.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    ఒకనాటి ఉదయం తమ్ముళ్ళతో కలిసి గనివద్దకు వెళుతోంటే కీచుమంటూ వాళ్ళపక్కగా వచ్చి ఆగింది ఓ జీపు.
 ఉలికిపాటునించి తేరుకోబోయేలోపలే జీపులోంచి మనిషి శరీరం ఒకటి వుండలా రోడ్డుమీద దొర్లింది.
అది బతికిందో, ప్రాణం పోయిందో గమనించే లోపలే జీపు స్పీడందుకొంది.  బాలుడు దాన్ని అందుకోవాలని ప్రయత్నించాడు గాని సాధ్యం కాలేదు.
 జీపు నెంబర్ గుర్తుపెట్టుకొని పెన్నుతో అరచేతి మీద రాసుకొన్నాడు రమణారెడ్డి
 నేలమీదున్న శరీరాన్ని పరిశీలించి చూశారు.
  ఊపిరాడుతూ వుంది.
  రేగిన వెంట్రుకలు, పెరిగిన గడ్డం, మాసిన బట్టలతో ఎవరో పాతికేళ్ళ యువకుడు, అతని వొళ్ళంతా కుడుములు కుడుములుగా వాచివుంది. వీపంతా ఎర్రగా వాతలు తేలివున్నాయి. స్పృహ తప్పి పడిపోయేంతగా కొట్టి పడేసి పోయారు.
 అటుగా వెల్తోన్న ఆటోను ఆపి పోరుమామిళ్ళకు తీసుకెళ్ళి హాస్పెటల్‌లో జాయిన్ చేశారు.
 గంటకల్లా స్పృహలోకొచ్చాడు ఆ యువకుడు.
 లేచికూచోని వాళ్ళకేసి ఆశ్చర్యంగా చూశాడు.
 "  ఎట్లా వుంది ఒంట్లో ?  బావుందా ? "  రమణారెడ్డి అడిగాడు.
 సమాధానమివ్వకుండా అతను బెడ్ మీంచి దిగబోతుండగా  " వొద్దొద్దు కూచో "  చేయిపట్టుకొని ఆపబోతే అతను నవ్వాడు.  " నాకేం కాదులే అన్నా ! ఏమయితాదేం యీ దెబ్బల్తో........?  నాకిది మామూలేలే "  అంటూ మంచం దిగాడు.
 " తినడానికేమన్నా వుందేన్నా ? "   అడిగాడు.   " ఆనాకొడుకులు నిన్నట్నుంచి వొల్లంతా దెబ్బల్దినిపిస్తా వుండారేగాని కడుపుకింత తిండి తినిపిస్తామని అనుకోరే..!  "
 ఒక్క నిమిషంలో బైటకు పరుగెత్తాడు జయసింహ.
 ఆపిల్ పళ్ళతో తిరిగొచ్చాడు.
 వాటిని కోయబోతుంటే చొరవగా లాక్కొని నోట కొరికి తినసాగాడు.
 అంతలో డాక్టర్ వచ్చాడు.
  బెడ్ మీద పేషంట్ లేకపోయేసరికి ఉలికిపాటుగా చూశాడు.
 అతని ఆదుర్దా గమనించి వేలెత్తి చూపాడు బాలుడు.
 పేషెంట్ కేసి ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్.
 " ఏంటిది ? ఏంటి... ఏమయ్యా ! పేషంట్ కంటే బుద్ది లేదు. మీకేమయ్య ? ఏ కండీషన్లో అతన్నిక్కడకు తెచ్చారో గర్తు లేదా..?  పడుకోబెట్టండి.... రెండ్రోజుల పాటు బెడ్‌రెస్ట్ ఇస్తేగాని కోలుకోలేడు... ఇప్పుడు అర్జంటుగా సెలైన్ ఎక్కించాలి... "  మొహం చిట్లించి చూస్తూ అన్నాడు.
 డాక్టర్ కేసి అదోలా చూశాడు ఆ యువకుడు  " సార్ ! ఒక్కమాట..."  అన్నాడు. డాక్టర్ అతనికేసి చూడగానే  " వీల్లెవురో నాకు తెల్దు సార్ ! నేనెవురో వాల్లకూ తెల్దు. దెబ్బలుతిని పడుంటే ఎత్తకొచ్చినారు. సెలైన్‌లు ఎక్కిస్తూ రెండ్రోజులు బెడ్ రెస్ట్ యిచ్చినావంటే  నీఫీజ్ ఎట్లా రాబట్టుకొంటావో ఆలోచించుకో. ముందుగా - ఇప్పటికైనా ఫీజు సంగతి చూసుకో "  అన్నాడు.
 మరేమి మాట్లాడలేదు డాక్టర్.
ఐదు నిమిషాల్లో బిల్‌తో సహా వచ్చింది నర్స్.
 "  నాకాడ అర్థరూపాయి కూడా లేదన్నా !  ఆ నాకొడుకులు జోబుల్లో ఏమి లేకుండా సేసినారు "  చెప్పాడు.
రమణారెడ్డి బిల్ చెల్లించాడు.
 హాస్పెటల్ నుండి బయటపడ్డారు అందరూ.
 "  నొప్పులు లేవా ? "  బాలుడు అడిగాడు.
 " నేనేం  దేవున్నా బ్రదరూ.. నొప్పుల్లేకుండేందుకు ? "  నవ్వాడు.
" ఇంతకు నువ్వెవరు తమ్ముడూ ..? "  అడిగాడు రమణారెడ్డి.
 చిన్నాగా నవ్వాడు ఆ యువకుడు.
 "  నాపేరు గోపాల్‌రెడ్డి, ఇంటి పేరు మజ్జిగ.  మాపూర్వీకులెవరికో దండిగా పాడివున్నెట్లుంది. బానలు బానలు ( పెద్ద పెద్ద కడవలు) మజ్జిగ చిలికి పోసే వాళ్ళేమో ! ఇంటి పేరు అదే ఖాయమైంది. "
 అన్ని దెబ్బలు తినికూడా నవ్వగలుగుతున్నందుకు అతనికేసి మెచ్చుకోలుగా చూశాడు రమణారెడ్డి.
 "  నేనీ కథ చెబితే కొందరు వొప్పుకోరు బ్రదరూ !  మాకే మజ్జిగ లేక సెరవ ( పెద్ద సిల్వర్ గిన్నె)  తీసుకొని ఇండ్లిండ్లా అడుక్కొనేదాన్నే మాకీ పేరొచ్చిందంటారు...  ఏమైతేనేం... కమ్మని పేరుగదా !  "
 అతని మాటతీరుకు నవ్వొచ్చింది వాళ్ళకు.
 తనది బద్వేలు మండలమట. వూరిపేరు కూడా చెప్పాడు
 " మీదేవూరో తెలుసుకోవచ్చునా అన్నలూ ? "  అడిగాడు.
 వాళ్ళ చిరునామా తెలీగానే అతని కళ్ళ నిండా ఆశ్చర్యం తొణకిసలాడింది.
 " కాఫీ తాగాలన్నా ! పెదాలు పీకుతండాయి "  చెప్పాడు.
 దగ్గర్లోని హోటల్‌కు వెళ్ళారు అందరూ. ఓ మూలగా వున్న టేబుల్‌ను ఆక్రమించి కాఫీ ఆర్డరిచ్చారు.
 "  మీనాయన గురించే విన్నేనన్నా ! పాలెగాడన్నా  ఆయప్ప....!  మీలాంటివాల్ల కోసమే నేను తిరుగుతాండ ....  తంతే అప్పచ్చుల గంపలో పన్నెట్టు మీకాడనే వొచ్చి పడినా..., మీనాయనట్లా మా నాయనా పాలెగాడు కాదుగాని.. జాతీయపార్టీ అభిమాని.  చెన్నారెడ్డికి ఆపోజిట్‌గా పట్టుదలగా ఎలక్షన్ జరిపించినందుకు మామీద కసిబట్టి మామీద దాడి జేసినాడు, కడాకు ( చివరికి) మా నాయన్ను నట్ట నడిరోడ్డు మీద పడేసి నరికినారన్నా ! "  అతని గొంతు పూడుకుపోయింది.
 "  అప్పట్నించి చెన్నారెడ్డిని సంపాలని తిరుగుతా వుండా.. నాకాడ పౌర్సముంది (పౌరుషము) గాని ఏ బలమూ లేదు. దొరికిన కాడంతా యిదో యిట్లా వొల్లు వాయిగొట్టించుకొంటావుండా... "
  తన అవస్థలన్నీ చెప్పుకు పోతూనే వున్నాడతను
 తను రెండు సార్లు దాడి చేసేసరికి జాగ్రత్త పడ్డాడట చెన్నారెడ్డి.  ప్రైవేటు మనుషుల్ని ఎక్కువ సంఖ్యలో తన చుట్టూ కాపలా పెట్టుకొన్నాడట. అతని రక్షణ వలయాన్ని ఛేదించుకొని పోవటం మాట దేవుడెరుగు - తనుకనిపిస్తే  చాలు వెంటపడి పట్టుకొని చితకబాది విసరేసి పోతున్నారట.
 తనలాగ తండ్రుల్ని, అన్నలను, ఆత్మీయుల్ని, బంధువుల్ని, భర్తల్ని, కొడుకుల్ని పోగొట్టుకొన్న ఎందరో ఎదురు చూస్తున్నారట కసిదీర్చుకొనే అవకాశం కోసం.
 మజ్జిగ గోపాల్‌రెడ్డిని నేరుగా శివపురికి తీసుకెళ్ళారు.
 వారం రోజుల విశ్రాంతి తర్వాత బాగా కోలుకొన్నాడు అతను. ఈలోపు రమణారెడ్డి తలలో ఓ వ్యూహం రూపు దిద్దికోసాగింది.
 మళ్ళీరోజే ఓ జీపును బాడుగకు మాట్లాడుకొన్నారు.
 మజ్జిగ గోపాల్‌ను వెంటేసుకొని ఏడుమంది అన్నదమ్ములు తాలుకా నలుమూలలా తిరిగారు.
 చెన్నారెడ్డి వల్ల పూడ్చుకోలేని గాయాల పాలైన కుటుంబాల్ని కలిశారు. తమను పరిచయం చేసుకొన్నారు.
  అందరి గాయమూ ఒకటే..
  అందరి బాధా ఒకటే...
  అందరి శత్రువు ఒకడే..
 తమ ప్రాణం పోయినా సరే శత్రువును చంపాలనే అంకిత భావం కలిగిన యువకుల్ని గుర్తించారు.
 మజ్జిగ గోపాల్ వాళ్ళ వెంటే శివపురికి వచ్చాడు.
 మానవ శక్తి దండిగా వుంది.
 ఇక ఆర్థిక శక్తి కావాలి.
 బంధువులందర్నీ మరోసారి కలిసారు.
 తాము ఎమ్మెల్లే చెన్నారెడ్డితో  ’పార్టి ’ చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. తమ ధ్యేయాన్ని, దాన్ని సాధించాలనే అంకిత భావాన్నీ, చెన్నారెడ్డి చావే జీవితాశయంగా పెట్టుకొని తాలుకా అంతటా తిరిగి సేకరించిన యువశక్తినీ వివరించేసరికి వాళ్ళమీద బంధువుల్లో కొంత నమ్మకం కలిగింది.
 అప్పటిదాకా పార్టీ చేయొద్దనీ, పార్టీలకు దూరంగా వుండమని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు పార్టీ చెయ్యమని ప్రోత్సహించారు. యువకుల హుషారు చూసి మితవాదులనుకొన్న వాళ్ళు కూడా ఎగదోశారు.
   తాము ఏడుమందిమి పోయినా పర్లేదు - చెన్నారెడ్డిని చంపి తీరాలనే కమిట్‌మెంట్‌కు వచ్చారు శివపురి సోదరులు.
 చెన్నారెడ్డితో  పార్టీ జేయాలంటే కేవలం గుండెబలం మాత్రమే సరిపోదు, ఆయుధాలు కావాలీ, వాహనాలు కావాలి. అడుగడునా డబ్బే ప్రధానంగా వుండాలి.
  తమకు గుండెలయితే వున్నాయి డబ్బు ఎక్కణ్నించి తేగలరు..?
 బంధువుల వద్ద తమ ప్రధాన సమస్య గురించి చెప్పారు.
 వాళ్ళంతా సానుకూలంగా స్పందించారు.
  ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భారీగానే చందాలిచ్చారు.
  దాదాపు పండ్రెండు లక్షల దాక జమకూడింది డబ్బు.
 వెంటనే రెండు జీపుల్ని కొన్నారు.
 విషయమంతా జాతీయపార్టి అధిస్టానానికి తెలిసింది.
 తమ ఆశీసుల్ని ’ బలంగా ’ అందజేశారు.
 తర్వాతి కార్యక్రమం తుపాకి లైసెన్స్‌లకు అప్లై చేయటం
 ఏడుమంది అన్నదమ్ములు ధరఖాస్తు చేసుకొన్నారు.
  వాళ్ళ నాన్నగారు ఇద్దరూ మర్డర్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు కూడ హాని వుంటుందనే కారణంగా జిల్లా నాయుకులు ఎస్పీకి చెప్పి మనిషికి రెండింటి వంతున ఏడుమందికి పదునాలుగు తుపాకులు మంజూరు చేయించారు. జిల్లా వ్యక్తి హోంమంత్రిగా వుండటం వలన వాళ్ళకాపని సులభమైంది.
 చెన్నారెడ్డి వల్ల జీవితాలు నాశనమైన వాళ్ళు, అతన్ని చంపాలనే పట్టుదల వున్నవాళ్ళను పిలిపించుకొన్నాడు రమణారెడ్డి.
 శివపురి సోదరులు ఏడుమంది తమతో మరో ముప్పైమంది యువకుల్ని వెంటేసుకొని రెండు జీపుల్నిండా వేలాడుతూ ప్రతిరోజూ బద్వేలు, పోరుమామిళ్ళకు తిరగటం మొదలు పెట్టారు.
  తుపాకులు బైటకు కన్పించేలా పట్టుకొని రెండుజీపులూ వేగంగా వెళ్ళి సెంటర్లో ఆగితే జనమంతా బెదిరిపోయి వాళ్ళకేసి చూడవలసిన పరిస్థితి వస్తోంది.
 తామెవరో అందరికీ అర్థమైన తర్వాత చెన్నారెడ్డి ఆధిపత్యాన్ని సవాల్ చేయటం ప్రారంభించారు.
  వాళ్ళందరీ ధ్యేయం ఒక్కటే - చెన్నారెడ్డిని చంపటం.
 ముందుగా అతన్ని మానసికంగా దెబ్బతీయాలి.
 అతనికి భయం పుట్టించాలి.
  వాళ్ళకు మరో పనిలేదు - చావంటే భయం లేదు.
మొదట చెన్నారెడ్డి మనుషులు తిరిగే సెంటర్లమీద దృష్టి కేంద్రీకరించారు. అకస్మాత్‌గా రెండు జీపులూ ఆ సెంటర్లకు పోవటం, కన్పించిన చెన్నారెడ్డి మనుషుల్ని చితకబాదటం, వచ్చినంత వేగంగానే జీపులెక్కి వుడాయించటం.
  ఆఫీసుల మీద కూడా దాడి జేస్తున్నారు.
  తమవాళ్ళకు  పనుల్జేయని ఆఫీసర్లకు వార్నింగ్‌లిస్తున్నారు.
 తమవర్గం వాల్లను ఇబ్బంది పెడుతోన్న పల్లె నాయుకుల్ని టౌన్‌లో దొరకపుచ్చుకొని బెదిరిస్తున్నారు.
 టౌన్‌లోనే నివాసముంటోన్న మాజీ ఎమ్మెల్లే సోమనాధరెడ్డి, పారిశ్రామికవేత్త రామసుబ్బారెడ్డి, సూపర్‌క్లాస్ కాంట్రాక్టర్ జి.పి.ఆర్ వర్గాల ఇళ్ళకు తరుచు వెళ్ళి ధైర్యాన్ని కలిగిస్తున్నారు. చెన్నారెడ్డి దెబ్బకు బెదిరి చాలా యేళ్ళుగా ఇంటికే పరిమితమిన ఆ ప్రముఖులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించారు.
  తమకు చెన్నారెడ్డిని ఎదుర్కొనే దమ్ములున్నాయని వాళ్ళకు నమ్మకం కలిగించారు.
  శివపురి సోదరుల చర్యలన్నింటినీ ఒక కంట గమనిస్తూనే వున్నాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
 చాచి కొడితే గిరగిరా తిరిగి పడిపోయేలా లేదు వ్యవహారం.. ఎదురు తిరిగేట్టున్నారు.
 తనవాళ్ళమీద దాడి చేయటం కాదు - వీలైతే తనమీదనే దాడి చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కూడా రహస్య సమాచారం.
  చాలా దూకుడుగా వ్యహరిస్తున్నారు శివపురివాళ్ళు.
 తమ వ్యతిరేకులంతా వాళ్ళ వెనక గట్టిగా నిలబడినట్లుంది, వాళ్ళ దూకుడుకు మొదట్లోనే అడ్డుకట్ట వేయకుంటే పరిస్థితి చేయదాటి పోవచ్చు.
  పోలీసుల్ని సంప్రదించాడు.
 డిస్పీ స్థాయి అధికారులతో చర్చించాడు.
  పిల్లనాయాల్లకు తుపాకులిచ్చి అందర్నీ భయప్రాంతుల్ని చేయటం మంచిది కాదనీ, ముందా గన్స్ లైసెన్స్ వెనక్కి లాక్కొమని వొత్తిడి చేసాడు.
 పోలీసులు తమ ఆశక్తతను వ్యక్తపరిచారు.
 తమ తండ్రుల్ని ప్రత్యుర్థులు ధారుణంగా చంపారనీ, తమకు కూడా వాళ్ళచేతిలో ప్రాణహాని  ప్రమాదం వుంది కాబట్టి ఆత్మరక్షణార్థం తుపాకుల లైసెన్స్‌లకు ధరఖాస్తు చేసుకొన్నారట. అట్లాంటి పరిస్థితుల్లో తుపాకులు లైసెన్స్ మంజూరు  చేయటం ప్రభుత్వ పాలసీ కాబట్టి తమ చేతిలో ఏమిలేదని పోలీసులు చెప్పారు.
 శివపురివాళ్ళకు హోంమినిస్టర్ వద్ద ప్రత్యేకమైన గుర్తింపు వుంది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా తామేమీ చేయలేమనీ, అలాగే స్థానిక ఎమ్మెల్లేగా చెన్నారెడ్డికి కూడా నష్టం కలిగించబోమనీ హామీ యిచ్చారు.
 పోలీసుకులు కూడా తనకు ముఖం చాటేస్తోన్న విషయం చెన్నారెడ్డికి అర్థమవుతోంది. వాళ్ళను తను ఎంతగా డబ్బుతో కొన్నా తనకు హానీ చెయ్యకపోవచ్చుగానీ మేలు మాత్రం చేయరు. తమ పక్క తాలుకా ఎమ్మెల్లే హోంమంత్రిగా వున్నందువల్ల పోలీసులు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు.
 తను ఏదొకటి చేయాలి
 తన చేయి వంగిపోకుండా చూసుకోవాలి.
 అవసరమైతే మరిన్ని ప్రాణాలు తీసయినా టెర్రర్ సృష్టించాలి.
 వాళ్ళు ప్రాణాలకు తెగించినట్టుంది.
 తనమీద కసిదీర్చుకోవటానికే ప్రయత్నిస్తున్నారు. సందేహంలేదు. తలకు తల అన్నరీతిలో ఆలోచిస్తున్నారు.
 తమ ప్రాణాలకు భయపడుతూ పార్టీ జేసేవాళ్ళు కొన్ని పరిమితులకు లోబడి వుంటారు. అవతల వాళ్ళను చంపాలి తప్ప తాము పొరబాటున కూడా చావకూడదనుకొంటారు. కనీసం గాయపడటం కూడా జరగొద్దని భావిస్తారు. అలాంటి వాళ్ళతో పార్టీ ( ఫ్యాక్షన్) జేయటం నడపటం సులభం.
 తాము చచ్చినా పర్లేదు. అవతలి వాళ్ళను చంపాలనే ధ్యేయంతో పన్జేస్తే... వాళ్ళతో పార్టీజేయటం కష్ట సాధ్యమైన విషయం.
 ముందుగా శివపురి పిల్లకాయలను భయపెట్టాలి.
 వాళ్ళు చేసేది కుప్పిగంతులేనని వాళ్ళకే తెలిసేట్లు చేయాలి.
 వెంటనే ఎనిమిది కమాండర్ జీపులు కొన్నాడు - చెన్నారెడ్డి. వాటినిండా వందమందికి పైగా జనాన్నేసుకొని తిరగటం ప్రారంభించాడు.
 తను గట్టిగా కన్ను దెరిస్తే అవతలి వాళ్ళు మాడిమసై పోరా..! అనే ధీమా వుంది చెన్నారెడ్డికి.
 జనాలకు కూడా అతనిమీద ఆ నమ్మకం వుంది.
 ఎప్పుడేం జరుగుతుందోనని ఉత్కంఠంగా చూస్తున్నారు. శివపురి పిల్లనాయాల్లకు మూడిందనే అనుకొంటున్నారు.
 తమ హంగామాకే అవతలి వాళ్ళు జడిసిపోతారనే భావనలో వున్నాడు చెన్నారెడ్డి. ఇప్పుడు కాకున్నా ఇంకొద్ది రోజులకైనా వాళ్ళు తోక ముడవక తప్పదు. పైసా ఆదాయం లేకుండా అంతమంది జనాల్ని మేపుకొంటూ ఎంతో కాలం తిరగటం సాధ్యమయ్యే విషయం కాదు. తనకు తెలిసి పెద్దగా ఆదాయమొచ్చే వనరులు కూడా వాళ్ళకు లేవు. ముగ్గుపిండి గనితో ప్రస్తుతం పార్టీలు నడిపేంత పరిస్థితి లేదు.
  మారెట్లా రెండు జీపుల్ని పద్నాలుగు తుపాకుల్ని కొని యుద్దానికి సన్నద్దమయ్యారు...?
 బహుశా తన ప్రత్యుర్థులు చందాలిచ్చి వుండొచ్చు...!
  ముఖ్యంగా  జీ.పియ్యార్, సోమనాధరెడ్డి, రామసుబ్బారెడ్డిలాంటి వాళ్ళే సహాయం చేసి వుండొచ్చు.
 ’ అబ్బిళ్ళు కొరుకుతూ మెల్లిగా తలపంకించాడు చెన్నారెడ్డి ’
 శివపురి వాళ్ళను బెదరగొట్టాలి.
 వాళ్ళకు వత్తాసిచ్చే మనుషులకు వాళ్ళెట్లా రక్షణ కల్పించగలరో పరీక్షించాలి. చెన్నారెడ్డితో పెట్టుకొంటే కాపాడేవాడు ఎవడూ లేడనే విషయం మరోసారి జనాలకు తెలిసిరావాలి.
 ఆ దిశగా పావుల్ని కదపటానికి సిద్దమయ్యాడు చెన్నారెడ్డి.
  పార్టీల స్వరూప స్వభావాల్ని పూర్తిగా తెలిసికోకుండానే అందులోకి అడుగుబెట్టిన శివపురి కుంకలు తగిన మూల్యం చెల్లించుకొనేలా చేయాలి.
 తన ముఖ్య అనుచరుల్ని పిల్చి వాళ్ళతో మాట్లాడాడు......

                                                                                    ......................  సశేషం

                                                                                                       .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

 మండల ఎలక్షన్లు దగ్గరపడ్డాయి.
  అక్కడక్కడా అడదడపా కొట్లాటలు జరుగుతున్నాయి.
  పోలీసు కేసులవుతున్నాయి.
  రిపోర్టులకు ప్రతిరిపోర్టులు, కేసులకు ప్రతికేసులు.
   ఓబుళరేడ్డికి మినిస్టరు అండ దండిగా వుండటం వలన పోలీసుస్టేషన్‌లో ఎమ్మెల్లేతోటి సమాన గౌరవం లభిస్తోంది.
  మండల ఎలక్షన్లలో చెన్నారెడ్డి భార్యమీద టేకూరి గుర్విరెడ్డి భార్యను పోటీకి నిలిపారు.
  తనకు ఎదురు చెప్పేవాడెవడనే అహంకారంతో చెన్నారెడ్డి ప్రవర్తిస్తోంటే, యీ ఎన్నికలు తమకు జీవన్మరణ సమస్యలాగ ఎక్కడలేని పట్టుదలతో కృషి చేస్తున్నారు ఓబుళరెడ్డి ప్రభృతులు.
  తన స్వంతమండలం కాకుండా పోరుమామిళ్ళ మండలానికి తన భార్యను పోటీగా నిలపటం కొంత పొరబాటేమోననిపించింది చెన్నారెడ్డికి, అక్కడ సరైన వ్యక్తి లేకపోవటం, తనకు అడ్డులేదనే గర్వం అతన్ని అలా పురికొల్పింది.
  జాతీయపార్టివాళ్ళు మొండిపట్టుదలతో ఎన్నికల్లో పన్జేయటం - పలితాలు కూడా బాగా తారుమారయ్యాయి.
  చెన్నారెడ్డి నిశ్చేష్టుడయిపోయేంత పరిస్థితి వచ్చింది.
  ఒక్క తన బద్వేలు మండలం తప్ప మిగిలిన ఐదుమండలాల్లో తను ఓడిపోయాడు.
  టేకూరు గుర్విరెడ్డి భార్య చేతిలో తన భార్య ఓడిపోయింది.
  ఆ షాక్‌ను భరించలేకపోయాడు అతను.
  తమ ఓటిమిని సమీక్షించుకొంటే - దీనికంతటికీ కారణం శివపురి ఓబుళరెడ్డిగా తేలింది.
  మండలాల వారీగా వచ్చిన ఓట్లన్నీ లెక్కేసుకొంటే - అతనికి వాలేమిటొ వారి సత్తా ఏమిటో అర్థమయ్యాయి.
  పల్లె పల్లెలుగా నాయకులు నాయకులుగా విడదీసి లెక్కలు మొదలు పెట్టాడు.
  ఒక్క తన మండలంలోనే తనకు భారీ మెజార్టీ వచ్చింది. మిగతా అన్ని మండలాల్లో తను వెనకబడి వున్నాడు.
  తాలుకా మొత్తం కలుపుకొంటే తనమండలంలో వచ్చిన ఓట్లు అంతా కరిగిపోయి రెండువేల ఓట్ల కంటే ఎక్కువ మిగల్లేదు.
  అంటే ... రేపు ఎవడైనా బలమైనా వ్యక్తి తనమీద పోటిజేస్తే ఓటమి ఖాయం.
  దిగ్భ్రాంతుడయ్యాడు చెన్నారెడ్డి.
  దీనికంతటికీ కారణం శివపురి ఓబుళరెడ్డి.
  అతనివల్ల తన  రాజకీయ పతనం ఖాయమయ్యే స్థితికి వచ్చింది.
  రాత్రి తన కుటుంబ సభ్యులతో యీ విషయం మీదనే రహస్యంగా మంతనాలు చేశాడు.
  ఓబుళరెడ్డిని లేపేద్దామన్నాడు చిన్నకొడుకు.
  అంతరంగికులు కూడా ఎగదోశారు.
  భార్య రమాదేవి మాత్రం చూస్తూ వూరుకుంది.
  ఓబుళరెడ్డిని చంపటం అనివార్యమని తేలిపోయింది.
  ఆ రాత్రి నుంచే వ్యూహాలు వూపిరిపోసుకోసాగాయి.
 మండల ఎలక్షన్ల తర్వాత తాలుకా రాజకీయాల్లో ఓబుళరెడ్డి పాత్ర విసృతమైంది. పార్టీ అధిస్టానం వద్ద అతనికో ప్రత్యేకగుర్తింపు వచ్చింది. సివిల్ కాంట్రాక్టు వర్కుల కోసం హైదరాబాద్, కర్నూల్, బెంగళూర్ ప్రాంతాలకు తిరుగుతున్నాడు. సరైనా రక్షణ చర్యలు కూడ చేసుకొనటం లేదు. తనమీద దాడులు జరుగుతాయేమోనని అనుమానం వున్నా, చంపేంత పనికి పూనుకొంటారని అతను భావించటం లేదు.
  ఓబుళరెడ్డిని చంపటమే ధ్యేయంగా కొంతమందిని వినియోగించాడు చెన్నారెడ్డి.
  సమయం కలిసి రాలేదు.
  పని తొందరగా జరగలేదు.
  చెన్నారెడ్డి కొంత అసహన పడుతున్నాడు..
  ఒకనాటి రాత్రి రెండు జీపుల్లో హైదరాబాద్‌నించి వస్తున్నాడు చెన్నారెడ్డి.  తన అన్నకొడుకు, కొందరు ఫాలోయిర్స్..ఇంకా తన మెరికల్లాంటి మనుషులతో నిండివున్నాయి జీపులు.
 హైవే మీద జీపుల వేగం బాగా పెరిగింది.
  లారీల్ని, బస్సుల్ని దాటుకొని వెళ్తున్నాయి.
  ఓ లగ్జరీ బస్సును ఓవర్‌టేక్ చేసింతర్వాత ఉన్నట్టుండి వెనుక సీటులోంచి  " అయ్యా ! అయ్యా !  ఆ బస్సులో వాల్లుండారయ్యా ! "  అన్నాడు తన మనిషి.
  "  ఎవర్రా  ?  "
  " వాల్లేయ్యా !  శివపురి ఓబుళరెడ్డి వాల్లు .."
  ఉలిక్కిపడ్డాడు చెన్నారెడ్డి.
  డ్రైవర్‌కు  సైగ చేశాడు.
 జీవు స్లో అయ్యింది.
  బస్సు తన వేగంతో తాను ముందుకు పోతోంది.
  రెండూ పక్క పక్కగా వెల్తూ వుండగా స్పష్టంగా కన్పించారు వాళ్ళు.  హైదరాబాదు బద్వేలు లగ్జరీ బస్సులో కిటికీ వారనే (పక్కనే) కూచుని శివపురీ ఓబుళరెడ్డి అతని పక్కన్నే టేకూరి గుర్విరెడ్డి.
  షాద్ నగర్ దగ్గరవటం వలన లైట్లు వేసి ప్రయాణీకుల్ని ఏదో అడుగుతున్నాడు కండక్టర్.
  "  మనకాడా ఏమేముండాయి ? "   వెనక్కి ప్రశ్నించాడు చెన్నారెడ్డి.
  చెప్పాడు అతను.
   " షాద్ నగర్ బస్టాండులో బస్సాగుతాది.. తెలుసుగదా !.. జీపులు బస్టాండు గేటుకు రవ్వంత ముందుంటాయి.. పనియిపించుకొని రాండి.. "  చెప్పాడు.
   బస్సు షాద్‌నగర్ బస్టాండులోపలికి వెళ్ళింది.
  చెన్నారెడ్డి జీపులు బస్టాండుదాటి కొంత ముందుకెళ్ళి ఆగాయి.
  రెండు జీపుల్లోంచి ఆరుమంది మనుషులు దిగారు.
  నలుగురి చేతుల్లో వేటకొడవళ్ళు వున్నాయి.
  ఇద్దరి చేతల్లో బాంబులున్నాయి.
   బాంబులు పట్టుకొన్న ఇద్దరు, వేటకొడవళ్ళు పట్టుకొన్న మరో ఇద్దరు ఎంట్రెన్స్‌కు అటుఇటూ తచ్చాడుతోంటే మిగిలిన ఇద్దరు నేరుగా బస్సు వద్దకు నడిచారు.
   బస్సులోంచి ప్రయాణికులు ఒక్కోక్కరే దిగుతున్నారు.
  భోజనాలు చేయదల్చుకొన్నవాళ్ళు హోటల్‌కు వెళ్ళుతున్నారు.
  ఓబుళరెడ్డి, గురివిరెడ్డిలు కూడా బస్సు దిగారు.
  జేబులో చేయిదూర్చి తడువుకొంటూ అటు ఇటు చూస్తోన్నంతలోనే శివపురి ఓబుళరెడ్డ్ మీద దాడి జరిగింది.
  వేటకొడవలి మొదటి దెబ్బ ఖచ్చితంగా మెడమీదనే పడింది.
  చావుకేక వేస్తూ రెండు చేతులు అడ్డుపెట్టాడు అతను.
 మరో దెబ్బ చంకల కింద పడింది.
  అకస్మాత్తుగా జరిగిన ఆ సంఘటన అక్కడి ప్రయణికుల్ని భయప్రాంతుల్ని చేసింది.
  గావుకేకలు వేసికొంటూ చెల్లాచెదరయ్యారు.
  మరో రెండు దెబ్బలకే ఓబుళరెడ్డి కుప్పకూలిపోయాడు.
  దిగ్భ్రాంతి నుంచి తేరుకొన్న గురివిరెడ్డి చావుకేకలేసుకొంటూ గేటుకేసి పరుగెత్తాడు.
  అతన్ని వెంబడించారు ఇద్దరు.
  " వొద్దు...నన్ను సంపొద్దు..మీకు దండం బెడ్తా !.. నన్ను సంపొద్దు.. అంటూ  పరుగెడ్తోన్న గురివిరెడ్డికి ఎదురుగా మరో రెండు వేటకొడవళ్ళు అడ్డుగా నిలబడ్డాయి.
  వెనకనించి వచ్చిన వేటకొడవళ్ళు అతన్ని సమీపించాయి.
  తన్ను చంపొద్దని దీనంగా వేడుకోంటోన్న టేకూరు గురివిరెడ్డి మీద వాలాయి ఓబుళరెడ్డిని నరికిన వేటకొడవళ్ళే.
  జనం కూడుకోబోతోంటే  రెండు నాటుబాంబులు కూడా పగిలాయి.
  ఇద్దర్నీ చంపిన తర్వాత వచ్చినంత వేగంగానే వెళ్ళి జీపుల్లో దూరారు ఆరుమంది మాసులు.
  బైటి జనాలకు అక్కడేం జరుగుతుందో తెలిసేలోపలే జీపులు ఆ ప్రాంతాల నించి వేగంగా వెళ్ళిపోయాయి.
  శివపురి ఓబుళరెడ్డి, టేకూరు గురివిరెడ్డిల  ’శవాలు ’ బస్టాండు లోపల ఒకటి, గేటు వద్ద ఒకటి భీభత్సంగా పడివున్నాయి.
  శవాల చుట్టూ క్రమంగా రక్తం మడుగు కడుతూ వుంది.
  చుట్టూ జనాలు మూగుతున్నారు.

           *******

 షాద్‌నగర్ వద్ద జరిగిన జంటహత్యలు తాలుకాను అతలాకుతలం చేశాయి.  జిల్లాను దిగ్భ్రాంతికి గురి చేశాయి.
 చెన్నారెడ్డి మీదా, అతని అన్నకొడుకూ మరికొందరి మీద కేసు రిజిస్టరయ్యింది.
  ఇంజనీరింగ్ ముగించుకొని ఏవో అవకాశాలకోసం చూసుకుంటూ తాలుకా నెత్తుటి రాజకీయాల్ని తలకెక్కించుకోకుండా వున్న చెన్నారెడ్డి అన్నకొడుకు నాగసుబ్బారెడ్డి ఆరోజు చిన్నాయన వెంబడి రావటం వలన కేసులో రెండవ ముద్దాయి  అయ్యాడు.
  అతను ముద్దాయి కాదని జనాల సానుభూతి.
 అతన్ని కేసులో ఇరికించటం జాతీయపార్టి వాళ్ళకు కూడ అంతగా ఇష్టం లేదు, అయినా తప్పని పరిస్థితి. ఎండు కర్రతోటి పచ్చకర్ర కూడా కాలవలసిందే గదా !
  జంటహత్యలతో చెన్నారెడ్డి మరోసారి టెర్రర్ సష్టించాడు. అతని వ్యతిరేకుల్లో గుబులు పుట్టించాడు.
 అతన్ని ఎదిరించి బతకటం కష్టమనిపించింది తాలుకాలోని జాతీయపార్టి నాయుకలందరికీ.
 గుండె ధైర్యమున్న ఓబుళరెడ్డిని నరికాడు.
మంచితనమున్న గురివిరెడ్డిని చంపాడు.
  చెన్నారెడ్డి దృష్టిలో ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే ! తనమార్గానికి అడ్డొచ్చింది కంపచెట్టయినా, పూలమొక్కయినా తొలగించబడవలిసిందే.
 తాలుకా పరిస్థితి మీద జాతీయపార్టి వాళ్ళంతా కలిసి చర్చించుకొనేందుక్కూడ భయపడుతున్నారు.
మండల ఎలక్షన్లలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు బద్వేలు టౌనుకు వెళ్ళటం చాలించారు.
  శివపురి ఇంకా దుఃఖం నించి కోలుకోలేదు.
 ఇద్దరు తమ్ముళ్ళను కిరాతకంగా పోగొట్టుకొన్న పెద్దిరెడ్డికి ఇప్పుడు వేదాంత ధోరణి అలవడింది.
 బంధువులొస్తున్నారు.. పరామర్శించిపోతున్నారు. జరిగినదంతా ఖర్మగా, విధివ్రాతగా చిత్రీకరించి సానుభూతి పలుకుతున్నారు.
 బాలుడు జైలునించి విడుదల అవటంతో ఏడుమంది అన్నదమ్ములు ఇంటి పట్టున్నే వుండిపోయారు.
 పరామర్శించడానికి వచ్చిన వాళ్ళంతా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నారు, పెద్దిరెడ్డి వేదాంతధోరణి, ఏడుమంది అన్నదమ్ముల గమ్యం తెలీని స్థితిని అర్థం చేసుకొన్నారు.  తాలుకా రాజకీయాల్ని దిశా నిర్దేశాలు చేసే పనిలో ఇకపై శివపురికి ఎలాంటి స్థానమూ లేదని వూహిస్తున్నారు.
  "  మేం ముందే చెప్పినాం, చెన్నారెడ్డితో పార్టి జెయ్యడం మంచిది గాదని పార్టీ పెట్టుకున్నెప్పుడే జెప్పినాం, మామాట విన్పించుకోకపోయినారు "  అన్నారు కొందరు.
 నారమ్మ కూడ వచ్చింది శివపురికి.
 పెద్దిరెడ్డి ఇంటివద్దకెళ్ళి నాలుగువైపుల ఎగాదిగా చూసింది.
ఆమె ఎందుకొచ్చిందో అర్థం కాలేదు అక్కడున్నవాళ్ళకు.
 పరామర్శించడానికొచ్చిందో..?
  తన పగవాడి పతనాన్ని కళ్ళారా చూడ్డానికొచ్చిందో..?
 ఎవ్వరితోనూ మాట్లాడలేదు ఆమె.
 నేరుగా రమణారెడ్డి సోదరుల వద్దకెళ్ళింది.
  " ఏమబ్బీ !  నాయన పోయినాడని దిగులు బడ్తాండారా ఏంది ? మొగపిల్లలకు ఏడుపూ, దిగులూ రాగూడదబ్బీ ! మీనాయనొక్కడే ఆ రాకాసోనితో తగూలాడిండే ! ఇంతమంది వుండీ బయపడ్తే ఎట్లా ?  మీ గుంపులో వొకరు పోయి మీ నాయనే వున్నేడనుకో.. ఇట్లా దిగులు మొగాలేసుకొని కూకుండేవాడా ? ... ఏడుమంది ఎద్దులాల వుండారు  ఎద్దులాల... "  అంటూ వెనుదిరిగి రెండడుగులు వేసి ఏదోగుర్తొచ్చిన దానిలా  " నామీదికైతే రాండి...ఆడదాన్ని, ముండమోపిని...  ! "  కసిగా అంటూ ఇక అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయింది.
  ఆమె ఏం మాట్లాడింది చుట్టుపట్ల వాళ్ళకు అర్థం కాలేదు.
 రమణారెడ్డి సోదరుల్ని అడిగితే పెదవి విప్పలేదు.
  ఆమె ఎందుకొచ్చిందీ, ఎందుకట్లా తమను రెచ్చగొట్టిందీ అర్థం చేసుకోలేనంత అమాయుకుడేం కాదు రమణారెడ్డి.
  తాము చేతగాని వాళ్ళలా పడున్నామనీ, ప్రతీకారం తీర్చుకొనే ఆలోచనల్లో లేమనీ తెలిసి ఆరాటపడుతూ వచ్చింది.
 ఆమె ఆరాటం - తామేదో సాధించాలని కాదు...!
  ఆవేశంతో చెన్నారెడ్డిని ఎదుర్కొని మాడి మసైపోవాలని.
 పినతండ్రి చనిపోయినప్పటినుండి తనను అలాంటి అనుమానమే  పట్టి కాల్చుకు తింటోంది.
 తన తమ్ముళ్ళు తొందరపడి ఎక్కడ దెబ్బతింటారోనను భయంగా వుంది. బాలుడు పెట్రేగి పోతున్నాడు.
 జయసింహ చావో రేవో తేల్చుకొందామంటున్నాడు.
 తమ్ముళ్ళంతా అదే కోవలో వున్నారు.
  రెండ్రోజుల క్రితమే తమ్ముళ్ళందర్నీ తండ్రి సమాధి వద్దకు తీసుకెళ్ళి కూచోబెట్టి పరిస్థితుల్ని వివరించాడు.
 తమ తండ్రిని చంపిన వాళ్ళమీద పగతీర్చుకోవటమనేది అనివార్యమైన చర్య. అందులో రాజీపడే అవకాశమే లేదు.
  తమ విరోధి అందరిలాంటివాడు కాదుకాబట్టి ఎంత సమయమైనా తీసుకొని పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. ఇది కేవలం ఆవేశంతో చేసే పని కాదు, ఆలోచన వుండాలి. ఒక రోజు..రెండ్రోజుల్లో పూర్తియేపనికాదు, ఒక్కోసారి జీవితకాలం పట్టొచ్చు.. ఎన్ని రోజులైనా పట్టనీ, ఎన్ని ఏళ్ళయినా పట్టనీ చెన్నారెడ్డి మాత్రం సహజమరణం పొందటానికి వీల్లేదు. పోరాటంలో తామందరూ పోయినా సరే మిగిలిన వాళ్ళే ఆ పని నేరవేర్చాల అవసాన దశలో మంచంమీదున్నపుడయినా సరే గొంతుకోసి చంపాలి తప్ప సహజంగా చచ్చేందుకు అవకాశం ఇవ్వకూడదు.
  పకడ్భందీ ప్రణాళిక ఏర్పాటు చేసుకొంటే తమ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చు.
  వ్యూహాన్ని నిర్మించుకొనేంత దాకా తమ్ముళ్ళను తొందర పడవద్దనె చెప్పాడు రమణారెడ్డి.
  ఈ క్రమంలోనే తమ యింటికి వచ్చిన వాళ్ళందర్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు,  వాళ్ళ మాటల్ని అధ్యయనం చేస్తున్నాడు.
  బంధువులెవ్వరూ తమను గొడవలకు పురమాయించటం లేదు.
  పైపెచ్చు భయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
   తమ నిర్ణయం బైటపడితే వాళ్ళగుండా నైతిక మద్దదు లభిస్తుందేమోగాని తమ కసిలో పాలు పంచుకొనే వాళ్ళెవరూ దొరక్కపోవచ్చు.  తాము మాత్రమే ఒంటరి పోరాటం చేయక తప్పేట్టు లేదు. తుపాకులు, బాంబులు, జీపులూ, మెరికల్లాంటి మనుషులు వగైరాలతో పరిపుష్టంగా వున్న చెన్నారెడ్డిని ఏ ఆయుధాలూ లేకుండా వుత్త చేతుల్తో,... ఏ వాహనమూ  లేకుండా ఉత్త కాళ్ళతో... ఏ బలగమూ లేకుండా కేవలం గుండే బలంతో..ఎదుర్కోవటం సాధ్యమా..?
   వాస్తవాల్ని కూడా బేరీజు వేసుకోవాలిగదా !
  ఆలోచిస్తూ వున్నాడు రమణారెడ్డి.
 నిద్రహారాలు మాని ఒకటే ఆలోచనలు..
  తమ్ముళ్ళు తొందరపాటు మాత్రం పట్టరాకుండా వుంది.
  జొరబడి నరికి వద్దామంటున్నారు. ’తాము ఏడుమందిమి చచ్చేలోపల వాన్ని నరకలేమా ? ’ అంటున్నారు.
 వాళ్ళ ఆవేశం అట్లా వుంది.
  పూర్వంలా ఎదురెదురు కత్తియుద్దం చేయటం కాదు ఇప్పుడు పార్టీలు ( ఈ " పార్టీ " పదానికే ఫ్యాక్షన్ అని ముద్దు పేరు పెట్టింది మన మీడియా) నడపటమంటే. చాటుమాటుగా ఎదుటి మనిషిని దెబ్బతీయాలి, విజయం సాధించాలి. తమవైపు ప్రాణ నష్టం జరక్కుండా పార్టీలు నడిపినవాడే గొప్పవాడు.  తాము నష్టపోకుండా ఎదుటి వాళ్ళను నష్టపరచాలి. అదే పార్టీ మూలసూత్రం.
  చెన్నారెడ్డి వ్యూహమంతా పై నిబంధనల ప్రకారమే వుంటుంది. ఎదుటివాడు సన్నద్దమయ్యేలోపలే దెబ్బతీస్తాడు.
  అన్ని విషయాలు తమ్ముళ్ళతో చర్చిస్తున్నాడు రమణారెడ్డి. ప్రతిరోజు ముగ్గుపిండి గనులవద్దకెళ్తున్నారు, భవిష్యత్తు కార్యచరణకు వ్యూహాలు పన్నటంలో తలమునకలవుతున్నారు.

                                                                                                     ............ సశేషం.

                                                                                                    .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

       ’లా ’ పూర్తిచేసి అప్పటికే ఇంటికి వచ్చివున్నాడు రమణారెడ్డి.
   జయసింహారెడ్డి ఎమ్మెస్సీ పూర్తిజేశాడు
  రామసుబ్బారెడ్డి, నర్శిరెడ్డిలు డిగ్రీలతోనే సరిపెట్టుకొన్నారు.
  చెన్నకేశవరెడ్డి, చంద్రశేఖర్‌లు డిగ్రీ చివరి అంకంలో వున్నారు.
  బాలుడు జైల్లో వున్నాడు.
 తాలుకాలో జాతీయపార్టీని బతికించేందుకు నడుం బిగించిన పెద్దలకు శివపురి వాళ్ళ సంతానం మీద కన్నుబడింది.
  ప్రముఖ జాతీయపార్టి నాయకుడు మున్నెల్లి సిద్దారెడ్డి తరుపున శివపురికి పెళ్ళిపెత్తనం వెళ్ళారు. పెద్దిరెడ్డిని, ఓబుళరెడ్డిని కలిశారు. రమణారెడ్డికి పిల్లనిచ్చి సంబంధం కలుపుకోదలంచినట్లు చెప్పారు.
  తమ్ముని కొడుకును పక్కకు పిల్చాడు పెద్దిరెడ్డి
   " పిల్లను సూడాల్సిన పన్లేదు వొప్పుకొందాం "  చెప్పాడు.  " తొట్టతొలూత(మొట్ట మొదటిసారిగా) యింటిని ఎదుక్కొంటూ వొచ్చిన సంబందాన్ని వొదులుకోగూడదురా ! "  హితువు  చెప్పాడు.
  " సరే సరేలే. మనం కాదంటావుడామా యేంది ? " ఓబుళరెడ్డి చెప్పాడు. ’ తాము కూడ వచ్చి అమ్మాయిని చూసింతర్వాత నిర్ణయం తీసుకొంటామని చెప్పాడు వచ్చిన వాళ్ళకు.
  రాత్రి రమణారెడ్డిని దగ్గరకు పిల్చుకొన్నాడు పెద్దిరెడ్డి. " అబ్బీ ! పెద్దోడా !  కాల్లకాడికొచ్చిన సంబందాన్ని కాలదన్నగాకు నాయనా ! పిల్చి పిల్లనిస్తామంటున్నారు.  గురి యించుమించు సర్దుకుపో. రంభను తెచ్చుకొని దాన్ని అంటిపెట్టుకొని వుండేకన్నా బుద్దిమంతురాల్ని తెచ్చుకుంటే  బాగుబడ్దాది నాయనా ! "  అంటూ హితబోధ చేశాడు.
  పెళ్ళి సంగతులు ఎత్తుకొంటే  తన బ్రహ్మచారి తనం గుర్తుకొస్తాంది ఆయనకు.
  తను వయసులో ఉన్నప్పుడు అందరిలాగే పెళ్ళి చూపులకు వెళ్ళాడు. మొదటిచూపులోనే అమ్మాయి రూపం అతని గుండెల్లో స్థిరపడిపోయింది.  ఆమె మీద అంతులేని వలపు పెంచుకొన్నాడు. పెళ్ళి ఖాయమవుతుందనే ( కుదురుతుంది) భావించారు అందరూ.
  అంతలో ’ నీకు పిల్లనిచ్చేది లేదంటూ అమ్మాయి తండ్రి వద్దనుంచి కబురొచ్చింది. ఆమె మేనమామ అడ్డుపడ్డాడట. అతనితోనే పెళ్ళి చేశారట.
  మనస్సు విరిగిపోయింది పెద్దిరెడ్డికి.
  " చ...నాకు పెళ్ళే వొద్దు.. " అనుకొన్నాడు.
  బ్రహ్మచారిగా వుండిపోయాడు.
  తనలాగా రమణారెడ్డి స్పరద్రూపి కాదు. నల్లగా పొట్టిగా వుంటాడు.  ఆ విషయమే పెద్దిరెడ్డికి కొంత భయాన్ని కలిగిస్తూ వుంది.
  అయితే ఇక్కడ ఆయన భయానికి అర్థం లేదు..ఎందుకంటే అవి రాజకీయపు పెళ్ళి చూపులు కాబట్టి.
  రాజకీయంగా రెండు వర్గాలు ఏకం కావటానికి  నిర్వహించే పెళ్ళితతంగంలో అందానికి, ఐశ్వర్యానికి తావులేదు.  చాలినంత బలగముంటే చాలు చెరోవైపు ఆడపిల్ల, మగపిల్లాడు వుంటే చాలు.
  రమణారెడ్డి పెళ్ళి  ఖాయమైంది.
  అంతలో కలసపాడు నించి మరో జాతీయపార్టి నాయకుని సంబంధం వొకటి నర్శిరెడ్డిని వెదుక్కొంటూ వచ్చింది.
  ఇద్దరి పెళ్ళెళ్ళూ ఆడంబరంగా జరిగాయి.
  అన్ని గమనిస్తూనే వున్నాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  ఓబుళరెడ్డి  ప్రయాణం ఎటువైపు సాగుతుందో పసిగట్టాడు
  ఆపేందుకు తనచేతిలో ఏమిలేదు - చూస్తూ వుండటం మినహా.
  అతను చూస్తోండగానే జయసింహారెడ్డికి, చెన్నకేశవరెడ్డికి కూడా పెళ్ళిళ్ళయ్యాయి. అందరికీ జాతీయ పార్టీ కుటుంబాల్నించే అమ్మాయిల్ని యిచ్చి..పని చక్కబెట్టారు.
  శివపురి వర్గం దాదాపు కాంగ్రెస్స్ పార్టీలో చేరినట్లేనని అందరి భావం
  వాళ్ల అనుమానాల్ని నిజం చేస్తూ ఓ సుభముహూర్తాన పులివెందుల జాతీయపార్టి రాష్ట్ర నాయుకుడు దేవుడు సమక్షంలో శివపురి వర్గం జాతీయ పార్టీ తీర్థం పుచ్చుకొంది.
  అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వెలుబడింది.
  ఓబుళరెడ్డి  చేరికతో జాతీయపార్టి బలోపేతమైందని భావించారు టేకూరి గురివిరెడ్డి.  శివపురి ఓబుళరెడ్డి, బద్వేలు జి.పి.ఆర్, అట్లూరి సోమనాథరెడ్డి, బి.కోడూరు రామసుబ్బారెడ్డిల వర్గాలతో కూడుకొన్న జాతీయపార్టి యీ దఫా చెన్నారెడ్డిని వెనక్కి నెట్టుతుందని అనుకొన్నారు.
  అయితే  చెన్నారెడ్డిని ఎదుర్కొని నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
  రాష్ట్రంలో ప్రాంతీయపార్టి నాయుకుని ప్రభంజనం బలంగా వుంది.
  అయన్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పగ్గాలు చేతికి తీసుకొన్న నాదేండ్ల భాస్కర్‌రావు ప్రభుత్వం నెలరోజులకే కుప్పకూలి పోయాక తిరిగి విశ్వనీయతకోసం వచ్చిన మధ్యంతర ఎన్నికలు ఇవి.
   జాతీయపార్టి నాయకురాలు టెర్రరిస్టుల చేతిలో మరణించి దేశమంతటా జాతీయపార్టికి సానుభూతిపవనాలు వీస్తున్నా రాష్ట్రంలో మాత్రం ఎన్టీఆర్ మీద సానుభూతి పవనాలు వీస్తున్నాయి.
  తాలుకాలో కూడా రెండు మండలాల్లో చెన్నారెడ్డికి అడ్డులేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో జాతీయపార్టి పక్షాన నామినేషన్ వేసేందుకు మనిషే దొరకలేదు.
  గత్యంతరం లేని పరిస్థితిల్లో తనకు సన్నిహితుడైన వై.వి.రావు చేత దేవుడు నామినేషన్ వేయించాడు.
  ఎన్టీఆర్ ప్రభంజనం ముందు మహామహులే మట్టిగొట్టుకుపోయారు, ఆయనకు జరిగిన అన్యాయానికి ప్రజలు తీవ్రంగా స్పందించి ప్రాంతీయపార్టీకి బ్రహ్మరథం పట్టారు.  దేశమంతా జాతీయపార్టి విజయఢంకా మోగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మట్టికరిచింది.
  తాలుకాలో కూడా శివపురి ఏరియా తప్ప మిగిలిన మండలాలన్నీ దాదాపు ఏకపక్షమయ్యాయి.
   చెన్నారెడ్డి అత్యధిక మెజారిటీతో గెల్చాడు.
  అతని మెజార్టీ చూసి ప్రాంతీయపార్టి అధ్యక్షుడు స్వయంగా అభినందించాడు. దాంతో అతనికి గర్వం పెరిగింది.
  బద్వేలు హెడ్ క్వార్టర్‌లో కూచుని అతను చేసే వికటాట్ట హాసాలు తాలుకాలోని అన్ని ప్రాంతాల జాతీయపార్టి వారి గుండెల్లో మార్మోగసాగాయి.
   " ఓబుళరెడ్డి  పోతే నా యింటిక పోయిందా ? జి.పి.ఆర్ పోతే నా ఎంటిక రాలిందా ? టేకూరు గురివిరెడ్డి పోతేనేం ? అట్లూరి సోమనాధ్‌రెడ్డి పోతేనేం.. వీల్లంతా కలిసి నా ఎంటికేమన్న పీక్కున్నెరా ? "  అంటూ ప్రగల్భాలు పలకసాగాడు.
  అతని మాటలు చెవుల బడుతున్నాయి అందరికీ.
  కానీ - ఏమి చేయలేని పరిస్థితి.
  రావుకు తాము సక్రమంగా ఓటు  జరపలేక పోయామేమోనను అనుమానం.  తమ వరకు గట్టిగనే పోరాడారు. అతని అసమర్థతను  తాము సవరించలేము గదా !  చెన్నారెడ్డి ఎదురుగా వస్తున్నాడంటే ఆ దారిన రావటం కూడా చాలించుకుంటాడు అతను.  తన ఏరియాలోనే వూళ్ళకు వూళ్ళు ఆక్రమించుకొని రిగ్గింగ్ చేసికోంటుంటే ఆ ప్రాంతానికేసి తొంగి  కూడా చూడలేదు రావు.
  చెన్నారెడ్డి విర్రవీగాడు.
  ఎలక్షన్లలో తనకు వ్యతిరేకంగా పన్జేసిన వాళ్ళ మీద కక్షగట్టి టౌన కేంద్రంగా పల్లెజనాల మీద తన పంజా గురిపెట్టాడు.
  పెద్ద మనుషుల్ని, మర్యాదస్తుల్ని సైతం తనకు వ్యతిరేకంగా పనిచేశారనే కారణంగా టౌనుకొచ్చినపుడు పట్టి బంధించి, కొట్టి దారుణంగా అవమానించాడు. చెన్నారెడ్డి పేరు బెట్టి అతని మనుషులు కూడా అరాచకాలకు దిగారు.
  ఈ నేపధ్యంలో చెన్నారెడ్డి చిన్నకొడుకు హర్షవర్ధన్ ప్రముఖపాత్ర పోషించసాగాడు.
బాంబుల ప్రయోగాన్ని విసృతపరిచాడు చెన్నారెడ్డి.
 ఊరూరా బాంబుల్ని పుష్కలంగా నిలవుంచాడు.
  దిబ్బల్లో బాంబులే.. వాముల కింద బాంబూలే.. పాడుబావుల్లో బాంబులే.. ఎక్కడ వంగితే అక్కడ బాంబు దొరికేంత అవకాశం కల్పించాడు.
  వంతుల బావికింద నీళ్ళ తకరారు వస్తుందేమో ! -  బావి గుంతపక్కనే కంపపొదల్లో బాంబులుండాలి.
  గెట్ల తకరారు రావొచ్చేమో !  గెనిమల వద్దనే గుర్తుగా బాంబులు పూడ్చి పెట్టి వుండాలి.
  ఇళ్ళవద్ద గోడ తకరారు వస్తుందేమో !
 ఎద్దుల గాడి తకరారు ఎదురవుతుందేమో !
  ఏ వైపునించి ఏ ఆపద మూడుతుందో ? తన వాళ్ళందరికీ అన్ని తావుల్లో చేతికందేలా బాంబులు నిల్వలుంచాలి.
  ఎమ్మెల్లే ఆశీర్వాదంతో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి బాంబులు వేసి వస్తున్నారు అతని అనుయాయులు.
  రాష్ట్రంలో ఆయన పేరు బాంబులకు పర్యాయపదమైంది.  చింతకుంట చెన్నారెడ్డి అనేకన్న బాంబుల చెన్నారెడ్డి అంటేనే ఆయన అందరికీ గుర్తింపుకొస్తున్నాడు.
  ఇన్ని గొడవలు చేస్తున్నప్పటికీ అతను టేకూరు గుర్విరెడ్డి జోలికి గాని, శివపురి వర్గం జోలికి గాని వెళ్ళటం లేదు. వాళ్ళు కూడా అతన్ని సవాల్ చేయటం లేదు.
  అలాగని వాళ్ళను వదిలేశాడని కాదు.
  అన్ని వైపుల్నించి నరుక్కొంటూ వాళ్ళకేసి వస్తున్నాడు.
  ఆ విషయం వాళ్ళక్కూడా అర్థమైంది.
  టేకూరు గురివిరెడ్డి మాత్రం ఓబుళరెడ్డిలాగ తెంపుమనిషి కాదు ( తెంపు = తెగింపు ) గాని అందర్నీ ఆకట్టుకొనే మంచిమనిషి. విస్తృతమైన బంధుబలం వున్న వ్యక్తి. అతనికి దెబ్బతగిలితే ఒక మండలమంతా బాధపడేంత గొప్ప మనిషి.
  బద్వేలు టౌన్లో సంసారముంటోన్న పాత నాయకులందర్నీ సవాల్ చేశాడు చెన్నారెడ్డి.  సోమనాథ్‌రెడ్డిని లెఖ్కలేకుండా తిట్టి చిటికలు వేసి పిలుస్తూ మరీ సవాలు  విసిరాడు. భూస్వాములు, ఫ్యాక్టరీ యజమానులు, కోటీశ్వరులుగా పిలవబడుతోన్న వాళ్లంతా చెన్నారెడ్డికేసి కన్నెత్తి చూడాలన్న వణికి పోయే పరిస్థితి వచ్చింది.
  పోలీసులంతా అతని గులాములయ్యారు. అతనికి వ్యతిరేకంగా కేసులు పెట్టినా రిజిస్టర్ చేసే పరిస్థితిలో లేరు.
  మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి బద్వేలు, అట్లూరు, గోపవరం మండలాలు మూడూ అతని చేతికిందికి వచ్చాయి. ఆ మండలంలో జాతీయపార్టికి ఏజంట్లు కూడా కరవయ్యే పరిస్థితి వచ్చింది.
  టేకూరు వాళ్ళు, శివపురి వాళ్ళు మాత్రం తమ ఉనికి చాటుకొంటున్నారు. ఆరెండు మండలాల్లో చెన్నారెడ్డి దౌర్జన్యం యధేచ్చగా సాగటం లేదు.
   పదొమ్మిది వందలఎనబై తొమ్మిదిలో తిరిగి ఎలక్షన్లు వచ్చాయి.
  చెన్నారెడ్డి భారీ మెజారిటీతో తిరిగి గెల్చాడుగాని, రాష్ట్రమంతటా జాతీయపార్టి గాలి వీచటంతో ప్రాంతీయపార్టి మట్టి కొట్టుకపోయింది. రెండు చోట్ల పోటి చేసిన ఆ పార్టి అధ్యక్షుడే   ఒక స్థానంలో ఓడిపోయాడు.
  రాష్ట్రంలో జాతీయపార్టి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో  చెన్నారెడ్డి ప్రత్యుర్థులకు కొంత వూరట కలిగింది. తను ఎమ్మెల్లే అయితే కావొచ్చు తమకు జిల్లా జాతీయపార్టి నాయుకులు వత్తాసు పలుకుతారు గదా! అందులోనూ యీ దఫా జిల్లా మనిషికే హోంమంత్రి పదవి దక్కింది. అతని అండదండలు తమకు దండిగా వుంటాయి. అప్పుడు తమపట్ల పోలీసుల ప్రవర్తన కూడా మారుతుంది కదా !
  వాళ్ళు వూహించినట్లే పోలీసుల్లో కొంత మార్పు వచ్చింది. చెన్నారెడ్డికి యిచ్చిన విలువ జాతీయపార్టి నాయకులకు కూడా యిస్తున్నారు. శివపురి ఓబుళరెడ్డిని సాదరంగా ఆహ్వానించి కుర్చీలు వేసి కూర్చబెడుతున్నారు.
  చెన్నారెడ్డి టెర్రర్ ఇంకా అణగ లేదు.
  ఓ కేసుకు సంబంధించి పోలీసులు తన వాళ్ళను అరెస్ట్ చేస్తే..పోలీసు్స్టేషన్ ముందరే పెద్ద గందరగోళం లేవదీసి, పోలీసుల్ని బెదిరించి మరీ విడిపించుకు పోయాడు. పోలీసుల్లో అతని మీద అంతర్లీనంగా అసమ్మతి వుంది.
  ఈ నేపథ్యంలో చింతకుంట చెన్నారెడ్డి వ్యతిరేకులంతా ఒక చోట సమావేశమయ్యారు. కాంగ్రెస్స్ గవర్నమెంటు హవా నడుస్తున్నా యీ ఐదేళ్ళలో అతని దుడుకుతనాన్ని అణచివేయాలని నడుంబిగించారు. వెంటనే పల్లె పల్లెకు వెళ్ళి తమ కార్యకర్తలని కలిశారు.
  పంచాయితీల వారిగా వాళ్లను కూడేశారు.
  ధైర్యం నూరిపోశారు.
  ఎమ్మెల్లే కూడా అప్పటిలా దుడుకుగా వ్యవహరించటంలేదు. ఏ మాత్రం తేడావస్తే పోలీసుల చేతుల్లో ఇరుక్కోంటామేమోనని అతనికి అనుమానంగా వుంది.
  జాతీయపార్టి కార్యకర్తల్లో మళ్ళీ జవసత్వాలు కూడుకొంటున్నాయి.
  చెన్నారెడ్డి మనుషుల గొడవలు పోలీసు స్టేషన్ వరకైనా తీసుకపోగలుగుతున్నారు.
  ఓబుళరెడ్డి ఇప్పుడు పూర్తిగా కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసే పనిలో వున్నాడు. ఎక్కడ గొడవలు జరిగినా తన జనంతో సహా అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు.
  అతని చర్యలు చెన్నారెడ్డికి కంటగింపుగా మారాయి.
  ఇలానే వదిలేస్తే తన వాళ్ళను బెదిరించే స్థాయికి కూడా రాగలడేమో..!
  పోరుమామిల్లలో ఓ పెళ్ళికి హాజరైన ఓబుళరెడ్డి వద్దకు దురుసుగా దూసుకెళ్ళాడు చెన్నారెడ్డి.
  " ఏం వోయ్ ?  మావాల్ల మీంద నీ బెదిరింపులు జాస్తెయినాయంట..?(ఎక్కువైనాయట ) దేనికోయి ఈ రాజకీయమంతా నీకు ?  ఎమ్మెల్లేకు పోటి జేస్తావా యేంది ! "  అన్నాడు తీక్షణంగా చూస్తూ వ్యంగాన్ని మిళితం చేసి.
   " మేం  ఎవార్నీ బెదిరించేవాల్లం గాదు. అనవసరంగా ఎవరిజోలికి పోము. మాజోలికి వస్తే వొప్పుకోం. దౌర్జన్యాలు సెయ్యడం, బెదిరించడం నీ లక్షణం. మాకవి చేతగాదు  "  అంతకంటే తీక్షణంగా చూస్తూ చెప్పాడు ఓబుళరెడ్డి.
   " సరే..సరే.. నేను తప్పుడు నాకొడుకునే... ఎమ్మెల్లే పదవి నిలబెట్టుకోవాలగాబట్టి నేను దౌర్జన్యాలు జేస్తాండ. నువ్వెందుకోయి మందను ఎంటేసుకొని వూర్లమీద తిరుగుతండావు ? నువ్వేమైనా ఎమ్మెల్లేకు పోటి జేసేదుందా ? "
   " ఎందుకు జేయనూ ? నీకు దొరికినట్టు మా యట్లాంటి ఖర్మనాకొడుకు  మాకు దొరికితే ఎమ్మెల్లేకు పోటిజేయనల్లా వుందా ? "  అన్నాడు ఓబుళరెడ్డి.
  గతుక్కుమన్నాడు చెన్నారెడ్డి... అంతలోనే తేరుకొని  " సరే .. సరే.. రేపు ఎలక్షన్లలో అట్లనే పోటీజేద్దువుగాని..  నావాల్ల జోలికి మాత్రం రావొద్దు.  పాతసావాసంగాబట్టి  నోటితో చెబుతావుండా ! " అన్నాడు తీక్షణంగా చూస్తూ.
  " లేకుంటే ఏం జేస్తావోయ్ ? "  గట్టిగా అరిచాడు ఓబుళరెడ్డి.
 పెళ్ళి జనమంతా అటుకేసి చూపుల్ని తిప్పి దిగ్ర్భాంతికి గురవుతున్నారు.
 ఓబుళరెడ్డి కేసి పైకి కిందకు ఓ సారి ఎగాదిగా చూశాడు చెన్నారెడ్డి. " ఏం జేస్తానా ? " అంటూ పళ్ళు కొరికి  " నేను ఎమ్మెల్లేనయి బజారు మనుసుల్లా మీదబడలేకుండా. మీయట్లా వుత్తమాసినయ్యుంటేనా... మిమ్మల్ని గాదు - మీ వూరిని కూడా ఎత్తక పోయిండేవాన్ని "  అన్నాడు.
  "  పో..  పోవోయ్ ! "  అదే శైలితో ప్రతిస్పందించాడు ఓబుళరెడ్డి.  " ఎమ్మేల్లేవు కాబట్టే మేమూ నీజోలికి రాలేకుండాము. రిజైన్ చేసి ఒక్కసారి తగిలి సూడు - మా సంగతేందో నీకూ తెలుస్తది..."  అంటూ ప్రతి సవాల్ విసిరాడు.
 చుట్టూ వున్న వాళ్ళందరికీ అక్కడేదో అరాచకం జరగబోతోన్న విషయం స్పరించసాగింది.
  ఓబుళరెడ్డి కేసి తదేకంగా కొంతసేపు చూశాడు చెన్నారెడ్డి. అతనికేసి పళ్ళు కొరుకుతూ వెనుదిరిగాడు.
  అక్కడ జరిగిన సంఘటన తాలుకా అంతటా చర్చనీయాంశమైంది.
  జాతీయపార్టీ కార్యకర్తలకు కొంత మనోధైర్యం సమకూరింది.

                                                                                                             ..........సశేషం.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs