.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

      డబుల్ మర్డర్ సంఘటన సంచనలనం సృష్టించింది.
  వంకల్లోనో, డొంకల్లోనో దారికాచి చంపటమో, రాత్రిళ్ళు నిద్రబోయేవాళ్ళను నరకటమో కాకుండా పట్ట పగలు ప్రధాన రహదారి మీద పోలీసు సాక్ష్యంగా యుద్దవాతావరణాన్ని తలపిస్తూ కొట్లాడిన తీరు అంతటా చర్చనీయాంశమైంది.
   ఉన్నట్టుండి శివపురి ఓబుళరెడ్డి వార్తల్లోని వ్యక్తి అయ్యాడు
  టెర్రర్ సృష్టించిన మనిషిగా ముద్రబడిపోయాడు
  డబుల్ మర్డర్ కేసు దాదాపు నలభై ఐదుమంది మీద మోపబడింది.  వాళ్ళందర్నీ వెంటేసుకొని పోలీస్‌స్టేషన్‌కూ, కోర్టులకూ వెళ్ళి వస్తున్నాడు ఓబుళరెడ్డి
  ముందు భాగాన అతను నడుస్తోంటే  వెనక అతని గుంపంతా అనుసరిస్తూ వుండటం చూసే వాళ్ళకు కొంత భయాన్ని కలిగిస్తూవుంది. ఎవరూ చెప్పకుండానే, ఎన్నుకోకుండానే అతనొక ముఠానాయుకునిగా జనాల్లో ముద్రబడిపోయాడు.
  రోజు రోజుకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి.
  పోలీసులకూ, కోర్టులకే కాకుండా జనాల ఖర్చు తడిసి మోపెడువుతోంది.  హోటల్ ఖర్చులు, బస్సు చార్జీలు భయపెడుతున్నాయి. కోర్టు వాయిదా వచ్చిందంటే చాలు వెన్నులో చలిపుడుతోంది.
  గ్రామంలో వైరి వర్గం దాదాపు సమిసిపోయింది.
  వ్యతిరేకులంతా వూరు విడిచారు.
  నారమ్మ తన స్థావరాన్ని పూర్తిగా కూతురి యింటికి మార్చింది.
  ఓబుళరెడ్డి పిండిగని నారమ్మ చేలోకి చొచ్చుకుపోయింది,  వాళ్ళిచ్చిన తృణమో ఫణమో తీసుకొని పొలం వాళ్ళకు రాసివ్వటం తప్ప గత్యంతరం లేని స్థితి వచ్చింది ఆమెకు.
  ఊరువదిలి  వెళ్ళిన చాలా మంది పొలాలు తక్కువ రేట్లకే ఓబుళరెడ్డి వర్గానికి దక్కాయి.
  ఓ సంవత్సరం గడిచేసరికి చుట్టుపట్ల పంచాయితీల్లో ఓబుళరెడ్డి మాటకు ఎదురులేకుండా పోయింది.
   కేసు రోజు రోజుకు జటిలమయ్యేకొద్దీ అతని పలుకుబడి పెరగసాగింది
  మరో ఆరునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
  ప్రస్తుత ఎమ్మేల్లే మీద జనాల్లో అసంతృప్తివుంది. జమీందారీ వంశానికి చెందిన ఆ వ్యక్తి ప్రజల సమస్యలని పట్టించుకోవటం లేదనీ, ధనవంతుల కొమ్ము కాస్తున్నాడనీ అపవాదు వుంది.
  అలాగని అతనితో పోటీకి దిగే దమ్మున్న మొనగాడు కూడ ఆ  తాలుకాలో కన్పించటం లేదు.
  అలాంటి తరుణంలో ఒకనాటి సాయింత్రం సమితిప్రెసిడెంటు చింతకుంట చెన్నారెడ్డి శివపురికి వచ్చాడు. వెంట టేకూరుకు చెందిన కమ్యూనిస్టు నాయకుడొకరున్నారు.
  రావటం తోటే ఓబుళరెడ్డినీ, పెద్దిరెడ్డినీ పక్కకు పిల్చుకొని మంతనాలాడే పని చేయలేదు. పరుపు పరచిన మంచమ్మీద కాళ్ళు బార్లా చాపి వెల్లకిలా పడుకొన్నాడు.  " సల్లగా వుంది మామా ! కండ్లు మూసుకొంటే చెప్పందే నిద్రబట్టేట్టుంది "  అన్నాడు పక్కనే వున్న పెద్దిరెడ్డితో.
  "  లోపల కలవరం లేకుంటే సల్లదనం సుగించినట్టే వుంటదోయ్ ! రెండు కాల్లు  వొక్కసోట బెట్టి నిలబడేంత కుదురుదనం వుండాల గద ! ఎప్పుడూ కేసులూ.. వాయిదాలూ....  వాయిదా వస్తాందంటే సాలు బయమేస్తాందోయ్ దొరా ! "  చెప్పాడు పెద్దిరెడ్డి.
  " తప్పదే పెద్దమనిసీ !  అవన్నీ భరిస్తేనే గద నాయుకుడయ్యేది,  మొన్న రొవ్వంత ( కొద్దిగా)  పన్జరగబట్టి గాదూ - సుట్టు పక్కల పల్లెలకంతా మొగోల్లయింది మీరు "
  " అది జరక్కున్నే మొగోల్లమేలే.. "  ఇంట్లోంచి వస్తూ అన్నాడు ఓబుళరెడ్డి.
  " సరె...సరేలే... "  అంటూ చెన్నారెడ్డి రాగం తీయటంతో నవ్వుకున్నారు అందరూ.
  అంతలొ కాఫీ వొచ్చింది.
  గ్లాసు అందుకొంటూ  " ఉడుకు నీల్లతోనే సరిపెట్టాలనుకొన్నావాందోయ్ ? "  ఓబుళరెడ్డి కేసి చూస్తూ అన్నాడు చెన్నారెడ్డి
  " ఏం గావాలో సెప్పుమరి... "
   " సెప్పాల్నా మల్లా.... వొచ్చి మంచమ్మీంద పండుకొన్నేమంటే కోల్లు కోయ్యాలనె తెల్దా ? అల్లుండ్లకు యివేనా మర్యాదలు.."  అన్నాడు.
   " నీకింత తీరుబాటొచ్చిందని నాకేం తెలుసు దొరా  "  పెద్దిరెడ్డి అన్నాడు.
  వాల్లు పరాచికాలు ఆడుకొంటూ వుండగానే కోడిపుంజు అరుపులు విన్పించాయి.  చావుకేకలు వేస్తుంది అది.
  అటుకేసి చూసే సరికి తుంటకర్ర విసరి పుంజు కాళ్ళు విరగగొట్టి దాన్ని వొడిసి పట్టుకొని తెస్తున్నాడు బాలుడు.
  "  అదీ.. అల్లుడంటే  అట్లుండాల... "  మెచ్చుకోలుగా చూశాడు.
ఉడికుడుకు అన్నమూ కోడిమాంసముతో రాత్రి భోజనం రుచికరంగా ముగిసింది.
  చెప్పాపెట్టకుండా చెన్నారెడ్డి వూడిపడటం, రాత్రికి తమయింటివద్దే మకాం  చేయటం కొంత అయోమయంగానే వుంది పెద్దిరెడ్డికి.
  భోజనానంతరం తాంబూలాలు నములుతూ అతని అయోమయానికి తెరదీశాడు చెన్నారెడ్డి.
    " తాలుకా రాజకీయం మీకు తెలియందిగాదు. ఇప్పుడుండే ఎమ్మెల్లే నాగిరెడ్డి ఎవ్వరికీ పలకడం లేదు, పల్లెలకేమీ సాయం సెయ్యడం లేదు. ఆయప్ప ఫ్యాక్టరీలూ, గనులూ..బస్సులూ..లారీలూ.. ఆదాయం.. అదితప్ప తాలుకా జనం బాగోగులు పట్టలేదు. ఆయప్పకు ఓట్లు గుద్ది పోసేందుకు మనం మనం పల్లెల్లో కొట్లాడుకొని సస్తాండం. ఆయప్ప మనకేసులు పట్టించుకోవడం లేదు... యీ సంగతి గురించి మాట్లాడ్డానికే వొచ్చినా మామా  ! "  చెప్పాడు.
   తర్వాత కమ్యూనిస్టు నాయకుడు గొంతువిప్పాడు తాలుకా పరిస్థితి గురించి వివరించాడు. పల్లెజనాల అగచాట్లు గురించి ఏకరువు పెట్టాడు. అసమ్మతితో వుండే గ్రామనాయకుల బలాబలాలు బేరీజు వేశాడు. అందరూ కలిసి ప్రజల కష్టాలు తెలిసిన మనిషినొకన్ని అసెంబ్లీకి నిలబెట్టి నాగిరెడ్డి నాయికత్వాన్ని కూలదోయవలసిన అవశ్యకతను నొక్కి చెప్పాడు.
   తమ అభ్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలన్నదే ఇప్పటి ప్రశ్న.
  " మీరు మీరు ఆలోచించండి నాయనా ! "  పెద్దిరెడ్డి అన్నాడు.
  " పరిస్థితి అట్లా లేదయ్యా ! "  చెప్పాడు కమ్యూనిస్టు వ్యక్తి.
  " మీరు ఎవరి పేరు ప్రతిపాదించితే వాళ్ళే అభ్యర్థి  అందులో సందేహమే లేదు...."
  తర్వాత కొంతసేపు తర్జన భర్జన పడ్డారు.
  నిశితంగా చర్చించిన తదుపరి... చెన్నారెడ్డిని అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిగా  తాను ప్రతిపాదించన్నట్లుగా  "  ఓబుళరెడ్డి ప్రకటించాడు.
  తాలుకా స్థాయి జరిగే సమావేశంలో అదే గొంతుకతో ప్రతిధ్వనించాలని కూడా తీర్మానించుకొన్నారు.
  మరో వారం రొజులకు బద్వేలులో తాలుకా స్థాయి సమావేశం జరిగింది.
  అనుకొన్నట్లే చెన్నారెడ్డి పేరును అసెంబ్లీ అభ్యర్థిగా ఓబుళరెడ్డి ప్రతిపాదించాడు. సభ్యులంతా ఏకగ్రీవంగా అమోదించాదు.
  ఓబుళరెడ్డి భుజస్కంధాలపై అదనపు భారం పడింది.
  గతంలో లాగా ఎలక్షన్లు చేసేదానికి లేదు
  ఈ దఫా సర్వశక్తులూ వినియోగించాలి.
  అవసరమైతే నెత్తురు పూసికొని చేయాల్సివుంటుంది, మొక్కుబడిగా తన వూర్లో తాను ఓటింగు జరిపించటం కాదు - తన బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళున్న చోటల్లా పాగావేయాలి, ఏమేరకు అవకాశముందో లెఖ్కగట్టాలి, పూర్తిస్థాయిలో ప్రయత్నించి చెన్నారెడ్డికి ఓట్ల రాసుల్ని పెంచాలి.
  ప్రాంతీయ పార్టీ అధ్యక్షుణ్ని కలిసాడు చెన్నారెడ్డి.
  బలమైనా నేతల చేత కూడా చెప్పించాడుట
  రాష్ట్రంలో స్వాంతంత్ర్యానంతరం నుండి పాతుకుపోయిన జాతీయపార్టీని ఆటకట్టించే దమ్ము ప్రస్తుతం ప్రాంతీయ పార్టీకే వుంది.
   నామినేషన్ల పర్వానికి పదిహేను రోజుల ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి అన్ని పార్టీలు.
  చెన్నారెడ్డికి ప్రాంతీయ పార్టీ టికెట్ రావటం చర్చనీయాంశమైంది తాలుకా ప్రజల్లో.
  నామినేషన్‌రోజు  బద్వేలు టౌనంతటికీ పెద్ద జాతరవాతావరణం కల్పించాడు చెన్నారెడ్డి.
  తాలుకా నలుమూలల్నించి తన అభిమానులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకొన్నాడు.
  శివపురి ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన జనమే టౌనంతా ఆక్రమించారు,  అన్ని ప్రాంతాలనించి వచ్చిన వాళ్ళు సగం మందుంటే..ఓబుళరెడ్డి మనుషులు సగం మంది వున్నారు.
  చెన్నారెడ్డి చాలా ఆనందించాడు. ఓబుళరెడ్డి వద్దకెళ్ళి  "  ఓహ్  మామా ! ఎలక్షనంతా నీదేనోయ్ ! నేను గెల్చినా ఓడినా ఆఘనత నీకే..."  అన్నాడు అతని చేతులు పట్టుకొని ఆర్ద్రంగా.
  ఓబుళరెడ్డికి మరింత భారం తలపై పడింది.
  రాత్రనక పగలనక పల్లెలు తిరగసాగాడు. ప్రత్యుర్థులుగా వున్న వాళ్ళను తమవైపుకు మల్లించుకొనేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నాడు,  తన బంధువుల్ని వెంటేసుకొని ప్రత్యర్థి వర్గంలోని తమ వాళ్ళను తన వర్గంలోకి చేర్చుకొనేందుకు సర్వశక్తులు వొడ్డి కృషి చేయసాగాడు.
  ఏవూరికైతే వెళ్ళాలనుకొంటాడో, ఆ వూర్లో ఎవరినైతే తన వైపుకు లాగాలని ప్రయత్నం చేయబోతున్నాడో  అ వ్యక్తి తాలుకా బంధువుల వివరాలు సేకరించటం, వాళ్ళను పిల్చుకొని అందరూ కలిసి ఆ వూరికి వెళ్ళటం,  జారిపోయేందుకు సాద్యం కాని విధంగా వలపన్నటం, ఒకరోజు కాకుంటే వారంరోజులైనా అతని వద్దకు తిరిగి తెల్లార్లూ మేలుకొని పంచకాసి అయినా అతని మనసు కరిగించి పార్టీలోకి రప్పించుకోవటం...డబ్బుకు లొంగే వాళ్ళకు ఏదోక ఆశ చూపటం, కేసులు వగైరాలున్నవాళ్ళను ఆదుకుంటామని నమ్మకంగా వరమివ్వటమో, అంతుచూస్తామని చెదిరించటమో..ఎన్నిరకాల వ్యూహాలున్నాయో అన్నింటిని ప్రయోగించి రాక్షసంగా కృషి చేయసాగాడు.
  ఓబుళరెడ్డి ..చెన్నారెడ్డి ప్రమేయం లేకుండా తన స్వంతంగానే వర్గాన్ని సమీకరించాడు.  తన వూరికి దగ్గరగా ఐదరు వూర్లు ఏకపక్షమయ్యాయి, మిగిలిన పదిహేను వూర్లల్లో మెజారిటి శాతం తమదే ఐంది. తన పరిధిని ఇంకా విసృతం చేసుకొంటున్నాడు అతను.
  ఓబుళరెడ్డి పర్యటించే గ్రామల్లో తను కాలుబెట్టాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిపోయింది చెన్నారెడ్డికి. దాంతో అతను తాలుకాలోని మిగతా ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టేందకు వీలు కలిగింది.  అవతలి వర్గం వాళ్ళను బలహీన పరిచేందుకు నీతి, న్యాయం, ధర్మంలనే పదాలకు అతీతంగా కూడా కృషిచేశాడు.
  ఎలక్షన్ దగ్గరబడింది.
  బలమైన వర్గంతో తను ఢీకొనబోతున్నాడు కాబట్టి అక్రమ మార్గాల్ని అనుసరించటానికి కూడా వెనుదీయలేదు చెన్నారెడ్డి.
  విస్తృతంగా నాటుబాంబులు తయారు చేయించాడు.
  అవసరమైనా చోటల్లా ప్రయోగించమని ప్రోత్సాహించాడు.
  ఓబుళరెడ్డి  వద్దంటోన్నా  వినకుండా  అత్మరక్షణకైనా కావాలిగదా అనే సాకుతో అతని ఏరియాకు కూడా సప్లై చేశాడు.
  ఎలక్షన్ రోజున ఓబుళరెడ్డి విజృంభించాడు.
  తన వాళ్ళను వెంటేసుకొని పల్లె పల్లె తిరిగాడు. అవతలి వర్గంవాళ్ళకు ఏజంట్లు కూడ లేని ఐదుపల్లెల్లో తోంభైశాతం పైగా ఓట్లు గుద్దేశాడు.
  ప్రత్యర్థి ఏజంట్లు వున్న వూర్లల్లో సైతం మద్యాహం నించి హుషారు చేశాడు. నయాన్నో భయాన్నో ఏజంట్లను వొప్పించి మిగిలిన వోట్లన్నీ చెన్నారెడ్డికి వేయించాడు.
  చెన్నారెడ్డి విషయమైతే చెప్పాల్సిన పనిలేదు.
  తెల్లవారు జామునే లేచాడు.
  భార్యచేత  వీరతిలకం దిద్దించుకొని గోచికట్టుకొని జీపులో కూచున్నాడు.
  సాయింత్రం ఏడుగంటల దాక గోచి విప్పలేదు.
  అవకాశమున్న చోటల్లా బూతుల్లో జొరబడి ప్రత్యర్థి ఏజంట్లను బైటకు లాగి రిగ్గింగ్ చేస్తూ పోయాడు.
  నాగిరెడ్డి కూడా తక్కువ తినలేదు.
  చెన్నారెడ్డి రిగ్ చేసిన బూతులన్నిట్లో జొరబడి బ్యాలెట్ బాక్సుల్ని బావుల్లో వేయటమో, ఇంకు, నీళ్ళు పోయటమో చేస్తూపోయాడు. సాయింత్రం దాకా ఒకరి ప్రయత్నాల్ని మరొకరు అడ్డుకోవటం, హుషారు చేసుకోవటం జరిగిపోయింది.
  ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిన బూతులన్నిట్లో భారీ బందోబస్తు మద్య రీ ఎలక్షన్ జరిగింది.  ఓబుళరెడ్డి ఏరియా తప్ప తాలుకా సాంతం సమస్యాత్మకమే అయ్యింది.
  పోలింగ్, రీపోలింగ్ రెండు సార్లు కూడా భారీగా బాంబులు పగిలాయి. చెన్నారెడ్డి అయితే ఆహారం నీళ్ళు కూడా మరచిపోయి సాయింత్రం దాకా వీర విహారం చేశాడు.
  అతనికి తృప్తిగా వుంది.
  నాగిరెడ్డి అనుభవం ముందు వూడలు దిగిన అతని రాజకీయం ముందు తను సరిజోడిగా నిలిచాడు. ఇక తనకు మిగిలింది ఓబుళరెడ్డి కృషి. అతని ఓట్లతో తను నిస్సందేహంగా గెలువగలడు.
  ఈ  ఎలక్షన్లతో బద్వేలు పేరు రాష్ట్ర ప్రజలందరీ నోట్లో నానింది. పగిలిన బాంబులు, జరిగిన గొడవలు, అత్యధిక సంఖ్యా బూతుల్లో రీపోలింగ్‌తో ప్రత్యేక స్థానం సంపాదించింది.
  చెన్నారెడ్డి, ఓబుళరెడ్డిల చేతి కష్టం వృధాకాలేదు.
  నాగిరెడ్డి పైనా 15 వేల మెజారిటితో గెలుపొందాడు, అందులో దాదాపుగా తొమ్మిదివేల ఓట్లు ఓబుళరెడ్డి గుద్ది పోసినవే.
  పల్లెపల్లెనా సంబరాలు..పండుగ వాతావరణాలు... ఊడలు బాతు అవినీతి రాజకీయానికి సమాధి....కొత్త నాయకత్వం మీద ఎన్నో ఆశలు...  ఒక మామూలు వ్యక్తి ఎమ్మేల్లేగా గెలవటం పట్ల ఎన్నెన్నో ఆశలతో కూడుకొన్న సంబరాలు,  రాక్షస సంహారం జరిగినంత ఆహ్లాదక సంబరాలు.
  తాలూకాలో పాతశకం అంతరించింది.
  కొత్తశకం ప్రారంభమైంది.
  మరోసారి ఓబుళరెడ్డి యింటికెళ్ళాడు చెన్నారెడ్డి.
  ఈ దఫా ఎమ్మెల్లే హోదాతో వెళ్ళాడు.
  తను గెలవటానికి ప్రధాన కారణం అతనేననీ, యీ ఎమ్మేల్లే పదవి అతని కృషి పలితమేననీ మనసారా ప్రకటించాడు.
  చెన్నారెడ్డి తమ వూరికి వచ్చిన సందర్భంగా పొట్టేళ్ళు కోయించి అందరికీ విందు చేశాడు ఓబుళరెడ్డి.

                                                                                                   ...........  సశేషం

3 comments:

Waiting for next part.
I was born and raised in Kadapa Dt. Its been a long time hearing these stories again, nostalgic experience. Please don't stop the novel assuming that you don't have readership.

@ మిస్టర్ యక్ష గారు.
చాలా థ్యాంక్స్. కేవలం కడపప్రాంతం వారే కాకుండా రాయలసీమ ప్రాంతపు బయటి ప్రపంచం వాళ్ళ దృష్టిలో మీడియా వారు సృష్టించిన అపోహల అభిప్రాయాన్ని తొలిగించాలన్న ఉద్దేశంతో అందరూ చదవాలన్న ఆలోచనతో ఇక్కడ ఈ నవలను ప్రచరిస్తున్నాను. ఎవరు చదివిన చదవకపోయినా మిగిలిన భాగాలను మొత్తం పోస్ట్ చేస్తాను, కాకపోతే మునుముందు రాబోయే భాగాలు ఎవరికన్న అభ్యంతరం ఉండచ్చుననే ఆలోచనే తప్ప మరో అభిప్రాయం లేదు. మరో సారి చాలా థ్యాంక్స్ మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు

కమల్,
మన రాష్ట్రంలో కొదవలేనిదల్లా ఒక్ఖ అభిప్రాయబేధాలకు, అభ్యంతరాలకు. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలుంటే మీకు కామెంట్ రూపంలో వ్రాస్తారు, అలా వ్రాసింది అభ్యంతరకరమైతే మీరు తీసెయ్యండి. కాబట్టి మీరు వ్రాయాలనుకున్నదో, వ్రాసేసిందో, ఎలాంటి అభ్యంతరాలకోసం మార్చవద్దని మనవి.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs