.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.
     కొంతసేపటికి వూళ్ళో కోలాహలం తగ్గుముఖం పట్టింది.
   కుంకుమతో తడిసిన వాళ్ళు శుభ్రపరుచుకొంటున్నారు జనాలు
 ఉన్నట్టుండి మట్టిబాట మొదట్లోంచి గావుకేక విన్పించింది.
" ఓయమ్మో...ఓనాయనో..సంపిన్రు..ఖూనీ జేసినారు..ఖూనీ..ఖూనీ.."  అంటూ చావు కేకలేసుకొంటూ పరుగెత్తుకొస్తున్నాడు గాన్లోల్ల సుబ్బన్న - జారిపోతున్న పంచెను ఓ చేత్తో ఎగబట్టుకొంటూ.
 అందరూ ఎగమల్లి చూశారు.
 అదిరే గుండెల్తో ఎదురెళ్ళారు.
" యేందిరా..! ఎవుర్ని సంపినారబ్బీ ? " అంటూ గాభరాగా ప్రశ్నించారు.
సమాధానం యిచ్చేందుక్కూడ నోరు పెగల్లేదు సుబ్బన్నకు.
" ఆ..ఆ భాట కాడ..ఖూనీ " అంటూ ఆగకుండా పరుగెత్తి రెడ్డివారి యిళ్ళ సందుకెళ్ళాడు.
 మంచమ్మీద కూచునివున్న పెద్దరెడ్డిని చూడగానే గోడుగోడున ఏడుస్తూ " ఖూనీ.. సంపినారయ్యా..! " అంటూ ఆయన కాళ్ళ వద్ద కుప్పకూలిపోయాడు..
" యేందిరా  ? " అదిరిపడుతూ లేచాడు పెద్దిరెడ్డి.
 ఆవేశమూ, భయమూ, శోకమో వళ్ళంతా పదురుతోండగా " నడిపి రెడ్డోర్ని ఎవరో బాంబులతో కొట్టినారయ్యా  ! " చెప్పాడు.
" యాడా  ? " పక్కనే వున్న ఓబుళరెడ్డికి కళ్ళు బైర్లు కమ్మిన్నట్టుగా అనిపిస్తోండగా ప్రశ్నించాడు.
" బాట కాడ " చెయ్యెత్తి చూపాడు సుబ్బన్న.
 క్షణం ఆలశ్యం చేయలేదు అన్నదమ్ములిద్దరు.
జారుతున్న పంచెను సవరించుకుంటూ పరుగులాంటి నడకతో అటుకేసి అడుగులేశాడు పెద్దిరెడ్డి.
 జనాలంతా వాళ్ళ వెంట పరుగులు తీశారు.
 అప్పుడే జాలాడిలో ( ’జలకాలాడే గదిని జాలాడి ’= బాత్‌రూమ్ ) దూరి రెండవ చెంబునీళ్ళు తలమీద పోసుకుంటున్నాడు రామిరెడ్డి పెద్ద కొడుకు రమణారెడ్డి.
" అన్నా..అన్నా !! " వగరుస్తూ అక్కడికొచ్చాడు తమ్ముడు జయసింహ.
" నాయన్నెవురో బాంబులతో కొట్టినారంట, సేలకాడ పడిపోయిండంట.."
చేతిలో చెంబు జారిపడినంత పనయింది రమణారెడ్డికి.
 అడ్డపంచె చుట్టుకొని తల తుడుచుకుంటూ బైటపడ్డాడు.
అప్పటికే ఇంటినిండా విషాదంతో కూడిన ఆందోళన.
 ఏడుపులతో కూడిన ఆడాళ్ళ పరుగులు...
కిందా మీద పడుతూ ఇల్లుదాటాడు రమణారెడ్డి.
 ఊరంతా దావనలంలా వ్యాపించట్టుంది వార్త
సందుల్లో గొందుల్లో కూడా కదిలిక వచ్చింది.
 ఏడుపులతో, శాపనార్థాలతో వేరుసెనగ చేలమద్య మట్టిబాట తల్లడిల్లింది.
కుటుంబ సభ్యుల్ని శవం మీద పడకుండా చేయటం గగనమైంది.
 బోర్లాపడి వుంది రామిరెడ్డి శవం.
వీపంతా చిద్రమైపోయి భయంకరంగా వుంది.
 రక్తం కారి మడుగు కట్టి వుంది.
ఆడవాళ్ళు శోకం పట్టరానిదిగా వుంది.
 మగవాళ్ళకు కూడ గుండె చెరువైంది.
ఊరు వూరంతా అక్కడకొచ్చింది.
  అప్పటికే ఇరవైమందికి పైగా యువకులు ఈటెలు, వేటకొడవళ్ళు వడిసెలతో నాలుగు బృందాలుగా ఏర్పడి తలాదిశకు పరుగెత్తారు - హంతకుల ఆచూకి కోసం.
  రామిరెడ్డి మీద బాంబు దాడి జరగటం అందరికీ ఆశ్చర్యంగా వుంది. అర్థం కాకుండా వుంది, ఊహించటానికిక్కూడా వీల్లేని విషయంగా వుంది.
మనుషుల్ని చంపుకునేంత గొడవల్లో లేదు రెడ్డిగారి కుటుంబం.
  ఎన్ని కోణాల్నించి విశ్లేషించినా బాంబుదాడికి కారణాలే కన్పించటం లేదు.
అన్న వద్దకు వెళ్ళాడు ఓబుళరెడ్డి.
" బాంబులేసిన మాసుల జాడ దొరుకుతాదని నాకేం నమ్మకం లేదు, పోరుమామిళ్ళ పోలీస్టేషన్‌కు ఫిర్యాదు సేస్తే మంచిది " చెప్పాడు
   వెంటనే కార్యాచరణకు పూనుకొన్నాడు పెద్దిరెడ్డి.
గ్రామ మునసబుగా తనపని తాను చేసుకుపోయాడు.
  రిపోర్ట్‌రాసి పోరుమామిళ్ళ పోలీస్‌స్టేషన్‌కు పంపించాడు.
ఓ గంటకల్లా హంతకుల ఆచూకి కోసం వెళ్ళిన యువకుల బృందం వొఠ్ఠి చేతల్తో తిరిగి వచ్చింది.
 సగం రేత్రికంతా పోలీసులు కూడా వచ్చారు.
దగ్గరున్న వాళ్ళను దూరంగా పోమ్మంటూ కొంత జులుం కూడా ప్రదర్శించారు.
సారాయి తెప్పించుకుని తాగి, మంచాలు వేయించుకుని పడుకొన్నారు.
చాలామంది గ్రామస్తులు అక్కడే వుండిపోయారు.
వూర్లో రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు.
రెడ్డి గారి యింటివద్ద కెళ్ళి పరామర్శించి వస్తున్నారు, తమ సానుభూతి తెలుపుతున్నారు.
  ఎడమొహం, పెడమొహంగా వున్నవాళ్ళు సైతం వచ్చిపోతున్నారు.
నారమ్మ కూడా వచ్చింది.
  ఎన్నో ఏళ్ళుగా రెడ్డిగారి పేడనీళ్ళు ముట్టకుండా తొక్కని ఆవిడ సైతం కళ్ళనీళ్ళు పెట్టుకొంది, నోట్లో గుడ్డ కుక్కుకొని రోదనను ఆపుకొంది.
  తండ్రి శవం వద్ద కూచుని తదేకంగా అటే చూస్తూ దుఃఖిస్తున్నాడు రమణారెడ్డి, కనీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. తండ్రి చనిపోయాడంటే ఇప్పటికి మనసు అంగీకరించటం లేదు.
   పెదనాన్న పేరుకు పెద్దవాడే అయినా, గ్రామ మునసుబు గిరి చేస్తున్నా, గ్రామంలో పెత్తనమంతా తన తండ్రిదే. చిన్నాయన సహాయంతో పంచాయితీలు చేయటం, గనుల నిర్వహణ. అన్నిట్లో హుషారుగా వుండేవాడు. గనివద్ద కూలీలకు ఆయనంటే ప్రాణం.
  తమకు ఎవ్వరితోనూ పెద్ద గొడవల్లేవు.
ఎలక్షన్ల సమయంలో కొంత మొహరింపు ఉన్నా, తర్వాత తమ ఆధిపత్యాన్ని సవాల్ చేసేవాళ్ళే ఎవ్వరూ లేరు.
 మనుషుల్ని చంపుకునేంత శతృత్వం ఏవైపునుంచి వచ్చిందో అర్థం కాకుండా వుంది.
ఇకపై తండ్రి లేకపోవటం వూహకే భరించరానిదిగా వుంది.
       
      ఉదయం సి.ఐ వచ్చాడు.
మరోగంటకు డి ఎస్పీ కూడ వచ్చాడు.
 శవాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించారు.
రెడ్డిగారి యిళ్ళవద్ద కుర్చీ వేసుక్కూచుని ఎంక్వయిరీ ప్రారంభించాడు డి.ఎస్పీ.
 ఎవ్వరిమీద తమకు అనుమానం లేదని చెప్పాడు పెద్దరెడ్డి.
 కుటుంబ సభ్యులంతా అదేమాట వినిపించారు.
 ఆశ్చర్యపోవటం పోలీసు అధికారుల వంతయింది.
 ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా అదే సమాధానం.
  ఎన్నో కోణాలించి విచారించి చూశారు. గ్రామ కక్షలు, వ్యాపారం, భూమి తకరార్లు, రాజకీయాలు. చివరకు అక్రమ సంబంధాల్ని గురించి ఎంక్వయిరీ చేశారు.  గ్రామంలో కెళ్ళి రచ్చబండల వద్దా, వూరబావుల వద్దా, ఇళ్ళవద్దా కన్పించిన మనిషినల్లా ప్రశ్నించారు.
  ఖూనికి సంబంధించిన అనుమానం ఎవ్వరిమీద వ్యక్తం కాకపోవటం విచిత్రంగా వుంది.
 డి.ఎస్పీకి ఏదో అనుమానంగా వుంది.
 ఖూనీ చేయబడ్డ వాళ్ళకు శత్రువులు లేరని చెప్పటం హాస్యాస్పదంగా అన్పించింది ఆయనకు.
 వాళ్ళేదో దాస్తున్నారని అతని వూహ.
  శత్రువు మీద తామే స్వయంగా కసి దీర్చుకోవాలని భావిస్తూన్నారేమో..!! అందుకే శత్రువు పేరు దాస్తున్నారేమో..!! చివరగా పెద్దరెడ్డిని, ఓబుళరెడ్డిని దగ్గరకు పిల్చి నమ్మకంగా చెప్పాడు  " నేను చాలా స్ట్రిక్ట్. ఎవరి వొత్తిళ్ళకూ లొంగను, నేరస్తుడెవడో మీకు తెలీదంటే నమ్మేంత అమాయకన్నిగాదు వాడెవడో చెప్పండి. చట్టప్రకారం అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తా. నేను ప్రలోభాలకు లొంగేవాన్ని గాదు, నన్ను నమ్మండి " అని
  ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వాళ్ళ సమాధానం మారలేదు.
 వాళ్ళకేసి తదేకంగా చూస్తూ మెల్లిగా తలూపి మరోసారి హెచ్చరించి అక్కణ్నించి కదిలాడు ఆయన.
 పొద్దు వాటాలే సరికి శవం వచ్చింది.
  అప్పటికే చుట్టపట్ల పల్లెల జనంతో వూరంతా కటకటలాడుతోంది. గని కూలీలలంతా కుటుంబ సమేతంగా వచ్చారు. తమ కన్నీళ్ళతో ఆ ప్రాంతాన్ని పునీతం చేశారు.
 సాయింత్రం దాకా మనుషులు వస్తూనే వున్నారు.
  దండోరి పల్లెలోని తమవాడైన సుబ్బారెడ్డి వర్గీయులంతా అక్కడే వున్నారు.  జరిగిన సంఘటనను గురించి రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
  పొద్దుగుంకే ముందు సంప్రదాయబద్దంగా శవసంస్కారం జరిగింది.
  ఆ సమయంలో అక్కడి వాతావరణమంతా శొకసముద్రమైంది.
  అంతిమ వీడ్కోలు తర్వాత ఊరంతా ఒక గంభీర ప్రశాంతతతో నిండిపోయింది.  రామిరెడ్డిని గురించిన స్మృతులు ఒకరితో ఒకరు పంచుకోవటంతోటే వీధులన్నీ రాత్రిళ్ళు మేలుకొన్నాయి.
  రాత్రి పదిగంటల సమయంలో రెడ్డిగారి యింట్లో రహస్య సమావేశం జరిగింది.  బంధువులు, రక్త సంబంధీకుల్లోని ముఖ్యులు అందులో పాల్గొన్నారు.  దండోరు పల్లె మనుషులు కూడా ఒకరిద్దరు వున్నారు.
  సుదీర్ఘ సమాలోచనానంతరం ఒక కార్యచరణ ప్రణాళిక సిద్దమైంది. దాని ప్రకారం -  మెదట శత్రువెవరో గుర్తించాలి. హత్య చేసింది అతనేనని నిర్దారణ అయిన మరుక్షణం ప్రతీకారానికి ప్రణాళిక రచించాలి.
 ప్రతి చర్య ఖచ్చితంగా జరిగితీరాలి.

                                                 ********

    రామిరెడ్డి మరణవార్త వినగానే హుటాహుటిన శివపురికి వచ్చాడు సమితి ప్రెసిడెంటు చింతకుంట చెన్నారెడ్డి.
  అప్పటికే రెండ్రొజుల ఆలశ్యమైంది.
  పెద్దరెడ్డి కుటుంబ సభ్యులందర్నీ గాద్గదికంగా పలుకరించాడు.
  " రామిరెడ్డి నాకు కుడిభుజం లాంటి వాడు. ఆనాకొడుకులెవురో నా కుడిభుజాన్ని నరికినారు, ఈ కష్టం మీది కాదు నాది..యీ పన్జేసినోడెవుడో తెలిస్తే వాని అంతుకనుక్కొంటా. వాడెంతవాడయినా సరే వదిలేది లేదు.." చెప్పాడు.
  ఆయన మాటలు యువకలందరికీ ఉత్సాహాన్ని కలిగించాయి.
  " ఎమ్మెల్లే వెంబడి హైద్రాబాద్ పోయున్నే.  సంగతి తెలిసి వచ్చేసరికి చివరి సూపు గూడా దక్కకుండా పోయే. "  కొంత సేపు వాపోయాడు.
  తర్వాత రామిరెడ్డి కొడుకులు ముగ్గుర్ని, ఓబుళరెడ్డి కొడుకులు నలుగుర్నీ భుజాల మీద చేతులేసి వీపు చరిచి ధైర్యమిచ్చాడు.
  రమణారెడ్డిని కొంత దూరం తీసికెళ్ళి రహస్యంగా ఏదో చెప్పాడు.
 రాత్రి పెదనాన్న వద్దకెళ్ళాడు రమణారెడ్డి.
  పక్కన్నే చిన్నాన్న ఓబుళరెడ్డి కూడ వున్నాడు.
 " పెదనాయన  ! నేను కాలేజి సాలిస్తా .." తలొంచుకొని చెప్పాడు
చివుక్కున తలెత్తాడు ఓబుళరెడ్డి.
  అప్పటికే పెద్దిరెడ్డి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకొన్నాయి.. కొడుకు కేసి  చూస్తూ " ఎందుకు నాయనా? " అన్నాడు నొసలు ముడేస్తూ.
  కొంతసేపు తటపటాయించి చెప్పాడు  " నాయన్ను సంపినోల్ల మీద పగతీర్చుకోవాల "
 " మేమందరం లేమా ? " ఓబుళరెడ్డి అన్నాడు వెంటనే.
 " నా సేతులారా వాన్ని సంపాల "
 " నిన్ను లాయరుగా సూడాలని మీ నాయన కలలుగంటా వున్నెడబ్బీ ! వాని కలదీర్చు.."
 " ఆయనే లేనెప్పుడు  ఆయన కలలు మాత్రం బతికి లాభమేంది పెదనాయనా  ? "
  కొంతసేపు మౌనంగా అతనికేసి చూశాడు పెద్దిరెడ్డి.
  మెల్లిగా ఆయన కళ్ళల్లో తడివూరి అది నీటి బుగ్గ ఐంది. రెప్పల చాటున్నించి ఉబికి డిబికి బైటకు రాబోతోంది.. " నాయన లేకుంటే మేము లేమా పెద్దోడా ! " అన్నాడు గద్గదంగా.  " బాలుడొకడు పోరంబోకుగా గనుల్లో తిరుగుతాండె. నువ్వూ వానికి తోడయితే మిగతా నీ తమ్ముల్లంతా నీదారే బట్టరా ? "
  " జరిగేటియన్నీ నువ్వులేకున్నా జరుగుతాయిగానీ... ఇంటి సంగతులన్నీ యీన్నే వొదిలేసి నీ సదువు పూర్తిజేయి. " ఓబుళరెడ్డి చెప్పాడు.
 అప్పటికే ఓబుళరెడ్డి కొడుకు బాలుడు వగైరాలంతా అక్కడికి వచ్చి వున్నారు.
 " మన కేసులు వాదించేందుకన్నా నువ్వు లాయరువు కావాల్సిందేన్నో ! " బాలుడు చెప్పాడు.
 మరేమి మాట్లాడలేదు రమణారెడ్డి.
 అంతలో బైట అలికిడి అయ్యింది.
 ఎవరో వచ్చినట్లుంది.
 వాకిలిదాక వెళ్ళి వచ్చాడు చెన్నకేశవ.
  ఊర్లోని తమ దాయాదులే
 కొంతసేపటికి మరో నలుగురు  చేరారు.
  రామిరెడ్డి అజాత శతృత్వాన్ని పొగడటం, అతని చావు పట్ల విచారాన్ని వెలిబుచ్చటం,  అతని చంపిన వాళ్ళమీద కోపం వెళ్ళగక్కటం..ఎవరెవరి మీదో అనుమానాలు వ్యక్తీకరించటం..
  పొద్దు బోయేదాకా యవ్వారాలు చేసి వెళ్ళారు వాళ్ళు.
  రాత్రి కూడా సరిగ్గా నిద్రబట్టలేదు రమణారెడ్డికి.
  తండ్రిని చంపిన రాక్షసుల మీద పగతీర్చుకోవాలని నెత్తురు మరుగుతోంది అతనికి.  మరోవైపు తనమీద ఆయన పెట్టుకొన్న ఆశలు. పెదతండ్రి, పినతండ్రుల ఆదేశాలు మెదడుకు చల్ల బరుస్తున్నాయి.
  ఇరుభావాల వొరిపిడిలో నిద్రపట్టక తెల్లార్లూ పడకమీద ఊరకే పొర్లుతూ వుండిపోయాడు అతను.
   పొద్దు పొడిచేసరికి దండోరు పల్లె మనుషులు ఇద్దరొచ్చి వున్నారు.  నిద్రలేమి వల్ల ఎర్రబారిన కళ్ళతో బైటకొచ్చి, జయసింహ అందించిన వేపపుల్లను తీసుకొని నమిలి పళ్ళు తోముకొంటూ అటు చూసేసరికి వాళ్ళు పెదనాన్నతో ఏదో రహస్యాలాడుతున్నారు.  వినేందుకు ప్రయత్నిస్తూ మెల్లిగా అటుకేసి నడిచాడు.
 " మా వూర్నాకొడుకులు దప్ప యేరేవాల్లెవురూ యీ పన్జేసుండరు పెద్దయ్యా ! "  చెప్పాడు ఓ మనిషి.
 విని తలూపాడు పెద్దిరెడ్డి.  కొద్ది క్షణాలు మౌనం తర్వాత " వొట్టి వూహలు పనికిరావాబ్బీ ! మనకు నిర్దారణ కావాల. ఫలానావాడని నిగ్గుదేలాల, ఖాయంగా వాడేనని తేలితే..దేనికయినా సిద్దమే ? " చెప్పాడు.
  " ఖాయంగా వాల్లేబ్బా ! "
  " ఎట్ల ..?  ఒకా రుజువన్నా వుండొద్దా  ?  " నిలదీశాడు.
  అప్పుడు వాళ్ళు ఏకరువు పెట్టారు.  తమ ప్రత్యర్థుల అరాచకత్వాన్నీ. అమానుషత్వాన్నీ వివరించారు, అంతటి హేయమైన క్రూరమైన పనులు గతంలో చేశారు కాబట్టే రామిరెడ్డిని వాల్లే చంపి వుంటారని నిర్దారించేందుకు ప్రయత్నించారు.
  పెద్దిరెడ్డి వొప్పుకోలేదు.
   ఎందుకో - వాల్ల మాటల్లో కొంత నిజమున్నట్లుగా తోచింది రమణారెడ్డికి. " పెదనాయనా ! వీళ్ళుజెప్పినట్లూ..." అంటూ కొనసాగించే లోపలే  " రమణా ! నువ్వూరుకోరా ! "  ఖండించాడు పెద్దిరెడ్డి.  తర్వాత దండోరుపల్లె వాళ్ళకేసి తిరిగి " మీరు సెప్పేదంతా నిజమే. ఆ రంగారెడ్డిగాడు రాక్షసుడే, అయితే మనకు రుజువులు కావాల, యీపని వాడే జేసినట్లు తెలియాల. కనిపెట్టండిరా ! సాక్ష్యాలు బైటికి తీయండి..అప్పటిదాక రవ్వంత ఓపికబట్టండబ్బీ ! "  చెప్పాడు.
    వాళ్ళు వెళ్ళిపోగానే రమణారెడ్డిని దగ్గరకు పిల్చుకున్నాడు పెద్దిరెడ్డి.  " ఎన్నేండ్లనుంచో  యీల్లకూ, వాళ్ళకూ తగువులాటలు నాయనా ! ఎంత పోరాడినా యీ సుబ్బారెడ్డిగాని గుంపు రంగారెడ్డి గాన్ని వొంచలే కుండారు.  సందు దొరికింది గదాని మనకేసులో రంగారెడ్డిగాని మందిని యిరికించాలని సూస్తాండరేమో ! మనసేత ఎగస్పార్టీ వాల్లను దెబ్బదీయించాలని వుపాయమెత్తినారేమో..? కీడించి మేలెంచాల పెద్దోడా ! రెండ్రోజులు సూద్దాం, మనమూ విచారించుదాం మల్లనే నిర్ణయం దీసుకుందాం. తొందరేముంది నాయనా ! యిట్లాంటి విషయాల్లో జాగర్త పడకుంటే దుంపనాశనమవుతామురా పెద్దోడా ! ’ చెప్పాడు.
  తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు రమణారెడ్డి.
  హంతకుల ఆచూకి కోసం తనకు తెలిసిన వాళ్ళందరి సహాయమూ తీసుకోదల్చాడు పెద్దిరెడ్డి.  ఆ దిశగా  ఓబుళరెడ్డిని సమాయత్త పరిచాడు.
  గతంలో యిట్లాంటి బైటి వ్యవహారాల్లో రామిరెడ్డి చురుగ్గా వుండేవాడు.  ఇప్పుడు ..రెండు భాద్యతలు ఓబుళరెడ్డి మీద పడ్డాయి.
    గని కూలీల్ని కూడా హెచ్చరించాడు పెద్దిరెడ్డి,
 చిన్న తీగ దొరికినా దాన్ని పట్టుకొని డొంకంతా లాగొచ్చు, అనుమానమున్న పల్లెలకు మనుషుల్ని పంపారు.
 కిరాయి హంతకుల కదిలికల కోసం ఆయా వూరి రెడ్లను విచారించారు.  పెద్దకర్మ లోపలే హంతకుల్ని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు గాని సాధ్యం కాలేదు.
 కర్మ అయిపోగానే కాలేజికి వెళ్ళాడు రమణారెడ్డి..  అతని తమ్ముళ్ళల్లో బాలుడు మినహా మిగిలిన వాళ్ళంతా కూడా చదువులకు వెళ్ళారు.

                                                                                        ..........సశేషం

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs