పన్నెండు సంవత్సరాల క్రితం నాకు రాయలసీమ గ్రామకక్షల మీద శాస్త్రీయంగా పరిశోదనలు చేసి వాటి ఆదారంగా వాస్తవానికి దగ్గరగా కథ అల్లుకొని బుల్లితెర మీద సీరియల్‌గా చేయాలనే ఆలోచన వచ్చింది, నేను రచయతను కాను కాబట్టి ఒక రచయత కోసం వెదుకుతున్నప్పుడు ప్రముఖ రచయత శ్రీ సొదం జయరాం గారి ద్వార సాహిత్య వ్యవసాయం చేస్తున్న సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి అనే రచయత పరిచయం అయ్యారు. ఈయన అప్పటికే రచయతగా ప్రసిద్దుడు. 2002 లో ప్రవాసాంద్రుల " ఆట " వారి నవలల పోటీలో " కాడి " అనే నవలకు రెండవ బహుమతిగాను, 2007 లో " తోలుబొమ్మలాట " కు ప్రధమ బహుమతి, అదే సంవత్సరంలో చతుర వారి నవలలపోటీలో " చినుకల సవ్వడి " నవలకు ప్రధమ బహుమతి వచ్చాయి, స్వాతి సపరివార పత్రికలో " పాండవబీడు, పాలగత్తె " సీరియల్స్ ప్రచురితమయ్యాయి, 70 దాక కవితలు  50 కథలు రాసారు. పుట్టింది, పెరిగింది కడపజిల్లా బాలరాజు పల్లెలో కావడం వలన ఈయన కథలలో, కవితలలో గ్రామీన జీవన సౌందర్యం ప్రతిబింబించింది. అలాగే అక్కడి బడుగుజీవులైన రైతులు, రైతుకూలీల బతుకు వెతల్ని తన కళ్ళలో నింపుకొని పాఠకలోకానికి అందించాడు.
      నేను ఈ రచయతతో కలిసి కొన్ని పరశొదనల కోసం కడప, కర్నూల్ జిల్లాలోని చాలా గ్రామాలు సందిర్శించాము, ఎంతో మంది ముఠానాయుకలను, వారి అనుచరలను, పాతకాలపు మనుషులను కలిసాము, ఎంతో సమాచారం తెలుసుకున్నాము. ముద్రితం కాని పాండిత్యం, పద్యాలు దొరికాయి. పల్లెప్రాంతాలలో ఎంతో సాహిత్యం ఉందన్న సంగతి మాకు అప్పుడు అర్థమయ్యింది. ఈ ప్రక్రియలో నాకర్థమైన కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఈ గ్రామకక్షలన్నవి ప్రపంచమంతటా ఉన్నాయి, అయితే ఎక్కడ ఎక్కువగా కరువుకాటకాలు ఉంటాయో, వర్షపాతం తక్కువ ఉంటుందో అక్కడ  గ్రామకక్షలు ఎక్కువగా ఉంటాయి. బీహార్, గుజరాత్‌లోని కొన్ని కరువుప్రాంతాలలో, మెక్సికన్ దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇదే వాతావరణం ఉన్నది, అక్కడ కూడ గొడవలు, ముఠాతగాదాలు, కాస్త అటు ఇటుగా ఇలాంటి గ్రామకక్షలే ఉన్నా ఆయా ప్రాంతం యెక్క స్వబావరిత్యా, కాలమానాల ప్రకారం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలా మన రాష్ట్రంలోని ఈరెండు జిల్లాలో పరశీలించినప్పుడు ఇక్కడి గ్రామకక్షలను మూడు విదాలుగా విభజించవచ్చు.1. సామాజిక ఆధిపత్య పోరు ( Social prestige ).  2. రాజకీయ ఆధిపత్య పోరు ( Political prestige). 3. ఆర్థిక ఆధిపత్య పోరు ( Financial prestige ). మొదటి సామాజిక ఆధిపత్యపోరు స్వాతంత్ర్యం రాకమునుపు నుండి ప్రారంభం అయ్యి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపుగా 1960, 70 వ దశకం దాక కొనసాగింది.  అప్పటివరకు ఒకే రాజకీయపార్టి రాష్ట్రంలో అధికారంలో ఉండడం వలన ఇరువర్గాలలో ఒకరు అధికార పార్టికి కొమ్ము కాస్తే మరోకరికి ఎటువంటి రాజకీయ ఆసరా లేక ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే 1982 లో ఒక ప్రాంతీయ పార్టి అవిర్భావం జరిగిందో అప్పుడు రెండొ వర్గమైన ముఠానాయుకుడికి ఆ ప్రాంతీయపార్టి ఆసరాగా నిలిచింది. అప్పుడే రాజకీయ ఆధిపత్యపోరు మొదలయ్యింది. తర్వాతర్వాత 1990 దశకం మద్యలో ఒకప్పటి వారి పెద్దలు చేసిన  " ఫ్యాక్షన్ " అనే భూతాన్ని ఒక సాకుగా చూపి ఆర్థికంగా అధిపత్యం కోసం ప్రాకులాడడం ప్రారంభించారు. ఇతిమిద్దంగా ఇది మాకు మా పరిశోధనలో అర్థమైన విషయం. ఈ విషయంపై నాకు మునుపే ఒక అవగాహన ఉన్నా.. స్వయంగా తిరిగి ఒకప్పటి పాత తరం మనుషలతో మాట్లాడి నిర్దారణ చేసుకున్నాక ఈ కానెప్ట్ మీద కథను తయారు చేసుకున్నాము. ఇలా గ్రామాలు తిరుగుతూ ఎన్నో కథలు, వెతలు, వ్యధలు, ఎన్నో ఎన్నెన్నో తెలిసాయి. ఇక్కడ మరొక విషయం...ఒకప్పుడు " ఫ్యాక్షన్ " అన్న పదం రాయలసీమ ప్రాంతంలో అసలు వాడుకలో లేనేలేదు. తెలుగు ప్రచారాసాధానాలే 1995 తర్వాత వాడుకలో తెచ్చాయి, అంత వరకు ఒక గ్రామంలో రెండు వర్గాల మద్యన కక్షలు ఏర్పడి గొడవలు మొదలయితే వాటిని " పార్టి " పడింది ఇద్దరి మద్యన అని చెప్పుకునేవారు, మొదట్లో కొత్తగా ఎవరు గ్రామానికి వెళ్ళినా " ఏవయ్యా మీ ఊళ్ళో ’ పార్టి ’ ఉందా..? అనో లేక ఆ ఇద్దరి నాయుకల మద్యన ’పార్టి ’ పడిందా అనో అడుగుతారు తప్ప " ఫ్యాక్షన్ " అన్న పదం కాని లేక " ఫ్యాక్షన్ " లీడర్ అన్న పదం కూడ వాడేవారు కారు.
    కొన్ని అనివార్య కారాణాల వలన మేము అనుకున్నా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి మూలన చేరింది. కాని మా రచయత సన్నపరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు మాత్రం మేము సేకరించిన విషయాలలోని కొన్ని కథల నుండి ఒక " ఉప కథను " ఆధారంగా " కసి " అన్న పేరుతో నవల రాసి స్వాతి వారపత్రికకు పంపారు. అయితే స్వాతి పత్రిక యజమాన్యం వారు వారికున్న కొన్ని నిబందనల దృష్ట్యా, లేక వారికున్న కొన్ని అభ్యంతరాల వలనో ఆ నవల ముద్రణకు నోచుకోలేదు. ఈ నవలకి ఆధారమైన ముఖ్యమైన కాన్సప్ట్ నాది కావడం మూలాన  ఈ నవలను రచయత సన్నపరెడ్డి అనుమతితో నేను ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఈనవలను చదివే పాఠకులకు ఒక చిన్న మనవి. ఈ నవలలోని పాత్రదారుల మధ్యన జరిగే మాటలు రాయలసీమప్రాంతపు యాసలో అంటే కడపకు దగ్గరలోని పల్లె ప్రజల యాస, మాడలికంలో సాగుతాయి,  అలాగే కొన్ని పాత్రలు కొందరిని కులంపేరుతో సంబోదిస్తాయి, అవి కేవలం ఆయా పాత్రల యెక్క స్వభావం, అంతే కాక ఈ నవల యెక్క కథాకాలం 1960, 70 నాటి కాలానిది. అప్పటికాలం గ్రామాలలో చాలా మంది తమ తోటివారిని కులంపేరుతోనో లేక మరో చిన్న చిన్న మారు పేరులతోనో పిలిచేవారు. వాటినే యధాతదంగా ఆయా పాత్రల చేత మాట్లాడించారు తప్ప అవి ఈ నవల రాసిన రచయత యెక్క ఉద్దేశం కాదని తెలుపుతున్నాను, అవన్ని ఆయా పాత్రల యెక్క స్వభావం అని గుర్తించగలరు. ఎవరిని కించపరచాలని గాని లేక రచయత ఉద్దేశపూర్వకంగా రాసినది కూడ కాదని మనవిచేస్తున్నాను. మరొకరి మనోబావాలను కించపరచాలనే ఉద్దేశం కూడ లేదు. కేవలం వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే సదుద్దేశంతో చేసిన ప్రయత్నం.

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs