిలేనోడ .."  తిడుతున్నారు ఇరుగుపొరుగులు.
  ముసలాయన మౌనంగా వున్నాడు.
  అతని వెనుక ఇరువైయేళ్ళ లోపు యువకుడు కూడా పెదవి విప్పలేదు.
  " అన్నా ! నీకోసమొచ్చినాడంట..."  బాలుడు చెప్పాడు రమణారెడ్డితో.
 " నాయనా !  నువ్వేనా రవణారెడ్డివి ..? "  అంటూ రమణారెడ్డి దగ్గరగా వచ్చి ఎగాదిగా చూశాడు ముసలాయన  " పగులొస్తే పానాలుండవని మొబ్బునబడి ( చీకటిపడి ) వొచ్చినాం నాయనా !  నిన్న దోవబట్టినం పల్లెలంబడి అడ్డం నడ్చుకుంటావస్చాండం...."  చెప్పాడు.
  " బువ్వ తిన్నెరా ? "  అడిగాడు రమణారెడ్డి.
" బువ్వదేముందిలే నాయనా ! ఒక్క పూట లేకుంటే పానాలు పోతాయా..? నిన్ను కలుస్తామో లేదోనని బయపడ్తావున్యాము..  "
  " సరే తర్వాత మాట్లాడుకోవచ్చుగాని బువ్వతినుపోండి.. సద్ది బువ్వే..."  చెబుతూ తన వాళ్ళను పురమాయించాడు.
 అప్పటికే మూడు జాములు గడిచిపోయింది.
 నాలుగు గంటలు కావస్తోంది.
 తర్వాత నిద్రరావటం కూడా గగనమే.
 కొత్తవాళ్ళిద్దరూ భోంచేసింతర్వాత అందరూ మిద్దె పైకెక్కారు.
  " ఇంక చెప్పు - ఏవూరు మీది ? "  అడిగాడు మజ్జిగ గోపాల్.
  " మాది బద్వేలుకాపక్క పాయకట్టులో వుండే అరికెపాడు. "  చెప్పాడు ముసలాయిన.
 తమలాగే వాళ్ళుకూడ చెన్నారెడ్డి భాధితులేనట.
  గత ఎమ్మెల్లే ఎలక్షన్లలో ఏజంట్‌గా కూచున్న నేరానికి ఆ కుర్రాడి తండ్రిని అంటే ముసలాయన కొడుకును అడ్డంగా నరికించాడుట చెన్నారెడ్డి. ఏమి చేయలేని పరిస్థితిల్లో ఆ యువకుడు చదువు కూడా చాలించి అబ్బతో ( తండ్రి తండ్రిని ’అబ్బ’ అంటారు) కలిసి వ్యవసాయ పనులు చేసికొంటూ వుండేవాడట. లోపల మాత్రం తండ్రి చావుకు కారకుడయిన చెన్నారెడ్డి మీద రగులుతూనే వుండిందట.
  మొన్న మండల ఎలక్షన్లలో ఆ వూరినుంచి మరో నాయుకుడు తయారై చెన్నారెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం నడపటంతో ఎన్నికల తర్వాత అతన్ని బద్వేలు నాలుగురోడ్ల కూడిలిలో దారుణంగా నరికించాడుట.  ఆ సమయంలో యీ కుర్రాడు అక్కడే వుండటం, సాక్షిగా స్టేషన్లో వాగ్మూలమివ్వటం, రేపు కోర్టుకు కూడ వెళ్ళి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వాలని నిర్ణయించుకోవటంతో వేట మొదలయిందట.
  " యీని నాయన్ను సంపిన కసి కడుపులో వుందెయ్యా ! అదనుకోసం కనిపెట్టుకోనుండె...యీనికి తగిన దోవదొరికె.. యీడెట్టా కోర్టులో సాక్ష్యం సెప్పక మానడని ఎంటవడ్తాండరు నాయనా !  మా మండలమంతా వానికి ఎదురుజెప్పేటోల్ల లేరు..  దాపెట్టుకొందామనుకొన్నే.. వాకిలి తెర్సేటోడు లేడు.  నా మనమన్ని ఎట్టయినా వాడు బతకనియ్యడు తండ్రి !  వాని సేతులో అన్యాయంగా సచ్చేకంటే యీన్ని మీ సేతల్లో బెట్టి పోదామని వొచ్చినా. వాన్ని సంపడానికి మీరు తిరుగుతావుండారంట...  యీన్నిగూడా మీతో తిప్పుకోండి. యీని నాయన్ను సంపిన కసిదీర్చుకోనియ్యండి...  వాడు ఎంటబడి పానాల్దీసేకన్నా, వాన్ని ఎంటబడి  సంపాలనుకునే తీరులో పానాలు పోగొట్టుకొన్నే తృప్తిగా వుంటది నాయనా !  నా మనమన్ని తీసుకోండి.  ఎమ్మెల్లేగాడు సచ్చేమాత్రమయితే యీన్ని బలిచ్చినా నాకు సమ్మతమే తండ్రీ ! ... "  ఉద్వేగంగా చెప్పాడు.
  ఎమ్మెల్లేను చంపే యఙ్ఞంలో తన మనవన్ని సమిధగా వాడుకొమ్మని అప్పగిస్తున్నాడు.
  హృదయం చలించింది వింటోన్న వాళ్ళకు.
  ఇలాంటి అఙ్ఞాత బాధితులు...  తాలుకాలో మరెంతమంది వున్నారో..!
  కుర్రాడి దగ్గరగా వచ్చి వీపు తట్టాడు మజ్జిగ గోపాల్. " నీ పేరేంది ..? "  అడిగాడు.
  "  రాఘవ .."  చెప్పాడు.
  "  తమ్ముడూ రాఘవా !  అరికె కూటికి చిక్కటి మజ్జిగకు భలే లంకె. మీవూరు అరికె.. నాయింటి పేరు మజ్జిగ.. ఇప్పట్నించి మనిద్దరం మజ్జిగన్నంలాగా కలిసి వుందాం.. సరేనా !  "  అన్నాడు నవ్వుతూ.
 గంభీర వాతావరణం నుంచి అందరూ కొంత తేలిక పడ్డట్టయింది గోపాల్ మాటలతో.
  అందరికీ తమ్ముడిలా కలిసిపోయాడు రాఘవ. వాళ్ళ కార్యకలాపాల్లో తనూ పాలుపంచుకొంటూ అక్కడే వుండిపోయాడు. బాలుని వెంట చొరవగా గనివద్ద కెళ్ళి అక్కడ బాంబులు తయారు చేయటంలో విసరటంలో ఆసక్తి చూపించసాగాడు.
  తన కార్యకలాపాల్ని వేగవంతం చేశడు రమణారెడ్డి.
  నమ్మకస్తులైన సానుభూతి పరుల్ని గుర్తించి వాళ్ళను రహస్యంగా కలిశాడు. పోరుమామిళ్ళ, బద్వేలు టౌనుల్లోని సానుభూతి పరుల్ని ప్రధాన గూడచారులుగా తయారు చేశాడు.  దారివెంట పల్లెల్లో కూడా వేగుల్ని నియమించుకొన్నాడు.
  చెన్నారెడ్డి కదలికలు ఎప్పటికప్పుడు తమకు తెలుస్తూ వుండాలి. అతను పాల్గొనే మీటింగ్‌లూ, అటెండ్ అయ్యే పెళ్ళిళ్ళూ.. ఒకటేమిటి అతను వేసే ప్రతి అడుగూ తమకు తెలిసిపోతుండాలి.
  తమ పలుకుబడినంతా ఉపయోగించి యుద్ద ప్రాదిపదికన గ్రామంలోకి ఫోను సౌకర్యం కల్పించుకోవటంతో పని మరింత వేగవంతమైంది.
  పెద్దిరెడ్డి గనులపని చూసుకొంటున్నాడు.
  కొడుకులకు ఆయన అడ్డు చెప్పటం లేదు.
  కొంత వేదాంత ధోరణి అలవడినా... ఇద్దరు తమ్ముళ్ళను పోగొట్టుకొన్న పేగుబంధపు దుఃఖ ఛాయ వొకటి ఆయనను అంగీకరించేలా చేస్తోంది.
  ఆయనకు మరో భయం కూడా వుంది - తను చెప్పినా వినుకోరేమోనని.
  చెన్నారెడ్డి వల్ల తాలుకాలో ఎన్ని కుటుంబాలు నిద్రలేకుండా జీవిస్తున్నాయనీ ! ఎంతమంది కసితో రగిలిపోతున్నారనీ..!
  "  జరగనీ ! - ఏం జరుగుతుందో అది జరగనీ ! "  అనుకొన్నాడు.
  రమణారెడ్డిలో ఇప్పుడు కొంత ఉడుకు తగ్గింది.  ఆలోచన పెరిగింది. తమ్ముళ్ళతో కలిసి ఎమ్మెల్లే వేటకోసం అహరహం ప్రయత్నించసాగాడు.
  చెన్నారెడ్డిని దెబ్బతీయటం కాదు -  ఒకేసారి చంపాలి.
  బాంబులు  సిద్దం చేసుకొన్నారు.
  పోరుమామిళ్ళ, బద్వేలు ఏరియాల్లో అనువైన చోటల్లా బాంబుల బక్కెట్లు దాచారు.  ప్రధాన రహదారిలో వున్న పల్లెల్లో సైతం రోడ్డు పక్కనే గుర్తుగా పూడ్చపెట్టారు.
  బాంబుల కోసం ఎంతో దూరం పరిగెత్తాల్సిన పని వుండకూడదు. ఎక్కడ చేయిపెట్టి కెలికితే అక్కడ దొరకాలి.
  శివపురి వర్గం కదలికల్లో కొంత వేగం తగ్గటాన్ని మరో విధంగానో, ఇంకో తీరుగానో అర్థం చేసుకోలేదు చెన్నారెడ్డి.  ఏదో ఎత్తుగడకు సిద్దమవుతోన్నట్లుగానే అనుమానిస్తున్నాడు.  తన అనుచరులు మాత్రం నవ్వుకొంటున్నారు - శివపురి వాళ్ళకు బేదులు పెట్టాయని.
  తన ముఖ్య అనుచరులు ఒకరిద్దరికి మాత్రం మనసులోని అనుమానాన్ని బైట బెట్టాడు  చెన్నారెడ్డి.

                                                                                                              ......... సశేషం

2 comments:

Kamal Gaaru,
Excellent Narration. I'm from Proddatur District and I believe SivaPuram in the story is Devagudi Right?
Waiting for your next Part.Please make it as a Daily posting.

Thanks in advance

అయ్యా అపరిచితులు...! ఇలాంటి కథలు ఆ ప్రాంతంలో ప్రతి చోట కాస్త అటు..ఇటుగా జరుగుతూనే ఉంటాయి, ప్రత్యేకంగా ఒక ప్రాంతం అని చెప్పలేము, ఎందుకు అనవసరంగా ఒక ప్రాంతానికి చెందినది అని చెప్పడం..అనవసర రాద్దాంతము. కేవలం ఒక కథలాగ చదవండి..మొత్తం నవల ఇక్కడ ప్రచురిస్తాను. మరిచా ప్రొద్దుటూర్ డిస్ట్రిక్ట్ కాదు తాలుకా మాత్రమే..!

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs