.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి

    నారమ్మ ఇంకా వూర్లోకి రాలేదు.
  దండోరు పల్లె వద్ద కూచనే బీరాలు ( ప్రగల్పాలు, బింకంగా మాట్లాడడం) తీస్తోందట.
  ఆమెతోటి వెళ్ళిన అనుచరవర్గం పదిరోజులు గడవకుండానే వూర్లోకి వచ్చారట. మొదట ఒకటి రెండు రోజులు రాత్రిళ్ళు వచ్చి ఇళ్ళవద్ద వుండి పొద్దున్నే వెళ్ళిపోయారట.
  తర్వాత మెల్ల మెల్లగా పగలు కూడ వూర్లోనే వుండటం ప్రారంభించారు గాని బహిరంగంగా వీధుల్లొకి రావటం లేదట.  చివరగా ఆ వర్గంలోని ప్రముఖుడు ఓబులకొండారెడ్డి కూడా గ్రామంలో ప్రవేశించాడుట.
  అతను స్వంత యింటికి వచ్చిన రాత్రి మిగిలినవాళ్ళు వచ్చారు.  రాత్రిళ్ళు ప్రశాంతంగా లేదని పెద్దిరెడ్డికి అందిన సమాచారం. దండోరుపల్లె వాళ్ళు ముప్పైమంది దాక జనం వచ్చి ఆ రాత్రంతా వుండిపోయారట.
 వరసుగా రెండు మూడు రాత్రిళ్ళు అలాగే జరిగిందని వినికిడి. నాలుగోరోజు పగటి పూటనే వూర్లో కొచ్చాడు కొండారెడ్డి.  ఆ రోజు దండోరిపల్లె గుంపంతా శివపురిలోనే తిరిగింది.
  రాత్రికి పెద్దిరెడ్డి వర్గం సమావేశమైంది.
  జరుగుతున్న విషయాలు కూలకషంగా విశ్లేషించుకొన్నారు.
  త్వరలో నారమ్మ కూడా వూర్లోకి వస్తుందనే విషయం స్పష్టమైంది కాబట్టి తమ ప్రతి స్పందన గూర్చి చర్చించుకున్నారు.  నారమ్మ వూర్లోకి వచ్చిన మరుక్షణమే దాడి చేయాలని, అవకాశం చూసుకొని ఈ మద్య కాలంలోనే ఆమె వర్గం మీద దాడిచేయాలి.
  తమ ప్రధాన శత్రువు నారమ్మ
  అందుకే ఆమె వర్గం మనుషులు తిరిగి గ్రామంలోకి వచ్చినా తాము చర్యతీసికోలేదు..  అదే వాళ్ళ దృష్టిలో  తమను చులకన చేసినట్టుంది.
  దండోరు పల్లె వాళ్ళు బాహాటంగా వూర్లో తిరగటం భరించరానిదిగా వుంది.  నేరం చేసిన మనుషులు రొమ్ము విరుచుకొని వీధుల్లోకి రావటం సహించరానిదిగా వుంది.
  దండోరు పల్లె వాళ్ళతో డీకొనాలంటే తమకు ఆయుధాలు కూడ అవసరమే.  ముఖ్యంగా బాంబూలు కావాలి.
  వాటి విషయంలో సమితి ప్రెసిడెంటుకు మంచి అనుభవం వుంది. మరునాడు చెన్నారెడ్డిని కలిశారు.  ఆయన ద్వారా ముద్దనూరు వద్దనున్న నల్లబల్లెలోని బాంబ్ మేకర్‌ని కలిశారు. అతనికే డబ్బిచ్చి ముడిసరకు తెప్పించి ముగ్గుపిండి గని వద్ద ఇసుక జేడల్లో బాంబులు చుట్టించటం మెదలెట్టారు.
  వారంరోజులు పాటు అక్కడే కూచుని బాంబులు చుట్టాడు అతను.
  గనిపని వదలి బాంబ్‌మేకర్‌ను అంటిపెట్టుకొని వుండిపోయాడు బాలుడు.   ప్రేలుడు మిశ్రమాన్ని కలపటం, అందులో ఇనుప ముక్కలు, గాజుపెంకులు వేయటం, దారంతో చుట్టటం,  వాటిని ఆరబెట్టి భద్రపరచటం వగైరా విషయాలన్నీ నేర్చుకున్నాడు.  చివరగా బాంబుల్నెలా ప్రయోగించటం కూడా ప్రాక్టీసు చేశాడు.
  రెండు బక్కెట్లు బాంబులు శివపురిలోకి చేర్చబడ్డాయి.
  మిగిలిన బాంబులన్నీ బాలుని ఆధ్వర్యంలో గనివద్దనే సురిక్షిత ప్రదేశంలో భద్రపరచబడ్డాయి.
  అవసరమైనప్పుడు బాంబులు విసిరేందుకు ’ పెద్దపసుపుల ’ పల్లే నుంచి ఇద్దరు మనుషుల్ని తెచ్చుకున్నారు.  ( రాయలసీమలో మొట్టమొదటి దేశీ బాంబు పెద్దపసుపుల పల్లెలోనె  తయారు చేసి ఒకరిమీద 1970  ప్రాంతంలో ప్రయోగించారు)
  నారమ్మ రాకకోసం ఎదురుచూస్తున్నారు.
  ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికినా ఆమె వర్గం మీద దాడిజేసి వూరిడిపించాలని కూడా వ్యూహాలు పన్నుతున్నారు.
  నారమ్మ  వచ్చింతర్వాతే ఆ దాడులు చేయాలనేది కొందరి సలహా,  ఎందుకంటే ముందే ఆమె వర్గం మీద దాడిజేస్తే ..ఆమె వూర్లోకి రాదేమో..!!
  వేరుసెనగ పీకుళ్ళు మొదలయ్యాయి
 ఆడమగ అంతా చేలల్లోనే వున్నారు.
  వేరుసెనగ పీకటం, కాయలు కోయటం, బస్తాలకెత్తి ఇళ్ళకు తెచ్చి కళ్ళాల్లోనో, మిద్దెల మీదనో ఆరబోసుకోవటం లాంటి పనులతో కసాలుగా ( ఆంగ్లంలో పిలిచే బిజీని కడప మాండలికంలొ కసాలు అంటారు, కొన్ని వూర్లల్లో సమయానులూలతకు తగ్గట్టుగా ఒక్కో భావం స్పరిస్తుంది, కష్టంగా ఉన్నది, డిమాండ్‌గా ఉంది అని ఇలా ) వుంది వూరంతా.
   నారమ్మ వర్గం మనుషులు రాత్రిళ్ళు చేలవద్ద కాయలకుప్పలకు కాపలగా కూడా వెళ్ళటం లేదు.  కూలి మనుషుల్ని పంపిస్తున్నారు.  ఆరుబైట పడుకొనే దానికి కూడ లేదు. వాకిళ్ళు బిగించుకొని తెల్లారేదాక ఇంట్లో వుండాల్సిందే.  దెబ్బ తిన్న వాళ్ళు తిరిగి తమమీద దెబ్బతీస్తారేమోనని భయం, ఆలాగని భయపడినట్లు కన్పిస్తే నిద్రరాదు. వీధికి యీ చివరనుంచి ఆ చివర దాకా చూపులకు పహారా కాసేపనే ! లేచి యింట్లోకి పోదామూ అంటే... ఎవరైనా చూస్తే భయపడి యింట్లో పడుకొన్నాడని భావిస్తారనే భావన.  అందుకే వీధులు సద్దుమణిగేదాక మంచం మీద నిద్రస్తున్నట్లు నటించి,  తర్వాత లేచి ఇంట్లోకి వెళ్తారు. ఎవరైనా చూస్తే తామింకా మంచం మీదే వున్నట్టుగా దుప్పటిని మడతలు పెట్టి పరిచి భ్రమింపచేస్తారు.

                                               *******

   నారమ్మ వర్గంలోని ప్రముఖ వ్యక్తి ఓబుళకొండారెడ్డి పరిస్థితి ఇబ్బందిగా తయారైంది.  నారమ్మ తర్వాత తనమీదనే వుంటుంది ప్రత్యుర్థుల గురి. ఆమె వస్తే అటోఇటో తేలిపోతుంది. పెద్దిరెడ్డివర్గం ఆమెమీద దాడిజేయక మానరు. దండోరుపల్లెవాళ్ళు విధ్వంసం సృష్టించక వదలరు..
  ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాడు కొండారెడ్డి.
  వేరుసెనగ పీకుళ్ళు పూర్తయి కాయలన్నీ ఇళ్ళకు చేరుకొంటోన్న సమయంలో ఒకనాటి ఉదయం పదిగంటల వేల ఏటికి అడ్డంగా ఒక్కతే నడిచివచ్చింది నారమ్మ. తలెత్తి అటుఇటు గూడ చూడకుండా వీధంటా గబా గబా నడుచుకుంటూ నేరుగా తన ఇంటి వద్దకెళ్ళింది,  తాళం తీసి లోపలికెళ్ళి పొరక ( చీపురు) చేతబట్టి కసువు ( చెత్త ) చిమ్మింది.  వీధిలోని జనాలు తనకేసి గుడ్లు పెద్దవి చేసి భయంగా చూస్తున్నట్లుగా చూడటం కంటి కొసల్లోంచి గమనించిందిగాని పట్టించుకోలేదు.
  అప్పుడే వీధి మొగసాల కలకలమైంది.
  జనాల గొంతుకలు కలగాపులగంగా కల్సిపోయి వీధిని నింపుతూ దూసుకొస్తున్నాయి.
  గుంపుముందు  పెద్ద పెద్ద అంగలేసుకొంటూ వస్తున్నాడు బాలుడు నారమ్మను బండబూతులు తిడుతూ, అతని వెనుకే ఇరవై మందికి పైగా జనం - కర్రలు చేతబట్టి కేకలేసుకొంటూ ప్రత్యుర్థుల్ని అమ్మనక్కల తిడుతూ వస్తున్నారు.
  నిటారుగా నిల్చొని వాళ్ళకేసి చూస్తుండిపోయింది నారమ్మ. రెప్పవాల్చటం కూడా మరిచిపోయి అటే చూడసాగింది.
  " మనిషిని చంపించి మల్లా వూర్లేకొస్తావంటనే లం...... ! " అంటూ మొదటి దెబ్బ వేశాడు బాలుడు.  ఒడుపుగా జుట్టుపట్టి కిందపడేసి జరజర వీధిలోకి యీడ్చుకొచ్చాడు ఆమెను.
  కసిదీర కాలితో తన్ని తన్ని వదిలాడు ఓబుళరెడ్డి.
  గుమిగూడిన వాళ్ళంతా విచక్షణా రహితంగా ఆమెను కాళ్ళతో తన్ని చేతుల్తో బాది వదిలారు.
 కిందపడేసి రెండు కాళ్ళు ఫళుక్ మని శబ్దం వచ్చేలా విరగ్గొట్టారు.  దెబ్బల బాధ భరించలేక స్పృహదప్పి పడిపోయింది ఆమె. చచ్చిందేమోనని అనుమానమొచ్చింది పెద్దరెడ్డికి.
   తమ్ముని చెవిలో మెల్లిగ గొణిగాడు.
   " సావనీ  ! వూరిబైట పారేస్తే కుక్కలు, నక్కలు పీక్కుతింటాయి  "  గట్టిగా చెప్పాడు ఓబుళరెడ్డి.
  ఆమె పురాణం ముగియగానే వీధిన పడ్డారు జనమంతా. ప్రత్యుర్థులని గొడవకు పిలుస్తూ సవాల్ చేస్తున్నారు.  దిక్కులు పిక్కుటిల్లేట్లు  సింహనాదాలు చేస్తున్నారు  " రాండ్రా నాకొడకల్లారా  ! యీ రోజే తేల్చుకోందాము రాండి.  మొగోల్లయితే రాండీ. మూతికి మీసమున్నోడెవుడయినా వుంటే యీధిలోకి రాండి .."  అంటూ గాండ్రిస్తున్నారు.
  నారమ్మ వర్గీయులెవ్వరూ ఇళ్ళల్లోంచి బైటకు రాలేదు.
  దండోరుపల్లె వాళ్ళను తోడు తెచ్చుకొంటాదనుకొంటే..ఒక్కటే వొచ్చి చావు దెబ్బలు తినటం వాళ్ళకు అర్థం కాని విషయంగా వుంది.
  వీధులన్నీ కవ్వాయదొక్కి ప్రత్యుర్థుల ఇంటి వాకిళ్ళను కాళ్లతో తన్ని, కేకలేసి పిలుస్తూ  చెలరేగిపోయారు పెద్దిరెడ్డి జనం.
  " దీన్ని ఏం జెయ్యాల..? "   నారమ్మను కాలితో నెడుతూ అన్నాడు వెంకటరెడ్డి.
  " బండికెత్తి మేయిన్‌రోడ్లో బేసి రాపోండి "  ఓబుళరెడ్డి చెప్పాడు.
  వెంటనే ఎద్దుల బండి సిద్దమైంది.
  ఇంకా వూపిరాడుతూవున్న నారమ్మను బండ్లోకెత్తి మేయిన్‌రోడ్ దాకా తీసికెళ్ళి అక్కడ మట్టనిడిసి వచ్చారు.
  రోడ్డు పక్క తడ్సిన బస్తాలా పడివుంది నారమ్మ.
  మొహాన నీళ్ళు చిలుకరించే దిక్కుకూడ లేక అనాధ ప్రేతంలా వుంది.

                                          *******

    మళ్ళీ రోజు సాయింత్రానికి పోలీసు జీపొకటి శివపురిలోకి ప్రవేశించింది.  బిలబిలమంటూ జీవు దిగిన పోలీసులు పెద్దిరెడ్డి యింటిని చుట్టుముట్టారు.
  ఓబుళరెడ్డి. బాలునితో సహా ఇరువైరెండు మందిని అరెస్టు చేశారు,  అందర్నీ పోలీసు స్టేషన్‌కు తీసికెళ్ళారు.
  అక్కడ నారమ్మ వుంది.
  వాళ్ళకేసి పిశాచిలా చూస్తోంది.
 శవాన్ని జేసి రోడ్డుమీద విసరేస్తే - ఎట్టా మేలుకొందో..? ఎట్టా లేచిందో.. ఎట్లా బసెక్కిందో...-  నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి రిపోర్ట్ చేసిందట. విరిగిన కాళ్ళకు కట్లుకూడా కట్టించుకోకుండా ఎట్లా అక్కడకు చేరిందో ఆ భగవంతునికే తెలియాలి.
  విషయం తెలిసి ఆగమేఘాల మీదొచ్చాడు చింతకుంట చెన్నారెడ్డి.  రాత్రి వాళ్ళను స్టేషన్‌లో వుంచనీకుండా తాను పూచీకత్తు యిచ్చి వెంటబెట్టుకెళ్ళాడు.  పార్టీ నాయుకుని యింట్లో దిగబెట్టాడు.
  అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు అయ్యింది.
  బెయిలు తెచ్చుకొనేసరికి మరో రెండ్రోజులు పట్టింది.
ఆమె వైపు సాక్ష్యం చెప్పేందుకు ఆమె వర్గీయులు సిద్దమయ్యారు.  నారమ్మను బలబరిచి పెద్దిరెడ్డి వర్గాన్ని అణగదొక్కాలనే దృడసంకల్పంతో ఉన్నారు వాళ్ళు.  అప్పుడు అర్థమైంది దండోరుపల్లె రంగారెడ్డి పన్నిన వ్యూహమేమిటో.
   వాయదాలకు తిరుగుతున్నారు.
  తాము కేసుల్లో ఇరుక్కోవటం ముందే వూహించిన సంగతే అయినా తమను కోలుకోకుండా తొక్కేయాలని నారమ్మ వర్గీయులైన ఓబుళకొండారెడ్డి వగైరాలు  అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వుండటాన్ని సహించలేకపోయారు పెద్దరెడ్డి జనం.
  వాళ్ళను భయపెట్టుకోకుంటే తమ మనుగడ కష్టంగా భావించారు.
  సెనక్కాయ పీకిన చేలల్లో అందరూ ఏగిలి సేద్యాలు చేసికొంటున్నారు. కసాలుగా పనిమీదున్నారు.
  ఆరోజు తనే స్వయంగా  కాడి కట్టుకెళ్ళాడు ఓబుళకొండారెడ్డి.
  పది చాళ్ళు దున్నాడో లేదో - మట్టిబాట  వైపునుంచి పదిమంది మనుషులు కట్టెలు, గొడ్డళ్ళతో తనకేసి పరుగెత్తికొంటూ రావటం చూసి గుండెలు దిగజారిపోయాయి.  వాళ్ళు పెద్దరెడ్డి మనుష్యులుగా అర్థమయ్యేసరికి  పైప్రాణాలు పైనే పోయాయి.  కాడెను అక్కడే వదిలేసి చెప్పులు చేతబట్టుకొని దుక్కపెళ్ళలకు అడ్డంగా పరుగు ప్రారంభించాడు
  " నిలబడరా నీయ్యెక్క  ! నిన్నీరోజు నరకంది వదుల్తామా  ? "  అంటూ వెనుకనించి కేకలు
  పరుగెత్తుతూనే ఆశ్రయం కోసం ఆలోచించాడు. ఊర్లోకి వెళ్ళటమే ఉత్తమంగా తోచింది..  చావుబతుకుల మీద ఇంట్లో దూరి గడియ పెట్టుకొన్నాడు.
  అతని వెంట వూర్లో కెళ్ళారు పెద్దరెడ్డి జనం.  ఇంటి ముందు నిల్చుని కేకలేశారు.  " సాక్ష్యం చెప్పడానికొస్తారా  నా కొడకల్లారా  ! " అంటూ పట్టెడు లావు రాళ్ళతో వాకిలికేసి బాదారు.
  ఆ రోజంతా ఇంట్లోంచి బైటకు రాలేదు కొండారెడ్డి.
  అతని సేద్యం మద్యలోనే ఆగిపోయింది.
  మరసటిరోజు మరొకర్ని... నారమ్మ వర్గీయులు  సేద్యాలు చాలించారు. పొలాల్లోకి వెళ్తే దాడులు చేసేట్టున్నారు.  భూములు బీళ్ళు పెట్టించాలనే వాళ్ళ వ్యూహంలా తోచింది నారమ్మ వర్గీయులకు.  ప్రస్తుతానికి వాళ్ళ భూములు బీళ్ళు పెట్టించటమనేది తమ వ్యూహంలో భాగమే అయినా - ప్రధాన ధ్యేయం మాత్రం వూరినుంచి తరిమిగొట్టాలనే..
  తమ ప్రత్యుర్థుల్ని వూరు విడిపించాలి.
  అదను కోసం కాచుకొని వున్నారు పెద్దరెడ్డి మనుషులు.
   ఈ నేపధ్యంలోనే కోర్ట్ వాయదాలు.
 డబ్బు మంచి నీళ్ళలా ఖర్చువుతోంది.
 ఇరువర్గాలూ వాయదాలకు వెళ్ళివస్తున్నాయి.

                                *********
 
   ఎండాకాలం దాటింది.
 తొలకరింపులు మొదలయ్యాయి
  పెద్దరెడ్డి వైపు రైతుల భూములన్నీ సేధ్యాలు పడ్డాయి.
  ప్రత్యర్థుల భూమలన్నీ మొలకగడ్డితో పచ్చదనాన్ని నింపుకుంటూ బీళ్ళుగా పడివున్నాయి.
  తమ భూముల దుస్థితి చూసి ఓబుళకొండారెడ్డి వగైరాలకు కడుపు తరుక్కుపోయింది.
  దండోరుపల్లెకు వెళ్ళారు.  రహస్య మంతనాలు చేశారు. మరుసటి రోజు రాత్రి శివపురి వీధుల్లో కొంత అలజడి రేగింది.  దండోరు పల్లెలో పెళ్ళిజేసికొన్న వీరన్న వీధెక్కి తిట్టటం మొదలెట్టాడు, పెద్ద అరుగు వద్ద నిల్చుని  గొంతెత్తి బండబూతులు తిడుతున్నాడు.
  మొదట - ఎవర్ని తిడుతున్నాడొ అర్థం కాలేదు.
  తర్వాత అర్థమై ఆశ్చర్యపోయారు జనమంతా..
  " తగుల్దాం రాండ్రా  ! ముసిల్దాన్ని కాల్లిరిగ్గొట్టడం కాదురా కొజ్జానాకొడకల్లారా  ! నా బలగమేందో సూపిస్తారాండి.  మీసమున్నోదెవుడొ రాండ్రా  !  " అంటూ తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు.
   పెద్దరెడ్డి ఇంటివద్ద జనం గుమిగూడారు.
   " అదును కోసం సూస్తావున్నెం.  మంచి టయమొచ్చింది అందరినీ వూర్లోనుంచి తరమాలంటే యిదే సమయం  "  చెప్పాడు వెంకటరెడ్డి.
  ఈటెలు. గొరకలు, వేటకొడవళ్ళ్తో సిద్దమవుతున్నారు జనం.
  పెద్దిరెడ్డి ఆలోచించాడు.
  " వాడంతగా  విర్రవీగుతండాడంటే - వెనుకేదో మనకు తెలియని వ్యూహముంది.  దండోరుపల్లె వాల్లొచ్చింటే బాంబులు తెచ్చుకొనుంటారు ..తొందరపడకండి..? "  చెప్పాడు
  " మనకాడ వుండాయి కదా  బాంబులు...? "
" వుండాయి..బేసే మాసులు మొన్ననే వూరికి పోయినారు  "
  " బాలుడు బేస్తాడు కదయ్యా  ! "
  " ఒక్కనితో ఏమయిద్ది..? వాల్లెంతమంది వచ్చినారో..?"
  "  ఇప్పుడు ఎనకడగుబేస్తే  సేతగానోల్లమవుతాం.  మన యిండ్లగాడికి వస్తారు వాల్లు . "   బాలుడు చెప్పాడు.
  " రానీ ! "   పెద్దిరెడ్డి అన్నాడు.  " అయినా..వాడొక్కడేగద వీధెక్కి కేకలేసేది. తోడెవరూ రాలేదుగదా  !  తాగుబోతు వెధవకింద లెక్కెసుకుందాం. ఈరొజుకు  వూరుకుండండి  ఏం జరుగుతుందో సూస్తావుండండి  "   కొద్దిసేపు కేకలేసింతర్వాత వీరన్నను అతని భార్య, తల్లి ఇంట్లోకి లాక్కపోవటంతో గొడవ సద్దుమణిగింది.
  అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఓబుళరెడ్డికి బాధగానే వుంది.  మరోసారి ఇలాంటి అవకాశమొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనీ -  అవకాశం తనకై తాను రాకున్నా ప్రయత్నించి కల్పించుకునైనావాళ్ళను వూరు వదలగొట్టాలనే దృఢంగా నిర్ణయించుకున్నారు.
  తమవర్గం మనిషి వీధెక్కి తొడగొట్టి సవాల్ జేసినా పెద్దిరెడ్డివర్గం గొడవకు దిగకపోవడం ఓబుళకొండారెడ్డికి ఏదో అనుమానంగా వుంది.  మరేదో భయం వెంటాడటం మొదలైంది.  తన భయాన్ని కాస్త తన వర్గపు మనుషులందరికీ అంటించాడు.
  తమ మీద ఏదో దాడి జరగబోతూవుంది.  బలమైనా దాడికే ప్రయత్నిస్తున్నారేమో..!!  మామూలుగా ఆలోచించేవాళ్ళయితే వీధెక్కి తిట్టినపుడే వచ్చి గొడవ పడేవాళ్ళు.  లోతుగా వ్యూహాలు పన్నుతోన్నట్లుంది.
మూకమ్మిడిగా ప్రాణాలు తీయాలనుకొంటున్నాట్లుంది.
  తమ భూములు బీళ్ళు పెట్టించారు.
  తమను భూమ్మీద లేకుండా చేయాలనుకొంటున్నారేమో..!!
  తమ్ము తాము రక్షించుకోవాలంటే  ఏదొకటి చేయక తప్పదు..అదేదో ఆఖరి ప్రయత్నమై వుండాలి. అదెంత ఖర్చుతో గూడుకొన్నదయినా, కష్టసాద్యమైనదయినా సరే సాధించాలి.   తనవాళ్ళను తీసికొని దండోరుపల్లెకు వెళ్ళాడు కొండారెడ్డి.  అక్కడ రంగారెడ్డితో సమావేశమయ్యారు
  తాము బతకాలన్నా, బతికి పిడికెడు మెతుకులు తినాలన్నా గాని ఓబుళరెడ్డి, పెద్దిరెడ్డి ప్రాణాలతో వుండకూడదు.
  వాళ్ళను చంపి తాము బతకటమా  ?
  అస్తుల్ని, గ్రామాన్ని వదిలి ఎటో వెళ్ళిపోయి కూలినాలి చేసికుంటూ పానాలు నిలుపుకోవటమా..?
 రెండిటిలో ఏదొక దారి నిర్ణయించుకొనేందుకు రాత్రంతా చర్చలు జరుపుతూనే వుండిపోయారు.
  తెల్లారేసరికి ఓ నిర్ణయం తీసికొన్నారు.
  ఎల్లుండి వాయిదా.
 ఆ రోజే పథకాన్ని అమలుచేయాలనుకొన్నారు.
  అతి జాగ్రత్తగా, రహస్యంగా తమ కార్యకలాపాల్ని ప్రారంభించారు..  ఎవ్వరికీ అనుమానం రాకుండా వనరుల్ని సమీకరిస్తున్నారు.

                                                                                                    ...........సశేషం.

4 comments:

adhbutham gaa vundi.. waiting for next part..

@కిరణ్, మీరుగాని దండోరుపల్లె వాసులు గాని లేక శివపురి వాసులు గానికాదు కదా..!!? నెక్స్ట్ పార్ట్ అని అడుగుతున్నారు..??

Dandori palli peru vinnanu kani, Siva puri yeppudu vinaledu... Nenu
kadapa jilla vasine okappudu, ippudu kadu.

telugu lo comment ela cheyyalo teliyadam ledu.

@కిరణ్. మీరు కడప ప్రాంతం వారా..!! శివపురి పేర్లు చాలానే ఉన్నాయిలఎ అక్కడ.
తెలుగులఓ టైపడానికి అంతర్జాలంలో www.lekhini.org ఒక సైట్ ఉన్నది అందులో టైపాక కాపీ అండ్ పేస్ట్ చేయడమో లేక. డైరెక్ట్ గా మీ బ్రౌజర్‌లోనే ఇండిక్ స్క్రిప్ట‌ని యాడ్‌ఆన్ చేసుకుంటే ఏ బాషలోనైనా టైపవచ్చు దానికి సైట్ ఇది : http://www.vishalon.net/ ఇందులో నుండి మీరు వాడే బ్రౌజర్‌ని బట్టి మోజిల్లాకా లేక ఎక్స్‌ప్లోరర్‌కా మీరు నిర్ణ్యించుకొని డవున్‌లోడ్ చేసుకొని యాడ్‌ఆన్ చేసుకుంటే ఇండియన్ లాం‌వేజ్‌లలొఅ ఏ బాషలోనైనా టైపవచ్చు డైరెక్ట్‌గా. టైప్‌పాడ్ టిప్స్ కూడ ఇచ్చారు.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs