.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.                                                                      

      చెన్నారెడ్డి గెలుపు పండుగ నియోజక వర్గమంతా చుట్టివచ్చేసరికి దాదాపు మూడునెలలు పట్టింది. సుమారైనా నాయుకలంతా ఎమ్మెల్లేను తమ వూరికి పిలవటం, పొట్టేళ్ళను కోసి, వచ్చిన వాళ్ళందరికీ విందులివ్వటం, తమ వూరి సమస్యల్ని ఆయన ముందు చిట్టా విప్పటం.
   రాష్ట్రంలో కూడా ప్రాంతీయపార్టి ప్రభుత్వం ఏర్పడటం వలన తాలుకా అభివృద్దికి ఆటంకం వుండబోదని అందరికీ ఆశ.
  చెన్నారెడ్డి వెంట తనూ కొన్ని వూళ్ళకు వెళ్ళాడుగాని, తర్వాత ఎందుకో ఇష్టపడలేదు ఓబుళరెడ్డికి.
  కోర్టు వాయిదాలు వేగమంతమయ్యాయి.
  మీద మీద డేట్లిస్తున్నారు
  సాక్ష్యాల్ని రికార్డు చేస్తున్నారు.
  దగ్గిర దగ్గిర వాయిదాలు వేయటం వలన ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అప్పులకోసం చేయి చాచాల్సిన పరిస్థితి వస్తోంది. మొన్న ఎలక్షన్స్‌లో చేతి చమురు చాలా వదిలింది.
  చెన్నారెడ్డి వద్దకెళ్ళి యింత ఖర్చయిందని చెప్పేందుకు అహం అడ్డు.  తనయినా గుర్తెరిగి ఇవ్వాల్సిన భాద్యత వుంది... కానీ జోబులోంచి ఒక్క రూపాయి కూడా బైటకు తీయలేదు.
  ముగ్గుపిండి గనుల మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టాడు ఓబుళరెడ్డి. దిగుబడిని పెంచేందుకు కృషి చేస్తున్నాడు. మద్యదళారీల్ని నమ్ముకోకుండా నేరుగా మద్రాసు ఫ్యాక్టరీలకు తామే తరలించేందుకు నడుం బిగించాడు. ఎమ్మెల్లే సహాయంతో మార్గాన్ని సుగమం చేసుకొన్నాడు.
   కోర్టు కేసు ఓబుళరెడ్డిని మానసికాందోళనకు గురిచేస్తోంది. కేసు పర్యవసానం ఏమవుతోందనని అలజడి. సాక్షల్ని కొంత వరకు లోబరుచుకొన్నారుగాని పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. పోలీసు సాక్ష్యం కొంత ఇబ్బందికరంగా తయారైంది. అతనికి యస్.పి భరోసా ఇచ్చినట్లుంది... లోంగటం లేదు.
   ఇప్పుడు ప్రభుత్వం మారిందిగదా ! మనవాడే ఎమ్మెల్లే అయ్యాడుగదా !  ఎస్పీ మీద వొత్తిడి తెస్తే ఫలితంముంటుందేమో అనే ఆశ. అందుకే రెండు మూడుసార్లు చెన్నారెడ్డి వద్ద ఆ విషయం ప్రస్తావించాడు.
  అతని చుట్టూ  ఒకటే రద్దీ, ఒకటే కోలాహలం... తన మాటలు అతని చెవిదాకా వెళ్ళనీయట్లేదు జనాలు. చివరకు ఎలాగోలా అతని చెవినేస్తే  " యీరోజే మాట్లాడ్తానోయ్ !  ప్రభుత్వం మనది గదా !  మనమాట ఎందుకినడూ  ? "  అన్నాడు.
  తర్వాత మాట్లాడాడో లేదో తెలీదు.
  పోలీసు సాక్ష్యం కూడా రికార్డయ్యింది.
  బాలుని మీద బాగా నేరం మోపినట్లుంది.
   సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్లేగా బాగా నిల్దొక్కున్నాడు చెన్నారెడ్డి.  తన వర్గం వాళ్ళకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నాడు. ముఖ్యంగా గొడవలున్నచోట ఆయుధాల్నించి మనుషులదాక అందిస్తున్నాడు.
  కొన్ని ఏరియాల్లో రాజకీయం చాలా మార్పులకు గురవుతోంది, పల్లెల్లో చెన్నారెడ్డి వర్గీయుల దాడులు అధికమయ్యాయి. ఇంతదాకా తమదే పైచేయిగా ఆధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళు కాస్తా ఇప్పుడు ఎదురుదెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తోంది. తనవాళ్ళ పట్ల చెన్నారెడ్డి ప్రత్యేక శ్రద్ద కనబరచటం వలన చెలరేగిపోయి ప్రత్యుర్థల్ని లొంగదీయటంలో సఫలీకృతమవుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోడానికి బలమైన పునాదులు వేయిస్తున్నాడు ఎమ్మెల్లే.  ఆ క్రమంలో కొన్నిచోట్ల పెద్ద గొడవలయ్యాయి. పోలీసు కేసులయ్యాయి. ఒకటి రెండు ఖూనీలు కూడ పడ్డాయి.
  కేసుల కోసం టౌనుకొచ్చిన ప్రత్యుర్థుల మీద దాడుల చేయించి భయబ్రాంతుల్ని చేసే కొత్తరకపు చర్యలకు కూడా శ్రీకారం చుట్టాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి. టౌన్‌లోనే సంసారం వుండటం వలన మెరికల్లాంటి మనుషుల్ని తయారుచేసి ప్రత్యుర్థలమీద దాడులకు వినియోగిస్తున్నాడు.
   అతని చర్యల్ని అడ్డుకోనేందుకు మొదట నాగిరెడ్డి వర్గం ప్రయత్నించింది గాని అతని మొరటుదనం ముందు నిలబడలేకపోయింది. టౌనులోని తమ ఆస్తుల్ని పరిరక్షించుకోంటే చాలనే స్థితికి చేరారు వాళ్ళు.
             
                                     *******

    దండోరుపల్లెలో మళ్ళీ గొడవలు.
  ఏరుదాటి వచ్చిన సుబ్బారెడ్డివర్గానికి తాము రక్షణ కల్పించక తప్పటంలేదు.  వాళ్ళ కేసులు కూడా తామే చూడాల్సి వస్తోంది ఓబుళరెడ్డికి.  అది తమకు తప్పనిసరి భాద్యత కూడా.
   నరసింహారెడ్డి విజయవాడలో లా చదవడానికి వెళ్ళాడు. మిగతావాళ్ళు కూడా చదువుల్లో బాగానే ఎక్కిపోతున్నారు.
  దండోరు పల్లెలో గొడవలు మరింత పెరిగాయి.
  ఒకనాటి రాత్రి సుబ్బారెడ్డి వర్గమంతా ఏటికడ్డంగా పారిపోయొ వచ్చి ఓబుళరెడ్డిని శరణుపొందారు.
   కొత్త మనుషల్ని తెచ్చి బాంబులేస్తూ తరుముకున్నాడుట రంగారెడ్డి.  దొరికివుంటే చంపేవాళ్ళట.
  తమకు కూడా బాంబులు కావలన్నాడు సుబ్బారెడి. బాంబింగ్ చేసే మనుషులు కూడా కావాలిట.  సప్లై చేయమన్నాడు. ఎంత ఖర్చయినా భరించుకొంటామని చెప్పాడు.
   ఓబుళరెడ్డి వొప్పుకోలేదు.
  ఖూనీలు చేసి తాము పొందే అనుభవమేమితో స్పష్టంగా తెలుస్తూనే వుంది.  దాని లాభమెంతో అర్థమవుతూ వుంది. తమ వెంట చాలా సార్లు లాయర్ల వద్దకూ కోర్టుల వద్దకూ అతను కూడా తిరిగాడు కాబట్టి యీ అగచాట్లు అతనికి కూడా తెలుసు.
  ఏ క్షణం తీర్పు వెలుబడుతుందో తెలీదు.  వాటి స్వరూపం ఎట్లా వుంటుందో కూడా అర్థం కాలేదు.   లైఫ్ చెప్పినా చెప్పొచ్చు.  క్షణం క్షణం కోర్టు తీర్పును వూహిస్తూ మానసికంగా సగం చచ్చిపోవాలి.
   తమని చూసి జాగ్రత్తపడమని సలహాయిచ్చాడు సుబ్బారెడ్డికి.
  తర్వాత  తనమనుషుల్ని దండోరుపల్లెకు పంపి గ్రామపరిస్థితిని తెలుసుకొన్నాడు.
  గ్రామంలో ఆడవాళ్ళు జోలికి రావటం లేదట. వామిదొడ్లను ( గడ్డితో పెద్ద పెద్దగా వాములు చెయటం =గడ్డివాము), పశువుల్ని, పంటల్ని నాశనం చేసే పనులకు వొడికట్టటం లేదుట.
  పూర్వం నించీ సాంప్రాదాయకంగా వస్తోన్న న్యాయమే అది, ఎంతపెద్ద గొడవలైనా, ఎన్ని ఖూనీలు పడినా ఆడవాళ్ళ జోలికి పోయేదిలేదు. చిన్న పిల్లల్ని ఏమనేదిలేదు. పశువుల్ని చంపటమో, పైర్లూ నాశనం చేయటమో జరగదు. గొడవల్లో కూడా ఒక యుద్దనీతి వుంది.  ఆధిపత్యపోరాటాలో, వ్యక్తిగత కక్షలే కాబట్టి గొడవలు కూడా ఆ పరిధిలోనే వుంటాయి.
  దండోరుపల్లెకు  మద్యవర్తుల్ని పంపాడు ఓబుళరెడ్డి. కొత్తవాళ్ళను తెచ్చుకొని దాడులు చేయించటం మంచిపద్దతి కాదనీ, గతంలో ఒకసారి తమవూరికి కొత్త మనుషుల్ని పంపి ఎట్లా భంగపడ్డారో గుర్తు చేసుకొమ్మనీ, పద్దతి మార్చుకోకపోతే తాము కూడా మనుషుల్ని పంపించవలసి వస్తుందనీ ఘాటుగా చెప్పించాడు.
    తర్వాత నాలుగు రోజులకే గొడవ సద్దుమణిగింది గాని పదిరోజుల తర్వాత సుబ్బారెడ్డి మళ్ళీ వచ్చాడు.
   " మామా !  రంగారెడ్డి గాన్ని నమ్మలేకుండాము.  వాడు లోపల్లోపల యేందో సేస్తాండాడు. కొత్తమాసుల అలికిడి తగ్గలేదు.  రాత్రిల్లు  మావోల్లు ఇండ్లల్లోంచి బైటికి రావాలంటే భయపడ్తాండారు.  ఎప్పుడేం జరుగుతదో అంతుబట్టడంలే... యీధిల్లోకి రాడానికిగ్గూడా బయపడ్తాండం.. యీ సావు మేం సావలేం మామా ! యీ బాధ తట్టుకోలేం..  వాన్ని బేసెయ్యకుంటే మాకు నిద్దర్రాదు... "  చెప్పాడు.
    అతనికేసి తదేకంగా చూశాడు ఓబుళరెడ్డి.
  "  ఎమ్మెల్లేతో ఒక్క మాట సెప్పరాదా ! "  అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు.
  నొసలు ముడేస్తూ  " ఏమని ? " అడిగాడు ఓబుళరెడ్డి.
  " మనుషులను పంపమను వాల్లకు నేనే లెక్కించుకుంటా. రంగారెడ్డిగాన్ని బేసి పోతారు ( వేసేసిపోతారు).... మాకా పీడ తప్పించు మామా  ! "
   ఆశ్చర్యంగా అతని కేసి చూశాడు.
  " ఎమ్మేల్లేకాడ లెక్కల్దీసుకొని  ఖూనీల్జేసే మనుషులుండారా  ? "  అన్నాడు
  ఇప్పుడు ఆశ్చర్యపోవటం  సుబ్బారెడ్డి వంతయింది.
   " ఏమి ఎరగనట్టు మాట్లాడ్తావేంది మామా  !  మెరికల్లాంటి మనుసులుండారు.  ఆయప్ప మాసుల్ని తెచ్చుకుంటే పోలీసు కేసులకు కూడా సాయం జేస్చాడు.. "
  మారు పలకలేదు ఓబుళరెడ్డి.
  అతనికి నోరు పెగల్లేదు.
  చెన్నారెడ్డి తన వర్గీయులకు మాట సాయం, మంది సాయం చేస్తాడని తెలుసుగాని. కిరాయికి ఖూనీలు చేయించే పనిపెట్టుకొన్నాడని వినలేదు.  అట్లాంటి  ఆలొచన చెన్నారెడ్డికి వస్తుందని కూడ వూహించలేదు.
   " నేన్జెప్పింది మర్చిపోగాకు మామా ! "  అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళాడు సుబ్బారెడ్డి.
  అతని అభియోగం నమ్మదగినదిగా అన్పించలేదు ఓబుళరెడ్డికి. కమ్యూనిస్టులతో సంబంధాలున్నవాడు, కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడు.. అలాంటి నీచస్థాయికి దిగజారతాడని అతను భావించటం లేదు.
    అందుకే సుబ్బారెడ్డి కోరికను, దాన్ని తీర్చుకొనేందుకు అతను సూచించిన మార్గాన్నీ స్మృతినుంచి తప్పించేశాడు.

                                              *****

       వర్షాకాలం వచ్చింది.
  వానదేవుడు కొంత కరుణించనట్లుంది.
  సగిలేరు పొంగి ప్రవహిస్తోంది
  ఇలాంటి సమయంలోనే దండోరుపల్లెల్లో గొడవలు రాజుకొనేది, బైటి ప్రపంచంతో సంబంధాలు తెగినపుడు రంగారెడ్డి విజృంభిస్తాడు.  అవతలి వర్గం మీద యుద్దం ప్రకటిస్తాడు. ఇరువర్గాలూ మిద్దెల మీద బండ్లకొద్దీ రాళ్ళు పోసుకొంటారు. చేతులు నొప్పి పుట్టేదాక విసురుకొంటారు, అవకాశమొస్తే కర్రలతో తలలు పగులగొట్టుకొంటారు. ఏరు తగ్గేదాక సరైన వైద్య సహాయం కూడా వుండదు.
  రాళ్ళ యుద్దంలో ఆడవాళ్ళు, పిల్లలు కూడా పాలుపంచుకొంటారు.  ఆడవాళ్ళు రాళ్ళు విసరటంలో సాయం చేస్తుంటారు, మగపిల్లలు తమ తండ్రుల తోటి తాము హుషారుగా రాళ్ళు విసురుతారు.
  ఆ నాలుగు రోజులూ మగాళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతారు,  అవతలి వాళ్ళ చేల మద్య తమ చేలున్నపుడు ఇంటి ఇల్లాల్లే కూలీల సాయంతో వ్యవసాయం చేయిస్తుంటారు.
  వ్యవసాయి పనుల్ని ఎవ్వరూ అడ్డుకొనేది లేదు.
  ఏటి చెలిమల్లో నీల్లు కూడా వంతుల వారీగా తెచ్చుకొంటారు.
వారం రోజులైనా ఏటి ఉరవడి తగ్గలేదు
  దండోరుపల్లె వాల్ల ఆచూకి తెలియలేదు.
  మాటల సందర్భంలో వాళ్ళ ప్రస్తావన వచ్చినపుడు ఆందోళన ప్రకటించాడు ఓబుళరెడ్డి.
  క్రమేణా ఏటి ఉరవడి తగ్గింది
  వాటం తెలిసిన మనిషి ఏటిని దాటగలుగుతున్నాడు.
  ఆ తరుణంలోనే ఏటి అవతల్నించి నలుగురు మనుషులు జట్టుగా కూడి వచ్చారు.
  వాళ్ళు అందించిన తొలిసమాచారం ’ సుబ్బారెడ్డిని పోలీసులు తీసుకెళ్ళారట ! ’
  " ఎందుకూ  ? "  పెద్దిరెడ్డి కంఠంలో ఆదుర్దా.
 " మీకింగా తెల్దా ? రంగారెడ్డి ఖూనీ అయ్యిన్లే ! "
 విన్నవాళ్ళంతా నమ్మలేనట్టుగా చూశారు.
  " బద్వేలు పోయిన్నెడంట  ఆడేం జరిగిందో ఏమో ! ..లాడ్జి కాన్నే నరికినారంట.  మీకు తెల్సింటాదనే అనుకున్నెం "
  " ఎప్పుడు రా ? "
  " రేత్రేనంట పెద్దయ్యా ! "
  ఓబుళరెడ్డి ప్రయాణమయ్యాడు
  " మాగ్గూడకా  యీ పొద్దున్నే తెల్సింది పోలీసోల్లొచ్చి సుబ్బారెడ్డి యింటి కాడికి పోయినాంకనే "
  ఓబుళరెడ్డికి నమ్మశక్యం కాలేదు.
  సుబ్బారెడ్డికి తెలీకుండా రంగారెడ్డి ఖూనీగావటం అసంబద్దమైన విషయంగా తోచింది.  కూలికి ఖూనీ చేసే వాళ్ళగురించి  తన్నతను అడిగిన విషయం కూడా గుర్తుకొచ్చింది.
  జనాన్ని వెంటేసుకొని పోరుమామిళ్ళ చేరాడు.  పోలీసు స్టేషన్‌కు వెళ్ళి సుబ్బారెడ్డిని కలిశాడు.
  స్టేషన్‌లో విచారిస్తే అతనిమీద ఇంకా కేసు బుక్ చేయలేదని తెలిసింది. ఎంక్వయిరీ చేస్తున్నారట.
  బద్వేల్ వెళ్ళి లాయర్‌ను కలిశాడు.
  అతనితో చాలా సేపు మాట్లాడి ఎమ్మెల్లేకు ఫోన్ చేయించాడు.  ఊల్లో లేడుట ఎమ్మెల్లే.
 సాయింత్రానికి గాని రాలేదు అతను
  విషయం వినగానే  "  అదెట్లా ? అతనికేం సంబంధముందనీ అరెస్ట్ చేస్తారు..?  ఖూనీ జరిగింది ఎక్కడో  ?  చంపింది ఎవురో ?  ఆ టైంలో అతను ఇంటికాన్నే వున్నేడుగదా..!  పోదాం  పా.. ఆ ఎస్సై సంగతెందో తేలుస్తా.. "  అంటూ జీపును బయటకు తీయించాడు.
  అంతా చూసినట్లు మాట్లాడుతున్నాడు చెన్నారెడ్డి.
  తను అభ్యర్థించకముందే  కేసుపట్ల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఓబుళరెడ్డికి ఆశ్చర్యంగా వుంది.
   పోరుమామిళ్ళ పోలీసు స్టేషన్లో ఎస్సైని దబాయించాడు చెన్నారెడ్డి. తన ఎమ్మెల్లే ప్రతాపాన్నంతా చూపించాడు. ఇప్పుడే హోం మినిస్టర్‌తో ఫోన్ చేయిస్తానన్నాడు.  సాక్ష్యాలుంటే నిరభ్యంతరంగా అరెస్ట్ చేయమన్నాడు.  టౌన్ వాళ్ళతో ఏవో గొడవలవల్ల రంగారెడ్డి ఖూనీ చేయబడ్డాడేగాని .. సుబ్బారెడ్డికి కేసుకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు.
  డి ఎస్పీ వచ్చి సర్ది చెబితేగాని వినుకోలేదు చెన్నారెడ్డి.
  ఎంక్వయిరీ చేస్తున్నామనీ, సుబ్బారెడ్డి నిర్దోషిగా నిరూపణ అయితే వదిలేస్తామని చెప్పాడు డి ఎస్పీ.
  బైట కొచ్చిన తర్వాత ఓబుళరెడ్డికి చెప్పాడు  "  పోలీసులకు కొంత ఎక్కువ మొత్తమే ముట్టజెప్పమని "
  తర్వాత పోలీసులకు అందవలసిన డబ్బు అందింది.
  సుబ్బారెడ్డి తోటి మరో నలుగురిమీద కేసు రిజస్టరయ్యింది.  బేయిలబుల్ సెక్షన్స్ కాబటి సులభంగానే బైటకొచ్చారు వాళ్ళు.

                                *****

    ఒక రోజు శివపురికి వెళ్ళాడు సుబ్బారెడ్డి. అత్యంత రహస్యంగా ఓబుళరెడ్డి చెవిలో అసలు రహస్యం వూదాడు. చెన్నారెడ్డి మనుషులేనట రంగారెడ్డిని ఖూనీ చేసింది. చింతకుంట గొల్లలు యిలాంటి విషయాల్లో ఆరితేరారుట. వాళ్ళనే పంపాడట.  వారం రోజుల ముందే వాళ్ళకు తను రంగారెడ్డిని చూపించాడుట. ఇరువై ఐదువేల రూపాయల వొప్పందమట.
  మనస్సు వికలమైంది ఓబుళరెడ్డికి
   అన్న వద్దకెళ్ళి సంగతి చెప్పగానే ఆయనకూడా నొచ్చుకున్నాడు. చెన్నారెడ్డి అలాంటి పనులు చేయిస్తున్నాడంటే మనస్సులో ఓ వైపు నమ్మకం కలుగటం లేదుగాని  వాస్తవాన్ని ఎట్లా కాదనగలరు..?
  మరో నెల తర్వాత సుబ్బారెడ్డి వచ్చి కలిశాడు.
  " ఎట్లా జెయ్యాల మామా ? "  అన్నాడు దిగాలుగా
  విషయమేదో చెప్పమన్నట్లుగా అతనికేసి చూశాడు ఓబుళరెడ్డి.  కొంతసేపు తటపటాయించి తర్వాత తలెత్తాడు సుబ్బారెడ్డి. " ఒప్పందం సేసుకొన్నెనా ! ఇరువై ఐదువేలు ఎత్తకపోయి ఎమ్మెల్లేకిచ్చినా  పనేమో జరిగిందిగాని  యవ్వారం రోంత తిరగడ కొచ్చింది "
  ఓబుళరెడ్డి చూస్తూనే వున్నాడు.
  " మొన్న మల్లా వొచ్చినారు చింతకుంట మాసులు.. ఇది నాలుగోసారి రావడం... లెక్కకొచ్చినారు. ఐదువేలు ముట్టిందంట..ఇరువైవేలు బ్యాలెన్స్ రావాలట. ఎమ్మెల్లేకు లెక్కంతా యిచ్చినానని కూడా చెప్పలేదు  ఏమి యిబ్బందోనని నే్నేమో ఎమ్మెల్లేను అడగలేకుండా. పోనీ అడగనీకి దొమ్మల్లేవు..."
  " అయితే నన్నేం జెయ్యమంటావు ? "  అన్నట్లుగా చూశాడు.
  " ఎమ్మెల్లేకు సెప్పి ఆ లెక్క వాల్లకిప్పీ మామా  !  "  బేలమొహంతో అడిగాడు.
   సుబ్బారెడ్డి కేసి ఎగాదిగా చూశాడు ఓబుళరెడ్డి.
   తర్వాత ఓ నిట్టూర్పు నిగిడించి " నేను మద్యవర్తిని కాదు కదా..ఎట్లా చెప్పాల  ? "  అన్నాడు
   " మామా  !... మామా  ! "  ప్రాధేయపడ్డాడు.
   " చూడోయ్  !"  గొంతు గంభీరమైంది ఓబుళరెడ్డికి  " మీ వూరి నీటిబ్బందులుంటే చెప్పు నేనొస్తా ! పోలీసు కేసులుంటే చెప్పి పంపు.. చేసిపెడతా. పూచికత్తు యిచ్చి బెయిలు తెప్పిస్తా... ఖర్చులకు చాలకుందని అడుగు లెక్క తెచ్చిస్తా... మీ గుంపంతా వొచ్చినా మూడోకంటికి తెలీకుండా నెలల గాలాలు సాకుతా... అంతేగాని యిట్లాంటి బ్రోకర్ పనులు నాసేయను నాకు చేతగాదు. నాకు చెప్పగాకు... నువ్వు మాట్లాడుకొనేప్పుడు నేను లేను కదా..? పని చేయించుకొనేప్పుడు లేను.. లెక్కలిచ్చేప్పుడు నేను లేను.. మద్యలో నన్నెందుకు యిరికిస్తావు  ? "  అన్నాడు.
  మరింకేమి మాట్లాడలేదు  సుబారెడ్డి.
   ఓబుళరెడ్డికి తెలీకుండా పనిచేయించటం తప్పే. తెలిస్తే వొప్పుకోడని భయపడ్డాడు తను. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుందనుకొన్నాడు.  వ్యవహారం మడత బడింది. మరోసారి డబ్బులివ్వటం తప్ప గత్యంతరం కన్పించటం లేదు.
   ఓబుళరెడ్డి మనసు కలతగా వుంది
  చెన్నారెడ్డి చర్యపట్ల అసహ్యం కలుగుతోంది.
  అతని పట్ల అంతరాంతరాళల్లో ఏదో అపనమ్మకం. మరేదో అవిశ్వాసం.  తన భావాల్ని అన్నతో పంచుకొన్నాడు.
  ఆయన కూడా తనలాగే స్పందించాడు.
   ఎమ్మెల్లే అయింతర్వాత క్రమేనా అతను నైతిక విలువలు కోల్పోతూ వుండటం పట్ల బాధ పడ్డారు ఇద్దరు.
      వారం రోజుల తర్వాత ఓ పెళ్ళిలో చెన్నారెడ్డిని కలవటం తటస్థించింది ఓబుళరెడ్డికి.  అతన్ని పక్కకు పిల్చి తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. ఇలాంటి చర్యలు మంచివి కావంటూ తన అబిప్రాయన్ని నిర్మొహమాటంగా వెలిబుచ్చాడు.
   కొద్ది క్షణాల మౌనం తర్వాత చెన్నారెడ్డి అన్నాడు  "  తప్పదోయి దొరా  ! మనవాళ్ళు దెబ్బతింటావుంటే సూస్తా వూరకుండలేం గదా ! "
  " అభిమానం కొద్దీ సహాయం చేయటం వేరు .."
   ఎంతమంది మీద అభిమానం చూపగలం  ? "
  " ఏమైనా....  నువ్వు చేసేది  తప్పే .."
  " తప్పంటే ఎట్లా ? గతాన్ని గుర్తుజేసుకో... నువ్వు మాత్రం  పిల్చుకోలేదా బాంబులేసే మనుషుల్ని  !  గొడవలు జరిగి బాంబులేసికోనుంటే వాల్లు ఖాయంగా  ఎవురోకర్ని బేసి పోయేవాల్లేగద  !  "
   ఓబుళరెడ్డికి కోపమొచ్చింది.  " వాల్లకు వీల్లకు ఏం సంబంధం..?  వీల్లట్లా వాళ్ళు మాసుల్ను  సంపేందుకు రాలేదు. తోడొచ్చినారు ".
   " అంతా  అదేలే దొరా ! ఎందుకు రట్టు జేస్తావుగానీ. నేనేం జేసినా మనోల్లకే మేలు జేస్చాండగదా  ! నా దారిన నన్ను సాగనీ. గుంపు నిలుపుకోవాలంటే కొన్ని కొన్ని యిష్టం లేని పనులు గూడా చేయక తప్పదు మరి.  శ్రీ క్రిష్ణ భగవానునికే తప్పలేదంట....  రా..రా....రా  "   అంటూ జనంలోకి లాక్కుపోయాడు.
  చెన్నారెడ్డిలో  కొత్త వ్యక్తి  కన్పించసాగడు ఓబుళరెడ్డికి.

                                                                                                  ..............  సశేషం

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs