.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    
        తర్వాత రెండు రోజులకే ఓ చిన్న సమాచారం అందింది.
    రామిరెడ్డి మృతిపట్ల దండోరుపల్లెలోని రంగారెడ్డి వర్గం మహా సంతోష పడుతున్నారట. " పీడ విరగడైంది " అంటూ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారట.
 అట్లాంటి స్పందనలు సహజమేననుకొన్నాడు ఓబుళరెడ్డి.
  తమగుండా వాళ్ళకు పరోక్షంగా కొంత నష్టమే జరిగివుంటుంది..  గొడవ జరిగినప్పుడంతా సుబ్బారెడ్డి వర్గం తమ ఆశ్రయం పొందుతుంది. కేసులు. కోర్టు వ్యవహారాలకు సంబందించిన సహాయాన్ని అందిస్తుంటారు.  పోలీసు వొత్తిళ్ళు లేకుండా  చూడటం ఆర్థిక సహాయం,  పైకం అందజేయటం... ఇట్లా ఓ వర్గానికి సమస్త సహాయమూ చేయటంతో సహజంగానే మరో వర్గానికి తమ మీద కసి వుండొచ్చు, వ్యతిరేకంగా స్పందించవచ్చు, అదేమి పెద్ద విశేషం కాదనుకొన్నాడు.
  సాయింత్రం పోరుమామిళ్ళ నించి జీపొచ్చింది.
 ఎస్సైతోటి మరో ఇద్దరు పోలీసులు దిగారు.
 " ఏం రెడ్డి  ! కొత్త సంగతులేమైనా వుండాయా..? " ఎస్సై అడిగాడు.
  " మా దగ్గరేముండాయి సారూ  ? మీరు సెప్పుతే మేం వినాల "  పెద్దిరెడ్డి చెప్పాడు.
  " మా పరిదిలో మేం గట్టిగానే ప్రయత్నిస్తుండాము.  పాతనేరస్తులను చాలా మందిని విచారించినాము.  హంతకుల ఆచూకీ చిక్కలేదు " అని చెప్పాడు.  తర్వాత కొంత ముందుకు వంగి లోగొంతుతో " అది సరే !
.. మీ పని ఎంతవరకు వొచ్చుండాది ? " అన్నాడు పెద్దిరెడ్డి కళ్ళల్లోకి చూస్తూ.
  " ఏం పని సారూ ? "
 " అదేనయ్యా మగడా ! మీరు తంటాలు బడేదే.."  కళ్ళెగరేశాడు.  సూచాయగా అర్థమైంది పెద్దిరెడ్డికి.
  " నాకన్నీ  తెలుసు రెడ్డీ !.. వేటకు మల్లుకొన్నెరు..మాటేసి వుండారు...అయితే మీకింకా ఏజీవి దొరకలే..కదూ  ? "
 రెండు చేతులెత్తి సమస్కరించాడు పెద్దిరెడ్డి  " మేమంత మాత్రపు మనుసులం కాదులే సారూ  ! "  అన్నాడు.  "  మావోడే వుండుండేనా  ?.. మేమొకరం పోయి వాడుండివుండేనా  ? నువ్వన్నట్టు వేటాడి వుండే వాడే  " చెప్పాడు.
  పెద్దిరెడ్డి కేసి తదేకంగా చూశాడు ఎస్సై " కనీసం అనుమానితుల పేర్లయినా చెప్పు రెడ్డీ ! మీ సేతులకు మట్టిగాకుండా మేం సూసుకుంటాము " అన్నాడు
 " చెబుతే నమ్మరుగాని ..మేమే తేల్చుకోలేకుండాము సారూ - అంత లావు శత్రువులు మాకెవురుండారా ? అని  "  చెప్పాడు.
  మరో సారి నొక్కి ప్రశ్నించి జీపు వద్దకు నడిచాడు ఎస్సై.  జీపులో కూచుంటూ అప్పుడే అక్కడకొస్తున్న ఓబుళరెడ్డితో చెప్పాడు " మీకు సరిపోనోల్ల పేర్లు జెప్పండి..వాల్లను పట్టుకోంటే అసలు ముద్దాయిలు బైటకొస్తారు.." అంటూ
  ఓబుళరెడ్డి నించి కూడా రాదే సమాధానం
ఎస్సై వెళ్ళిపోయాడు.
 " ఏదొక పేరు చెప్పించుకపోవటం,  వాల్లను తీసప్పోయి లోపలేసి బెదిరించి లెక్క ( డబ్బు ) రాబట్టడం... ఆ గడ్డి దినేందుకే ఈ అగసాట్లన్నీ "  ఓబుళరెడ్డి అన్నాడు.
     రాత్రికి  దండోరిపల్లెనుంచి యిద్దరు వ్యక్తులొచ్చారు.
    వాళ్ళు మోహాల్నిండా ఏదో చెప్పాలని ఆతృత.
   గొంతుల్లో సన్నని తడబాటు.
   " సంపింది  మావూర్నాకొడుకులే  ! నువ్వు నమ్ము, నమ్మకపో ఖాయంగా వాల్లే "  చెప్పాడు ఓ వ్యక్తి.
   ప్రశ్నార్థాకంగా చూశాడు ఓబుళరెడ్డి.
   " ఆ నాకొడుకు..వాడు...రంగారెడ్డి తమ్ముడు నాతోనే అన్నేడు. మీకు శివపురి రాంరెడ్డికి పట్టిన గతే పడ్తాదని.  "
  నొసలు ముడేశాడు ఓబుళరెడ్డి.  " నిజంగా నీతోనేనా  ?  "
  " అవునన్నా  !  నాతోనే .  "  నమ్మకంగా చెప్పాడు.
  " ఏ గొడవల్లేకుండా అంతలావు మాట ఎందుకొచ్చిందీ  ?  "
   చిన్నగా నిట్టూర్చాడు ఆవ్యక్తి.
  "  ఆ మద్య చిన్న తకరారు జరిగిందిలేన్నా  !  కొట్లాడుకొనేంతయ్యింది.  వాల్ల మాసుల్నంతా గుంపు జేసుకొన్నెరు. మాదిగోల్లను గుడకా పిల్చుకొన్నేరు. ఎందుకోమరి వున్నెట్టుండి ఎనకడుగు బేసినారు,  యీ లోపల మన రాంరెడ్డన్న పాయే... వున్నట్టుండి యిప్పుడు మల్లా కాలుదువ్వుతా వుండారు. "
   ఆలోచనల్లో పడ్డాడు ఓబుళరెడ్డి.
  దండోరిపల్లె వాల్ల చేష్టలు విశ్లేషించదగినవిగా  అన్పించింది పెద్దరెడ్డికి కూడా.
   గొడవ పెట్టుకోబోయి  చాలించటం, రామిరెడ్డి పోగానే తమ కుటుంబం విషాదంలో మునిగివున్నా యీ సమయంలో తిరిగి గొడవలు లేవదీయాలనుకోవటం,   రామిరెడ్డి చావును చూపి ప్రత్యర్థుల్ని బెదిరించిటం....అంటే.... ఇప్పుడు శివపురి వాల్ల సహాయం మీకందదని సుబ్బారెడ్డి వర్గాన్ని    హెచ్చరించట... అంటే...?
   " మనవాల్లందర్నీ పిలిపించరా  ! "  తమ్మునికి చెప్పాడు.
  తమకు సంబందించిన ముఖ్యులంతా భోజనాల తర్వాత రెడ్డిగారి ఇంటికి చేరారు. దండోరు పల్లె సుబ్బారెడ్డి కూడ వచ్చాడు.
   వాకిళ్ళేసుకొని  లోపల కూచున్నారు.
  యింటిబైట  అరుగుమీద కూచున్న ఆడవాళ్ళు పరిసరాల్ని గమనిస్తూ కబుర్లు  చెప్పుకొంటున్నారు.
   " మనోన్ని దండోరు పల్లె వాల్లే సంపినట్టుంది. "  చెప్పాడు పెద్దిరెడ్డి
  " రాంరెడ్డిని సంపితే వాల్లకేం లాభం  ? "   ప్రశ్న.
 " మనం సుబ్బారెడ్డి గుంపుకు సాయంజేస్తాండమా  ! సాయమంటే - కేసులున్నెప్పుడు వాల్లకు కూడుబెట్టి మన కల్లాలకాడనో, పొలాలకాడనో దాపెడ్తా వుండాము గదా  ! లాయర్లను మాట్లాడ్తా వుండాము,  పోలీసోల్లకు సెప్పిస్తా వుండాము గదా  ! అది రంగారెడ్డిగానికి నచ్చినట్లు లేదు...అయితే యీ నాయాండ్లు గూడ మర్యాదగా లేరు. "  సుబ్బారెడ్డి కేసి  వేలు చూపుతూ అన్నాడు  " యీ కులబట్టు  నాయాండ్లు గూడా కొన్ని తప్పుల్జేసినారు,  వస్తా వస్తా రంగారెడ్డి గాని గుంపువాల్ల ఇండ్లకాడ మేపుకొన్నె పొట్టేళ్ళను ఒకటినో రెండుంటినో దొంగతనంగా తెచ్చి కోసుకొన్నెరంట.  మామిడి కాయలు రాల్చుకొచ్చినారంట.  మాంచి కోడి పుంజుల్న సంకన బెట్టుకొచ్చినారంట...., మనకు తెల్సుంటే  సెప్పున గొట్టేవాల్లం.. యాడనో  సేలకాడ, సెడ్లకాడ కోసకతినిరి.  ఆ సంగతులన్నీ మాకు తెలిసే చేసినారని వాల్ల నమ్మకం. ఇంకోమాటలో చెప్పాలంటే మేమే సేయించినామని... అందుకే వాల్లంతలావు పనికి తెగించినారు...."  పెద్దిరెడ్డి చెప్పాడు.
   సుబ్బారెడ్డి సిగ్గుతో తలొంచుకొన్నాడు.
"  పొలాల్లో మనుసుల మీద సరిగ్గా గురిజూసి బాంబులేసే నాయాండ్లు ఎవరుండా రబ్బా  ! "  రెడ్డిగారి దాయాది కృష్ణారెడ్డి ప్రశ్న.
  " కాపోల్లెవరూ ( రెడ్ల ను రాయలసీమలో ’కాపులు ’ అని అంటారు ) లేరు మరి "  సుబ్బారెడ్డి చెప్పాడు.  "  అయితే మాదిగోల్లల్లో మాంచి దిట్టలుండారు.  వాల్లంతా రంగారెడ్డి గాడు ఎట్టజెపుతే అట్ల...., వాల్ల సేతనే బాంబులేయించి వుంటారు. "
  నిజమేననిపించింది అందరికీ.
  బాంబులేసిన వాళ్ళెవరో తెలిసిపోయినట్టుగా అన్పిస్తోంది, రామిరెడ్డిని చంపించిన మనుషులెవరో అర్థమవుతూ వుంది.
 అందరి గుండెల్లో సన్నని ఆందోళన, కనిపించని భయం. మునివేళ్ళు కంపించే ఆతృత.
  ఏం చేయాలో నిర్ణయించుకొన్నారు.
  ఎలా చేయాలో కూడా వ్యూహం రచించుకొన్నారు.
  తమ మాలిండ్లకు చెప్పి పంపారు.
  గ్రామస్తులంతా ముప్పైమంది దాకా గుంపయ్యారు - ఈటెలు్,గొరకలు, వేటకొడవళ్ళు సిద్దం చేసికొని.
  ఊరు దాటింతర్వాత ఇరువై మంది మాలలు వచ్చి కలిశారు.
  అప్పటికే రాత్రి మూడు జాములు దాటింది.
  నెలగుంకి నేలంతా చుక్కలు వెలుతురు పరుచుకొని వుంది పల్చగా. ఆకాశం నిర్మలంగా వుంది.
  వాతావరణం చల్లగా వుంది.
  అందరి గుండెల్లో ఏదో ఉత్సాహం, మరేదో అలజడి..
  అడుగులు వడివడిగా పడుతున్నాయి.
  ఏటి జేడల్లో నక్కల ఊళలు.
  అదే పనిగా తీతువు పిట్ట  హెచ్చరికలు.
  ఏట్లో అక్కడక్కడా సన్నని నీటి జాలులు
  ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్న  సరసరమనే శబ్దం తప్ప దండులోంచి మరో సవ్వడి బైటకు రావటం లేదు.
  ఏటి గడ్డల్నించి మొదలైన దట్టమైనా చీకుతుమ్మ కంపచెట్లు.
  వాటి మద్య కాలిబాట వెంట జాగ్రత్తగా నడుస్తున్నారు.
  నేరుగా దండోరుపల్లె పక్కన వున్న మాదిగిళ్ళ మీద కెళ్ళారు.
  నిద్రమత్తు వదిలించుకొని లేచి కుక్కలు గొంతు చించుకొనే లోపలే ఎంచుకొన్న నాలుగిళ్ళను చుట్టుముట్టారు.
  మగవాళ్ళను జుట్టుపట్టుకొని బైటకీడ్చి వీధుల్లో నిల్చోబెట్టారు.
  ఆడవాళ్ళు గోడుగోడుమంటున్నారు.
  ఓబుళరెడ్డి గొంతెత్తి చెప్పాడు  " వీల్ల మీంద మాకు అనుమానమొచ్చింది - బాంబులేసింది వీల్లేనని. నిజంగా తప్పుజేయకుంటే మేమేమీ అనం. మల్లా తీసుకొచ్చి యీడనే యిడ్చిపెట్టిపోతాం "
  అప్పటికే ఒకరిద్దరు మాదిగలు దండోరు పల్లెకేసి పరుగెత్తారు కేకలేసికొంటూ...
  ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు కాబట్టి నలుగురు మాదిగల్ని బర బర యీడ్చుకొంటూ ఏరు దాటించి తమవైపు దరికి తీసికెళ్ళారు.
  అక్కడ విచారణ ప్రారంభించారు.
  పెద్ద కష్టపడకుండానే సహకరించారు వాళ్ళు.
  వాళ్ళకు తెలుసు ఇలాంటి విషయాల్లో శిక్ష అంటూ వుంటే అది చిత్రవధేనని.
  రామిరెడ్డి మీద జరిపిన బాంబు దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని వాపోయారు, గతంలో చేసిన కొన్ని అకృత్యాలను ఏకరవు పెట్టటంలో తమ నిజాయితీని నిరూపించుకొంటూ, యీ విషయంలో మాత్రం తాము నిర్దోషలమని నమ్మబలికారు. ప్రమాణాలు కూడా చేశారు.
  " మీరు కాదు సరే  ! వొప్పుకొంటాం... మరి ఎవరు జేసినారీపని  ? "
  " ఏమో రెడ్డోరు ! మేమయితే కాదు. "
  " దొంగకు దొంగ జాడ, ముచ్చుకు ముచ్చు పోకడా తెలియకుంటదా  ? అదేపనిగా తిరుగుతూ వుండేటోల్లు మీకు తెలియకుండా ఎట్లుంటది  ? ఇక్కడ బాంబు పేలినప్పుడే అది ఎవురేసిందీ మీకు అర్థమై వుంటది. "
  " నిజంగా తెల్దు రెడ్డోరు ! " దీనంగా చెప్పారు.
 ఎంత సేపు గుచ్చి గుచ్చి అడిగినా అదే సమాధానం.
  ఓపిక నశించింది ఓబుళరెడ్డికి
 సమాచారం వాళ్ళవద్దనించే రావాలి.
  " సరే ఇప్పుడు మీరు తప్పు జేయలెదు. మరి లోగడ జేసింది మీరే గదా ! వొప్పుకుంటా వుండారుగదా !  వాటికైనా శిక్ష పడాల్సిందే..చెయ్యో కాలో యిరిస్తేగాని మీకు సిగ్గురాదు " అన్నాడు కఠినంగా.
  " రెడ్డోరు  "  లబోదిబోమన్నారు వాళ్ళు.
  " మీరిప్పుడు క్షేమంగా యెట్లా వచ్చిన వాళ్ళు అట్లా యిండ్లకు పోవాలంటే మాయన్న మీద బాంబులేసిన వాల్లెవురో చెప్పాల్సిందే "
  కొంత సేపు మౌనంగా వున్నారు వాళ్ళు.
  తర్వాత  వొకర్నొకరు సైగ చేసికొన్నారు.
  అప్పుడు గొంతు విప్పాడో వ్యక్తి.
  " బాంబులేసిందెవురో మాకు ఖాయంగా తెల్దుగాని రెడ్డోరూ ! ఆరోజు పొద్దుగూకే జామున మైదుకూరు పక్క మిట్టపల్లే మాదిగలు యేటి దరుల్లో తారట్లాడుతూ వుంటే సూసినాం. "
  " వాళ్ళు అట్లాంటోల్లేనా  ? "
   " అదే పనిమీద బతుకుతా వుండారు "
  ఆశ్చర్యంగా వుంది అందరికీ
 ఎక్కడ మిట్టపల్లె  ?  ఎక్కడ శివపురి ?
  వాళ్ళ మాటల్ని విశ్వసించలేకపోయారు.
 విశ్వసించకుండా చేసేదేమి లేదు.
  మరోసారి  తీవ్రంగా హెచ్చరించి మాదిగల్ని వదిలారు.
సమస్య కొత్త మలుపు తిరిగింది.
  మిట్ట పల్లెలో ఎంక్వయిరీ చేయాలంటే ప్రతాపరెడ్డి వద్దకేళ్ళాల్సిందే.  ఆ ఫిర్కాకంతటికీ మకుటం లేని మహారాజు అతను.
 మళ్ళీ రోజు ఉదయమే బద్వేలు వెళ్ళాడు ఓబుళరెడ్డి. సమితి ప్రెసిడెంటు చెన్నారెడ్డిని కలిశాడు.
  అతన్ని వెంటేసుకొని సాయింత్రానికి ప్రతాపరెడ్డి వూరు చేరాడు.
 చెన్నారెడ్డిని చూడగానే ఘనంగా స్వాగతించాడు ప్రతాపరెడ్డి. అప్పటికప్పుడు కోళ్ళకోసి విందు ఏర్పాటు చేశాడు.
ప్రతాపరెడ్డి సామ్రాజ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది ఓబుళరెడ్డికి, వచ్చిన జనాలంతా అతనికి వొంగి వొంగి దండాలు పెట్టేవాళ్ళే. కనుసన్నలనే సుగ్రీవాఙ్ఞలుగా శిరసావహించే వాళ్ళే.
 విషయం వింటూనే మాదిగిళ్ళకు కబురంపాడు రెడ్డి.
 తాంబూలం నమిలే లోపలే వొంగి వొంగి దండాలు పెడుతూ మిట్టపల్లె మాదిగ వ్యక్తి వచ్చాడు.
  " ఏంరా నారిగా ! అందరూ యిండ్లల్లోనే వుండారా  ? "  అడిగాడు ప్రతాపరెడ్డి.
  " వుండారు సోమీ  ! "
  " దసరా పండగ రోజు ఎవురన్నా పోరమామిళ్ళ యిలాకాకు పోయెచ్చినారా ? "
  " పొద్దుటూరు పోయినట్టుండారు సోమీ ! "
  " ప్రొద్దుటూరు గాదు,  పోరుమామిళ్ళ యిలాకాలో శివపురమనే వూరింది.  దసరా పండగ రోజు ఆ వూరికి పోయినోల్లెవురో నాకిప్పుడు తెలియాల, పండగ సూసేందుగ్గాడు వాల్లుబోయింది.  పని.. ..పనిమీద పోయినారంట.."  కొంత కటువుగా చెప్పాడు.  ’పని ’ అనే పదాన్ని వొత్తి పలుకుతూ.
  వెంటనే వెనుదిరిగాడు మాదిగ నారప్ప.
  పరుగులాంటి నడకతో వూరు దాటాడు.
 అర్థగంట సమయం కూడ గడవక ముందే తిరిగి వచ్చాడు.  " పోయినారంట సోమీ ! నలుగురు మాసులు పోయినారు పన్నెండువేల వొప్పందమంట. పనయిపించుకొని వొచ్చినారు. "  నలుగురి పేర్లు చెప్పాడు.
  వింటూవున్న ఓబుళరెడ్డికి ఆవేశం తన్నుకొస్తూ వుంది, ముక్కుపుటాల్లోంచి శ్వాస తీవ్రతరమైంది.  నొసలు ముడేసి నారప్ప కేసి తదేకంగా చూశాడు ప్రతాపరెడ్డి  "  పోకముందు నాకు చెప్పలేదు. వచ్చినాక కూడా మాట్లాడలేదు, అంటే..మొగోల్లయినారనే మాట..సరే సరే..మన సంగతి తర్వాత మాట్లాడుకుందాము గాని... "  అంటూ చెన్నారెడ్డి వైపు తిరిగి " అదీ సంగతి ..." అన్నట్లుగా తల ఎగరేశాడు.
  " ఆ మాసులెవురో మాకప్పగించు వాల్లతో వొప్పందం సేసుకున్నేదెవురో కనుక్కోవాల. " చెప్పాడు చెన్నారెడ్డి.
  " రవ్వంత ఓపికబట్టు. "  అంటూ ప్రతాపరెడ్డి లేచి మిట్టపల్లె మాదిగ నారప్ప వెంట కదిలాడు.
  మంచాల మీద పడుకున్నారు చెన్నారెడ్డి, ఓబుళరెడ్డిలు.
  ఓబుళరెడ్డికి టెన్షన్‌గా వుంది.
  చెన్నారెడ్డి మాటలకు వూకొడుతున్నాడేగాని మనస్సంతా ప్రతాపరెడ్డి తెచ్చే సమాచారం మీదనే వుంది.
శత్రువెవరో తెలిసిపోయే క్షణాలు దగ్గరపడుతున్నాయి. కిరాయి తీసుకొని హత్యలు చేయటం మిట్టపల్లె మాదిగలకు వృత్తివిద్యతో సమానమట. పల్లెనించి పట్నం దాకా ఎన్నో వొప్పందాలు చేసికొని నిర్వర్తించారట.
  ప్రతాపరెడ్డి మాటల్ని చూస్తే వాళ్ళ పాపంలో ఇతనికి కూడా భాగమున్నట్లుంది. వాళ్ళను పోలీసుల్నించీ, నాయకుల నుంచీ ఇతనే రక్షించి పోషిస్తోన్నట్లుంది.
  ప్రతాపరెడ్డి వచ్చేసరికి గంటయింది.
  దండోరిపల్లె మాదిగలు మిట్టపల్లే వాళ్ళకు చుట్టాలట, వాళ్ళద్వార యీ వొప్పందం కుదిరిందట.
  ఒప్పందం చేసికొన్న మనిషి పేరు విని అదిరిపడ్డాడు ఓబుళరెడ్డి. ఐదునిమిషాల దాకా అతని నోటినుంచి మాటే రాలేదు. కొయ్యబారినట్లు నిల్చుండిపోయాడు.
  రాత్రే ప్రయాణమై వద్దామనుకున్నాడు గాని, చెన్నారెడ్డి ససేమిరా అనటంతో అక్కడే నిద్ర చేయవలసి వచ్చింది.
  తన అన్నమీద బాంబింగ జరిపిన వ్యక్తుల్ని అప్పగించమని ఓబుళరెడ్డి అడిగాడుగాని,  ప్రతాపరెడ్డి నవ్వి తిరస్కరించాడు.
  " వాల్లు కూలినాకొడుకులు పోన్నా  ! మంచి సెడ్డా ఏం లేదు, మనోడు తనోడు అనేది లేదు. లెక్కిస్తే సాలు - నామీందయనా బాంబులేస్తారు ఈ నాకొడుకులు,  వాల్లదేముంది పోండి.."  అంటూ సాగనంపాడు.
 వాళ్ళను అన్ని విధాలుగా రక్షిస్తున్నట్లుంది అతను..
అంటే వాళ్ళ సంపాదనలో కూడ  అతనికి వాటా వున్నట్లే..!!
తెల్లార్లూ ఆలోచనలలోనే గడిచిఫొయింది ఓబుళరెడ్డికి.
  ఉదయమే లేచి ప్రయాణమై చెన్నారెడ్డిని బద్వేలులో వదిలేసి పదిగంటలకంతా శివపురి చేరుకున్నాడు. 

                                                                                ............సశేషం.

4 comments:

బ్రహ్మాండంగా వ్రాస్తున్నారండీ. రక్తచరిత్ర సినిమా విడుదల కాకుండానే చూస్తున్నట్లుంది. మరో భాగంకోసం ఎదురుచూస్తున్నాం.

oka post ni 2 or 3 posts ga vibhajinchi post cheyi aa tarvata post ki post kanisam 3 -4 days gap ivvu.. ilaa kummeste tattukuni nilabadi chadavali ante time kudarali kada.. mallosari.. post size tagginchi konchem gap ivvu anna..

budugu

@వాసు.s. మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇక రక్తచరిత్ర సినిమా గురించి చెప్పాలంటే చాలానే ఉన్నది, ఆ సినిమాకి మొదట్లో దర్శకుడు " రాజేంద్ర " అని ఒకతను కథకోసం చాలా ప్రదేశాలు తిరిగి తిరిగి చాలా సేకరించాడు తర్వాత " ధర్మ - రక్ష " అనే ఇద్దరి కవలలను దర్శకులుగా రెండో సారి ప్రకటించాడు వర్మగారు, అతను కూడ అండర్‌గ్రౌండ్‌లో దాక్కున్నవారితోను ఇంటర్‌వ్యూలు తీసుకొని కథ తయారు చేసాడు. చివరకు అతన్ని కూడ పీకేసి వారు తయారు చేసిన కథను తీసుకొని తనే స్వయంగా దర్శకత్వం చేస్తున్నారు. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నది విషయం, అది అప్రస్తుతం ఇక్కడ.

@ budugu కు. అయ్యా మగానుభావ ఇది చాలా పెద్ద నవల నీవు చెప్పినట్లు విభజించి రాస్తే మన తెలుగు టి.వి సీరియల్‌లాగ ఓ నాలుగేళ్ళు రాసుకోవచ్చు, నాకంత ఓపిక లేదు..తీరిక లేదు, మొత్తం వెనుకా ముందు కలిపి 180 పేజీలు ఉన్నది. మరికొందరు మిగతా భాగం తొందరగా పోస్ట్ చేయండి అని కూడ అడుగుతున్నారు కదా..? వారి మాటలను కూడ మన్నించాలి కదా బుడుగు మహాశయా..!!

We can't wait to see the rest of the story...

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs